” ఆనందరావుగారూ మీరేమీ అనుకోనంటే ఓ విషయం అడుగుతాను చెప్తారా ? ” అడిగేడు నన్ను మా ఆఫీసులో క్లర్క్ కామేశ్వరరావు.
” అనుకునేదేముందండీ, నాకు తెలిసిందయితే తప్పకుండా చెప్తాను ” అన్నాను.
” మన ఆఫీసులో అంతా పిచ్చాపాటీగా ఏదో ఒకటి మాట్లాడుతుంటారు. కాని మీరు మాత్రం కనీసం లంచ్ అవర్లో కూడా నోరు విప్పడం చూడలేదు. ఆ కుమార్గారిని చూడండి ఆయన మాట్లాడని విషయమంటూ లేదు కాలిజోడు నుండి కంట్రీ బోర్డర్ వరకూ “
” ఒకరి విషయం నాకనవసరమండీ . నా ఉద్దేశ్యంలో దేనిలోనూ అతి మంచిది కాదు ” అన్నాను. కాని నా అభిప్రాయం కామేశ్వరరావుకు అంత రుచించినట్లు లేదు. ఇంతలో మా బాస్నుండి నాకు పిలుపు రావడంతో ఆ ప్రసక్తి అంతటితో ఆగిపోయింది .
ఓరోజు కామేశ్వరరావు హడావిడిగా నా దగ్గరకు వఛ్చి ” ఆనందరావుగారూ ఇది విన్నారా, కుమార్గారిని కడప ట్రాన్సఫర్ చేసేరట బాసు ” అని చెప్పేడు
” ఏమట ?” ముక్తసరిగా అడిగేను సహజధోరణిలో .
” ఎప్పుడు చూసినా ఎవరితో ఒకరితో ఏదో ఒకటి మాట్లాడుతూ తను పని చేయకపోవడమే కాకుండా అవతలి వాళ్ళనుకూడా పనిచెయ్యనివ్వకుండా అందర్నీ డిస్టర్బ్ చేయడం బాస్ దృష్టిలో చాలాసార్లు పడిందట” చెప్పేడు
” నేను చెప్పేను కదండీ . అతి సర్వత్ర వర్జయేత్ అని ” అన్నాను.
ఈసారి నాతో ఏకీభవించినట్లున్నాడు ” నిజమే సుమండీ! కానీ ఆ లెక్కన మీరు కూడా అతిమితంగా మాట్లాడుతున్నారేమో ” అన్నాడు .
” ఓ మీకలా అర్థమయిందా అయితే అమితంగా మాట్లాడనా ?” అన్నాను
” వద్దు వద్దు అమృతంలా మాట్లాడండి చాలు” అన్నాడు.
( ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రంలో 22.7.1988 ప్రసారితమైంది.)
పేరు : పతి.మురళీధర శర్మ
ఉద్యోగం : భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ లో సీనియర్ సబ్ డివిజనల్ ఇంజనీర్ గా పదవీ విరమణ.
స్వస్థలం/నివాసం : విశాఖపట్నం.
రచనావ్యాసంగం ప్రారంభం : టీ.వీ.కొందాం నాటికతో. అది తే.15.03.1987 దీని ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రంలో ప్రసారితం.
నా రచనలలోని వర్గాలు : కథలు,కథానికలు (చిన్న కథలు),బాలసాహిత్యం కథలు,కవితలు,పద్యాలు,ఆధ్యాత్మిక విషయాలు,వ్యాసాలు ,పదరంగం (పజిల్స్),హాస్యోక్తులు (జోకులు),
నాటికలు (42),సూక్తిముక్తావళి,చింతన – ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రంలో ప్రసారితం.
సమస్యాపూరణలు(126) : దూరదర్శన్ హైదరాబాద్,విజయవాడ కేంద్రాలలోనూ,ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం లోనూ ప్రసారితం.
“తప్పెవరిది” నాటిక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కుటుంబ సంక్షేమ శాఖ వారిచే చిత్రీకరించబడి సంచార రథంపై ప్రదర్శింపబడింది.
నా రచనలు ప్రచురితమైన పత్రికలు
దినపత్రికలు : ఆంధ్రభూమి,ఆంధ్రప్రభ,ఈనాడు
వారపత్రికలు : ఉదయం,సుప్రభాతం,ఆబ్జెక్ట్ వన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లిమిటెడ్,హైదరాబాద్.
పక్షపత్రికలు : అక్షర తపస్మాన్,జిల్లా సాక్షరతా సమితి,చిత్తూరు.
మాసపత్రికలు : బాలరంజని, చిత్ర, స్వప్న, విశాలాక్షి, సాహితీకిరణం, సాహిత్యప్రసూన, సృజన విశాఖ, ప్రజ-పద్యం, విశాఖ సంస్కృతి
అంతర్జాలపత్రికలు : ప్రతిలిపి,వాస్తవం (అమెరికా),ఆఫ్ ప్రింట్,తెలుగువేదిక,ఆంధ్రసంఘం పూనా 75వ వార్షికోత్సవ సంచిక “మధురిమ” 2017.
చిరు సన్మానాలు : 1. సాహితీ సమితి, తుని వారిచే
2.పరవస్తు పద్యపీఠం, విశాఖపట్నం వారిచే
దూరదర్శన్ హైదరాబాదు కేంద్రంలో ప్రసారితమైన సమస్యాపూరణ,వర్ణనలకు ఉత్తమ పూరణ,ఉత్తమ వర్ణనలుగా ఎంపికై యువభారతి వారిచే పురస్కారాలు
భావగీతి – భావగీతికల సుమవనం (ముఖపుస్తక సమూహం/ఫేస్ బుక్ గ్రూప్) వారిచే హేవళంబి నామ సంవత్సర ఉగాది సందర్భంగా నిర్వహించిన కవిత/పద్య/విశ్లేషణ పోటీలలో ఉత్తమ కవి/రచయితగా బహుమతులు,నగదు బహుమతి, ప్రశంసాపత్ర ప్రదానం.
“ధరిత్రి “ సాహితీ మిత్రుల సంగమం, మహబూబాబాద్ జిల్లా,తెలంగాణ వారిచే నిర్వహించబడిన తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి కవితలు ,కథల పోటీలలో ఒక కథకూ,ఒక కవితకూ ప్రశంసాపత్ర ప్రదానం
2015 లో సృజన విశాఖ,గరిమ సాహితీ సాంస్కృతిక సంస్థలు నిర్వహించిన శ్రీ “మన్మధ” ఉగాది కవి సమ్మేళనంలో జ్ఞాపిక బహూకరణ.
2016 లో సృజన విశాఖ ఏడవ వార్షికోత్సవ ఆత్మీయ జ్ఞాపిక బహూకరణ.
తే.09.04.2017 దీని ప్రజ – పద్యం ( లోకాస్సమస్తా సుఖినోభవంతు ) ఫేస్ బుక్ సమూహం వారి సామాజిక పద్యాల పొటీలో ప్రత్యేక సంచికతో పాటు జ్ఞాపిక బహూకరణ.
వసుధ ఎన్విరో లేబ్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి సౌజన్యంతో RGB Infotain ఉగాది 2017 సందర్భంగా నిర్వహించిన కథల పోటీలో “ ఒక్క క్షణం “ కథకు ద్వితీయ బహుమతి ( రు.8000/-) ప్రదానం. “విశాఖ సంస్కృతి” మాసపత్రిక ఆధ్వర్యంలో నిర్వహించిన ” మానవ జీవన లక్ష్యం” వ్యాసరచన పోటీలో ప్రోత్సాహక బహుమతి. “నెలవంక నెమలీక”మాసపత్రికలో ప్రచురింపబడిన కథ “రాఖీ” కలహంస పురస్కారానికి ఎంపికయింది.
“మన తెలుగు తేజం – 2021” సాహిత్య రంగంలో జాతీయ అవార్డు లభించింది.