అలెగ్జాండర్ బొరిసొవిచ్ రాస్కిన్ రష్యను రచయిత. అతని జీవితకాలం 1914-1971. When Daddy Was A Little Boy అనే ఈ పుస్తకం 1968లో Как папа учился в школе పేరుతో రష్యనులో ప్రచురించబడింది.
Fainna glagoleva 1973లో ఇంగ్లీషులోకి అనువదించాడు.
దీనిని ఆర్వీయార్గా పరిచితులైన ఆర్ వేంకటేశ్వర్రావుగారు 2012లో దీనిని తెలుగులోకి అనువదించారు. రాదుగ సంస్థ ప్రచురించింది. అప్పటి వెల రూ60/-
1991లో సోవియట్ యూనియన్ పతనమయేవరకూ రష్యను కథల పుస్తకాలు లేని యిల్లు లేదంటె అతిశయోక్తి కాదు. ఒక ప్రత్యేకమైన శైలి, భాష, ఆకట్టుకునే బొమ్మలతో ఎన్నో పుస్తకాలు విశాలంధ్రవారి పుస్తకాలయాలలో దొరికేవి. తరువాతకూడా అంత విస్తృతంగా కాకపోయినా, రాదుగావారి ప్రచురణలు లభిస్తున్నాయి.
ప్రతి వ్యక్తికీ తల్లిదండ్రులు పెద్దవాళ్ళుగానే పరిచయమౌతారు. ఆ పెద్దవాళ్ళ బాల్యాన్ని గురించి తెలుసుకోవటం ఒక అద్భుతమైన విషయం. రచయిత కూతురికి విపరీతమైన చెవినొప్పి, గొంతువాపు, ఇన్ఫ్లుయెంజా జ్వరం వచ్చి నిద్రపట్టక రాత్రివేళ బాధపడుతూ వుంటుంది. విపరీతంగా ఏడుస్తుంది. ఆమెని మరిపించడానికి తన బాల్యంలోని కొన్ని సంఘటనలు చెప్తాడు. తర్వాత ఆ పాప చెవిపోటు వచ్చినప్పుడల్లా ఆ అనుభవాలని చెప్పమని అడుగుతూ వుంటుంది. తన చిన్నప్పటి వినోదవిషయాలతోపాటు స్నేహితుల విషయాలుకూడా చెప్తాడు. ఇందులో వున్నవన్నీ నాన్నల చిన్నప్పటి విశేషాలు కాబట్టి పిల్లలందరికోసం పుస్తకరుపంలో తీసుకొచ్చారు. ఇందులో మొత్తం 28 కథలున్నాయి. నాన్న తోటిపిల్లల అసూయమాటలు విని అమాయకంగా కారు కిందికి బంతి విసిరెయ్యడంతో మొదలై ఐదుకాళ్ళ స్టూలు తయారుచెయ్యడంతో ముగుస్తుంది. నాన్న సంగీతం నేర్చుకోవటం, కుక్కని మచ్చిక చెయ్యటం, నాన్న కొక్కిరిబిక్కిరి రాత, పిల్లలకి సహజాతమైన ఎన్నో విషయాలని రచయిత చెప్తూ వుంటే చక్కటి హాస్యం ఫక్కుమని నవ్విస్తుంది.
పశ్చిమగోదావరి జిల్లా రెడ్డి పోలవరంలో 16 July, 1962 లో జననం. వరంగల్లో వుద్యోగం. హెడ్పోస్ట్మాస్టర్గా వరంగల్లో స్వచ్చందపదవీ విరమణ.
వివాహం శ్రీ చదలవాడ విష్ణుమూర్తిగారితో. వారు డెప్యూటీ ఏగ్జిక్యూటివ్ ఇంజనీరుగా చేసి రిటైరయారు.
మొదటి కథ అనగనగా 1978లో వనితాజ్యోతి మాసపత్రికలో అచ్చైంది. వీరివి 225కి పైగా కథలు, 9 నవలలు వివిధ పత్రికల్లో ప్రచురించబడ్డాయి. గూడు, సింధూరి, గుండెలోతు అనే కథాసంపుటాలు, నీలినక్షత్రం అనే నవల పుస్తకాలుగా వచ్చాయి. సింధూరి అనే సంపుటానికి శ్రీమతి సుశీలా నారాయణ రెడ్డి అవార్డు 2005 లో వచ్చింది. ప్రేమలోంచీ ప్రేమలోకి అనే నవలకి ఆంధ్రభూమి ప్రథమ, తిరస్కృతులు, నీకోసం నేను అనే నవలలకి ఆంధ్రభూమి ద్వితీయ, 5-3-2 అనే నవలకి కినిగె ద్వితీయ బహుమతులు వచ్చాయి. ఎంతెంతదూరం? అనే కథకి విపుల కన్సొలేషన్ బహుమతి, శ్రీమతి రంగవల్లి ట్రస్ట్ అవార్డు వచ్చాయి. ఇవికాక కథలకు మరో ఏడెనిమిది బహుమతులు వచ్చాయి.
కథలకు కాన్వాస్ పెద్దదిగా వుండాలనేది వీరి అభిప్రాయం.