ఉదయం 8 గంటలు కావస్తోంది. కామేశ్వరి విలాస్ కాఫీ హోటెల్ వచ్చే పోయే భక్తులతో నిండిన దేవాలయంలా రద్దీగా ఉంది. ఆ హొటెల్ ప్రొప్రైటర్ ఓ పెద్ద బేంక్లో బిజీ అవర్స్లో కౌంటర్లో ఉండే క్యాషియర్లా అనిపిస్తున్నాడు. గుమ్మం దగ్గర ఓ ప్రక్కకు నిలబడి బిక్కమొహం వేసుకొని చింకి చొక్కా లాగుతో నిలబడి ఉన్న పదేళ్ల కుర్రాణ్ణి మాత్రం ఎవరూ గమనించే స్థితిలో లేరు. హోటెల్ ప్రొప్రైటర్ తనను చూసే అవకాశం కోసం ఎదురుచూస్తున్నాడా పిల్లవాడు. తనంతట తానుగా మాట్లాడే ధైర్యం ఇంకా లేక. ఆ పసివాడి అంతరంగాన్ని పసికట్టినట్లుగా హొటెల్ కాస్త ఖాళీ అవడం, హోటల్ యజమాని హనుమంతరావు దృష్టి కుర్రాడిమీద పడటం జరిగింది.
“ఏం కావాలి?” అలవాటు ప్రకారం అడిగేడు. ఏదో టిఫిన్ పార్సిలుకోసం వచ్చి ఉంటాడనే ఉద్దేశంతో. కాని ఆ చిన్నవాడి నోటివెంట మాట వచ్చేలోపునే మళ్ళీ జనం వస్తూ వెళుతుండడంతో అతని దృష్టిలో కనుమరుగైపోయాడా అర్భకుడు. ఇంతలో ఎవరో ఆసామి బిల్లు చెల్లించడానికి డబ్బులు తీస్తుంటే ఓ పది రూపాయల నోటు జారి ఎగిరి వచ్చి ఆ కుర్రాడి ముందుపడింది. వెంటనే ఆ కుర్రాడు దాన్ని ఆ ఆసామికి ఇచ్చేద్దామనే ఉద్దేశంతో వంగి తీశాడో లేదో ఎవరిదో బలమైన చేయి ఆ కుర్ర శరీరంమీద వేసిందో దెబ్బ. అసలే ఆకలితో అలమటిస్తూ బలహీనంగా ఉన్న ఆ శరీరం ఆ దెబ్బను తట్టుకోలేక విలవిల్లాడింది. ఏం జరిగిందో తెలిసేలోపునే…
“ఏరా చూస్తే వేలిడంత లేవు? ఎప్పటినుండి ఈ ఉధ్యోగం? ఎవరి జేబు కొడదామా అని ఆలోచిస్తున్నావా?” అని అడిగేడా ఆసామి.
“నేదండి నానలాటోడ్ని కాదండి. పడిపోయిన మీ నోటు మీకిచ్చేద్దామనే తీత్తున్నానండి” అంటున్న ఆ కుర్రాడి మాటలు వినిపించుకోకుండానే “చఫ్ నోర్మూయ్ వెధవా! ఇప్పుడే ఇలాంటి దొంగతనాలకు అలవాటుపడ్డవాడివి పెద్దయ్యాక ఇంకెలాంటి దోపిడీలు చేస్తావో నిన్నిలా వదిలేయకూడదు. పద పోలీసు స్టేషనుకు అప్పజెప్పితే అక్కడ వాళ్ళు నాలుగు తన్ని మళ్ళీ ఇలాంటి వెధవపనుల జోలికి పోకుండా చేస్తారు” అంటూ ఆ చిన్న చేతిని పట్టుకున్నాడు.
“నన్ను నమ్మండి, నేనందుకు రానెదండి నన్నొదిలేయండి” వేడుకొంటున్నాడు.
ఒక్కక్కరూ గుమిగూడుతున్నారు “ఏం జరిగింది…ఏం జరిగింది” అంటూ.
“పాపం, ఎవరో అడుక్కునేవాడయి ఉంటాడు…వదిలేయండి..దొంగతనం చేసే ధైర్యం వాడికెక్కడుంటుంది?” అని ఓ పెద్దాయన అన్నాడు.
“అలాగే చెప్పండి. ఈ కుర్రకుంకలేమో మనం అనుమానించంకదా అని ఇలాంటి వేషాలు వేస్తుంటారు. అయినా ప్రతి హోటలు ముందు ఈ ముష్టివాళ్ళొకరు ” ఈసడించుకున్నాడు.
“అసలు ఆ కుర్రాడెవరో ఎందుకొచ్చాడో కనుక్కోకుండా తొందరపడడం మంచిది కాదు” మనసున్న ఓ మనిషి మందలించేడు.
ఇంతలో హోటలు యజమాని కలుగజేసుకొని ” ఇందాక నేనడిగేనండి ఏం కావాలని? ఏం చెప్పలేదు” అన్నాడు.
“ఏమని చెప్తాడు వచ్చిన పని అలాంటిది” ఓ కంఠం.
” ఇంతకీ ఎవరు నువ్వు? ఎందుకొచ్చావు? త్వరగా చెప్పరా! లేకపోతే అనవసరంగా ఇబ్బందులపాలౌతావు” గదమాయించేడు హోటలు యజమాని.
“నేను నర్సయ్య కొడుకునండి. మా అయ్య నన్ను అంపించేడండి” చెప్పాడా కుర్రాడు.
” నర్సయ్య?…”
“ఈ హోటల్లో పనిచేత్తాడండి”
“ఓరీ నువ్వు నర్సయ్య కొడుకువా? ఎప్పుడూ చూడలేదు. నీ పేరేంటి?”
“నారిగాడండి”
“మీ అయ్య ఎందుకు పంపేడు?”
” మా అయ్యకి ఒంటో బాగోనేదు. పనిలోకి రాలేనని సెప్పమన్నాడు. ఏదైనా పని ఉంటే సెయ్యమని నన్ను అంపేడు”
“చూసేరా? అందుకే నేను తొందరపడొద్దని చెప్పేను. పాపం అన్యాయంగా ఈ కుర్రాడ్ని చితకబాదేసేరు… ఉదయం లేచి ఎవరి మొహం చూసేవో అనవసరంగా దెబ్బలు తిన్నావు. వచ్చినోడివి ఎందుకొచ్చావో చెప్పకుండా అలా నిలబడ్డావెందుకు? ఇలారా” అని పిలిచేడు ప్రొప్రయిటరు. ఆ కుర్రాణ్ణి కొట్టిన అసామీ మరి మాట్లాడలేకపోయేడు. తన తొందరపాటుకు తనే తలెత్తుకోలేకపోయాడు.
” ఈ చెప్పిందేదో ముందే చెప్తే బాగుండును కదా” అన్నాడు ఆ కుర్రాడితో.
“మీరు నన్నెక్కడ చెప్పనిచ్చేరు?” అన్నాడు ఉక్రోషంగా అంతవరకు మాటలు రానివాడిలా నిల్చున్నవాడే.
“ఇంద ఈ పది రూపాయలూ తీసుకొని టిఫిన్ చెయ్యి ఎప్పుడు తిన్నావో ఏమో” అన్నాడు ఎక్కడాలేని ఆప్యాయత కనబరుస్తూ.
“అక్కర్లేదు” ఆ మాట విన్న వారెవరికైనా, చింకి చొక్కా చింకి లాగు వేసుకున్నంత మాత్రాన ముష్టివెధవనో, దొంగవెధవనో అనెయ్యడమేనా? అన్న అభిప్రాయం వ్యక్తమౌతుంది. వాడి కళ్ళు వాడి చూపులు భరించలేక మెల్లగా అక్కడనుండి జారుకున్నాడు ఆ ఆసామి. ఒక్కక్కరూ ఎవరి స్థానాలకు వాళ్ళు వచ్చి కూర్చున్నారు.
ఆ కుర్రాణ్ణి పిలిచి హోటలు యజమాని హనుమంతరావు, “ఓరేయ్ ముందు కాస్త టిఫిన్ చేయి తర్వాత నీ సంగతి చెపుదువుగాని” అంటూ బెల్ నొక్కాడు. ఇంతలో వచ్చిన పనివాడితో “వీడీక్కావలసిన టిఫిన్ ఇయ్యి” అని చెప్పి “వెళ్ళిరా అబ్బాయ్ వెళ్ళు” అన్నాడు.
“ ఆ! ఇప్పుడు చెప్పరా.మీ అయ్యకేమైంది?” అడిగేడు హనుమంతరావు వాడు తిని వచ్చాక.
“ ఏవైందో నాకు తెల్దుగాని మంచంమీదనుండి లేవనేకపోతున్నాడు.ఇక్కడ మీకు ఇబ్బంది అవుతాదని నాకు సేతనైన పని సేయమని నన్ను అంపేడు. మా అయ్యకిచ్చినన్ని డబ్బులు నాకియ్యక్కర్నేదండి. నాను సేసిన పనికి సరిపడా యిత్తే సాలునండి.” అన్నాడు.
పనికి ఖరీదు కట్టే వాడి ఆలోచనకు సంతోషించేడు హనుమంతరావు. “ నువ్వేం పని చేస్తావు “ అడిగేడు వాడ్ని.
“ మీరేం సెప్తే అది.” బుద్ధిమంతుడిలా సమాధానం చెప్పేడు.
“ బల్లలు తుడిచే పని చేస్తావా?”
“ అంటే? “ అమాయకంగా అడిగేడు నారిగాడు.
“ ప్లేట్లూ,గ్లాసులూ,కప్పులూ,సాసర్లూ,టేబుళ్ళూ శుభ్రం చేయడం”
“ నానెపుడూ సేయనేదండి.” సమాధానం చెప్పేడు.
“ ఇక్కడ చేసే పనులేవీ నువ్వెప్పుడూ చేసి ఉండవు. మరేం చేద్దామని వచ్చేవ్?” తెలుసుకుందామని అడిగేడు హనుమంతరావు.
ఎక్కడ వెళ్లిపొమ్మంటారోనని “ మీరు ఏ పని సెప్పినా సేత్తానండి” అన్నాడు.
వాడిని చూసి జాలి వేసింది హనుమంతరావుకు.తన దగ్గర పనిచేసే నర్సయ్య కొడుకనో లేక చిన్నవయసులోనే పనిపాట్లకు అంకితమైపోతున్న వాడిలోని దాస్యభావానికో లేక గంట క్రితం వాడికి జరిగిన అవమానానికి బాధ కలిగో ఏదైతేనేం తన హోటల్లో పనివాడిగా చేర్చుకున్నాడు. కాని నారిగాడి హృదయంలో మాత్రం శాశ్వతంగా ఓ గాయం ఏర్పడిపోయింది.
“ ఒరేయ్! ఇలా రా!” ఓ పెద్దమనిషి కేకేసేడు నారిగాడ్ని.
“ ఒత్తున్నానండి.” ప్రక్క టేబుల్ తుడుస్తూ అన్నాడు.
“ ముందిటు రమ్మంటుంటే” గద్దించేడా పెద్దమనిషి.
“ ఇక్కడ తుడుత్తున్నానుండండి. “ పని పూర్తి చేసి వచ్చే ఉద్దేశంతో అన్నాడు.
“ కప్పులు కడిగేవాడివి కళ్ళు నెత్తిమీదికొచ్చేయిరా నీకు? పిలుస్తుంటే రావడంలేదు.”
“ నానేం మీ యింటో కప్పులు కడిగేవోడ్ని కాదు. మీ యింటో ఆడాల్లు కూడా కప్పులు కడుగుతారు. ఆల్ల కల్లు ఎక్కడున్నాయో సూసి అప్పుడు మాటాడండి” ధైర్యంగా అన్నాడు.
“ అక్షరజ్ఞానం లేని అంట్లవెధవవి, మాటలు రాని మొద్దువి ఏం కూసేవ్?” అని లేచి వెళ్లి ఒక్క దెబ్బ వెయ్యబోయేడు. అది తప్పించుకోవడంలో చేతిలో ఉన్న ఎంగిలి ప్లేటు కాస్తా అతని వళ్ళో పడింది.అంతే పట్టరాని కోపంతో ఆ ప్లేటును వాడి ముఖానికి విసిరి కొట్టే ప్రయత్నంలో ఉండగానే పనివాళ్ళంతా పరిగెత్తుకుని వచ్చి అడ్డుకుని సర్దిచెప్పడంతో అంతా సద్దుమణిగింది. జరిగిందేమిటో అంతా విని తెలుసుకున్న హనుమంతరావు నారిగాడ్ని ఏమీ అనలేదు. ప్రతిమనిషికీ ఆత్మాభిమానం కలిగి ఉండే హక్కును కాదనలేకా,ఈ సమాజంలో మానవతా విలువలు లేని వ్యక్తులపట్ల నారిగాడికుండే ద్వేషాన్ని ఆతను అర్థం చేసుకున్నాడు కాబట్టి.
ఆఫీసుకు వెళ్ళేడే గాని అన్యమనస్కంగా ఉన్న పెద్దమనిషి పేర్రాజు కళ్ళెదురుగా ఆ నారిగాడే కనిపిస్తున్నాడు. మధ్యాహ్నం భోజనం చేస్తున్నప్పుడు కూడా వాడేదో నిలదీసి అడుగుతున్నట్లే అనిపించింది. మరి భోజనం చేయబుద్ది వేయలేదు.రాత్రీ అంతే నిద్ర కూడా పట్టలేదు. వాడు వేసిన ప్రశ్నలు ఒక్కొక్కటీ గుర్తుకొస్తున్నాయి.వేలెడంత లేడు వెధవ. ఎంత పొగరు?
“ పనివాడ్ని నేనే కాదు. మీరు కూడా. ఆఫీసులో ఒకరి క్రింద పనిచేస్తున్నారంటే మీరూ పని వాళ్ళే” అంటాడా?
ఒక్కసారి ఆవేశం పెల్లుబికింది. ఎంతెంత మాటలన్నాడు? దుర్యోధనుడికి మయసభలో జరిగిన అవమానంలా తోచింది. మనసు ఒక ప్రక్క సమాధానపరుస్తుంది. నిజమే. ఇంట్లో ఎంగిలి కంచాలు ఎత్తేదీ, ఎంగిలి కప్పులు కడిగేదీ తల్లీ, భార్యా, అక్కాచెల్లెళ్ళూ, కూతుళ్ళూ, కోడళ్ళూ. వాళ్ళంతా ఒకే కుటుంబీకులు. అలాగే హోటల్లో వినియోగదారులందర్నీ ఒక కుటుంబంగా భావిస్తే ఆ పనివాడు చేసే పనీ, మన ఇంట్లో ఆడాళ్ళు చేసే పనీ ఒకటే అనిపించింది.మరి మనయింట్లో పని చేసేవాళ్లకిచ్చిన గౌరవం ఆ పనివాళ్ళకెందుకివ్వం? అనిపించింది. ఛ..ఇంట్ళో ఆడాళ్లకీ పనివాళ్ళకీ పోలిక ఏమిటి? ఒక విధంగా నిజమేననిపించింది. నేనో గవర్నమెంటు సర్వెంట్ని అంటే ప్రభుత్వ ఉధ్యోగిని. ప్రభుత్వం అనే యజమాని దగ్గర పొట్టకూటికోసం ఉధ్యోగం చేస్తున్నవాడ్ని. ఇంగ్లీషులో సర్వెంట్ అన్న పదానికి తెలుగులో సేవకుడు, నౌకరు అనేదే అర్ధం. వాడు చిన్నవాడైనా చెప్పినదానిలో ఎంత పరమార్ధం ఉంది అనిపించింది. ఇలా మనసులోని తర్జన భర్జనలతో ఎప్పుడు నిద్ర పట్టేసిందో తెలియదు.
కాలచక్రంలో కేలండర్లెన్నో మారిపోయేయి. పెద్దమనిషి పేర్ర్రాజుకు పట్నం బదిలీ అవడం, అక్కడి నుండి ఊళ్ళన్నీ తిరుగుతూ పదిహేనేళ్ల తర్వాత ఏదో పని మీద అదే ఊరికి రావటం జరిగేయి. అలవాటుగా కాఫీ టిఫిన్కోసం హొటల్ కామేశ్వరి విలాస్ ఉండే చోటికి వచ్చేడు. కాని అక్కడ ఆ పేరుగల బొర్డు ఏదీ కనబడలేదు. కాని అదే స్థలంలో జ్యోతి విలాస్ అన్న బొర్డున్న హోటల్ కనబడింది. బహుశా ఆ హోటల్ యజమాని దాన్ని ఎవరికో అమ్మేసి ఉంటాడు ఏదైతేనేం అనుకొని అందులో దూరేడు. కాఫీ టిఫిన్ అయ్యాక బిల్లు చెల్లించబోతుంటే “వద్దండి నేనే మీకు ఋణపడి ఉన్నాను” అన్నాడా ప్రొప్రయిటర్.
ఆశ్చర్యపోతు పేర్రాజు “అదేమిటండీ? మీరెవరు? నేనెవర్ని, నాకు మీరు ఋణపడి ఉండడమేమిటి?” అన్నాడు
” మీరు నన్ను పోల్చలేదాండీ?” అడిగేడు.
పేర్రాజు గుర్తుపట్టడానికి ప్రయత్నిస్తున్నాడు. కాని లాభం లేకపోయింది.
“నేనండి కామేశ్వరి విలాస్ కాఫీ హోటల్లో …ఇంకా గుర్తురాలేదా, క్లీనర్ నారిగాడ్ని. ఇపుడు ఓనర్ నారాయణరావును ఈ హొటల్కు”
పేర్రాజు అతన్ని నువ్వు అనాలా మీరు అనాలా అని తికమకపడుతుంటే అతనే మళ్ళీ చెప్పడం ప్రారంభించేడు. “క్లీనర్ ఓనరెలా అయ్యాడా అని మీరు ఆశ్చర్యపోతున్నారు కదూ ? అంతా మీదీవెన మహత్యమే..మీ చలవే”
“అదెలా…”
“ఆనాడు మీరు నన్ను అక్షరజ్ణానం లేని అంటవెధవా, మాటలు రాని మొద్దూ అని తిట్టినందుకు… ఆవేళ నేను ఎంతో భాధపడినా మీ తిట్లే నాలో రోషాన్ని పెంచాయి. నేను చదువుకోక పోవడాన్నే అందరూ నన్ను దొంగ వెధవ క్రిందా, ముష్టివాడి కిందా జమ కట్టేవారు. పని చేస్తే హీనంగా చూసేరు. అందుకే ఓ ప్రక్క హోటల్లో పని చేస్తూ రాత్రిపూట పట్టుదలతో అక్షరాలు నేర్చుకోవడంతో ప్రారంభించి లోకజ్ఞానం సంపాదించాను. ఈ హోటల్లో కష్టపడి సంపాదించి క్లీనర్నుండి ఓనరయ్యాను. నాలో అక్షరజ్ఞానం వెలిగించిన జ్యోతికి గుర్తుగా మా యజమాని అమ్మివేస్తున్న ఈ కామేశ్వరీ విలాస్ను నేను కొని జ్యోతి విలాస్గా పేరు పెట్టేను. అని అతను చెప్పుకుపోతుంటే ఆనాడు తను చేసిన అవమానం ఈనాడు అతనిని అక్షరాస్యుడిగా మలిచినందుకు ఓ ప్రక్క సంతోషించినా నిరక్షరాస్యుడని ఆవేళ నీరసంగా చూసినందుకు సిగ్గుతో నోటమాట రాలేదు పేర్రాజుకు.
( ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం కార్మికుల కార్యక్రమంలో 09.5.1992న, సాహితీ మేఖల కార్యక్రమంలో తే.07.6.1994న ప్రసారితమైంది. 22.01.1992న “అక్షర తపస్మాన్” పక్షపత్రిక (జిల్లా సాక్షరతా సమితి, చిత్తూరు)లో, అమెరికాలోని తెలుగు అంతర్జాల పత్రిక “ వాస్తవం-జూన్ 2016” ప్రచురితమైంది.)
పేరు : పతి.మురళీధర శర్మ
ఉద్యోగం : భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ లో సీనియర్ సబ్ డివిజనల్ ఇంజనీర్ గా పదవీ విరమణ.
స్వస్థలం/నివాసం : విశాఖపట్నం.
రచనావ్యాసంగం ప్రారంభం : టీ.వీ.కొందాం నాటికతో. అది తే.15.03.1987 దీని ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రంలో ప్రసారితం.
నా రచనలలోని వర్గాలు : కథలు,కథానికలు (చిన్న కథలు),బాలసాహిత్యం కథలు,కవితలు,పద్యాలు,ఆధ్యాత్మిక విషయాలు,వ్యాసాలు ,పదరంగం (పజిల్స్),హాస్యోక్తులు (జోకులు),
నాటికలు (42),సూక్తిముక్తావళి,చింతన – ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రంలో ప్రసారితం.
సమస్యాపూరణలు(126) : దూరదర్శన్ హైదరాబాద్,విజయవాడ కేంద్రాలలోనూ,ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం లోనూ ప్రసారితం.
“తప్పెవరిది” నాటిక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కుటుంబ సంక్షేమ శాఖ వారిచే చిత్రీకరించబడి సంచార రథంపై ప్రదర్శింపబడింది.
నా రచనలు ప్రచురితమైన పత్రికలు
దినపత్రికలు : ఆంధ్రభూమి,ఆంధ్రప్రభ,ఈనాడు
వారపత్రికలు : ఉదయం,సుప్రభాతం,ఆబ్జెక్ట్ వన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లిమిటెడ్,హైదరాబాద్.
పక్షపత్రికలు : అక్షర తపస్మాన్,జిల్లా సాక్షరతా సమితి,చిత్తూరు.
మాసపత్రికలు : బాలరంజని, చిత్ర, స్వప్న, విశాలాక్షి, సాహితీకిరణం, సాహిత్యప్రసూన, సృజన విశాఖ, ప్రజ-పద్యం, విశాఖ సంస్కృతి
అంతర్జాలపత్రికలు : ప్రతిలిపి,వాస్తవం (అమెరికా),ఆఫ్ ప్రింట్,తెలుగువేదిక,ఆంధ్రసంఘం పూనా 75వ వార్షికోత్సవ సంచిక “మధురిమ” 2017.
చిరు సన్మానాలు : 1. సాహితీ సమితి, తుని వారిచే
2.పరవస్తు పద్యపీఠం, విశాఖపట్నం వారిచే
దూరదర్శన్ హైదరాబాదు కేంద్రంలో ప్రసారితమైన సమస్యాపూరణ,వర్ణనలకు ఉత్తమ పూరణ,ఉత్తమ వర్ణనలుగా ఎంపికై యువభారతి వారిచే పురస్కారాలు
భావగీతి – భావగీతికల సుమవనం (ముఖపుస్తక సమూహం/ఫేస్ బుక్ గ్రూప్) వారిచే హేవళంబి నామ సంవత్సర ఉగాది సందర్భంగా నిర్వహించిన కవిత/పద్య/విశ్లేషణ పోటీలలో ఉత్తమ కవి/రచయితగా బహుమతులు,నగదు బహుమతి, ప్రశంసాపత్ర ప్రదానం.
“ధరిత్రి “ సాహితీ మిత్రుల సంగమం, మహబూబాబాద్ జిల్లా,తెలంగాణ వారిచే నిర్వహించబడిన తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి కవితలు ,కథల పోటీలలో ఒక కథకూ,ఒక కవితకూ ప్రశంసాపత్ర ప్రదానం
2015 లో సృజన విశాఖ,గరిమ సాహితీ సాంస్కృతిక సంస్థలు నిర్వహించిన శ్రీ “మన్మధ” ఉగాది కవి సమ్మేళనంలో జ్ఞాపిక బహూకరణ.
2016 లో సృజన విశాఖ ఏడవ వార్షికోత్సవ ఆత్మీయ జ్ఞాపిక బహూకరణ.
తే.09.04.2017 దీని ప్రజ – పద్యం ( లోకాస్సమస్తా సుఖినోభవంతు ) ఫేస్ బుక్ సమూహం వారి సామాజిక పద్యాల పొటీలో ప్రత్యేక సంచికతో పాటు జ్ఞాపిక బహూకరణ.
వసుధ ఎన్విరో లేబ్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి సౌజన్యంతో RGB Infotain ఉగాది 2017 సందర్భంగా నిర్వహించిన కథల పోటీలో “ ఒక్క క్షణం “ కథకు ద్వితీయ బహుమతి ( రు.8000/-) ప్రదానం. “విశాఖ సంస్కృతి” మాసపత్రిక ఆధ్వర్యంలో నిర్వహించిన ” మానవ జీవన లక్ష్యం” వ్యాసరచన పోటీలో ప్రోత్సాహక బహుమతి. “నెలవంక నెమలీక”మాసపత్రికలో ప్రచురింపబడిన కథ “రాఖీ” కలహంస పురస్కారానికి ఎంపికయింది.
“మన తెలుగు తేజం – 2021” సాహిత్య రంగంలో జాతీయ అవార్డు లభించింది.