ఆరోజు ఆదివారం. ఆనందరావు ఈవేళ ఎలాగైనా ఆత్మహత్య చేసేసుకోవాలని నిశ్చయించేసుకున్నాడు. కారణాలేవయితేనేం ఎవరూ చూడకుండా ఇంటినుండి బయలుదేరేడు. సెల్ఫోన్ ఇంట్లో వదిలేసేడు.
చివరిసారిగా దైవదర్శనం చేసుకుందామని శివాలయానికి వెళ్ళేడు, “స్వామీ! నేను నీ దగ్గరికే వస్తున్నాను” అని చెప్పడానికి అన్నట్లుగా. శివుడికి అభిషేకం చేయించేడు. ఎవరైనా తమ కోరికలు తీర్చమని విన్నవించుకుంటారు ఆ విశ్వేశ్వరుడికి. అలాగే ఆనందరావు తన ఆత్మహత్య నిర్విఘ్నంగా జరగాలని ప్రార్థించేడు ఆ పరమేశ్వరుణ్ణి.
పూజారి, “అకాల మృత్యుహరణం- సర్వ వ్యాధి నివారణం- శ్రీ పరమేశ్వర పాదోదకం పావనం శుభం ““ అంటూ తీర్థం ఇచ్చేడు. తనే మృత్యువును ఆహ్వానిస్తుంటే ఇంక అకాల మృత్యుహరణం ఎలా అవుతుంది? ఈ తీర్థంలాగే విషాన్ని తీసుకుంటే సరి అనుకున్నాడు. ప్రసాదం కూడా తీసుకుని కాసేపు ఆ భోళాశంకరుడి సన్నిధిలో కూర్చున్నాడు.
మనసంతా కకావికలంగా ఉంది.ఉరిశిక్ష పడినవాడికి ఉరి తీసేరోజు వాడి చివరి కోరిక చెప్పమంటారు. అది తీర్చిన తర్వాత ఉరి తీస్తారు. అలాగే చనిపోతున్నామని తెలిసిన వాళ్ళు చనిపోయేముందు వాళ్ళ చివరి కోరిక తీర్చమని అడుగుతారు. అది తీరిందన్న సంతృప్తితో చనిపోతారు. కాని ఆనందరావుకి అలాంటి అవకాశమేలేదు. అంచేత తనకు తానే చివరి రోజు సంతోషంగా గడపాలని నిర్ణయించుకున్నాడు.
గుడి బయటకు వచ్చేడు. అక్కడ ఉన్న ముష్టివాళ్ళంతా ఒక్కొక్కరూ “అయ్యా ధర్మం! బాబూ ధర్మం!” “ అంటూ ప్రాధేయపడుతున్నారు. అందులో ఒక కుష్టురోగికూడా ఉన్నాడు. తాను పోయేముందు వీళ్ళకు సంతృప్తికరమైన దానం చేసి వాళ్ళ కళ్ళల్లో సంతోషాన్ని చూద్దామనుకున్నాడు. అనుకున్నదే తడవుగా ఆ కుష్టువాడు చాచిన వేళ్ళులేని చేతిలో పైనుండి వందనోటు పడేసేడు. అది కాస్త గాలికి ఎగిరి దూరంగా పడిపోయింది.ఆ నోటు తీసుకొచ్చి అతని డబ్బాలో పడేసేడు ఆనందరావు.
ఆ కుష్టువాడు వెంటనే “దండాలు బాబయ్యా ! తవరు మాపాలిట దేవుడు. నేకపోతే నాలాటోడికి ఒంద రూపాయలు ఎవరేత్తారు? తవరూ, తవరి కుటుంబం అంతా పిల్లాపాపలతో పదికాలాలు సల్లగా ఉండాల మారాజా!”” అన్నాడు.
అప్పుడనిపించింది ఆనందరావుకి,” ఎలాగూ చనిపోదామనుకున్న తనకు ఇంత శరీరాభిమానం ఎందుకూ? వాడి చెయ్యి తన చేతికెక్కడ తగుల్తుందోననే కదా అలా నోటు పైనుండి పడేసేడు! వాడి రోగం తనకు ఎక్కడ అంటుకుంటుందోననే భయం. ఛ! తనకే ఇలా అనిపిస్తే ఆ రోగాన్ని అనుభవిస్తున్న వాడికెలా ఉంటుంది? వాడిని చూస్తే అందరూ అసహ్యించుకుంటారు. అలాంటిది వాడికి చచ్చిపోవాలనిపించదా? బ్రతుకుతీపి అంటే ఇదేనేమో!
ఇలా అనుకుంటున్న ఆనందరావుతో ఆ కుష్టువాడన్నాడు,’” ఏటి బాబూ! అలా ఆలోసిత్తన్నారు? ఈడిదీ ఓ బతుకేనా అనుకుంటున్నారు కదూ! ఏం సేత్తాను బాబయ్యా! పుట్టిన పెతీమడిసికీ ఎప్పటికైనా సావు తప్పదు. పుట్టడం మన సేతిలో లేనప్పుడు సావడం మాత్తరం మన సేతిలోకి ఎందుకు తీసుకోవాలి? నన్ను సూత్తే అందరూ అసయ్యించుకుంటారు. నిజవే! గాని మాలాటోల్లని సూసినప్పుడు పాపాలు ఎందుకు సెయ్యకూడదో తెలుత్తాది అందరికీ. మాలాటోల్లకి దానం సేసినోల్లకి పున్నెం ఒత్తాది”“ జీవనరహస్యం చెప్పేడా ముష్టివాడు.
ఆనందరావు తికమకపడ్డాడు. ఇలాంటి రోగే బ్రతుకుబండి యీడుస్తున్నప్పుడు ఏ రోగమూ లేని తను తీసుకున్న నిర్ణయం సరైనదేనా అని. అలాగే ఆ ముష్టివాళ్ళలో కాళ్ళులేనివాళ్ళూ, చేతులులేనివాళ్ళూ, గ్రుడ్డివాళ్ళూ, పిల్లలతో తల్లులూ ఉన్నారు. వీళ్ళంతా మరొకరిపై ఆధారపడినవాళ్లే. అన్ని అవయవాలూ సవ్యంగా ఉన్న తను ఎవరిమీదా ఆధారపడలేదు. పైగా తనమీద ఆధారపడినవాళ్లే ఉన్నారు. అలాంటిది తను చేయబోయే పనేంటి? తగునా అది? మొదటిసారిగా మనసు వెనక్కులాగింది. అయినా తమాయించుకుని అక్కడ ఉన్న బిచ్చగాళ్ళందరికీ తలో వందరూపాయలూ వేసేడు.
మనసు బాగోకపోయినా కడుపు ఆకలిని గుర్తుచేసింది. భోజనం చేద్దామని ఓ ఏ.సీ. రెస్టారెంట్కి వేళ్లేడు. ఈ చివరిరోజు ఆనందంగా గడుపుదామని అనుకున్నాడు కదా! తనకిష్టమైనవన్నీ సుష్టుగా తిని బిల్లు చెల్లించి బయటకు వచ్చేడు. అక్కడొక ముసలివాడు కదలలేని స్థితిలో పడి ఉన్నాడు. అయితే మెలకువగానే ఉన్నాడు. కానీ ఎవరూ వాడ్ని పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నారు. అక్కడున్న రెస్టారెంట్ సెక్యూరిటీ గార్డ్ ఆ ముసలివాడిని అక్కడినుంచి పొమ్మంటున్నాడు-
“లేరా! లే!”” అంటూ.
“ఏమైంది?” అని అడిగేడు ఆనందరావుఆ ముసలాడిని.
“రెండ్రోజుల్నుండీ తిండినేదు బాబయ్యా!”“అన్నాడు లేని ఓపిక తెచ్చుకుంటూ.
“ఏం, నీకెవరూ లేరా?” అడిగేడు ఆనందరావు.
“నేకేం బాబూ! ఉన్నా లేనట్టే”” అన్నాడు ముసలాడు నీరసంగా.
సెక్యూరిటీ గార్డ్ ఆనందరావుతో అన్నాడు, “మీరు మరీ అమాయకుల్లా ఉన్నారు సార్. వాడు చిత్తుగా తాగి పడిపోయి ఉంటాడు. లేదా ఇలాంటివాళ్ళే దొంగతనాలు కూడా చేస్తారు ఎవరూ అనుమానించరని”
ఆనందరావు అతని మాటల్ని పట్టించుకోకుండా వెంటనే రెస్టారెంట్లో కౌంటర్ దగ్గరికెళ్లి ఓ భోజనం పార్సిల్ ఆర్డరిచ్చి తీసుకొచ్చి ఆ ముసలివాడికిచ్చేడు. అది చూసి ముసలాడికి ప్రాణం లేచివచ్చింది. శక్తినంతా కూడగట్టుకుని లేచి పార్సిల్ అందుకుని ఆత్రంగా తినేయసాగేడు. ఆకలి బాధ ఎలా ఉంటుందో వాడ్ని చూస్తే తెలుస్తుంది ఎవరికైనా. వాడ్ని అలాగే చూస్తూ ఉండిపోయేడు ఆనందరావు.
ఆ ముసలివాడు అంతా తినేసి ఆనందరావువైపు చూసి కృతజ్ఞతాపూర్వకంగా చేతులెత్తి నమస్కరించేడు. ఆనందరావుకు చిన్నదైనా ఓ మంచిపని చేసేనన్న సంతృప్తి కలిగింది. వెంటనే ఆ ముసలివాడ్ని అడిగేడు.
“నీకు నీవాళ్ళుండీ ఇలా తిండికి నోచుకోనందుకు కష్టం అనిపించడం లేదా? ఆ సెక్యూరిటీ గార్డ్ అన్నమాటలకు నీకేం బాధగా లేదా?” “
“కట్టంగా ఉన్నా, బాదగా ఉన్నా నాను సేయగలిగేదేమీ నేదు బాబుగారూ! తిండికి నేకపోతే ఎప్పుడో ఒకప్పుడు ఎలాగూ సచ్చిపోతాను. ఇంకా ఆ అయ్యే కాదు, ఎవురు అన్నమాటలైనా పట్టించుకుంటేనే కద బాబూ బాద కలిగేది. నేకపోతే నేదు” ఆ ముసలివాడు చెప్తున్న వేదాంతం విని ఆనందరావుకు మళ్ళీ అంతర్మథనం మొదలైంది. వాడు చెప్పింది నిజంగా బుద్ధుడి ఉపదేశాన్ని గుర్తుకుతెచ్చింది.
అక్కడినుండి అలా నడుచుకుంటూ వస్తూ ఆలోచిస్తున్నాడు.”తిండికిలేనివాడు ఆత్మహత్య చేసుకోవడంలేదు. తనకు మంచి ఉద్యోగం, మంచి జీతం. డబ్బుకు లోటు లేదు. ఇల్లుంది. ఇల్లాలూ, తల్లీ, తండ్రీ అందరూ ఉన్నారు. దేనికీ లోటు లేదు. కాకపొతే కేవలం ఇంట్లో అంతులేని గొడవలవల్ల మనశ్శాంతి లేక తనకీ ఆలోచన వచ్చింది. ఆ ముసలివాడు చెప్పినట్లు వాటిని పట్టించుకోకుండా ఉంటే సరిపోతుంది కదా. అదేంటి? మళ్ళీ ఇలా ఆలోచిస్తున్నాను? వాడు అయితే పట్టించుకున్నా చేయగలిగేదేమీ లేదు. అంచేత పట్టించుకోడు. కాని పట్టించుకోకుండా ఉండడానికీ, రాజీపడడానికీ నాకేం అవసరం? ఇలా తర్జనభర్జనపడుతూ ఆనందరావు విషయాన్ని దారి మళ్ళించడానికీ, మెదడుకు విశ్రాంతికీ ఓ ఏ.సీ. థియేటర్లో దూరేడు.
సినిమా ప్రారంభమైంది. ఇంతకీ కథ ఏమిటంటే మామూలే. ఓ అమ్మాయి మానభంగానికి గురవుతుంది. ఆపై ఏసిడ్ దాడికి గురవుతుంది. కన్నతలిదండ్రులు కూతుర్ని వదులుకోలేరు కాబట్టి చికిత్స చేయించేరు. కాని పూర్వపు రూపం తేలేకపోయేరు. పరువుప్రతిష్టలు పోతాయని భయపడి ఆ విషయం బయటకు చెప్పుకోలేదు. కూతురి జీవితం ఇలా అయిపోయిందేమిటా అని ఒకటే దిగులు. కూతురు ఎక్కడ ఏ అఘాయిత్యానికి పాల్పడుతుందోనని ఒకటే భయం వాళ్లకు. కాని ఆ అమ్మాయి తన బ్రతుకు నాశనం చేసిన దోషికి శిక్ష పడేవరకూ పోరాడింది. ఇదీ కథ.” అదే ఆ అమ్మాయి అందరూ తనను అసహ్యించుకుంటున్నారని ఆత్మహత్య చేసుకుని ఉంటే అక్కడితో కథ ముగిసిపోయి ఉండేది. కాని ఆ అమ్మాయి ఆత్మస్థైర్యంతో అలా పోరాడబట్టేకదా, నేరస్థుడికి శిక్ష వేయించగలిగింది. చనిపోయి ఉంటే ఏం సాధించగలిగేది?” ఆనందరావు అంతరంగం పదేపదే హెచ్చరిస్తుంది. ఆనందరావు నిర్ణయానికి అన్నీ అవరోధాలే.
ధియేటర్నుండి బయటకు వచ్చేడు. ఎక్కడికి వెళ్ళినా తన అభీష్టానికి వ్యతిరేక సూచనలే. అలా నడుచుకుంటూ వస్తున్నాడు. రోడ్డు ప్రక్కన చెట్లూచేమలలో గుడిసెలు కనబడుతున్నాయి. అందులోని వాళ్లకు ఎండయినా, వానయినా, చలి అయినా అదే రక్షణ. క్రిమికీటకాల మధ్య విషపుపురుగుల మధ్య జీవిస్తున్నారు. ఆ బ్రతుకెంత దయనీయం! అయినా వాళ్ళూ మనుగడ సాగిస్తున్నారు. వాళ్ళ మొహాల్లో ఎక్కడా ఏ బాధా, విచారమూ కనబడలేదు.
ఏంటి ఇలా ఆలోచిస్తున్నాను? ఈవేళ నా కార్యక్రమానికి అంతరాయం కలిగించేలా ఉన్నాయి ఈ దృశ్యాలన్నీ. అయినా తను వెనుదిరిగేదిలేదు.” రైల్వేస్టేషన్వైపు నడిచేడు.
ఆ రైల్వేస్టేషన్తో ఆనందరావుకు ఎంతో అనుబంధం. ఎందుకంటే ఉద్యోగరీత్యా ప్రక్క ఊరికి రోజూ వెళ్ళేది ట్రైన్లోనే. అంచేత వెళ్ళేటప్పుడూ, వచ్చేటప్పుడూ రైలు ప్రయాణం ఎన్నో అనుభూతుల్ని మిగిల్చింది. ఒకసారి రైలు సడన్గా మధ్యలో ఆగిపోయింది. ఎవరో పట్టాలపై పడుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అందుకని. ఆరోజు ప్రయాణీకులందరూ పడిన ఇబ్బంది అంతా ఇంతా కాదు. అప్పుడు తనే అన్నాడు, ఆత్మహత్యలంటే ఆటల్లా ఉన్నాయని. మరి ఇప్పుడు తను చేస్తున్న పనేంటి? తను అలా చేయకూడదు. ట్రైన్ ఎక్కి ఎవరూ చూడకుండా రైలు బ్రిడ్జిమీదనుండి వెళ్ళేటప్పుడు క్రిందకు దూకేస్తే సరి. ఎవరికీ ఇబ్బంది ఉండదు అనుకుని ఓ కంపార్ట్మెంట్ ఎక్కేసేడు. ట్రైన్ ఇంకా కదలలేదు. తనకింకా టైం ఉంది అనుకున్నాడు ఆనందరావు. అంతవరకూ కాలక్షేపంగా కంపార్ట్మెంట్ అంతా కలియదిరిగేడు.
ఒక దగ్గర ఒకాయన పేపరు చదువుతున్నాడు.”
“ప్రేమ విఫలమై ప్రేమికుల ఆత్మహత్య! చూడండి. ఈరోజుల్లో ఆత్మహత్య చేసుకోవడం అంటే ఆషామాషీ అయిపొయింది. తల్లి మందలించిందని ఓ కూతురూ, తండ్రి కోప్పడ్డాడని ఓ కొడుకూ, టీచర్ తిట్టిందని అవమానం భరించలేక ఓ స్టూడెంటూ, పరీక్ష బాగా వ్రాయలేదు ఫెయిలవుతానేమోననే బెంగతో ఓ విద్యార్థీ, భర్తతో గొడవపడి పిల్లలతో కలిసి ఓ భార్యా, వృద్ధాప్యంలో జీవితంమీద విరక్తి చెంది వృద్దులూ, వర్షాలు లేక పంట పండలేదనీ, పండినపంట తుఫానులూ, వరదలవల్ల దక్కలేదనీ, చేసిన అప్పులు తీర్చలేమని రైతులూ ఇలా ఎవరికివారు ప్రాణాలు తీసేసుకుంటున్నారు. వీళ్ళంతా ఒక్క క్షణం ఆలోచించి ఉంటే తలిదండ్రులకు పుత్రశోకమూ, భార్యాభర్తలకు జంటవియోగమూ, సంతానానికి వృద్దతలిదండ్రుల వియోగమూతప్పించి ఉండేవారు””ఇలా చెప్పుకుంటూ పోతున్నాడు. ఇంకా అక్కడ ఉంటే తన మనసూ మారుతుందని డోర్ దగ్గరకు వచ్చేసేడు ఆనందరావు. ట్రైన్ నెమ్మదిగా కదిలింది.
రైలు ఊగిసలాగే ఆనందరావు మనసు ఊగిసలాడుతుంది. దూకేద్దామనుకున్న ప్రతీసారీ ఎవరో ఒకరు డోర్ దగ్గరకు వస్తుండడంతో ఆగిపోతున్నాడు. సమయంకోసం చూస్తున్నాడు. రైలు బ్రిడ్జి మీదకు రానే వచ్చింది. ఆనందరావు దూకేయబోతుండగా వెనకనుండి ఎవరో తట్టినట్లయింది.చూస్తే ఓ అమ్మాయి.
“ఏంటమ్మా?”” అన్నాడు ఆనందరావు. వినబడదన్నట్లు చెవి వైపు చూపించి సైగ చేసింది.
“పోనీ చెప్పమ్మా!” అన్నట్ట్టు సైగచేసేడు ఆనందరావు. తనకు మాటలు కూడా రావన్నట్లు మూగభాషలో చెప్పింది.
“మరెలా?” అన్నాడు ఆనందరావు సౌంజ్ఞతో. వెంటనే ఆ అమ్మాయి ఓ కాగితం చూపించింది. అది చదివి ఆనందరావుకు నోటమాట రాలేదు. అందులో ఏమి వ్రాసి ఉందంటే-
“అంకుల్! మీరెవరో నాకు తెలియదు. కానీ మీరు ట్రైన్ ఎక్కినప్పటినుండీ చూస్తున్నాను. మీలో ఏదో కంగారు,అలజడీ. ఒక దగ్గర కూచోకుండా డోర్ దగ్గర నిలబడి దూకేయడానికి ప్రయత్నం చేస్తున్నట్లుగా నాకు అనిపించింది. నేనో అనాధను. అనాధాశ్రమంలో ఉంటున్నాను. మీరెందుకు ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నారో నాకు తెలియదు. కానీ నాలాగే మీకూ ఎవరూ లేకపోతే నన్ను మీకూతురిగా భావించి ఆత్మహత్యాయత్నం మానుకోండి” అని. “
ఆనందరావు కళ్ళవెంట ఒకటే నీళ్ళు. ఆ అమ్మాయిని ఒక్కసారిగా కన్నకూతురిలా హత్తుకున్నాడు. ఉదయంనుండీ తాను చూసిన దృశ్యాలు ఒక్కొక్కటే గుర్తుకొస్తున్నాయి. గుడి దగ్గర ముష్టివాళ్ళూ, రెస్టారెంట్ దగ్గర ముసలివాడూ, రోడ్డుప్రక్కన గుడిసెలలోనివాళ్ళూ. ఇప్పుడీ మూగ, చెవిటి అమ్మాయీ.”వీళ్ళెవరూ ఆత్మహత్యలు చేసుకోవడంలేదు.వాళ్ళందరికీ లేని లోటు నాకేముంది? క్షణికావేశంలో తను తీసుకున్న నిర్ణయం సరైనది కాదని తెలిసింది.ఈ అమ్మాయి తన మనసు మార్చింది.” అనుకుంటుండగానే ఆ అమ్మాయి కోసం ఓ పెద్దమనిషి అక్కడకు వచ్చేడు. ఆ సన్నివేశాన్ని చూసి ఆనందరావుని అడిగి జరిగిన సంగతంతా తెలుసుకున్నాడు. తను ఆ అనాధాశ్రమ నిర్వాహకుడినని చెప్పేడు. ఆ అమ్మాయిని మౌనిక అంటామనీ, ఆ అమ్మాయిని పెంచుకోదలచుకుంటే పెంచుకోవచ్చునని, ఆశ్రమానికి వచ్చి ఫార్మాలిటీస్ పూర్తిచేసుకొమ్మనీ చెప్పాడు. ఆనందరావు వివరాలూ, విజిటింగ్ కార్డూ అడిగి తీసుకున్నాడు.
ఇంకేం? ఆనందరావు ఆ అమ్మాయిని తన స్వంత కూతురిలా చూసుకుంటానని ఆ పెద్దాయనకు హామీ ఇచ్చి తనతో ఇంటికి తీసుకువెళ్తానని అనుమతి కోరేడు. ఆ పెద్దాయన సంతోషం వెలిబుచ్చుతూ అంగీకరించేడు. ప్రక్క స్టేషన్లో ఆనందరావూ, ఆ అమ్మాయీ దిగిపోతూ ఆ పెద్దాయన దగ్గర సెలవు తీసుకున్నారు. రిటర్న్ ట్రైయినెక్కి ఇద్దరూ మళ్ళీ వాళ్ళ ఊరి స్టేషన్లో దిగేరు.
స్టేషన్లో అనౌన్స్మెంట్ వినబడుతోంది.
“బి.ఆనందరావు ఎక్కడున్నా ఎంక్వయిరీ ఆఫీసుకి రావలసింది” అని. ఆశ్చర్యపోయేడు. గబగబా ఎంక్వయిరీ ఆఫీసుకి వెళ్లి చూస్తే అక్కడ తన భార్య అనూరాధ ఉంది.
“ఏంటండీ ! ఉదయం నుండీ మీరు కనబడలేదు. సెల్ ఇంట్లో వదిలేసేరు. ఎక్కడికి వెళ్ళిపోయేరు? భోజనానికి కూడా రాలేదు. మేమెంత గాబరాపడ్డామో తెలుసా? ఒకటే చెప్పుకుంటూ పోతుంది.”ఇంతవరకూ రాకపోయేసరికి అందర్నీ ఎంక్వయిరీ చేస్తే ఎవరో మిమ్మల్ని రైల్వే స్టేషన్లో చూసినట్లు చెప్పేరు. అందుకే ఇక్కడికి వచ్చి అనౌన్స్మెంట్ చేయించేను” అంది కంగారుపడుతూ.
“చెప్తానుండవోయ్! ఆదివారం కదా, అలా బయటకు వచ్చేను” అన్నాడు.
“బయటకు వెళ్తున్నట్టు ఇంట్లో ఎవరికైనా చెప్పొచ్చుకదా!””
దానికి ఏం సమాధానం చెప్పాలో తెలియలేదు ఆనందరావుకి.
“సెల్ ఇంట్లో మర్చిపోయేను. శివాలయానికి వెళ్ళేను. తిరిగి వచ్చేస్తుంటే దారిలో నా చిరకాలస్నేహితుడొకడు కనబడ్డాడు. వాళ్ళింటికి రమ్మంటే వెళ్ళేను. భోజనం చెయ్యమని బలవంతం చేస్తే వాళ్ళింట్లో భోజనం చేసేసేను” అతికినట్లు అబద్ధం చెప్పేడు.
“మరి ఆ సంగతి మాకెలా తెలుస్తుంది? మీ ఫ్రెండ్ ఫోన్నుంచి చేసి చెప్పొచ్చు కదా! మీరు చెప్పేవాటికి పొంతన లేకుండా ఉంది. మీ వ్యవహారం మాత్రం నాకు ఏదో అనుమానంగా ఉంది” అంది అనూరాధ. దానికి ఏం చెప్పాలో అర్థం కాలేదు ఆనందరావుకి.
“ఈ అమ్మాయి ఎవరు?” అడిగింది.
“అదేనోయ్! మనకి పిల్లల్లేరు కదా! అందుకే తీసుకొచ్చేను అనాథాశ్రమంనుంచి పెంచుకుందామని. పేరు మౌనిక” అని చెప్పేడు, అసలు సంగతి బయటపెట్టకుండా. భార్య ముఖంలో రంగులు మారేయి.”
“పెంచుకునేది మనం. నన్ను సంప్రదించాలని అనిపించలేదా?” నిలదీసింది అనూరాధ.
“నువ్వు నామాట కాదనవనే నమ్మకంతోనే ఆ అమ్మాయిని చూడగానే అలా చేయాలనిపించింది” సంజాయిషీ చెప్పేడు ఆనందరావు భర్తగా. అనూరాధ ఆ అమ్మాయిని తదేకంగా చూస్తుంది. ఇంక లాభం లేదని ఈ అమ్మాయి మూగ,చెవిటిది అని చెప్పేసేడు.
“ఏం, మరెవరూ దొరకలేదా?””వెటకారంగా అంది. ఆ అమ్మాయి వినలేదనే ధీమాతో. కానీ ఆమె ముఖంలో భావాలు తెలిసిపోతుండొచ్చు అనుకున్నాడు ఆనందరావు.”
“అన్నీ ఉండి లక్షణంగా ఉన్న పిల్లల్ని ఎవ్వరైనా పెంచుకుంటారు. ఇలాంటివాళ్ళను పెంచుకోవడమే గొప్ప. మానవత్వమూను” చెప్పేడు. దానితో అనూరాధ ఏం మాట్లాడలేకపోయింది.
అదే అదనుగా,”పద. ఇంటికెళ్ళి అన్నీ మాట్లాడుకుందాం. ఇక్కడ వాదించుకుంటే బాగోదు. అందరూ వింటారు””అని సర్దిచెప్పి ఇద్దర్నీ తీసుకుని ఇంటికి బయలుదేరేడు ఆనందరావు. శివాలయంలో తీర్థం మహిమ తెలిసొచ్చింది. తనకు అకాలమృత్యుహరణం జరిగింది. ఆత్మహత్య చేసుకున్నవాళ్ళు కూడా ఒక్క క్షణం ఆలోచించి ఉంటే బాగుండేది అనుకున్నాడు ఆనందరావు.
( ఈ కథ ఆత్మహత్యలు చేసుకోవాలనుకునే వాళ్లకు అంకితం )
(వసుధ ఎన్విరో, ఆర్.జి.బి. ఇన్ఫోటైన్ సంయుక్తంగా 2017లో నిర్వహించిన ఉగాది కథల పోటీలో 8 వేల రూపాయల బహుమతి పొందిన కథ)
పేరు : పతి.మురళీధర శర్మ
ఉద్యోగం : భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ లో సీనియర్ సబ్ డివిజనల్ ఇంజనీర్ గా పదవీ విరమణ.
స్వస్థలం/నివాసం : విశాఖపట్నం.
రచనావ్యాసంగం ప్రారంభం : టీ.వీ.కొందాం నాటికతో. అది తే.15.03.1987 దీని ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రంలో ప్రసారితం.
నా రచనలలోని వర్గాలు : కథలు,కథానికలు (చిన్న కథలు),బాలసాహిత్యం కథలు,కవితలు,పద్యాలు,ఆధ్యాత్మిక విషయాలు,వ్యాసాలు ,పదరంగం (పజిల్స్),హాస్యోక్తులు (జోకులు),
నాటికలు (42),సూక్తిముక్తావళి,చింతన – ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రంలో ప్రసారితం.
సమస్యాపూరణలు(126) : దూరదర్శన్ హైదరాబాద్,విజయవాడ కేంద్రాలలోనూ,ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం లోనూ ప్రసారితం.
“తప్పెవరిది” నాటిక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కుటుంబ సంక్షేమ శాఖ వారిచే చిత్రీకరించబడి సంచార రథంపై ప్రదర్శింపబడింది.
నా రచనలు ప్రచురితమైన పత్రికలు
దినపత్రికలు : ఆంధ్రభూమి,ఆంధ్రప్రభ,ఈనాడు
వారపత్రికలు : ఉదయం,సుప్రభాతం,ఆబ్జెక్ట్ వన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లిమిటెడ్,హైదరాబాద్.
పక్షపత్రికలు : అక్షర తపస్మాన్,జిల్లా సాక్షరతా సమితి,చిత్తూరు.
మాసపత్రికలు : బాలరంజని, చిత్ర, స్వప్న, విశాలాక్షి, సాహితీకిరణం, సాహిత్యప్రసూన, సృజన విశాఖ, ప్రజ-పద్యం, విశాఖ సంస్కృతి
అంతర్జాలపత్రికలు : ప్రతిలిపి,వాస్తవం (అమెరికా),ఆఫ్ ప్రింట్,తెలుగువేదిక,ఆంధ్రసంఘం పూనా 75వ వార్షికోత్సవ సంచిక “మధురిమ” 2017.
చిరు సన్మానాలు : 1. సాహితీ సమితి, తుని వారిచే
2.పరవస్తు పద్యపీఠం, విశాఖపట్నం వారిచే
దూరదర్శన్ హైదరాబాదు కేంద్రంలో ప్రసారితమైన సమస్యాపూరణ,వర్ణనలకు ఉత్తమ పూరణ,ఉత్తమ వర్ణనలుగా ఎంపికై యువభారతి వారిచే పురస్కారాలు
భావగీతి – భావగీతికల సుమవనం (ముఖపుస్తక సమూహం/ఫేస్ బుక్ గ్రూప్) వారిచే హేవళంబి నామ సంవత్సర ఉగాది సందర్భంగా నిర్వహించిన కవిత/పద్య/విశ్లేషణ పోటీలలో ఉత్తమ కవి/రచయితగా బహుమతులు,నగదు బహుమతి, ప్రశంసాపత్ర ప్రదానం.
“ధరిత్రి “ సాహితీ మిత్రుల సంగమం, మహబూబాబాద్ జిల్లా,తెలంగాణ వారిచే నిర్వహించబడిన తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి కవితలు ,కథల పోటీలలో ఒక కథకూ,ఒక కవితకూ ప్రశంసాపత్ర ప్రదానం
2015 లో సృజన విశాఖ,గరిమ సాహితీ సాంస్కృతిక సంస్థలు నిర్వహించిన శ్రీ “మన్మధ” ఉగాది కవి సమ్మేళనంలో జ్ఞాపిక బహూకరణ.
2016 లో సృజన విశాఖ ఏడవ వార్షికోత్సవ ఆత్మీయ జ్ఞాపిక బహూకరణ.
తే.09.04.2017 దీని ప్రజ – పద్యం ( లోకాస్సమస్తా సుఖినోభవంతు ) ఫేస్ బుక్ సమూహం వారి సామాజిక పద్యాల పొటీలో ప్రత్యేక సంచికతో పాటు జ్ఞాపిక బహూకరణ.
వసుధ ఎన్విరో లేబ్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి సౌజన్యంతో RGB Infotain ఉగాది 2017 సందర్భంగా నిర్వహించిన కథల పోటీలో “ ఒక్క క్షణం “ కథకు ద్వితీయ బహుమతి ( రు.8000/-) ప్రదానం. “విశాఖ సంస్కృతి” మాసపత్రిక ఆధ్వర్యంలో నిర్వహించిన ” మానవ జీవన లక్ష్యం” వ్యాసరచన పోటీలో ప్రోత్సాహక బహుమతి. “నెలవంక నెమలీక”మాసపత్రికలో ప్రచురింపబడిన కథ “రాఖీ” కలహంస పురస్కారానికి ఎంపికయింది.
“మన తెలుగు తేజం – 2021” సాహిత్య రంగంలో జాతీయ అవార్డు లభించింది.