ఝరి – 52 by S Sridevi

  1. ఝరి – 46 by S Sridevi
  2. ఝరి – 47 by S Sridevi
  3. ఝరి – 48 by S Sridevi
  4. ఝరి – 49 by S Sridevi
  5. ఝరి – 50 by S Sridevi
  6. ఝరి – 51 by S Sridevi
  7. ఝరి – 52 by S Sridevi
  8. ఝరి – 53 by S Sridevi
  9. ఝరి – 54 by S Sridevi
  10. ఝరి – 55 by S Sridevi
  11. ఝరి – 56 by S Sridevi
  12. ఝరి – 57 by S Sridevi
  13. ఝరి – 58 by S Sridevi
  14. ఝరి – 59 by S Sridevi

జరిగిన కథ-వాసు, గీత భార్యాభర్తలు. గీత ఆత్మహత్యకి ప్రయత్నం చేసి బైటపడుతుంది. తులసికి కేన్సరొచ్చి తగ్గుతుంది. భర్తతో విడిపోవాలనుకుంటుంది. అతనికి విడాకులు ఇష్టం వుండదు. గీతకి ఎవరో ఫోన్‍చేసి బెదిరిస్తారు. ఆ ఫోన్ సుధీర్‍ చేసాడేమోననే అనుమానం వస్తుంది వాసుకి. మహతి భర్తతో విడాకులు తీసుకుంటుంది. మేఘన ఆమె కూతురు. తల్లి దగ్గిరే వుంటుంది. తండ్రికి యాక్సిడెంటైతే చూడటానికి వస్తుంది. మహతితో విడాకులయ్యాక నరేంద్ర మరో పెళ్ళి చేసుకుంటాడు. ఆమెవలన ఇద్దరు పిల్లలు. ఆమె చనిపోతుంది. అతనికి యాక్సిడెంటైతే సాయానికి హాస్పిటల్‍కి వెళ్తుంది మహతి. రాత్రి అతనికి అటెండెంటుగా వుంటుంది. పిల్లలని వాసు తనింటికి తీసుకెళ్తాడు. మహతికి అతనితో తన పెళ్ళైనప్పటి రోజులు గుర్తొస్తుంటాయి. నరేంద్రతో విడిపోయాక ఆమె ముంబైలో వుండిపోతుంది.
గీత గతం. చదువయ్యి, చిన్నవయసులోనే వుద్యోగంలో చేరుతుంది. ఇంట్లో ఆమెకి పెళ్ళి చెయ్యాలనుకుంటారు. తండ్రి అడిగితే సూచనాప్రాయంగా వాసు పేరు చెప్తుంది. ఆమెని తనింటికి తీసుకెళ్ళి సుధీర్ని చేసుకొమ్మని నచ్చజెప్పే ప్రయత్నం చేస్తాడు రవి. గీతావాసులకి చాలామంది కజిన్స్. చిన్నతనంలో వాళ్లంతా ఒకే స్కూల్లో చదువుకుంటారు. రామారావు యశోద ప్రమీల ఇంటికి వెళ్ళి పెళ్ళివిషయం చెప్పి, ఆహ్వానించి వస్తారు. సుధీర్ గీతని ఇష్టపడతాడు. ఆమెని చేసుకోలేకపోతున్నందుకు బాధపడతాడు.
వెంకట్రావు, విశాల అనే భార్యాభర్తలు అప్పులబాధ తట్టుకోలేక వురివేసుకుని చనిపోతారు. వాళ్ళ కూతురు అమృత. అమృత అవంతీ ఎస్టేట్స్‌లో మాధవరావు ప్రాపకంలో వుంటుంది. పోలీసుస్టేషన్‍కి పిలిచి బెదిరిస్తారు అమృతని. విజయ్, శ్యామ్మోహన్ అండగా నిలబడతారు. తనకి అమృత అంటే ఇష్టమని ప్రసూనకి చెప్తాడు. ఆ విషయం చెప్పి రోహిణిని హెచ్చరిస్తుంది ప్రసూన.


జోగేశ్వర్రావు మధ్యాహ్నం భోజనానికి వచ్చినప్పుడు మాధవ్‍ని బాగా ఆటపట్టించాడు. ఇద్దరూ సరదాయైన మనుషులు. సెటైర్లూ, రీపార్టీలతో టైము తెలీలేదు. ఎప్పటెప్పటి విషయాలో గుర్తుతెచ్చుకుని మాట్లాడుకున్నారు ముగ్గురూ.
“అందరం కలవాలి బావా! ఫంక్షన్లలో కలిసినా అది వేరు. గెట్ టుగెదర్‍లా పెట్టుకుని కలుసుకుంటూ వుంటేనే ఒకళ్లకొకళ్లం చనువౌతాం” అన్నాడు మాధవ్. అతను సరేనన్నాడు. సుమతి కొడుకునికూడా చూసి బయల్దేరాడు. వెళ్ళేముందు భార్యభర్తలిద్దరినీ అటు ముంబైలో తనింటికి ఆహ్వానించి, ఇటు అవంతీపురం యింటికి వెళ్లమనికూడా చెప్పాడు.
“అందరం మనం మనమే బావా! కలుస్తూ వుంటే సర్కిల్ పెరుగుతూ వుంటుంది. పిల్లలకీ ఒకళ్ళనొకళ్ళని చూపిస్తూ వుంటే పరిచయాలౌతాయి. మన స్నేహాలని ఇంకో తరానికి తీసుకెళ్ళచ్చు” అని సుమతి భర్తకి చెప్పి, “జరిగినవేవో జరిగిపోయాయి. జరిగికూడా చాలా కాలమైంది. కోపాలవీ మర్చిపోయి, మాయింటికి వెళ్ళండి. అమ్మ సంతోషపడుతుంది” అని ఆమెకి చెప్పాడు.
పొద్దున్నెప్పుడో రైలు దిగాడు. ఒక పూట యిక్కడే గడిచింది. ఈ వూరొచ్చి, ఇంటికి వెళ్ళాలనే ధ్యాసలేకుండా ఇంతసేపు గడపడం కొంత ఆశ్చర్యంగా అనిపించింది. ముంబైలో నీలిమతో వున్న యిల్లు తనదనిపిస్తోందిగానీ ఇక్కడ కొంచెం దూరం పెరిగినట్టే వుంది. తన గమ్యం అదన్న ఎరుకైతే వుందిగానీ అక్కడికి వెళ్ళి వాలిపోవాలన్న ఆతృత లేదు. అప్పటికే మనసునిండా అలుక్కుపోయినట్టు వున్న విషయాలకి స్పష్టత వచ్చిందో, కొత్త గందరగోళం వచ్చి చేరిందో అర్థమవలేదు అతనికి. మార్పు మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. సుమతిని చూసాక క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఎలా పెంచుకోవాలో అర్థమైంది. బాధలనీ, కోపాలనీ, ఇష్టాలనీ, సంతోషాన్నీ విడివిడిగా చూడాలని తెలిసింది.
ఇల్లు చేరుకున్నాడు.
“ఇంతసేపు ఎక్కడ తిరుగుతున్నావురా? పొద్దుటినుంచీ ఎదురుచూస్తున్నాం. చూసిచూసి అన్నంకూడా తినేసాం” అంది లక్ష్మి చిరుకోపంగా.
“సుమతి యింట్లో వుండిపోయానమ్మా! అది అక్కడికి వచ్చినప్పుడు బెంగపెట్టుకున్నట్టు చేసింది. మళ్ళీ కలవడం ఎప్పటికి కుదురుతుందోననిపించి ఆగాను. బావకూడా బానే మాట్లాడారు. భోజనం అక్కడే అయింది. దాని కొడుకునికూడా చూసేసి వస్తున్నాను” అన్నాడు మామూలుగా.
“అన్నీ వేషాలు. కళ్ళు బాగా నెత్తికెక్కాయి వాళ్ళకి. అంత బెంగ వుంటే ఓమాటు యిటు రావచ్చుగా?”
“అలాంటిదేం లేదమ్మా! అది వెనకటిలానే వుంది. లేకపోతే అంతదూరం చంటిపిల్లనేసుకుని ఎందుకు వస్తుంది? ఆమ్మా, పెదనాన్నా రాలేదా? పోతే వీళ్ళ పెళ్ళితో మొదలైన అపార్థాలు ఇంకా అలానే వున్నాయి. చెప్పగలిగినంత చెప్పాను”
“వాళ్ళు మాట్లాడితే ఎంత, మాట్లాడకపోతే ఎంత?”
ఆవిడ కోపానికి మాధవ్ నవ్వేసాడు. గీత లోపల్నుంచీ వచ్చి మంచినీళ్ళు, కాఫీ యిచ్చింది. “అంతా బావున్నారా, అక్కడ?” అడిగింది ముక్తసరిగా. తల్లిముఖంలో కనిపించిన కోపం ఆమె ముఖంలో ప్రతిబింబించినట్టు అనిపించింది.
“అందరూ పెద్దవాళ్ళయారు. ఎవరివాళ్ళు వాళ్ళకి వున్నారు, వెనకేసుకుని రావడానికి” అంది లక్ష్మి.
వాసు ఆఫీసునించీ వచ్చాడు. తమ్ముడిని చూడగానే అతని ముఖంలో మెరుపు. “పొద్దుటినుంచీ ఎక్కడ తిరుగుతున్నావురా?” తల్లి అడిగిన ప్రశ్ననే తనూ అడిగాడు.
“సుమతితో కలిసి వచ్చానుకదరా? అది ఆపేసింది” జవాబిచ్చాడు. ఇద్దరూ మాటల్లో పడ్డారు. మాధవ్ వచ్చాడని తెలిసి పిల్లలిద్దరూ వచ్చారు. వాళ్ళు చిన్నాన్నని పలకరించేసి, క్రికెట్ మేచి మధ్యలో వుందని, మళ్ళీ వస్తామని వెళ్ళిపోయారు.
“వచ్చే ఏడాది టెన్యూర్ పూర్తౌతుందిరా! మళ్ళీ వెనక్కి వచ్చేద్దామనుకుంటున్నాను. వేకెన్సీలుకూడా వున్నాయి” అన్నాడు మాధవ్.
“మిమ్మల్ని వెళ్ళమనీ ఎవరూ అనలేదు, రావద్దనీ ఎవరూ ఆపట్లేదు. నీయింటికి నువ్వు రావడానికి లెక్కలేసుకోవడం దేనికి? ” అంది లక్ష్మి.
“అలా లేదుకదమ్మా, మనింట్లో?” మామూలుగా అనేసాడు మాధవ్.
“నేను నీ భార్యని ఒక్కమాటకూడా అనలేదు. నా వంట నేను చేసుకున్నాను, నా తిండి నేను తిన్నాను. నాతో గొడవలు పెట్టుకున్నదీ, నన్నూ, నా పుట్టింటినీ అన్నదీ తను. తనకి చెప్పలేక టాన్స్‌ఫర్ చేయించుకున్నది నువ్వు” రోషంగా అంది గీత. విసురుగా అక్కడినుంచీ లేచి వెళ్ళిపోయింది. తమ పదకొండుమందిలో ముగ్గురు యీ యింట్లో వున్నారు. వీళ్ళ పెళ్లైన కొత్తలో హాస్యాలూ, పరిహాసాలూ వుండేవి. అవకాశం దొరికితేచాలు, మిగిలినవాళ్ళు ఇక్కడికి వచ్చేసేవారు. చాలా చైతన్యవంతగా వుండేవి రోజులు. అదంతా మారిపోయింది. సరదాకి అన్నమాటకూడా విపరీతార్ధాలని యిస్తోంది. ఇప్పుడేమిటో చిటపటలు. కన్నీళ్ళు, కలతలు. క్షమకూడా తగ్గినట్టే అనిపిస్తోంది.
“ఒకే యింట్లోంచీ ఇందరు పిల్లలని తెచ్చుకోకూడదు. బాగా బుద్ధి చెప్తున్నారు వీళ్ళు” అంది లక్ష్మి.
“మళ్ళీ ఏమైంది?” అడిగాడు మాధవ్.
“ఒకే యింటికి యిచ్చారుకదా, మనం చెప్పలేమా ఆ బుద్ధేదో?” అన్నాడు వాసు.
“నీకు తెలీదా? అసలు ఇంటికి ఇంతదాకా రాకపోయేసరికి నీకూ ఏదేనా ఎక్కిందేమోననుకున్నాను. మీ మామ ఇంటికో వదిన యింటికో వెళ్ళావనుకున్నాను” అంది లక్ష్మి. మాధవ్‍కి ఏమీ అర్థమవలేదు.
“ఏంజరిగిందో చెప్పకుండా ఇద్దరూ ఈ సూటిపోట్లేమిటి? కొత్తగా ఎక్కడ నేర్చుకున్నారు? మనింటికి రాకుండా వాళ్ళందరి యిళ్ళకీ ఎందుకు వెళ్తాను? సుమతి యింటికేనా, అది రావడం ఒక్కర్తే వచ్చినా వెంట వెళ్ళడం మర్యాదందని అమ్మమ్మ, వెళ్ళాను”
“ఈమధ్య ప్రహ్లాద్ భార్యని తీసుకుని వచ్చాడు. అదే మొదటిసారి వచ్చినట్టు ఆ పిల్ల ఇల్లంతా తిరిగి చూసి, ఇంత పెద్ద యిల్లు, బైట బోల్డంత అద్దె పోస్తేగానీ దొరకదు అని, మా చెల్లెనినీ, మరిదినీ దూరం పంపేసి బాగానే ఎంజాయ్ చేస్తున్నారు- అంది గీతతో.
ప్రహ్లాద్ ఇంకా మన పిల్లాడే. వెంటనే అనేసాడు- ఈరోజుల్లో ఇలాంటి యిళ్లకి డిమాండు లేదు. స్వంతయిళ్ళు వున్నవాళ్ళు అమ్ముకోలేక వుంచుకుంటున్నారు. ఇళ్ళు లేనివాళ్ళుమాత్రం ఫ్లాట్సే నచ్చుకుంటున్నారని.
మరలాంటప్పుడు స్థలం పెద్దదేకదా, డెవలప్‍మెంటుకి ఇస్తే? అదీకాక పాతయిల్లు- అంది.
అది వాళ్ళ యిల్లు, వాళ్ళ యిష్టం- అని వాడు ఖండించాడు” అని చెప్పి, “నీకు తెలీకుండా, నీ భార్య ప్రమేయం లేకుండా ఇదంతా జరిగిందా? ” సూటిగా అడిగింది లక్ష్మి.
“నిజంగానే నాకు తెలీదు” అన్నాడు మాధవ్.
“ఐతే నీలిమ నీకు బాగానే తాటాకులు కడుతోందన్నమాట”
“అలాంటిదేం వుండదమ్మా! తనకీ తెలీకపోవచ్చు. వెళ్ళగానే అడుగుతాను” అతనికి నిజంగానే కోపం వచ్చింది. తన యింటి వ్యవహారంలో వదినగారు తలదూర్చి సలహాలు ఇవ్వడమేమిటని.
లక్ష్మి ఆపలేదు. “అదయ్యిందా? పద్మపిన్ని, బాబాయ్ వచ్చారు. ఆమాటా ఈమాటా మాట్లాడారు. వాసేకాదు, మాధవ్‍కూడా నీ కొడుకే. వాడికి అన్యాయం చెయ్యద్దని పాతసూక్తులే చెప్పింది పిన్ని. ఎప్పటెప్పటివో విషయాలన్నీ తవ్విపోసింది. తను చదువుకుంటానంటే అన్నయ్య చదివించలేదన్నదగ్గిర మొదలుపెట్టి-
మా అక్కచెల్లెళ్ళ పెళ్ళిళ్ళకికూడా యిల్లమ్మలేదు. తూతూమంత్రంగా ఐందనిపించాడు, ఇప్పుడా స్థలం నీపేర పెట్టాడు. నిన్ను పక్కని వుంచుకోవాలనేకదా? మీరు అందులో కట్టుకుని, ఈ యిల్లు మాధవ్‍కి వదిలెయ్యండి. మీకు రెండు జీతాలు. వాడికి ఒకటే జీతం. ఎలా బతుకుతాడు? అందులో ముంబైలో వుంటున్నాడు. వాడేం పైవాడు కాదుకదా- గీతతో అంది.
చెప్పేవాళ్లకి విసుగులేకపోయినా వినేవాళ్ళకి విసుగేకదా? ఎవరేనా వాళ్ళ జవాబుల్ని ఎన్నిసార్లు చెప్తారు? తులసి పెళ్ళయాక మీకు చెప్పాను, ఇంక దాని బతుకు దానిది, మీరు కొనుక్కున్నవన్నీ దానికి కొనక్కర్లేదని. మిమ్మల్ని చూసి అన్నలు యివ్వాలని ఆశపడ్డంకాదు, తనూ కొనుక్కోవడం నేర్చుకోవాలని. నువ్వేనా అంతేకదా? వాసుకి ఆస్తులున్నాయని మీరు ఏడవడం దేనికి?” అంది. మాధవ్‍కి ఇది మరీ ఆశ్చర్యం కలిగించించింది. ఐపోయిందనుకున్న గొడవ మళ్ళీమళ్ళీ ఎందుకు బైటికి వస్తోంది? తన వెనక ఏమేం జరిగాయో చాలాకాలం తనకే వివరంగా తెలీలేదు. తెలిసిందికూడా క్లుప్తంగానే. నీలిమ గీతని ఏవేవో అంది. అవేమిటో గీత బైటపెట్టలేదుగానీ చాలా బాధపడింది. ఎప్పుడూ కంటతడి పెట్టనిది వెక్కివెక్కి ఏడ్చింది. పెద్ద గొడవైంది. అందుకేగా, తను ట్రాన్స్ఫరు పెట్టుకుని ముంబై వెళ్ళింది? మళ్ళీ కొత్తగా ఏమిటి?
“ఇక్కడినుంచీ వెళ్ళేముందు చాలా స్పష్టంగా చెప్పాను బాబాయికి. అక్కడితో ఆపేస్తారనుకున్నాను. మళ్ళీ మొదలుపెట్టారా? ఇంకెవరెవరు ఇందులో మాట్లాడారు?” అడిగాడు కోపంగా.
“ఇంకెవరికి కావాలి? అరుణకీ భర్తకీ మంచిచెడులు తెలుసు. వాళ్ల కోడలు ఎగిరినా, వాళ్ళు కలగజేసుకోరు. ఇక మిగిలింది నీ మరదలు. దానికి తగ్గట్టే పద్మపిన్ని…” లక్ష్మి జవాబిచ్చింది.
“గీతకి వాళ్ళ నాన్న ఏదో యిచ్చుకుంటే అమ్మానాన్నలిచ్చిన యింట్లోంచీ నేనెందుకు వెళ్లాలిరా? అంతగా కావాలంటే వేర్లుపడదాం. అమ్మా, నేనూ, నువ్వూ, తులసి… తలోగదీ తీసుకుందాం. అత్తలేం అంటారో! ” అన్నాడు వాసు.
“మీ మా దగ్గిరకీ, వాటాలదగ్గిరకీ వచ్చావేంట్రా?” అన్నాడు మాధవ్ చిన్నబుచ్చుకుని.
“లేకపోతే ఏం చెయ్యాల్రా? చిన్నప్పట్నుంచీ పుట్టి పెరిగిన యిల్లు డిమాలిష్ చెయ్యమని ఒకళ్లంటారు, వదులుకుని పొమ్మని యింకొకళ్ల సలహా. నాలుగేళ్ళనాడు మొదలైన గొడవ రావణకాష్ఠంలా కాలుతునే వుంది. వీళ్లందరికీ మనింటి వ్యవహారాలతో ఏం పని?” వాసు నిలదీసాడు.
“నువ్వు వెనక్కి రావాలనుకుంటే రావచ్చు. ఎవరికీ ఆక్షేపణ లేదు. ఇదివరకట్లాగే వుండండి. ఇష్టమైతే కలిసి వండుకోండి. లేకపోతే ఎవరి వంట వాళ్ళు చేసుకోండి. నలుగురూ నాలుగురోజులు నవ్వుతారు. తర్వాత వదిలేస్తారు. కాదూ, వేరే యిల్లు తీసుకుని వుండండి. మధ్యలో గీతకెందుకురా, పడి ఏడుస్తారు? ఇంట్లో మీకెంత హక్కు వుందో దానికీ అంతే హక్కుంది. నా పెద్దకోడలది. మీ నాన్నని చెయ్యిపట్టుకుని తీసుకొచ్చి అందరి మధ్యనీ అన్నానికి కూర్చోబెట్టగలిగిన చొరవ మీరిద్దరు అన్నదమ్ములుగానీ, తులసిగానీ ఎప్పుడేనా చేసారా? అది చేసింది. దాని జీవితం ఈ రెండిళ్లతోనూ ముడిపడి వుంది. దాన్ని అకారణంగా కంటతడి పెట్టిస్తున్నారు. అదెవర్రా, ఆ మాధురి, నా ఇల్లు పడగొట్టించమనడానికి? దానికి నువ్వు ఎంత లోకువ యివ్వకపోతే అలా మాట్లాడుతుంది?” దులిపేసింది లక్ష్మి.
మాధవ్ తలపట్టుకున్నాడు. వాసు చూస్తూ కూర్చున్నాడు. పనిగట్టుకుని వచ్చి, మాధురి అలా మాట్లాడటం అతనికి అసలు నచ్చలేదు. ఒకప్పుడు ప్రాణస్నేహాలుగా వున్న చుట్టరికాలు పెళుసుగా, మాట తాకితే పగిలిపోయేలా మారిపోవడం తెలుస్తోంది. అప్పటికప్పుడే జవాబు యివ్వచ్చు. మాధురి నోరుమూయించవచ్చు. ఇప్పుడు తమమధ్యనే వున్న గొడవలు పెద్దవాళ్ళదాకా వెళ్తాయేమోనని ఆగాడు. నందకిషోర్‍తో చెడగొట్టుకోవడం అతనికి యిష్టం లేదు. చాలా మంచిమనిషి అతను. మాధురి మాటలకి స్పందించి జవాబివ్వడం అనేది ఆమెకి అనవసరప్రాధాన్యత యివ్వడంలా వుంటుందనికూడా వూరుకున్నాడు.
“ఎవరి ఆశలు వాళ్ళకి వున్నాయి. మీ మామ వెనకనుంచీ ఎగేస్తున్నాడు. ఇప్పుడీ యిల్లు మీకొదిలేసి వీళ్ళు వెళ్ళిపోతే దీన్ని పడగొట్టి అపార్టుమెంటు కట్టించి, మీ ముగ్గురినీ ఒకదగ్గిర చేర్చాలని ఆయన కోరిక. నాకూ వాసుకీకూడా చెరో ఫ్లాటూ వస్తుందట. దయా? ధర్మమా? అందరూ పైకొస్తారంట. నాకదే అర్థం కావట్లేదు. నా పెద్దకొడుకుని వదిలేసి, ఇంకెవరి బాగో నాకెందుకు? వాళ్ళ అమ్మానాన్నలు వాళ్ళకి లేరా? వీళ్ళంతా ఎవర్రా, నాయింటిగురించి మాట్లాడ్డానికి? అసలు నువ్వెందుకు నోరు మెదపట్లేదు? మీ యిల్లు మీరు చూసుకోలేనంత అసమర్ధులా మీరిద్దరూ? నువ్వు ఔనేమో, వాసుమాత్రం కాదు. అంతగా కూతుళ్ళు ముగ్గుర్నీ ఒకచోట పెట్టి ఆమధ్యని తనూ వుండాలనుకుంటే మీ మామని ఓ రెండొందలగజాల స్థలం కొనిమ్మనండి. అందులో కట్టుకుని ముగ్గురూ వూరేగండి. ఆయన్ని తలోకాసేపూ ఎత్తుకుని ఆడించుకోండి. మీనాన్న పోయినప్పుడు మొదలుపెట్టిన ఏడుపు ఇంకా ఆపలేదు ఆయన” అంది లక్ష్మి.
1 వాసు, గీత – భార్యాభర్తలు, మేనత్తమేనమామ పిల్లలు. మయూఖ్, విహంగ్ గీతావాసుల పిల్లలు. రామారావు గీత తండ్రి.
2 ప్రమీల – రామారావు పెద్ద చెల్లెలు. సుధీర్, సుమతి, సుమంత్ ఆమె పిల్లలు. భర్త గురుమూర్తి.
రమ – సుధీర్ భార్య. వ్యాస్, హాస్ వాళ్ళ పిల్లలు. సరళ ఆమె తల్లి. సుమతి భర్త జోగేశ్వర్రావు.
3 లక్ష్మి – రామారావు రెండో చెల్లెలు. వాసు, మాధవ్, తులసి ఆవిడ పిల్లలు. నీలిమ మాధవ్ భార్య. పంకజ్ కొడుకు.
4 నిర్మల – రామారావు మూడో చెల్లెలు. నారాయణ ఆమె భర్త. మహతి, రవళి ఆమె కూతుళ్ళు.
నరేంద్ర, మహతి భర్త, మేఘన కూతురు. విజయ నరేంద్ర రెండో భార్య. హరి, ఇందిర ఆమె పిల్లలు.