ఝరి – 55 by S Sridevi

  1. ఝరి – 46 by S Sridevi
  2. ఝరి – 47 by S Sridevi
  3. ఝరి – 48 by S Sridevi
  4. ఝరి – 49 by S Sridevi
  5. ఝరి – 50 by S Sridevi
  6. ఝరి – 51 by S Sridevi
  7. ఝరి – 52 by S Sridevi
  8. ఝరి – 53 by S Sridevi
  9. ఝరి – 54 by S Sridevi
  10. ఝరి – 55 by S Sridevi
  11. ఝరి – 56 by S Sridevi
  12. ఝరి – 57 by S Sridevi
  13. ఝరి – 58 by S Sridevi
  14. ఝరి – 59 by S Sridevi

జరిగిన కథ-వాసు, గీత భార్యాభర్తలు. గీత ఆత్మహత్యకి ప్రయత్నం చేసి బైటపడుతుంది. తులసికి కేన్సరొచ్చి తగ్గుతుంది. భర్తతో విడిపోవాలనుకుంటుంది. అతనికి విడాకులు ఇష్టం వుండదు. గీతకి ఎవరో ఫోన్‍చేసి బెదిరిస్తారు. ఆ ఫోన్ సుధీర్‍ చేసాడేమోననే అనుమానం వస్తుంది వాసుకి. మహతి భర్తతో విడాకులు తీసుకుంటుంది. మేఘన ఆమె కూతురు. తల్లి దగ్గిరే వుంటుంది. తండ్రికి యాక్సిడెంటైతే చూడటానికి వస్తుంది. మహతితో విడాకులయ్యాక నరేంద్ర మరో పెళ్ళి చేసుకుంటాడు. ఆమెవలన ఇద్దరు పిల్లలు. ఆమె చనిపోతుంది. అతనికి యాక్సిడెంటైతే సాయానికి హాస్పిటల్‍కి వెళ్తుంది మహతి. రాత్రి అతనికి అటెండెంటుగా వుంటుంది. పిల్లలని వాసు తనింటికి తీసుకెళ్తాడు. మహతికి అతనితో తన పెళ్ళైనప్పటి రోజులు గుర్తొస్తుంటాయి. నరేంద్రతో విడిపోయాక ఆమె ముంబైలో వుండిపోతుంది.
గీత గతం. చదువయ్యి, చిన్నవయసులోనే వుద్యోగంలో చేరుతుంది. ఇంట్లో ఆమెకి పెళ్ళి చెయ్యాలనుకుంటారు. తండ్రి అడిగితే సూచనాప్రాయంగా వాసు పేరు చెప్తుంది. ఆమెని తనింటికి తీసుకెళ్ళి సుధీర్ని చేసుకొమ్మని నచ్చజెప్పే ప్రయత్నం చేస్తాడు రవి. గీతావాసులకి చాలామంది కజిన్స్. చిన్నతనంలో వాళ్లంతా ఒకే స్కూల్లో చదువుకుంటారు. రామారావు యశోద ప్రమీల ఇంటికి వెళ్ళి పెళ్ళివిషయం చెప్పి, ఆహ్వానించి వస్తారు. సుధీర్ గీతని ఇష్టపడతాడు. ఆమెని చేసుకోలేకపోతున్నందుకు బాధపడతాడు.
వెంకట్రావు, విశాల అనే భార్యాభర్తలు అప్పులబాధ తట్టుకోలేక వురివేసుకుని చనిపోతారు. వాళ్ళ కూతురు అమృత. అమృత అవంతీ ఎస్టేట్స్‌లో మాధవరావు ప్రాపకంలో వుంటుంది. పోలీసుస్టేషన్‍కి పిలిచి బెదిరిస్తారు అమృతని. విజయ్, శ్యామ్మోహన్ అండగా నిలబడతారు. తనకి అమృత అంటే ఇష్టమని ప్రసూనకి చెప్తాడు. ఆ విషయం చెప్పి రోహిణిని హెచ్చరిస్తుంది ప్రసూన.


“మీకు త్రిమూర్తులు తెలుసా?” కొంచెం అమర్యాదగా అడిగాడు రామ్మోహన్.
“అతను మా పెద్దబావమరిదికి చాలా దగ్గర” అన్నాడు నారాయణ.
“దుర్మార్గుడు” త్రిమూర్తులిని తెలిసినవాళ్ళకి ఎవరో ఒకరికి చెప్పాలనిపించిన వుక్రోషం. ఎప్పట్నుంచో దాచుకున్నది.
“అదేమిటలా అనేసారు? హైద్రాబాదులో చాలా పేరున్న వ్యక్తి అతను. పెద్ద ఉమ్మడికుటుంబం. చాలా వ్యాపారాలు వున్నాయి. బాగా ఆస్తులు కూడబెట్టాడు. ఎవరికీ హాని తలపెట్టినట్టు వినలేదు” అన్నాడు నారాయణ కొంచెం ఆశ్చర్యంగా.
“మా అమ్మ అతని చెల్లెలు” అన్నాడు రామ్మోహన్.
“చెల్లెలా? త్రిమూర్తులు ఒక్కడే కొడుకు వాళ్ల నాన్నకి” అంటూ అర్థమైనట్టు ఆగాడు నారాయణ. అతనికి ఆ కథ తెలుసు. రామ్మోహన్‍పట్ల కొద్దిగా చులకనభావంలాంటిది కలిగింది. మనిషిని కొలిచేందుకు కొన్ని వుపకరణాలుంటాయి. తల్లిదండ్రులు, కుటుంబం, పుట్టిపెరిగిన పరిసరాలు. వీటికి భిన్నమైన లక్షణాలు చూపించే మనుషులు చాలా అరుదుగా వుండచ్చు. వాళ్ళు ఒకరిద్దరినీ మినహాయించుకుంటే మిగిలినవాళ్ళంతా ఆ త్రాసులో తూగేవాళ్ళే. ఎదుటిమనిషిగురించి వుండే కనీసపు అంచనా అది. వీళ్ళు మాట్లాడుకుంటుంటే మహతి ప్రింటు తీసిన కాగితాలు, సిడీ తీసుకుని వచ్చింది. అప్పుడు మరోసారి ఇద్దరూ కలుసుకున్నారు. ఒకరినొకరు గుర్తుపట్టారు.
“ఆరోజు మీకు చెప్పిన కథే రాసాను. పుస్తకం ప్రింటయాక కాపీ యిస్తాను చదివి అభిప్రాయం చెప్పండి” అన్నాడు. ఆమె తలూపింది.
“మీకు మా అమ్మాయెలా తెలుసు?” అడిగాడు నారాయణ కొంచెం అసహనంగా. రైల్లో సంఘటన చెప్పాడు రామ్మోహన్. నారాయణకి అతనిమీది అసహనం తగ్గిందిగానీ తేలికభావం పోలేదు.
“అతన్తో జాగ్రత్తగా వుండు. కల్పించుకుని మాట్లాడతాడేమో, తుంచెయ్. వాళ్ళది అంత మంచి కుటుంబం కాదు” అన్నాడు మహతితో, తర్వాత. అతను ఎలా చెడ్డవాడో, తండ్రి ఎలా ఆ విషయం తెలుసుకోగలిగాడో, కుటుంబాన్నిబట్టి అలా నిర్ణయించడం సరైనదోకాదో మహతికి తెలీదు. ప్రశ్నించడం, ఎదురుతిరగడం ఆమె స్వభావం కాదు. తలూపి వూరుకుంది.
“ఎవర్నిగురించి?” నిర్మల అడిగింది ఆరాగా. చెప్పాడు. ప్రపంచం ఎంత చిన్నదోననిపించి ఆశ్చర్యపోయింది.
ఈ యిన్నిరోజుల్లో రామ్మోహన్ మహతిని మర్చిపోలేదు. మర్చిపోవడమంటే? సగం చదివాక తప్పనిసరై మూసేసిన పుస్తకంలా ఆమెని గురించిన ఆలోచనలు వస్తుంటాయి. ఎన్నో ప్రశ్నలు తలెత్తుతాయి.
ఆమె పేరేమిటి?
ఆరోజు వచ్చినది, తిరిగి వెళ్ళలేదా? ఇక్కడే వుండిపోయిందా?
భర్తతో కలిసే వుంటోందా? ఇద్దరూ విడిపోయారా?
మళ్ళీ ఎవరితోనేనా కమిట్‍మెంటు ఏర్పడిందా? వంటరిగానే వుందా?
ఆ తర్వాతది ఆమెపట్ల చిన్న క్రష్. పురుషసహజమైన కోరిక. అతని జీవనశైలికి అనుచితం అనిపించనిది.
ఆమె స్ఫూర్తిగా పెద్దరిసెర్చే చేసాడు. ఆడపిల్లలు కష్టం రాగానే ఇల్లొదిలి ఎందుకు వెళ్ళిపోతారన్న విషయంమీద. అన్నిదారులూ ఒకవైపుకే వెళ్ళాయి. ఇంట్లోవాళ్ళకి కాస్త భిన్నంగా ఆమె నిర్ణయం తీసుకోగానే, దాన్ని ఆపేందుకు అందరూ అన్నివైపులనించీ వత్తిడి మొదలుపెడతారు. బలప్రయోగం చేసేనా ఆ నిర్ణయాన్ని మార్చాలనుకుంటారు. ఆమెకి ఏమీ తెలీకుండా పెంచి, ఏమీ తెలీనిదని ఆరోపిస్తారు. ఇక తప్పనిసరై ఇల్లు వదిలిపెట్టి వచ్చేస్తుంది.
పెళ్ళి… ఇష్టం లేకపోయినా చేసుకోవాలి.
భర్త… కొట్టినా తిట్టినా భరించాలి. అన్నీ భరించి, అతన్ని మార్చుకుని, ఆనందంగా బతకాలి.
పిల్లలు… పెద్దతనాన తిండి పెట్టినా పెట్టకపోయినా సర్దుకుపోవాలి.
సమాజం… పెళ్ళి కాకుండా సమాజం నిరోధించినా ఆ సమాజంలోనే బతకాలి.
ఈ ప్రపంచం యుటోపియా కాకపోయినా ఆమె మాత్రం యుటోపియన్‍గానే భావించబడుతుంది. పెళ్ళికిముందు ఒకలా, పెళ్లయాక మరోలా, ఇంట్లో ఒకలా, ఆఫీసులో ఒకలా. ఇలా మనిషిని, పరిసరాలని, పరిస్థితులనిబట్టి మారుతూ, అలాంటి నిరంతరమైన మార్పునే పీలుస్తూ అందరి జీవితాలకీ ఆలంబన కావాలనే ఒక వింత ఆశింపు ఆమెనుంచి వుంటుంది. అదే సమాజంలో వున్న వైకల్యాలన్నిటికీ కారణం అనేది అతను తనుగా నిర్ధారించుకున్న విషయం.
రామ్మోహన్ మహతిని తరుచు కలిసేవాడు. ఇంటికే వచ్చేవాడు. తమమధ్య ఆంతరంగిక సాన్నిహిత్యమేదో వున్నట్టు ఇద్దరికీ అనిపించేది. ఆమె జీవితంలోని అత్యంతక్లిష్టమైన రోజుని అతను చూసాడు. ఆమె ఎలాంటి తెలివితక్కువ నిర్ణయం తీసుకోకుండా ఆపాడు. వాళ్లమధ్య సాన్నిహిత్యానికి కారణం అదే. సాహిత్యాన్ని గురించి, అతను రాసిన పుస్తకాలగురించి మాట్లాడుకునేవారు. అతను యింటికి రావడం, మహతితో ఈ చర్చలు నారాయణకి యిష్టం వుండేవి కాదు.
“పెద్దవాడేకదా? తప్పేం లేదు. మాట్లాడుకోనివ్వండి. అది ఆ కంప్యూటరు వర్కుతప్ప మరోధ్యాస వదిలేసింది. ఎవరికీ ఫోన్‍కూడా చెయ్యడం లేదు. వాళ్ళు చేస్తే పలకడమే. మనకిమాత్రం ఇక్కడ ఎవరున్నారు?” అంది నిర్మల.
మహతి ఇక్కడికి వచ్చినప్పటికీ, ఇప్పటికీ చాలా సంఘటనలు జరిగాయి. మాధవ్ రాజస్థాన్ ట్రాన్స్‌ఫరై వెళ్ళిపోయాడు. మహతిని వదిలేసి వెళ్తున్నందుకు చాలా బాధపడ్డాడు. తమతోపాటు నిలబెట్టాలని రాణాని తీసుకొస్తే అతను మూడునెలలు జల్సా చేసి, తెచ్చుకున్న డబ్బంతా ఖర్చుపెట్టుకుని, చివరికి చార్జీలు అడిగి తీసుకుని వెళ్ళాడు. గీత అంచనా ఇక్కడ తప్పింది. సుధీర్ ఏం చెప్పాడోగానీ, అతని అత్తమామలుమాత్రం మంచిసపోర్టు ఇచ్చారు. డీటీపీ సెంటరు పెట్టడం, మాధవ్ వెళ్ళిపోయాక తమకి దగ్గర్లో, తక్కువలో ఫ్లాటు చూసి, అందులోకి వాళ్ళని షిఫ్ట్ చెయ్యడం అన్నీ దగ్గరుండి చూసుకున్నారు. గీత, వాసు వచ్చి మధ్యలో వచ్చి చూసి వెళ్తున్నారు. రవళి వస్తుంటుంది.
పదకొండుమంది కలిసి ఏర్పరిచిన స్నేహప్రవాహం ఇప్పుడు చిన్నచిన్నపాయలుగా చీలి, దేని గతిననుసరించి అది విడిగా ప్రవహిస్తోంది. ఒకరంటే ఒకరికి గల ప్రేమాభిమానాలు నేలపొరల లోలోపలి చెమ్మలాగా వుండిపోయాయి. ఒకరికోసం మరొకరు ఏదేనా చెయ్యగలిగే పరిస్థితి స్వంతకుటుంబం అనే పరిమితులకి లోబడిపోయింది.
రామ్మోహన్‍తో మహతి పరిచయం అక్కడే ఆగలేదు. కొద్దిరోజులతర్వాత అతన్నుంచీ పెళ్ళిప్రస్తావనలాంటిది వచ్చింది.
“నాకు ఈ వివాహవ్యవస్థమీద నమ్మకంలేక పెళ్ళి చేసుకోలేదు. మూడేళ్ళు రిలేషన్‍షిప్‍లో వున్నాను. ఒక బాబు పుట్టాక అభిప్రాయబేధాలు వచ్చి ఇద్దరం విడిపోయాం. వాడు నా దగ్గిరే వున్నాడు” అన్నాడు తన ప్రతిపాదనకి నాందీప్రస్తావనలా.
“మీరు పెళ్ళిచేసుకోవద్దనుకున్నారు, చేసుకోకుండా వుండగలిగారు. నేనూ అనుకున్నానుగానీ బలవంతంగా చేసారు. అంత బలంతోనూ విడిపించుకుని బైటపడ్డాను” అంది మహతి చిన్నగా నవ్వి. వివాహవ్యవస్థలో వస్తున్న మార్పులు తెలుస్తున్నాయి ఆమెకి. కొన్నాళ్ళు బైటికి వెళ్ళి వుద్యోగం చేసింది. అనేక పరిచయాలు. రేకులు ముడుచుకున్న పువ్వుని బలవంతంగా రెక్కలు ఇప్పినట్టు కొన్ని పరిచయాలు. తప్పనిసరిగా. విడాకులు తీసుకున్నాక మానవసంబంధాలకి చెందిన ఒక కొత్తకోణం తెరుచుకుంది. బాయ్‍ఫ్రెండ్సు, గర్ల్‌ఫ్రెండ్సు, పార్టీలు, పబ్‍లు, పెళ్ళిచేసుకోకుండా కలిసి వుండటం. అన్నిటినీ చుట్టుకుని శృంగారం. అవంతీపురంలో ఇంత విశృంఖలత లేదు. ఉందేమో, గమనించలేదు. చదువుకునేరోజుల్లో చూచాయగా విన్న విషయాలు ఇప్పుడు విస్తృతంగా తెలుస్తున్నాయి. తెలుసుకుంటోంది. అందుకే రామ్మోహన్ విషయంలో పెద్దగా ఆశ్చర్యపోలేదు. కానీ తనతో ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నాడో అనుకుంది. సాహిత్యచర్చలో భాగంగా చెప్తున్నాడనుకుంది.
“మీకు ఇష్టమైతే మనం కలిసి వుండచ్చు. నా కొడుకు, మీ పాప. మీరు, నేను, మా అమ్మ ఐదుగురం ఒక కుటుంబంగా. ఇష్టమైతే మీ తల్లిదండ్రులుకూడా. అలా వుండటం మీకు అభ్యంతరమైతే సివిల్ మేరేజి చేసుకుందాం” అన్నాడు చాలా మామూలు విషయమన్నట్టు.
మహతి తొణకలేదు. అతన్ని నిశితంగా చూసింది. ఇద్దరు మనుషులమధ్య శృంగారం లేకుండా మరే బంధం వుండకూడదా? ఆరోజు రాత్రి బలమైన వుద్వేగాలమధ్య కొట్టుకుపోతూ బేలన్సు తప్పి వున్న తనని సరైన దార్లోకి తీసుకెళ్ళి వదిలిపెట్టాడు ఇతడు. చెయ్యాలనుకుంటే తన నిస్సహాయత చూసి ఆరోజే మోసం చెయ్యచ్చు. అవకాశం తీసుకోవచ్చు. కానీ ఆ పని చెయ్యలేదు. చాలా బాధ్యతగా వ్యవహరించాడు. కనీసం తన పేరుకూడా అడగలేదు. మాధవ్‍ని పరిచయంచేసుకుని, ఆ పరిచయాన్ని పెంచుకుని మళ్ళీ కలిసే ప్రయత్నం చెయ్యచ్చు. కానీ చెయ్యలేదు. మరి యిప్పుడెందుకిలా? తనని చూడగానే శృంగారం గుర్తొచ్చిందా? ఎందుకు? భర్తని వదిలిపెట్టిందనా? ఇక్కడ తనకి స్థానబలం లేదనా?
ఆమె తొణకలేదు. తొందరపడలేదు. గొడవపడలేదు. అతనెంత మామూలు విషయంలా అడిగాడో అంతే మామూలుగా వుండాలని నిర్ణయించుకుంది.
“నాకు అలాంటి ఆలోచన లేదు. నా భర్తంటే నాకు ఇప్పటికీ ప్రేమే. అతను చెడ్డవాడని మేం విడిపోలేదు. ఐ వజ్ ఎ బేడ్ వైఫ్ ఆల్ త్రూ” అంది.
“పోనీ కేజువల్‍గా? బయట ఎక్కడేనా?” అడిగాడు.
పుట్టుకతోటే మనిషి ఒక మూసలో ఇమడ్చబడతాడు. అతని చుట్టూ వుండే మనుషులు, పరిసరాలు ఆ మూసకి శీలలని బిగిస్తాయి. అతను ఆ మూసకి అలవాటుపడిపోతాడు. ఆపైన ఆవ్యక్తి ఆలోచనలకీ, వెతుకులాటకీ ఒక పరిమితి ఏర్పడుతుంది. అతని అమ్మమ్మ పెళ్ళైన మగవాడితో అంటే త్రిమూర్తులి తండ్రితో కలిసి వుంది. నలుగురు పిల్లలని కన్నది. వాళ్ళకి సరైన జీవితాలు ఏర్పరచలేకపోయింది. ఇప్పుడతను తల్లిగా చెప్పుకుంటున్న స్త్రీ- త్రిమూర్తులి చిన్నచెల్లెలు- ఆమెకూడా వివాహబంధానికి వెలుపలే బతికింది. ఇవన్నీ అతనిలో ఆత్మన్యూనతని పెంచి వుంటాయి. దాన్ని కప్పిపుచ్చుకునేందుకు కొన్ని సిద్ధాంతాలని చేసుకున్నాడు. ఆ సిద్ధాంతాలకి అనువైనవాళ్ళతోనే స్నేహం చేసాడు. అతని వ్యాసంగం, ముంబై సంస్కృతి దానికి చక్కగా సహకరించాయి. మహతిని పెళ్ళిచేసుకోవాలనుకోవడంలో ముసుగుకప్పి దాచిన ఆత్మన్యూనత వుంది. అది లేకుండా బతకడం అతనికి చేతకాలేదు. ఎవరూ నేర్పలేదు. సాహిత్యం చదివేడు. తను కొంత సృష్టించాడు. స్త్రీపట్ల సానుభూతి తనకి వుందనుకున్నాడు. అలాంటిదేమీ లేదనీ తెలుసుకున్నాడు. తన మనసులో వున్న అభిప్రాయాల్నే ఇంకొంచెం కృషి చేసి కథలుగా సృష్టించాడు. నిజానికి అన్నీ సవ్యంగా సాగిపోతున్న ఏ వ్యక్తికీ స్వంతజీవితం నడిపించుకునేందుకు ఆదర్శాలు అవసరం లేదు. అది లేనప్పుడే వాటి అవసరం.
“బిగ్ నో” అంది మహతి. ఈమాటు ఆమెకి కొద్దిగా చికాకు కలిగింది. దాన్ని అణచుకుంది.
“మరి? ఇలాగే వుండిపోతారా?” అతను ఆశ్చర్యంతో తలమునకలయ్యాడు.
“తప్పేముంది? ఇది నా జీవితం” అంది.
అక్కడితో ఆ సంభాషణ ముగిసింది. అతను వెళ్ళిపోయాడు. కోపాలూ, కక్ష పెంచుకోవటాలూ లేవు. కానీ అతనుమాత్రం చిన్న వోటమిని రుచి చూసినట్టనుకున్నాడు. గాయపడ్డాడు. అందుకు బాధ్యతమాత్రం మహతిది కాదు.
అతను ఇదివరకట్లా రావటం లేదని గుర్తించి నిర్మల అడిగింది. “రామ్మోహన్‍గారు రావట్లేదేమే?” అని.
“పోనీమ్మా! గంటలతరబడి కబుర్లకి ఏముంటాయి? నాకేమైనా అన్నా, తమ్ముడా, స్నేహితుడా? రావద్దని చెప్పలేక వూరుకున్నాను. నా పని పాడు” అంది మహతి. ఇద్దరిమధ్యా ఏదో జరిగిందని నిర్మల గ్రహించిందిగానీ రెట్టించి అడగలేదు. అడగటంవలన ప్రయోజనం వుండదని తెలుసు. నువ్వితన్ని చేసుకో అనటానికి నరేంద్రతో పోలిస్తే రామ్మోహన్ దివిటీముందు దివ్వెలా వున్నాడు. ఇటు మహతి భర్తని వద్దనుకుని వచ్చిన కారణం చిన్నదికాదు. వాళ్ళ స్నేహం ముందుకి వెళ్ళనందుకు నారాయణ సంతోషించాడు. జీవితంలో వచ్చే మరే మార్పునీ తట్టుకునే శక్తి అతనికి లేదు. జీవితం అంటే మహతిది.
కూతురు ఇంక యింతేనా? ఏకాకిలా? నిరంతరం ఈ ప్రశ్న నిర్మలని తినేసింది. అలిసిపోయిన ఆమె గుండె ఆగిపోయింది. అందరూ షాక్కి గురయ్యారు. తనవల్లే ఇదంతా జరిగిందని మహతి కృంగిపోయింది. కర్మ అవంతీపురంలో చేద్దామనుకున్నారు. ఇల్లు అద్దెకి ఇచ్చారు, అప్పటికప్పుడు ఖాళీచేయించడం సాధ్యపడదుకాబట్టి సత్రంలో చేద్దామని నారాయణ అనుకుంటే రామారావు తనింటికి వచ్చెయ్యమన్నాడు.