3 మళ్ళీ అదే తీరానికి+5 by S Sridevi

మళ్ళీ అదే తీరానికి

యుద్ధం ముగిసాక

గతజలం-సేతుబంధనం

తనువు- మనసు- ఆత్మ

లిఫ్ట్ ప్లీజ్

కుటుంబదృశ్యం

మళ్ళీ అదే తీరానికి-మయూఖలో మొదటి ప్రచురణ

లాబ్‍లో ఇచ్చిన రిపోర్టులు తీసుకుని డాక్టరుకి చూపించి ఆయన చెప్పింది విని మౌనంగా ఇవతలికి వచ్చాడు మధు.
“మీరు కాఫీ టీలు, సిగరెట్లు మానెయ్యాలి. అల్సర్స్ బాగా పెద్దవయ్యాయి. వీలైనంత తొందరగా సర్జరీ చేయించుకోండి” డాక్టరు మాటలు చెవుల్లో మార్మోగాయి. ఆరోగ్యం కన్నా విలువైనదీ, మనిషికి జీవనపోరాటంలో నైతికబలాన్నిచ్చేదీ మరేదీ వుండదు. ఇంకేం మిగిలింది తనకి? మనశ్శాంతి లేదు, ఆరోగ్యం లేదు. ఎలా వున్నా ఏం తిన్నా పట్టించుకుని మందలించేవాళ్ళు లేరు. మనసు చాలా అలజడిగా మారింది. క్రమంగా దు:ఖంతో నిండిపోయింది.
ఇంటికి వచ్చాడు. పిల్లలు ఇంట్లో లేరు. ఆడుకుందుకు వెళ్ళారు.  భార్య రమ వుంది. ఆమె పెళ్ళికి ముందు ప్రైవేట్ కాలేజిలో చేసేది. టైమింగ్స్ కలవక పెళ్ళైన కొత్తలోనే వుద్యోగం మానేసింది. ఉద్యోగం మానకుండా వుండి వుంటే బాగుండేదనిపించింది ఆ క్షణాన.
“ఇవాళ తొందరగా వచ్చారే ! ” అంది విస్మయంగా.
అతను నవ్వి వూరుకున్నాడు. రిపోర్టుల్లోని విషయాలు, డాక్టరు చేసిన హెచ్చరికలు ఆమెకి చెప్పాలనిపించలేదు. తనకి తను అందర్నించీ విడిగా అనిపించాడు. అలసటగా సోఫాలో కూలబడితే లోపలికి ఆమె వెళ్ళి చల్లటి మంచినీళ్ళు తెచ్చి ఇచ్చింది.
“ఉండండి. కాఫీ కలుపుకుని వస్తాను” అని మళ్ళీ వెళ్ళింది. వంటింట్లోంచి కమ్మటికాఫీ వాసన ముక్కుకి సోకుతుంటే “ఇవాళ ఇదెన్నో కాఫీ?” అని గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నించాడు. పదోసారో పదకొండోసారో సరిగా లెక్క కుదరలేదు. వదిలేసాడు.
రమ కాఫీ గ్లాసుతో వచ్చింది. అతనికిచ్చి పక్కనే కూర్చుంది.
“నీకో? ” అడిగాడు తాగబోతూ.
“నాకిన్నిసార్లు అలవాటులేదు. నిద్రపట్టదు”
చురుక్కుమనిపించింది. తనకి మాత్రం అలవాటా? చాలాకాలం పాలలో లైట్‍గా బ్రూ వేసి ఇచ్చేది తల్లి. ఆపైన కూడా కొంచెం స్ట్రాంగ్‍గా తాగడం జరిగిందిగానీ ఎక్కువసార్లు తాగడం లేదు. తనకి తెలియకుండానే ఒకటికి రెండు, రెండుకి నాలుగుసార్లు కాఫీకి అలవాటు పడ్డాడు. దాన్ని పెంచుకుంటూపోయాడు. అన్నిసార్లు తాగద్దని రమ నచ్చజెప్పినా ఆరోగ్యం పాడౌతుందని డాక్టర్లు హెచ్చరించినా అది కొద్దిసేపు ఇచ్చే ఫ్రెష్‍నెస్‍కోసం వదలలేకపోతున్నాడు. అలాగే సిగరెట్లు.
పెళ్ళి…. పిల్లలు… ఇంటా బయటా వత్తిడి. ఇది మంచిదనిగానీ చెయ్యమనిగానీ చెయ్యద్దని చెప్పడానికిగానీ తల్లీతండ్రీ లేరు. ఇంత విశాలమైన ప్రపంచంలో తనొక్కడు. తనని ఆశ్రయించుకుని భార్యాపిల్లలు. ఎందుకో ఈమధ్య వాళ్ళు మొయ్యలేనంత బరువనిపిస్తున్నారు. తనని ఇరికించి పట్టుకున్న బంధాల్లాకూడా అనిపిస్తున్నారు. అందుకే అనిపించడం, రమ వుద్యోగం మానకుండా వుండాల్సిందని.ఆఫీసులోఅన్నిటికీ డెడ్ లైన్లు. ఇంట్లో పిల్లల అవసరాలు, ఆఫీసులో ప్రాజెక్టులు. సుడిగుండంలో ఇరుక్కుపోయినట్టనిపించిది. కణతలు రుద్దుకున్నాడు. కొద్దిరోజులుగా అతను చేస్తున్న ఆలోచన ఒక రూపానికొచ్చింది. ఊపిరి పీల్చుకున్నాడు.
“ఏమిటి?” అడిగింది రమ.
“ఈ దసరాకి మన వూరు వెళ్తున్నాం. బతకమ్మ పెట్టడం అక్కడే. లీవు పెడతాను” అన్నాడు వున్నట్టుండి ఒక నిర్ణయానికి వచ్చినట్టై.
ఆమె తెల్లబోయింది. “మన వూరా? ఏముందక్కడ? ” అడిగింది.
“ఇల్లు, పొలం”
“ఇంట్లో దూరపు చుట్టాలెవరో వుంటున్నారుకదా? “
“ఇల్లు చూడటానికని వుంటున్నారు. రెండు గదులు వాడుకుంటున్నారు. మిగిలిన ఇల్లంతా అలాగే వుంది”
“కాదు మధూ! ఇప్పుడింత హఠాత్తుగా అక్కడికెందుకు? అదీ పండక్కి. అత్తయ్య, మామయ్య అక్కడ వున్నారు, ఎదురుచూస్తుంటారంటే వెళ్ళడం వేరు. పిల్లలేమంటారో! స్నేహితులు, సందడి ఇక్కడ వుండగా మరెక్కడికో వెళ్దామంటే ఏం గొడవచేస్తారో!” నచ్చజెప్పబోయింది.
ఆమె చెప్పడం పూర్తవనే లేదు, అతను అగ్నిపర్వతంలా బ్రద్దలయాడు.
“ఇన్నేళ్ళూ మీరు ఎక్కడికి తీసుకెళ్ళమంటే అక్కడికి తీసుకెళ్ళాను. ఎటు రమ్మంటే అటొచ్చాను, ఎలా కావాలంటే అలా వున్నాను. నా యిష్టాలూ అభిప్రాయాలూ పక్కనపెట్టి నువ్వెలా ఇల్లు నడిపితే అలాగల్లా సహకరించాను. ఒక్కసారి… ఒకే ఒక్కసారి మావూరు…. నేను పుట్టి పెరిగిన వూళ్ళో నాకెంతో ఇష్టమైన పండుగ జరుపుకుందామంటే నీకు ఇబ్బందిగా వుందా? రమా! ఎప్పుడూ నాకింత బలంగా అనిపించలేదు. అక్కడికి వెళ్దాం. వెళ్ళాలి. అంతే. రేపే ప్రయాణం” అన్నాడు గట్టిగా.
చెప్పడం పూర్తవగానే పడగ్గదిలోకి వెళ్ళి తలుపేసుకున్నాడు. అంత చిన్న విషయానికి అతనికంత కోపం ఎందుకొచ్చిందో రమకి అర్థమవలేదు. ఈమధ్య చాలా మూడీగా వుంటున్నాడు. ఆఫీసునించీ రావటమే విసుగ్గా అలసటగా వస్తున్నాడు. ఏం మాట్లాడబోయినా చిరాకుపడుతున్నాడు. పిల్లలతోకూడా గడపటంలేదు. రాగానే మళ్ళీ ఆఫీసువర్కంటూ కంప్యూటర్‍కి అతుక్కుపోతున్నాడు. ఒక్కర్తి ఎంతకని ఇంటాబయటా సమర్ధించగలదు? ఇంటి పని. పిల్లలకి స్కూల్లో వెనకటి చదువులు కాదు. వాళ్ళ వయసుకి మించిన ప్రాజెక్టులు ఇస్తున్నారు. వాటికోసం షాపులు తిరగటం, అవి పూర్తిచెయ్యటం అయేసరికి వాళ్ళ చదువుకాదుగానీ తన చదువుని తిరిగి దిద్దుకుంటున్నట్టౌతోంది. ఇవికాక ఇంట్లో అవసరాలకి బజారుపనులు… సంపాదించుకు రావటంతో తన బాధ్యత తీరిపోయినట్టు అతను ప్రవర్తిస్తుంటే కష్టంగా అనిపిస్తోంది. అతనితో ఈ విషయాలన్నీ మాట్లాడాలి. అతనూ దొరకట్లేదు, తనకి తీరికా చిక్కట్లేదు. ఇప్పుడీ ప్రయాణం.
“నాన్న మన వూరు వెళ్లామంటున్నారు. ఈసారి దసరా అక్కడ జరుపుకోవాలని తన కోరిక” పిల్లలు రాగానే చెప్పింది. ఇద్దరు పిల్లలు. కూతురు ధన్య, కొడుకు ఆర్య.
“అక్కడికా?” ఇద్దరూ ఒక్కసారే అన్నారు, అక్కడికేదో తమని అంటార్కిటికాలోనో అంగారకగ్రహమ్మీదో అంట్లు తోమటానికి తల్లితండ్రులు తీసుకెళ్తున్నట్టు.
“ఏం? మన వూరు, మనిల్లు. మీనాన్న పుట్టి, చిన్నతనమంతా గడిపిన వూరు. అక్కడికి వెళ్ళడంలో వింతేముంది?” ఇంతకుముందు పిల్లల పక్షాన భర్తకి చెప్పబోయింది. అతను వినలేదు. ఇప్పుడు అతని పక్షాన పిల్లలకి చెప్తోంది. ఇరుపక్షాలవారి మధ్యా సమన్వయం కుదర్చడానికి ప్రయత్నిస్తోంది.
“నోమ్మా! ఇవ్వక ఇవ్వక మాకేదో నాలుగు రోజులు సెలవులు వచ్చాయి. ఫ్రెండ్సుతో సరదాగా గడపకుండా ఆ వూరు వెళ్లామంటే నేనొప్పుకోను” కూతురు గట్టిగానే అంది.
“నేను కూడా” అక్కకి ఏమాత్రం తీసిపోకుండా చెప్పాడు కొడుకు.
దసరాకి స్నేహితుల్తో కలిసి గడపడానికి ఎన్నెన్ని ప్లాన్లు వేసుకున్నారు! బతకమ్మలు పేర్చడం, గాలిపటాలు ఎగరెయ్యడం, సైకిల్ రేసులు… అవేవీ జరగవంటే వాళ్ళు జీర్ణించుకోలేకుండా వున్నారు.
మధు అడిగిన ప్రశ్నలు చెప్పింది రమ. “నాన్న అడగడం కాదు. ఆయన బదులుగా నేను అడుగుతున్నాను. మీ చిన్నప్పట్నుంచీ ఈరోజుదాకా తనకిది కావాలనిగానీ, ఇచ్చినది వద్దనిగానీ అనడం చూసారా? అడగక అడగక తను పుట్టి పెరిగిన వూరు వెళ్దామని అడిగారు. ఆ ఒక్క కోరిక మనం తీర్చలేమా? తనంతట తను అడిగాకకూడా ఇంత తర్జనభర్జనపడటం అవసరమా?” పదునుగా అడిగింది రమ.
పిల్లలిద్దరు తగ్గారు. ” అక్కడికి వెళ్ళడం మాకిష్టం లేదని కాదమ్మా! పోనీ పండగ వెళ్ళాక వెళ్దాం” అన్నాడు కొడుకు.
“లేదు. ఈసారి పండుగ అక్కడే” కచ్చితంగా చెప్పింది. వాళ్ళిద్దరూ ముఖాలు ముడుచుకుని వాళ్ళ గదుల్లోకి వెళ్ళారు.
రమ ఒక్కర్తే మిగిలిపోయింది. పెళ్ళప్పటి మధు గుర్తొచ్చాడామెకి. ఎంతో సున్నితంగా సరదాగా నవ్వుతూ నవ్విస్తూ వుండేవాడు.
అతని తండ్రి… అంటే తన మామగారికి పొద్దున్న పదిన్నరకి వెళ్తే సాయంత్రం ఐదింటికల్లా ఆఫీసైపోయేది. కాసేపు అట్నుంచీ అటే బాడ్మింటన్ కోర్టుకి వెళ్ళి, అక్కడినుంచి గుడికి వెళ్ళి మిత్రసాంగత్యమో, పురాణకాలక్షేపమో చేసుకుని భోజనాలవేళకి ఇంటికి చేరేవారు. పైగా ఆయనది పల్లెటూళ్ళో వుద్యోగం కావడం, అది స్వంతవూరుకూడా కావడంతో చాలా సునాయాసంగా గడిచిపోయింది ఆయన జీవితం. అంత అందంగానూ మధు బాల్యం కూడా వుండేదట. తరం మారడంతోపాటు జీవనగమనంకూడా మారింది.
మధు బీటెక్ చదివాడు. ఆపైన మంచి బీస్కూల్‍లో ఎంబియ్యే చేసాడు. కేంపస్ సెలక్షన్స్‌లో ప్రైవేట్ కంపెనీలో వుద్యోగం వచ్చింది. కళ్ళు చెదిరే జీతం. చెల్లిస్తున్న జీతానికి దామాషాలోనే పని… వత్తిడి. మొదట్లో వున్న వుత్సాహం క్రమంగా తగ్గింది. సాయంత్రాలయేసరికి గూటికి గువ్వలా ఇంటికి వచ్చెయ్యాలని అతని ఆరాటం. కానీ, ఈ దేశపుయువత బ్రతుకుల్లోంచీ సాయంత్రాలు ఎప్పుడో కనుమరుగైపోయాయనేది అతను గుర్తించని విషయం. దానికితోడు చేసేది మార్కెటింగ్‍లో కాబట్టి వుద్యోగంలో టార్గెట్స్, డెడ్‍లైన్లు… ఆపైన…
ఆపైన అతని తల్లిదండ్రులు ఇద్దరూ ఒకేసారి యాక్సిడెంట్లో పోయారు. అది అతన్లో స్పష్టమైన మార్పుని తెచ్చింది.
ఇప్పుడిలా వాళ్ళ వూరెళ్దామని పట్టుపట్టడం ఎందుకో అర్థమవడం లేదు రమకి. పొద్దున్న లేచాక మరోసారి మాట్లాడదామనుకుందిగానీ అతనప్పటికే ప్రయాణం ఏర్పాట్లలో వుండటంతో చేసేదేంలేక తనూ ఆ పనిలో పడింది.
ధన్యకోసం బతకమ్మలకి పట్టులంగా, పండుక్కి కట్టుకుంటుందని కొన్న డిజైనర్ లంగా పెడుతుంటే, “ఆ పల్లెటూళ్ళో తిరగడానికి ఇంత మంచివి దేనికి?” అని తీసి పక్కని పెట్టేసింది. ఆర్య తన కొత్త ఫాంటు పెట్టనివ్వలేదు. అలాగే అన్నీ రమ పెట్టడం,వాళ్ళు తీసెయ్యడం. విసుగొచ్చేసింది ఆమెకి. మీరే సర్దుకోండని అక్కడినుంచి వెళ్ళిపోయింది.
“రెడీయా?” అని మధు సీరియస్‍గా అడిగేదాకా ఈ ప్రహసనం కొనసాగింది.
అతనింక అడిగాక ఒకొక్కరూ తయారై వచ్చారు. తీసేసిన బట్టలే మళ్ళీ బేగుల్లో పెట్టుకున్నారు.
కార్లో బయల్దేరారు. వెళ్తూ కూడా పెద్దగా ఏమీ మాట్లాడుకోలేదు. అవసరానికి మించి ఒక్క ముక్క కూడా ఎవరి నోట్లోంచీ రాలేదు. మధు ముభావం అందర్నీ అలా శాశించింది. దార్లో హోటల్లో భోజనం చేసారు. సాయంత్రమైంది వూరు చేరేసరికి. ఇంకో పదినిముషాలు పట్టింది పొలిమేరలనుంచీ ఇల్లు చేరడానికి. రోడ్డుకి అటూఇటూ విస్తరించుకుని పెరిగిన చెట్ల మధ్య నుంచి కారు వెళ్తుంటే ధన్య, ఆర్యలు అలక మర్చిపోయి కళ్ళు విప్పార్చుకుని చూసారు. హాలీవుడ్ సినిమాల్లో సీనరీల్లా అనిపించాయి. ఎప్పుడో చిన్నప్పుడు వచ్చేవాళ్ళిక్కడికి. ఆఖరిసారి వచ్చింది తాతయ్య, బామ్మలు పోయినప్పుడు. ఐదేళ్ళైంది అది జరిగి. ఇద్దరికీ పెద్దగా గుర్తు లేదు.
పెద్దపెద్ద గేట్లున్న ఇంటిముందు కారు ఆగింది. అందరూ దిగారు. విశాలమైన ఆవరణ. గేటు దగ్గర్నుంచీ కారు లోపలికి వెళ్ళడానికి పట్టేంత వెడల్పైన బాట వుంది. బాటకి అటూ ఇటూ మళ్ళలో రంగురంగుల బంతి, చామంతి, కనకాంబరాలూ, నీలిగోరింటా విరగబూసి వున్నాయి. సాయంత్రం కావడంతో పసుపూ, వూదాచంద్రకాంతలు మొక్కలనిండా విచ్చుకుని వున్నాయి. ప్రహరీగోడకి ఆనుకుని నందివర్ధనం, గన్నేరు చెట్లున్నాయి. చెట్లనిండా రంగురంగుల పువ్వులు. అందులో ఒక గన్నేరుచెట్టు తను పెట్టిందేనని గుర్తొచ్చింది రమకి. పెళ్ళైన కొత్తలో పూలమొక్కల్ని కుతూహలంగా చూస్తుంటే మధు చెప్పాడు-
“ఈ గన్నేరుచెట్టుంది చూసావా, కొమ్మ పాతితే చాలు ఏనుకుంటుంది” అని.
ఆమెకి నమ్మకం కలగలేదు. ఈ సంభాషణ విన్న అతని తండ్రి ఒక ఎర్రగన్నేరుకొమ్మ విరిచి, బెరడు చెక్కేసి పాతమని ఇచ్చాడు. రమ అపనమ్మకంగానే అట్లకాడతో చిన్నగొయ్యి తవ్వి పాతి, నీళ్ళు పోసింది. రెండోరోజుకి అది కొంచెం వడిలినట్టై, నమ్మకం ఇంకొంచెం సడలింది. వారంపాటు అటు చూడనే లేదు. అన్ని మొక్కల్తోపాటు దానికికూడా నీళ్ళుపెట్టేవారు ఎవరో ఒకరు.
“అమ్మాయ్ అమ్మాయ్!” వారం తర్వాత మామగారు పిలుస్తుంటే ఏమిటోనని వెళ్ళింది. ఆయన చూపిస్తే చూసింది. ఆమె పాతిన గన్నేరు కొమ్మ చిగురువేసింది. ఆయన సంతోషం చూసి వింతగా అనిపించింది. ఇంత చిన్న విషయానికి అంత సంతోషమా అనికాదుగానీ, చిన్న చిన్న విషయాలకే ఇంతగా సంతోషపడిపోయే మనస్సుని పెద్దపెద్ద ప్రలోభాలవైపుకి ఎందుకు తోస్తున్నామన్న సందేహం.
నిండా గుత్తులుగుత్తులుగా పూలతో వున్న చెట్టుని చూపించి పిల్లలకి చెప్పింది,”ఆ చెట్టు నేను పెట్టినదే, తెలుసా?” వాళ్ళు తలూపారు.
ఇంట్లో వుంటున్నవాళ్ళు భార్యాభర్తలిద్దరూ ఇవతలికి వచ్చారు. ఆమె పేరు వనజ. మధుకి అత్తవరుస. భర్త రాములు. వాళ్ళకి పిల్లలు లేరు. ఏవో చిన్నచిన్న పనులు చేసుకుంటూ గడుపుతున్నవాళ్ళు, మధు తల్లిదండ్రులు పోయినప్పుడు ఇల్లు చూసుకుంటామని వాళ్ళంతట వాళ్ళు ముందుకి వచ్చారు. అప్పటికి పొలం వేరేవాళ్ళ కౌలులో వుండేది. అదికూడా నెమ్మదిమీద వీళ్ళే తీసుకున్నారు.
ఇంటిముందంతా పూలమొక్కలు, పెరటినిండా కూరలమొక్కలు, పాదులు. ఇల్లంతా పరిశుభ్రంగా వుంది. వాళ్ళని వాడుకొమ్మని ఇచ్చిన రెండుగదులు తప్ప ఇంచికూడా అతిక్రమించలేదు. అంత నమ్మకస్థులు. పండుగనో తాము వస్తున్నామనో కడిగి ముగ్గులుకూడా పెట్టింది వనజ. పిల్లలుమాత్రం ఇక్కడ వుండాలా అన్నట్టు చూసారు. వాళ్ళుండే అపార్టుమెంటుకల్చర్‍కి ఇది పూర్తిగా భిన్నంగా వుంది.
కుశలప్రశ్నలయ్యాయి. తరువాత టీలు, స్నానాలు, కాస్తాగి భోజనాలు అన్నీ వరుసక్రమంలో ముగిసాయి. ఎదురమావస్య అని త్రయోదశిరోజు
బయల్దేరారు. మర్నాడు చతుర్దశి. మధు పదోతరగతిదాకానే ఆ వూళ్ళో వున్నది. తర్వాత చదువుల కోసం సిటీకి వచ్చేసాడు. అతనితో చదువుకున్న పిల్లలంతా కూడా చదువులై వుద్యోగాలు వచ్చి, పెళ్ళిళ్ళై ఎక్కడెక్కడో స్థిరపడ్డారు. అత్తవారింట్లో రమ వున్నదికూడా చాలా తక్కువ. ఎప్పుడో పండుగలకి రావటమే. అందుచేత ఇద్దరికీ పెద్దగా పరిచయస్తులు లేరు.
“ఇంటికి చుట్టాలొచ్చినట్టున్నారు?” అని ఒకరో ఇద్దరో వనజావాళ్ళనే అడుగుతున్నారు.
“బయటివాళ్ళెవరూ కాదు, రాజారావు బావ కొడుకూ, కోడలూ, పిల్లలూను” అని వీళ్ళు కొంచెం మొహమాటపడుతూ చెప్తున్నారు.
పక్కరోజు అమావస్య. వనజతో వెళ్ళి గునుగుపూలు, తంగేడుపూలు కోసుకొచ్చింది ధన్య. ఇంట్లో పూసిన పూలన్నీ తెంపింది. చాలా పెద్ద బతకమ్మలను పేర్చారు ముగ్గురూ కలిసి. ఆర్యకి క్రికెట్ ఫ్రెండ్సు దొరికారు. తాటిమట్టలతో ఆడేసుకుంటున్నారు. దసరాకి తమ వూళ్ళో వుండటంలేదన్న విషయాన్ని మర్చిపోయారు. పిల్లలు కొత్త విషయాలకి తొందరగా ఆకర్షితులౌతారు.
సాయంత్రం అందరితోపాటు చెరువుగట్టుకి వెళ్ళి బతకమ్మలు ఆడి, చెరువులో కలిపి వచ్చారు. ధన్య తల్లి ఫోన్లో అవన్నీ ఫొటోలు తీసింది. ఫ్రెండ్స్ కోసం వాట్సప్‍లో పెట్టింది.
రోజంతా బాగా తిరిగీ, ఆడీ పిల్లలిద్దరూ బాగా అలిసిపోయారు. వనజని అడిగి భోజనం పెట్టించుకుని తిని తొందరగా నిద్రపోయారు. ఈ హడావిడిలో చాలాసేపట్నుంచీ మధు ఎక్కడా కనిపించలేదు రమకి. అతన్ని వెతుక్కుంటూ వెళ్ళింది. లోపలిగదుల్లో ఎక్కడా లేడు. ఇంటిముందు చూసింది. కనిపించలేదు. ఎవరింటికేనా వెళ్ళాడా అని సందేహపడుతునే పెరటివైపుకి వెళ్ళింది. అతన్నక్కడ చూసి ఆశ్చర్యపడింది.
“ఇక్కడేం చేస్తున్నావు?” అడగబోయిన మాట నోట్లోనే వుండిపోయింది. అతని కాళ్ళదగ్గిర పెద్ద చేంతాడుంది. పైకి విసరడానికి అనువుగా రెండు చేతుల్తోనూ ఒక కొస పట్టుకుని పై దూలంకేసి చూస్తున్నాడు.
“ఏం చేస్తున్నావు? నువ్వు చేస్తున్న పనేమిటి?” గట్టిగా అడుగుతూ వెనకనుంచే అతని చెయ్యి పట్టుకుని లాక్కొచ్చి ఇంటిముందు అరుగులమీద కూలేసింది. మధు ఆమెని ఎదుర్కోలేనట్టు తలదించుకున్నాడు. మామూలుగా అవడానికి రెండుమూడునిముషాలు పట్టింది రమకి. ఆమె కేకలకి లోపల్నుంచీ వనజా, రాములూ వచ్చారు. అక్కడి దృశ్యం చూడగానే అర్థమైంది వనజకి.
“ఏమైందమ్మా?” అని రాములు అడగబోతుంటే-
“లోపలికి రండి. ఇక్కడెందుకు?” అని రమ చెయ్యిపట్టుకుని తీసుకెళ్ళింది వనజ. మరబొమ్మలా అనుసరించాడు మధు. వెనకే రాములు.
“ఎంతపని చేసావయ్యా? ఏం కష్టం వచ్చింది నీకు? చక్కటి వుద్యోగం, భార్యాపిల్లలు, ఆస్తిపాస్తులు… బోల్డంత వయసు ముందుంది…” అడిగింది వనజ మృదువుగా. మధు జవాబివ్వలేదు. మనసులో వున్న ఆలోచన బహిర్గతమయాక అతనికి చాలా తేలిగ్గా వుంది. చచ్చిపోవాలనే తన నిర్ణయం అందరికీ తెలిసిపోయింది. తన ఇంట్లో… తన చిన్నతనం గడిచినచోట…ఏ బాధ్యతలూ తెలీకుండా పెరిగినచోట… ప్రాణాలు వదిలెయ్యాలనుకున్నాడు. అది తీరలేదు. ఈ ప్రయత్నం కాకపోతే ఇంకొకటి. చావాలంటే ఎన్ని మార్గాలు లేవు?
“ఏమైంది మధూ? అసలిదంతా ఏమిటి? ఎందుకిలా చెయ్యబోయావు? ఇందుకేనా, ఇక్కడికి రావాలని పట్టుబట్టావు?”” తనని తను సంభాళించుకుని అడిగింది. అతను జవాబివ్వలేదు. కళ్ళెత్తి ఆమెనొకమాటు చూసి మళ్ళీ దించుకున్నాడు.
“నాకు చాలా భయంగా వుంది. ఏం జరిగిందో చెప్పు మధూ?” రమ గొంతులో దు:ఖపు జీర. కళ్ళలో పల్చటి నీటి పొర. అతను కొద్దిగా చలించాడు.
“అలసిపోయాను… చాలా. అమ్మానాన్నలు పోయిన బాధ నన్ను నిద్రలో కూడా స్థిమితంగా వుండనివ్వటం లేదు. దాంట్లోంచీ నేనింకా బయటపడలేకపోతున్నాను” అన్నాడు.
“ఎంతకాలం బాధపడినా వాళ్ళు తిరిగి రారుకదా ? మళ్ళీ మనింట్లోనే పుడతారేమో… ఆర్యకీ ధన్యకీ పెళ్ళిళ్ళయాక పిల్లలుగా. అలా అనుకుంటే ఆశగా లేదూ? ఆ పిల్లలు వాళ్ళే అనుకుంటే అదింకెంత సంతోషం? మనని మనం ఇలాగే ఓదార్చుకోవాలి మధూ! ఎంతకాలం బాధపడతాం? బాధలో వున్నామని మనకోసం ప్రపంచం ఆగుతుందా? మనని వున్నచోటే వదిలేసి వెళ్ళిపోతుంది” నచ్చజెప్పే ప్రయత్నం చేసింది. హఠాత్తుగా జరిగిన ఆ సంఘటనని అతను ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నాడు. జ్ఞాపకాలు ఎన్నున్నా అవి వోదార్పునివ్వవు. ఇంకా ఇంకా దు:ఖాన్ని పెంచుతున్నాయి. అతని కంప్యూటర్లోనూ, సెల్‍లోనూ నిండా వాళ్ళ ఫొటోలే. వాళ్ళతో తను గడిపిన జ్ఞాపకాల గుర్తులే. మర్చిపోవటానికి ప్రయత్నం చెయ్యట్లేదతను. మరీమరీ గుర్తు తెచ్చుకుని దు:ఖాన్ని పోగేసుకుంటున్నాడు.
“మా కంపెనీ విస్తరించుకునే ప్రయత్నంలో వుంది. కొత్తకొత్త టార్గెట్స్… డెడ్‍లైన్లు… అందుకోలేకపోతున్నాను. క్లయంట్ మీటింగ్స్… వాళ్ళని వొప్పించి ప్రాజెక్ట్స్ తేవటం… ఈ వత్తిడి తట్టుకోలేకపోతున్నాను. యాన్యువల్ వర్క్ అసెస్‍మెంట్ కూడా సరిగ్గా లేదు. ఎప్పుడేనా ఫైర్ చేసేస్తారు. బీటెక్‍లో గోల్డ్‌మెడలిస్టుని. ఎంబియ్యేలో టాప్ స్కోరర్‍ని. నా రెజ్యుమె పట్టుకుని మళ్ళీ వుద్యోగాలకోసం తిరగాలి… నా వల్ల కాదు. నౌ అయామె ఫెయిల్యూర్ యూనో… ” అన్నాడు. నిస్సహాయంగా కంప్లెయింట్ చేస్తున్నాడు.
చిన్నగా నిట్టూర్చింది రమ. ప్రభుత్వోద్యోగం చేస్తున్న తన తండ్రికూడా ఇలాగే అంటున్నాడు. రెండేళ్ళ సర్వీసు వదిలేసి వాలంటరీ రిటైర్‍మెంట్ తీసుకుంటాడట. డెస్క్‌వర్క్ చెయ్యటానికి రిక్రూటై, బేసిక్ క్లాసిఫికేషన్స్ మీద వుద్యోగాల్లో చేరినవారి పనియొక్క మౌలికతని మార్చేసి వాళ్ళు చెయ్యలేకపోతే అసమర్ధులుగా ముద్ర వేస్తున్నారు. రోజంతా ఆఫీసులోనే పాతుకుపోయి చేసినా పూర్తవని పని. ఒకప్పుడు సాయంత్రమయేసరికి పువ్వులో స్వీట్సో తీసుకుని సరదాగా ఇంటికొచ్చే తన తండ్రి విసుగ్గా అలసటగా ఇంటికొస్తున్నాడు. తమ్ముడు బెంగుళూర్లో, మరదలు చెన్నైలో. వారాంతపు కాపురం.
“వత్తిడి ఎందుకు మధూ? పదిహేనేళ్ళుగా చేస్తున్నపనేకదా?”
అతను మాట్లాడలేదు. మాట్లాడే స్థితిలో లేడు. రెండుచేతుల్తో తల పట్టుకుని కూర్చున్నాడు.
“నాకొక్క రెండురోజులు సమయం ఇవ్వు. మనం ఏం చెయ్యచ్చో ఆలోచిద్దాం. నీకు నచ్చకపోతే కంపెనీ ఫైర్ చేసేదాకా ఎందుకు, నువ్వే రిజైన్ చేద్దువుగాని. ప్లీజ్… ఒక్క రెండురోజులదాకా ఈ విషయం ఆలోచించకు. ఏదో ఒకటి ఆలోచిస్తాను. ఒకవేళ ఏ దారీ దొరకనప్పుడు అందరం కలిసే చచ్చిపోదాం’” అంది రమ. ఏడుపు ఆపుకోలేకపోతోంది. ఈ పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలో తెలీడం లేదు.
“అందరూనా?” అతను తెల్లబోయాడు.
“నువ్వులేకుండా మేం మాత్రం బతికి ఎందుకు?”
వనజ చప్పుని కలగజేసుకుంది, ’”నిండింట్లో ఈ చావు కబుర్లేమిటమ్మాయ్?” అని రమని కోప్పడి, “మధూ! రెండురోజులు వ్యవధి అడిగిందికదా! అప్పటిదాకా ఏం మాట్లాడకు. వెళ్ళి పడుకో” అంది పెద్దరికం తీసుకుని.
“కాస్త ఏదైనా తినండి” అంది తనే మళ్ళీ.
నలుగురూ తిన్నామనిపించి లేచారు. మధు నిద్రకి వుపక్రమించాడు. అంటే నిద్ర వస్తోందని కాదు. వాళ్ళనుంచి తప్పించుకోవాలని.
“అతన్ని కనిపెట్టుకుని వుండాలి రమా! ” అంది వనజ అతనికి వినిపించకుండా.
రమ తండ్రికి ఫోన్ చేసింది. వాళ్ళు కొడుకు దగ్గర బెంగుళూర్లో వున్నారు. జరిగినది క్లుప్తంగా చెప్పి, “మీరు అమ్మని తీసుకుని వెంటనే రాగలరా నాన్నా?” అని అడిగింది. “ఫ్లైట్ టికెట్స్ బుక్ చెయ్యనా? “
వాళ్ళు వస్తామనగానే వెంటనే టికెట్స్ బుక్ చేసింది. పండగరోజులు, వెంటనే కావటంతో చాలా ఖరీదు పడ్డాయి. తర్వాత మధు లాప్‍టాప్ తెచ్చుకుని కూర్చుంది. తెరవబోతుంటే రాములు వచ్చి ఎదురుగా కూర్చున్నాడు.
“చెప్పండి బాబాయ్!” అంది కంప్యూటర్ పక్కని పెట్టి.
“రేపు మీ నాన్నగారు వచ్చాక ఏం నిర్ణయిస్తారోగానీ రమా, నీకు చెప్పినంత స్వతంత్రంగా వారికి చెప్పలేను” అన్నాడు సంకోచంగా.
“అయ్యో! చెప్పండి”
“ఏ ఆధారం లేనివారికి మరొకరికింద వుద్యోగాలుగానీ అతను చెయ్యలేనప్పుడు ఆ వుద్యోగం ఎందుకమ్మా? ఈరోజుని ఎంత గండం తప్పింది? మళ్ళీ అక్కడికి తిరిగి వెళ్ళి నీ వ్యాపకాల్లో నువ్వు పడిపోతే అతన్ని కాయగలవా?”
రమ భయం కూడా అదే. కానీ నెలకి లక్షరూపాయల జీతం వచ్చే వుద్యోగానికి ప్రత్యామ్నాయం ఏది?
“ఈ వూరు వచ్చెయ్యండి. ఇక్కడ మీ మామగారి పరిచయస్థులు చాలామంది వున్నారు. మధు మనుషుల్లో పడతాడు. వ్యవసాయం చూసుకోవచ్చు. నేను తోడుంటాను” అన్నాడు.
“వ్యవసాయమా? అందరూ వదిలేసి పోతుంటే మమ్మల్ని ఇందులోకి రమ్మంటారా?”
“విత్తనం దగ్గర్నుంచీ అప్పుల్తో మొదలుపెట్టి మునుగుతున్నారు రమా! అప్పులమీది వడ్డీలుకూడా పెట్టుబడికి కలిసిపోయి, లాభాలు రావట్లేదు. పండించిన పంట కళ్ళారా చూడకుండానే కళ్ళాలమీదే అమ్ముకునే పరిస్థితి. అటు పెద్దల దగ్గర్నుంచీ నేర్చుకున్న పద్ధతులూ మట్టిగొట్టుకుపోయి, ఇటు చదువుకున్నవాళ్ళ పద్ధతులూ పాటించలేక త్రిశంకుస్వర్గంలా వుంది రైతు పరిస్థితి. నేల వున్నంతమాత్రాన రైతూ కాడు, చేతిలో పుస్తకం వున్నంతమాత్రాన పండితుడూ కాలేడు”
“మాకుమాత్రం ఏం తెలుసని?” అడిగింది రమ. అతని మనసులో వున్నదేమిటి? ఒకవైపు నష్టం వస్తోందంటూనే తమని ఇందులోకి ఎందుకు రమ్మంటున్నాడు? ఈ గొడవల్లో పొలం అమ్మేస్తే కుదురుకున్న వాళ్ళ జీవితాలు అస్తవ్యస్తమౌతాయనా? కష్టం యొక్క నీడ చాలా పెద్దది. అంత మంచీ అందులో లుప్తమైపోతుంది. రమ అతనికేసి నిశితంగా చూసింది.
“వ్యవసాయమంటే చారెడంత భూమీ, అందులో పండే పంటా మాత్రమేనా? ఆవుల్నీ గేదెల్నీ పెంచాలి. కోళ్ళనీ పెంచుకోవాలి. ఈమధ్య ఎవరిదగ్గరో విన్నాను, వరిమళ్ళమధ్య నీరు నిలవచేసి చేపలు పెంచుతున్నారని. పాడికి పాడి, ఎరువుకి ఎరువు… ఒకదానికి ఇంకొకటి అన్నీ కలిసొస్తాయి. మీరిద్దరూ చదువుకున్నవాళ్ళు. మీలాంటివాళ్ళు కొత్త విషయాలని అర్థం చేసుకోగలరు. నాలుగుచోట్లకి వెళ్ళి నలుగుర్ని కలుపుకుని ముందుకి వెళ్ళగలరని చెప్తున్నాను”
“మీ ఉప్పు తిని బతుకుతున్నాము. మీ మంచి కోరి చెప్తున్నాను. మీ నాన్నగారు వచ్చాక ఈ పొలం, ఇల్లూ అమ్మెయ్యమంటారేమో! బావగారు పోయినప్పుడు అన్నారు. తొందరపడి ఆ పని చెయ్యకండి. ఒక ఆధారాన్ని కోల్పోతారు. మాదేముంది? ఇక్కడ కాకపోతే ఇంకొకచోట … ఇద్దరు మనుషులకి ఎంతకావాలి? పిల్లాజెల్లా లేరు, పోగు చేసి ఇవ్వాలనుకోవడానికి” అని చేతులు జోడించి నమస్కరించి వెళ్ళిపోయాడు. అతన్ని అనవసరంగా అనుమానించాననుకుంది రమ.
పైకలా అన్నాడేగానీ అతనికి దిగులుగానే వుంది. భార్యాభర్తలిద్దరూ ఎన్నో కష్టాలు పడి వున్నారు. మధు ఇంట్లో ఒక ఆశ్రయం దొరికింది. రోజులు సాఫీగా సాగిపోతున్నాయనుకుంటే ఇప్పుడీ సమస్య. మధు మనసులో అదుపు తప్పిన భావోద్వాగాలు అతనికి జీవన్మరణమస్యగా మారటంతోపాటు అతని చుట్టూ వున్నవాళ్ళ జీవితాలనికూడా కుదుపుతున్నాయి. కూకటివేళ్ళతో పెళ్ళగించేసే ప్రయత్నం చేస్తున్నాయి. మనిషి తనొక్కడినే అనుకుంటాడు. కానీ అతనొక వ్యవస్థ.
మధు వుద్యోగం వుంటుందో, వుండదో? పనితీరు ఎంత బాగున్నా కార్పొరేట్ సెక్టర్లో అంతర్గత రాజకీయాలు చాలా వుంటాయి. ఇతను తప్పుకుంటే మరొకరికి జరిగే లాభమేదైనా వుందంటే పావులన్నీ కదలటం మొదలౌతుంది. పెర్ఫా‌ర్మెన్స్ కూడా బాగాలేదంటున్నాడు. సీనియర్ కాబట్టి కంపెనీ తీసెయ్యకపోవచ్చు. ఇతనంతట ఇతనే వదిలిపెట్టి వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది. ఇంకో వుద్యోగం వెతుక్కోనంటున్నాడు. బలవంతపెట్టే పరిస్థితికూడా లేదు. ఎలాగా అతనికి బ్రేక్ కావల్సినప్పుడు ఇక్కడికి వచ్చి వుండటంలో తప్పులేదు. కానీ పిల్లల చదువు? ఆమె ఆలోచనలు అక్కడ ఆగిపోయాయి.
మధు నిద్రలోకి జారుకున్నాడని అర్థమైనా పడుకునే సాహసం చెయ్యలేకపోయింది. లాప్‍టాప్ తెరిచి అందులో నిమగ్నమైంది. అతని డైరీ మెయిల్స్… ఒకొక్కటీ అతని మనసుకి కాదు, అది వున్న స్థితికి అద్దం పడుతున్నాయి. తెలతెలవారుతుంటే ఇంట్లో అలికిడి మొదలైంది. అప్పుడు నెమ్మదిగా కూర్చున్న సోఫాలోనే నిద్రకి వొరిగింది.
“మీ నాన్నగారి స్నేహితులంట మధూ! ఇద్దరు ముగ్గురు కలిసారు. నువ్వొచ్చావని తెలిసి తీసుకు రమ్మన్నారు” అన్నాడు రాములు. మధు పెద్దగా ఆసక్తి చూపించలేదు. అతనే బలవంతం చేసి తీసుకుపోయాడు. వెళ్ళాక రాజారావు కొడుకట అని ఇంట్లోవాళ్ళకి చెప్తుంటే ఆ గుర్తింపు మనసు లోపల ఎక్కడో సుతారంగా తాకింది. పిల్లల స్కూలికి వెళ్ళినప్పుడు ధన్యా-ఆర్యా-వాళ్ళ-నాన్న అని గుర్తించినప్పుడు ఎలాంటి భావం కలిగిందో అలాంటిది కదిలింది. అతన్లో గడ్డకట్టుకుపోయిన భావాలకి కొద్దిపాటి వెచ్చటి సెగ తగిలింది. నలుగురైదుగురి ఇళ్లకి వెళ్ళి తిరిగివచ్చారు.
మహర్నవమి కాబట్టి ఇంట్లో వంటలు తప్ప పెద్దగా సందడి లేదు.
సాయంత్రానికి రమ తల్లిదండ్రులు వచ్చారు. “నువ్వు రమ్మన్నావా?” అన్నట్టు కోపంగా చూసాడు మధు రమని. మామా అల్లుళ్ళమధ్య సాధారణ పలకరింపులయ్యాయి. వాళ్ళింకా అతని మనసులో తల్లిదండ్రుల స్థానాల్లోకి రాలేదు. పిల్లలు ఆటల్లోంచీ తిరిగొచ్చారు. అమ్మమ్మా తాతయ్యలని అల్లుకుపోయారు. స్నానాలు, భోజనాలు అయాక విశ్రాంతిగా కూర్చున్నప్పుడు నెమ్మదిగా విషయాన్ని లేవనెత్తాడు రమ తండ్రి.
“మనసులో బాధేమిటో పైకి చెప్పుకోకపోతే ఎలా తెలుస్తుంది మధూ? నిన్న జరిగినదానికి అమ్మాయి తల్లడిల్లిపోతోంది. ఫోన్ చేసి చెప్పేసరికి మాకూ కంగారుగానే వుంది. ప్రాణం తీసుకోవాలనిపించేంత పెద్ద సమస్య ఏమిటి? అమ్మానాన్నలు పోయి ఐదేళ్ళైంది. బాధ బాధే. కాదనను. ఎంతకాలం బాధపడినా వాళ్ళైతే తిరిగి రారు. వాస్తవాన్ని గుర్తించాలి మీరు… ఇంక వుద్యోగంలో సమస్యలు… గవర్నమెంటు వుద్యోగం కాదు, ఈ కంపెనీ కాకపోతే ఇంకొకటి…” అని ఇంకా చెప్పబోతుంటే –
“రమా!” కోపంగా పిలిచాడు మధు.
ఆమె రాగానే, “నా సమస్యలు మీకేం తెలుసని అందరూ ఇలా సలహాలు ఇస్తున్నారు? చనిపోయింది నా తల్లిదండ్రులు. ఆ బాధ నాది. ఉద్యోగం నాది. అందులో బాధలు నావి. ఈ బతుకు నాది, బతకాలో చావాలో నిర్ణయించుకునే హక్కు కూడా నాదే” గట్టిగా అరిచాడు.
రమ తండ్రి చిన్నబుచ్చుకున్నాడు. రమకి కూడా కళ్ళమ్మట నీళ్ళు తిరిగాయి. తండ్రిని వెంటబెట్టుకుని అక్కడినుంచీ ఇవతలికి వచ్చింది.
“అసలు ఇక్కడికి ఎందుకొచ్చారమ్మా? ఈ పల్లెటూళ్ళో ఏం చేద్దామని? అసలే మనసు చెదిరి వున్నాడు. తలుచుకుని ఇంకాస్త బాధపడటానికి కాకపోతే? అప్పుడే అమ్మేసెయ్యమన్నాను. వినలేదు ఇద్దరూను. ఇప్పుడు ఉద్యోగం మానేసి ఏం చేస్తాడు? ఈ పల్లెటూళ్ళో గడ్డి పీక్కుంటూ కూర్చుంటాడా? ఇలా చస్తాను చస్తానని బెదిరించేవాళ్ళని చూసి మనం బెదరకూడదు. చచ్చి చూపించమనాలి” అన్నాడు కోపంగా.
ముప్పయ్యెనిమిదేళ్ళ సర్వీసు చేసి, బాధ్యతలన్నీ తీరి వుండి, ఇంక చెయ్యలేని పరిస్థితి వున్నప్పటికీ కూడా వాలంటరీ రిటైర్మెంటు తీసుకోవటానికి ధైర్యం చాలటం లేదు. అలాంటిది, ఇద్దరు చిన్నపిల్లల్ని పెట్టుకుని అంత బాధ్యత తెలీకుండా ఎలా వున్నాడు, అల్లుడు? పోయినవాళ్ళని తలుచుకుని ఏడటానికి అతనేం చిన్నపిల్లవాడు కాదు. ఇద్దరు పిల్లల్తో కూతుర్ని ఏ గంగలో ముంచబోతున్నాడు? కోపం ముంచుకొస్తోంది.
“నాన్నా! ప్లీజ్, వూరుకోండి” అంది రమ.
ముగ్గురూ పెరట్లోకి వెళ్ళి కూర్చున్నారు.
“ఏం చేద్దామని రమా?” అడిగాడు అయన. “ఎవరిచేతేనా చెప్పిస్తే? ఏదైనా వైద్యం చేయిస్తే?”
“అవేవీ వెంటనే జరగవు నాన్నా!” రమ జవాబిచ్చింది. “ముందు అతనికి బ్రేక్ కావాలి. కొన్నాళ్ళు ఇక్కడ వచ్చి వుందామనుకుంటున్నాం”
ఆత్మహత్య చేసుకోవాలనుకునే మనుషులు అందరిళ్ళలో వుండరు. అలాంటివాళ్ళతో ఎలా ప్రవర్తించాలో చాలమందికి తెలియదు. అలాంటి ప్రయత్నం ఇంట్లో ఎవరేనా చేస్తే కూడా అదొక తాత్కాలికమైన సంఘటనలా అనిపిస్తుంది. ఆ గండం తప్పిపోయిందనుకుంటారు. అంతకన్నా లోతుగా ఆలోచించరు.
మనిషికి బతకాలనే కోరిక ఎంత బలమైనదో, చనిపోవాలనేది కూడా అంతే బలమైనది. మొదటిది వ్యక్తమౌతూ వుంటుంది. రెండోది అవ్యక్తంగా వుంటుంది…. నివురు వెనక దాక్కున్న నిప్పులా. ప్రతికూల పరిస్థితులు దాన్ని బహిర్గతం చేస్తాయి … అప్పుడప్పుడు. ఆ పరిస్థితులు మారగానే మళ్ళీ అది కప్పడిపోతుంది. మారనప్పుడు మాత్రం అది కొద్దికొద్దిగా అతన్ని కాల్చుతూ వుంటుంది.
“ఇక్కడా? అసలు ఇంతదాకా ఎందుకు వచ్చింది పరిస్థితి? ఇద్దరూ ఏవేనా గొడవపడ్డారా?” అడిగింది రమ తల్లి. చాలా మామూలు ప్రశ్న.
“అలాంటిదేం లేదమ్మా! ఒక్కసారి వాళ్ళు పోయేసరికి స్తబ్దుగా మారిపోయాడు. అంత పెద్ద సంఘటన తర్వాత వెనుకట్లా ఐతే వుండడుకదా? అలానే అనుకుని సర్దుకుపోయాను. ఆ స్తబ్దత క్రమంగా పెరుగుతూ వచ్చింది… గుర్తించలేనంత సూక్ష్మంగా. ఇన్నేళ్ళు పోగుచేసుకున్న దు:ఖం, దానిలోంచీ బయటపడలేని నిస్సహాయత”
“అక్కడి ఫ్లాట్? పిల్లల చదువు? ఇక్కడేం చేస్తారే? పొలం అమ్మేస్తే కోటేనా రాదూ? బేంకులో వేసుకుంటే వడ్డీ వస్తుంది. కొన్నాళ్ళాగి అతను మరో కంపెనీ చూసుకుంటే సరి. కాదంటే నువ్వు చూసుకోవచ్చు”
“పొలం అమ్మెయ్యటమనే ఆప్షన్ ఎప్పుడూ వుంటుంది. ఇప్పుడే ఎందుకు? మధుకి తల్లిదండ్రులతో వున్న ఆఖరి అనుబంధం ఇది. కొన్నాళ్ళు ఇక్కడుంటే మధు మనసు మారుతుందేమో. వాళ్ళు అర్ధాంతరంగా వదిలిపెట్టి వెళ్ళిన జీవితాన్ని తను కొనసాగిస్తున్నాడని అనుకోగలిగితే చాలు. అతన్లో మార్పు వస్తుంది. రాములుబాబాయ్‍ నమ్మకంగానే చూసుకుంటున్నాడు ” జవాబిచ్చింది రమ.
జాబ్‍కి రిజైన్ చేసేసాడు మధు. రమ రిజైన్ చెయ్యమని చెప్తే అతను మొదట ఆశ్చర్యపోయాడు.
“చెయ్యలేనప్పుడు ఆ వుద్యోగాన్ని పట్టుకుని వేలాడటం ఎందుకు? కొన్నాళ్ళు ఇక్కడే వుందాం. బావుంది ఇక్కడ. ఆ విషయాలు మాట్లాడాలనే మా పేరెంట్స్‌ని రమ్మన్నాను. నాన్న కొన్నాళ్ళు సెలవు పెడతానన్నారు. అక్కడ ఇల్లు ఖాళీ చేసి రెంటుకివ్వటం, పిల్లల స్కూలు అవీ చూసుకుంటారు” అని అతన్ని కన్విన్స్ చేసింది. అతనేమీ మాట్లాడలేదు.
ధన్యా- ఆర్యలని స్కూలు మార్చడం పెద్ద ప్రహసనమే అయింది. సంవత్సరం మధ్యలో టీసీ ఇవ్వటానికి పాత స్కూల్లో వప్పుకోలేదు, తీసుకోవటానికి ఇక్కడ వప్పుకోలేదు. మొత్తానికి అదైంది.
ఈలోగా రమ కనీసం ఒక వందమందిని కాంటాక్ట్ చేసి వుంటుంది. .. రాములు చెప్పిన ఆర్గానిక్ వ్యవసాయాన్ని గురించి.
“ఆర్యూ క్రేజీ? వ్యవసాయమా?” అన్నవాళ్ళనీ-
“గో ఎహెడ్” అన్నవాళ్ళనీ_
పక్కనబెడితే ఒక మంచి సలహా వచ్చింది.
“స్వతంత్రం రాకముందటి చదువులు బ్రిటిష్‍వారి అవసరాలకి అనువుగా, దుబాసీ పని చెయ్యడానికి వుపయోగపడేలా వుండేవి. స్వతంత్రం కూడా వచ్చాక మార్పేం రాలేదు. ఇటు కుటుంబానికిగానీ అటు సమాజానికిగానీ వుపయోగపడని చదువులు. ఇప్పుడైతే కుటుంబానికీ, దేశానికీ కూడా వుపయోగపడకుండా ప్రైవేటుసంస్థలకీ, పైదేశాలకీ వుపయోగపడుతున్నాయి. మీరు తీసుకున్న నిర్ణయం చాలా మంచిది. నేను చాలాకాలంగా ఆర్గానిక ఫార్మింగ్ చేస్తున్నాను. విత్తనాలు, ఎరువులు, పురుగులమందులకోసం మార్కెట్‍కి వెళ్ళకపోతే వ్యవసాయం లాభదాయకమే. పుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ కూడా పెట్టుకుంటే సర్‍ప్లస్ వృధా అవదు. వడ్లతో అటుకులు, మరమరాలు, పేలాలు, వడియాలు చేసి మనవాళ్ళు చూపించనే చూపించారు. ఇదేమీ కొత్తదారి కాదు. పాతతీరానికే చేరుకుంటున్నాం. అయాం విత్ యూ” అని ఒక రిటైర్డ్ మిలిటరీ ఆఫీసరు రాసాడు. రమ ఫ్రెండుకి ఆయన చిన్నాన్న. ఆమె ఆయన నెంబరు ఇచ్చింది . ఫోన్లోకూడా మాట్లాడాడు.
“నీలో చనిపోవాలన్న ఆ ఆలోచన ఎందుకు వచ్చింది? నాకు శాస్త్రీయంగా తెలుసుకోవాలని వుంది” అంది రమ మధు కొంచెం ప్రసన్నంగా వున్న సమయం చూసి.
“ఐతే నన్ను వైద్యం చేయించుకోమంటావు?” అన్నాడతను. అతని పెదాలమీద చిన్న చిరునవ్వు… చాలా అరుదుగా అమావస్యతో కలిసివచ్చే పాడ్యమినాడు కనిపించే కనీకనిపించని చంద్రరేఖలా. ఆ రేఖ ఇంకా విస్తరించాలని ఆశపడింది రమ.

యుద్ధం ముగిశాక- విపుల మే 2002, సింధూరి కథల సంపుటి

హీరో హీరోయిన్లు పెద్దలని ఎదిరించి పెళ్ళి చేసుకున్నాక సినిమాకథ ముగుస్తుంది. రాజులు యుద్ధంలో జయాపజయాలని పంచుకున్నాక చరిత్ర ముగుస్తుంది. కాని నిజజీవితంలో కథ మొదలయ్యేది పెళ్ళితోనే. సామాన్యుల జీవితకథలు మొదలయ్యేది యుద్ధం ముగిశాకే.
నేను ప్రేమ యుద్ధం చేశాను.


“నేనతన్ని ప్రేమించాను, ఇద్దరం పెళ్ళిచేసుకుందామనుకుంటున్నాం” అని మీరా వచ్చి చెప్తుందేమోనని చాలా ఆశగా ఎదురుచూస్తున్నాను. ఆ ఆశ మనసులో పుట్టిన క్షణం తర్వాత కొన్ని లక్షల క్షణాలు గడిచి దాన్ని కొన్ని సంవత్సరాల వెనక్కి నెట్టేశాయి. ఆ క్షణం ఇంకా ఇంకా వెనక్కి జరుగుతోందిగాని నా ఆశ నెరవేరటంలేదు. మీరా నా కూతురు.
మీరా వట్టి పుస్తకాల పురుగు. కాలేజి లైబ్రరీలో పుస్తకాల గుట్టలవెనుక దాక్కుంటుంది. అంతేగానీ కేంపస్‍లో సీతాకోకచిలుకల్లా రెకలిప్పుకుని తిరిగే తన క్లాస్‍మేట్స్ మధ్య వుండదు. అబ్బాయిల్ని తనచుట్టూ పరిభ్రమింపజేసుకోదు.
చూస్తుండగానే మీరా గ్రాడ్యుయేషనైపోయింది. పోస్ట్‌గ్రాడ్యుయేషన్… లెక్చరర్ పోస్టు… రిసెర్చి… డాక్టరేటు. నెలకి మొదట్లో వేలలో జీతం, ఇప్పుడు దానికి కొన్నిరెట్లు ఎక్కువ. తలలో ఒకటి రెండు పండువెంట్రుకలు, కళ్ళకి టూపాయింట్ ఫైవ్ గ్లాసెస్. ఇంకా తను పుస్తకాల్లోనే ప్రపంచాన్ని వెతుక్కుంటోంది. పెళ్ళిచేసుకోవాలన్న ఆకాంక్ష తనలో కనిపించదు. ఎలా? ఎలా ఈ సమస్యని పరిష్కరించడం?
నా భార్య మాలతిని అడిగాను. తను నిర్లిప్తంగా నవ్వి “”డబ్బూ, అందం, ఆస్తీ, వుద్యోగం అన్నీ వున్న అమ్మాయికి పెళ్ళికావటం కష్టమైందంటే ఆ లోపం మన వ్యవస్థలోనే వుంది” అంది.
“సిద్ధాంతాలు జీవితాలని బాగుపర్చవు. ఈ వ్యవస్థని మనమూ బాగుచెయ్యలేం. ప్రస్తుతం మనకి కావల్సింది మీరా పెళ్ళి” అసహనంగా అన్నాను.
“చూద్దాం, దాని రాతెలా వుందో?”
మూడనమ్మకాలంటారు, తనున్న నిస్సహాయస్థితే మనిషికి దేవుడి పేరిట ముడుపులు కట్టడం నేర్పిస్తుంది. మనచేతుల్లో ఏదీ లేదని తెలిసినప్పుడు కర్మసిద్ధాంతం గుర్తొస్తుంది. ముప్పయ్యేళ్ళ క్రితం నేను చేసిన ఒక పనికి ఫలితం ఇప్పుడు బైటపడ్తోంది. ఇలా… నా ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతియ్యటం ద్వారా.


తెలుగు ఎమ్మే చేశాక రీసెర్చి మీదకి పోయింది నా మనసు. వైదికసంస్కృతీసాహిత్యాలు, హిందూసమాజనిర్మాణం. మన కులవ్యవస్థ వీటిమీద నాకు గొప్ప ఆసక్తి కలిగింది. వాటినే రిసెర్చికి సబ్జెక్టుగా ఎంచుకున్నాను. అప్పుడే నాకు మాలతితో పరిచయమైంది.
అమ్మాయి వాళ్ళ కమ్యూనిటీ హాస్టల్స్‌లో వుండి చదువుకుని వచ్చింది. చామనఛాయతో చురుగ్గావుండే కళ్ళలో ఆకర్షణీయంగా వుండేది.
“ఎందుకండీ, సొసైటీలో మేమంటే ఇంత చిన్నచూపు? ఏం అందరిలా మేము పుట్టలేదా? గాలికీ ధూళికి పుట్టామా? నేను చదువుకుంటానంటే ఆడపిల్లకి చదువేమిటని మా కులంవాళ్ళూ, మీకు చదువేంటని మా నాన్నని జీతానికి వుంచుకున్నవాళ్ళూ ఒకటే అనటం. ఎందుకు? ఆడపిల్లగా పుట్టడం లేక ఏదో కులంలో పుట్టడం అంత తప్పా? చదువుకి అనర్హతలా?” అనేది ఎరుపెక్కిన కళ్ళతో.
ఆ ఆవేశం చూస్తుంటే నాకు సంతోషం కలిగేది. అన్యాయం జరుగుతున్న ప్రతివారూ ఇలా ఎదిరించి అడిగితే? అణచబడ్డ ప్రతివాడూ తిరగబడి పైకొస్తే? ఇది ఒక కులానికో ఒక వర్గానికో చెందిన సమస్య కాదు. కేవలం ఆడవాళ్ళకి మాత్రమే చెందినది కాదు.
కష్టపడేగానీ కడుపు నిండని ఇళ్ళలో చదువుకి ఆడేంటి, మగేంటి? ఎవరికీ వుండదు. చదువొక భుక్తిమార్గంగా ఎంచుకున్న కుటుంబాల్లో సంపాదించుకు రావటం మగవాళ్ళ పని కనుక ఆడవాళ్ళకి చదువుండదు. ఇక ధనికకుటుంబాల్లో చదువు స్టేటస్‍సింబల్ కాబట్టి ఆమెకి ఎంత చదువుంటే అలంకారమో, తూచి తూచి అంతే చదివించి దాన్ని నిరుపయోగంగా వుంచుతారు.
స్త్రీకి చదువుండాలి. వియ్యమైనా నెయ్యమైనా సమవుజ్జీతోనన్న స్పృహ ఎంతమంది మగవారికుంటుంది? చదువుకోవాలనే తపనవుండి, ఎన్నో తెలుసుకోగలిగే తెలివి వుండి కూడా నిరర్ధకంగా వంటిళ్లలో జీవితాలని గడిపే ఆడవాళ్ళని చూసే నాకు హృదయం కదిలిపోయేది. అలాంటివాళ్ళు ఎక్కడో కాదు, నా చుట్టూనే, నా కుటుంబంలోనే, నా ఇంట్లోనే వుండే వారు. అమ్మ, అత్తయ్య, పిన్ని ఇలా ఎందరో! ఒక్కొక్కరూ ఒక్కొక్క విషాదగీతిక. కొంతకాలం గడిచేసరికి వాళ్ళలో ఆ జిజ్ఞాస చచ్చిపోయి పనులతో బండబారిపోవటాన్ని కూడా నేను గుర్తించేవాడిని.
మాలతి అలాంటి మూసబొమ్మ కారాదనిపించేది. ఆమెలో రెండు విషయాలు నన్ను ప్రత్యేకంగా ఆకర్షించేవి. మొదటిది ఆమె స్త్రీత్వం. రెండోది ఆమె మరో కులానికి చెందివుండటం. మా యిళ్ళలో మడీతడీ ఆచారం వుంటాయి. చదువుంటుంది. సంఘంలో గౌరవ మర్యాదలుంటాయి. మరి వాళ్ళ ఇళ్ళలో? కట్టు వుంటుంది. ఆ కట్టుబాట్లు తప్పినవాళ్ళని నిలువునా నరికేసే నిబద్ధత వుంటుంది. ఇంకా?
“ఎవరు సృష్టించారండి ఈ కులాలని? మనిషి సమాజపరిరక్షణ కోసం ఏర్పరుచుకున్న వర్ణవ్యవస్థనా ఇలా రూపుదిద్దుకున్నది? మనిషి ప్రవృత్తినిబట్టి నిర్ణయించాల్సిన వర్ణం అనువంశికంగా వచ్చే కులంగా ఎప్పుడు రూపాంతరం చెందిందో చెప్పగలరా? ఈ విషయంమీదే రీసెర్చ్ చేస్తున్నట్టున్నారు” అని అడిగింది. ఆ అడగటంలో జిజ్ఞాస వుంది. ఆవేదన, ఆక్రోశం వున్నాయి.
“నాగరికత పెరిగిన కొద్దీ మనిషి అవసరాలు పెరిగాయి. తమలో సహజసిద్ధంగా వున్న నైపుణ్యాలని ఉపయోగించుకుని ఒక్కొక్కరు ఒక్కొక్క వృత్తిని మొదలు పెట్టారు.” భుక్తినిస్తున్న వృత్తిని గౌరవించటం మొదలైంది. వృత్తి అంటే అదొక ఫైనాన్షియల్ సెక్యూరిటీ, వృత్తిని గౌరవించటం మొదలయ్యాక అది అనువంశికమైంది”
“ఇప్పుడు జరుగుతున్నదికూడా అంతేగా? డాక్టరు కొడుకు తన తండ్రి వృత్తిని క్షుణ్ణంగా పరిశీలించి దానితో సహజీవనం చేసి, తనూ డాక్టరు అవాలనుకుంటాడు. అలాగే టీచర్ పిల్లలంతా టీచింగ్ లైన్‍లోకి వెళ్తారు. ఇది జనరల్‌గా జరిగేదే” అంది.
తను చూపించిన ఉపమానానికి నేను స్టన్నయ్యాను. నిజమే. తండ్రి ఎలాంటి ప్రొఫెషన్‍లో వుంటే పిల్లలు అందులోకి వస్తారు. సులువుగా రాగలుగుతారు. అప్పటికే పరచబడి వున్న మార్గంకాబట్టి పెద్దగా ఆటంకాలు, ఇబ్బందులు వుందవు. అంటే ఇప్పుడు కులవ్యవస్థ మారాల్సి వుంది. డాక్టర్ల కులం ఇంజనీర్లకులం…ఇలా.
“అవన్నీ చదువుకున్న వాళ్ళకి. మరి మాలాంటివాళ్లకి? మేం ఎప్పటికీ ఇలాగే వుండాలా?” నా మనసు చదివినట్లు అడిగింది మాలతి.
“మీలోమాత్రం మార్పు రావటంలేదా, మాలతీ? చదువుకుని పైకిరావాలనే తపన మొదలైంది”
“అదొక్కటే చాలా?”
“గవర్నమెంటు కృషి చేస్తూనే వుందిగా?”
“వాటిని ఎంతదాకా వుపయోగించుకుంటున్నాం?”
“ఆ తప్పెవరిది?”
“మాది మాత్రం కాదు”
“మరి?”
“ఏ పూటకాపూట ఎవరికి వారు సంపాదించుకుంటేగానీ తిండికి లేని కుటుంబాల్లో తల్లీతండ్రీ కూలికి పోతే తర్వాతి పిల్లల్ని చూడాలిన ఆడపిల్లలు… కాస్త ఎదగగానే ఆసరా ఆశించి తండ్రి అందించే చేతిని అందుకోక తప్పని మగపిల్లలు… ఏ బడికెళ్తారు? ఏ చదువులు చదువుతారు? మీకున్న అనుకూలత మాకేది?’”
నిజమే. అవసరాలు మనిషి ఎలా బతకాలో నిర్దేశిస్తాయి.ఎన్నో ప్రశ్నలు వేసేది. కొన్నిటికి జవాబు చెప్పగలిగేవాడిని. కొన్నిటికి లేదు. నెనే వెతుక్కునేవాడిని.
వర్ణాశ్రమ ధర్మం ముందు పుట్టిందా? కులవ్యవస్థా? లేక రెండూ సమాంతరంగా నడిచాయా? దేన్ని ఏది డామినేట్ చేసింది? దేనినుంచి ఏది పుట్టింది? మేమెందుకు ఇలా అణిగిపోయి వున్నాము? ఇవన్నీ అడిగేది.
ప్రశ్నలు చాలా చిన్నవేగానీ లోతైనవి. చాలా. కారణాలు అనేకం. సరైన ఆధారాలు మిగిలిలేని ఎన్నో లోతులలోంచీ కారణాలని వెతికిపట్టుకుని విశ్లేషించాలి. అది నాకొక అంతర్గత జ్వాలగా అంటుకుంది. రిసెర్చిని మించి నన్ను ఆకర్షించింది.
ప్రేమా? ఏమో! జవాబు నా చదువులోనే వుంటుందనిపించింది. మేమిద్దరం సామాజిక అవగాహనల చెరో ప్రవాహంలోనూ వున్నాము. మా ఆలోచనలు ఎలా కలుస్తాయి? చెరోవొడ్డూ చేరకుండా ఆపే శక్తి ఏదైనా వుందా?
వర్ణం మనిషి మనస్తత్వానికి సంబంధించినది. ఒకవిధంగా స్పందించే మానసికవ్యవస్థని పుట్టుకతో తెచ్చుకుంటాడు. కొన్ని ఆసక్తులనీ నైపుణ్యాలనీ జన్మతహా పొందుతాడు. అవి అతని డ్రైవింగ్ ఫాక్టర్స్. అతనిపై పరిసరాలు, పరిస్థితులు, పెంపకం ఇలా ఎన్నో అంశాలు ప్రభావాన్ని చూపిస్తాయి. సమాజం అతనెలా బతకాలో నిర్దేశిస్తుంది. అలాగే బతికారు. సమాజం ఒకొక్కమెట్టూ దిగజారుతున్నకొద్దీ అందులో వుండే మనుషుల జీవితాలు దుర్భరమౌతాయి. దాదాపు వెయ్యిసంవత్సరాల పరాయిపాలనలో భారతదేశం ఎన్నో విలువలని పోగొట్టుకుంది. చరిత్ర కొన్ని ప్రశ్నలకి జవాబు చెప్పవలసిన అవసరం వుంది.
భరతఖండపు సరిహద్దులని కాపాడుకోవటానికి ప్రయత్నాలు ఎందుకు జరగలేదు? అశోకునివంటి మహాచక్రవర్తి ఆయుధాన్ని వదిలిపెట్టి అహింసని పాటించడంవల్లనేకదా,పశ్చిమహద్దులో శకులు రాజ్యాన్ని స్థాపించుకోగలిగారు? పురుషోత్తముడు హిందువు. యుద్ధరంగాన నిలిచినప్పుడు బంధుత్వాలు వుండవని గీతకారుడు చెప్పిన విషయాన్ని మర్చిపోయి, రుక్సానా కపటోపాయంతో పంపిన రాఖీకి ఎందుకు విలువ ఇచ్చాడు? అది నిజమో కాదొ, అలాంటి కథని ఎందుకు ఒరచారంచ్ ఎశ్తున్నారు? పృథ్వీరాజ్ చౌహాన్ తన చేతిలోనే పదహారుసార్లు వోడిపోయిన ఘోరీని ఎందుకు చంపలేదు? వీటన్నిటి ఫలితం పరాయిపాలన, ప్రజాపీడన, అవ్యవస్థ.
ఇది కళ్ళముందు కనిపించే వాస్తవం. దీనికి కారణం మనువో మరెవరో కాదు. పరాయిపాలకులు హిందూధర్మాన్ని గుర్తించలేదు. వాళ్ళ జీవనసూత్రాలని, లస్ట్‌ని మనమీద రుద్దారు. వాటివలన మన సమాజానికి రుగ్మత వచ్చింది.
ఈ విషయాలని మాలతితో చర్చించాను. తనకి మొదట్లో నచ్చలేదు. కొన్ని ద్వేషాలు అంత త్వరగా చల్లారవు. బలంగా నమ్ముతున్న ఒక విషయాన్ని మరోలా అర్థం చేసుకోవటంలో సమస్య వుంది. తనవారు, పైవారు అన్న బేధభావం వుంది.
చివరికి మా ఆలోచనాస్రవంతులు కలిసాయి. తర్వాత పెళ్ళి. మా పెళ్లికి పెద్దల ఆమోదం లేదు. కానీ సంఘసంస్కర్తలు హర్షం ప్రకటించారు. మా ఇద్దర్నీ తమ గుంపులో కలుపుకున్నారు. కులరహిత సమాజాన్ని నిర్మించడం, కులాంతర వివాహాలు ప్రోత్సహించటం, నేనూ ఆ గుంపులో కలిసిపోయి తిరిగాను. అదొక మత్తులా నన్ను కమ్మేసింది. ఆ మత్తు తరుణ్ మీరాని తిరస్కరించే వరకూ అలాగే వుంది. ఆ తర్వాత క్రమంగా దిగి వెబ్‍సైట్లలో వరుణ్ణి వెతికే దాకా వెళ్లి అక్కడ నిస్సహాయంగా ఆగింది.
మీరాకి అప్పుడు ఇరవయ్యేళ్లు. తరుణ్ కొత్తగా ఆఫీసులో చేరాడు. నా పక్కసీటే అతనిది. ప్రతి విషయం మీదా అనర్గళంగా మాట్లాడేవాడు. సమసమాజం రావాలనేవాడు. డిగ్నిటీ ఆఫ్ లేబర్ గురించి మనం నేర్చుకుంటే సోషలిజం ఆటోమేటిగ్గా వస్తుందనేవాడు.
“ఇప్పుడంతా కేపిటలిజమ్ గురించి మాట్లాడుతుంటే నువ్వేంటి, పాత రాతి యుగం మనిషిలా సోషలిజం అంటున్నావు. మార్క్స్ చచ్చిపోయి ఎన్నోయేళ్ళైంది. ఎంతో పెద్ద సోషలిస్టు దేశమైన రష్యా కుప్పకూలింది. కేపిటలిస్టులు మాత్రం అడుగడుక్కీ వున్నారు. ఎక్కడో లైబ్రరీలో పుస్తకాల్లో నిక్షిప్తమైపోయిన ఆయన సిద్ధాంతాలు ఈ సజీవచైతన్యం ముందేం నిలుస్తాయి?” అనేవాడిని నవ్వుతూ.
అతను నాకు బాగా నచ్చాడు. ఆత్మీయుడిలా అనిపించాడు. మా గురించి చెప్పి మాలతినీ మీరానీ పరిచయం చేశాను. అతను మా కుటుంబాన్ని చాలా ఆరాధనగా చూశాడు. ఆ తర్వాత అతనికి మీరాని ప్రపోజ్ చేశాను.
నిర్విణ్ణుయ్యాడు ముందు.
“ఆదర్శాలు చెప్పటం తేలిక అంకుల్. కానీ ఆచరించటం కష్టం. చెప్తుంటే విని అంతా మత్తులో పడిపోతారు. మనని ఆరాధనగా చూస్తారు. ఆచరిస్తుంటే మాత్రం మన పక్కన ఎవరూ వుండరు. నేను పలికే ఆదర్శాలు మీలాంటివారిలో ఆశని పుట్టిస్తున్నాయని గుర్తించాక నేనొక నిర్ణయానికొచ్చాను. అది కూడా మీరంటే వున్న గౌరవంతో, నేనింకెప్పుడూ ఆదర్శాలు మాట్లాడను” అన్నాడు పాలిపోయిన ముఖంతో.
ఆ తర్వాత ట్రాన్స్ఫర్ చేయించుకుని వేరే ఆఫీసుకి వెళ్ళిపోయాడు.
అది మొదటి ప్రకరణం. అలా ముగిశాక ,“”రామ్‍ధన్ని అడుగుతే?” అంది మాలతి.
అతను మాలతికి తమ్ముడి వరుస. ఉన్న వాళ్లందర్లో బాగా చదువుకుని మంచి ఉద్యోగంలో అన్నది అతనే. నల్లగా ఎత్తుగా బలిష్టంగా వుండే రామ్‍ధన్ నేను మనసు సరిపెట్టుకుంటే మీరాకి వరసైన వరుడే. కానీ ఆ మనసే ముడుచుకుపోయింది. అతనొప్పుకోకపోతే బాగుండునని లోపలెక్కడో అనిపించింది.
“మీరొచ్చి వెళ్లాక మా కాలనీలో ఆడపిల్లలంతా అర్జెంటుగా చదువులు మొదలు పెట్టేశారు” అని నేనెప్పుడు కనిపించినా జోక్ చేసే రామ్‍ధన్ మాలతిని సొంత అక్కలా ఆదరిస్తాడు. వాళ్లింట్లో ఆమెకి పుట్టిల్లులేని లోటు తీరుతుంది. ఆమె కోణంలోంచి చూస్తే అతను కోరుకోదగ్గ వరుడే.
మీరాని చేసుకొమ్మని అడగ్గానే తెల్లబోయాడు. “”నేనా? దాన్నా?”” అన్నాడు ఆపనమ్మకంగా.
“ఏం తక్కువైందిరా దానికి?”” అతను వెంటనే ఒప్పుకుంటాడని ఆశించిన మాలతి తట్టుకోలేక వుక్కిరిబిక్కిరవుతూ ఉక్రోషంగా అడిగింది.
“దానికి తక్కువేంటక్కయ్యా? అన్నీ ఎక్కువే”” నవ్వాడతను. కాస్సేపాగి “”మన యిళ్లలో అది ఇడలేదు. దాన్ని పూర్తిగా శాకాహారజంతువులా పెంచారు. మా ఇంటికొచ్చాక అది వేటపిల్లని కొయ్యగలదా? కోడి కూరొండగలదా? నాకవిలేనిదే రోజు గడవదు. ఒకసారి దసరాకి మా ఇంటికొచ్చారు చూడు, అదా మూడు రోజులూ తిండి కూడా తినలేదు… గుర్తుందా?”” అన్నాడు.
అతను పైకి వ్యక్తపరచని మరో విషయం కూడా నాకు స్పురించింది అది. సుతారంగా జాజిమొగ్గలా వుండే మీరా ఈ మొరటు మనిషిని శారీరకంగానూ మానసికంగానూ భరించగలదా అని.
మన సమాజం స్త్రీ యొక్క సున్నితమైన మనస్తత్వాన్ని దృష్టిలో వుంచుకునే ఏ నిర్ణయమైనా చేసింది. మనస్తత్వాలనిబట్టి వర్ణ నిరయం జరిగాక అనులోమ వివాహాలని ప్రోత్సహించి ప్రతిలోమ వివాహలని తిరస్కరించింది. మానసికస్థాయిలో తనకన్నా తక్కువలో వుండే మగవాడిని ఆడపిల్ల చేసుకోరాదని నిర్దేశించింది. మీరా రామ్‍ధన్‍ని చేసుకుంటే అది నిషిద్ధవివాహమవుతుంది. చాలా పెళ్లిళ్లు బ్రేకవుతున్నాయన్నా, భార్యాభర్తలో హార్మొనీ లేక జీవితంలో వుత్సాహాన్ని కోల్పోయి నిస్సారంగా గడిపేస్తున్నారన్నా ఇదే కారణం.
“ఎలారా, దానికి సంబంధాలు రావటం లేదు?” మాలతి ఏడ్చేసింది.
“అక్కా చదువుకున్న నువ్వూ ఇలాగే మాట్లాడితే ఎలా? నువ్వు బాధపడుతున్నావనో, బావ అడిగారనో మీరాని నేను చేసుకుంటే అది మా మధ్య సర్దుకుపోగలదా? సంతోషంగా వుంటుందా? మరోసారి ఆలోచించుకుని చెప్పండి” అన్నాడు.
అతను వెళ్లిపోయాక మాలతి మీరాని అడిగింది. “మామయ్య నిన్ను చేసుకుంటాడటనే, నీకిష్టమేనా?”” అని.
విని మీరా కూడా రామ్‍ధన్‍లాగే తెల్లబోయింది. “”నేనా? అతన్నా?” అని అడిగింది.
ఆమె కళ్లలో స్వల్పంగా భయం… అసహ్యంలాంటివేవో కదిలాయి. అతన్ని మేనమామగా ప్రేమించడం వేరు. భర్తగా చూసుకోవట వేరు. “ఇప్పుడే నా పెళ్లికేం తొందర? వద్దు” అనేసింది.
నేను తేలిగ్గా వూపిరిపీల్చుకున్నాను. తలమీది బరువేదో దిగిపోయినట్లైంది. మరో అధ్యాయం మొదలైంది.
“వైజయంతి కొడుక్కి చేసుకుంటుందేమో అడుగుతాను. దానికి నేనంటే చాలా ఇష్టం. ఎన్నోసార్లు మనింటికొచ్చింది. శివానీ తీసుకొచ్చింది. బావ సరేసరి” అన్నాను.
మాలతి నన్నదోలా చూసింది. ఆ చూపు కర్ధం తర్వాతెప్పుడో గ్రహించాను.
వైజయంతి నా ఆఖరి చెల్లెలు. ఆమ్మానాన్నలతో నా సంబంధాలు పూర్తిగా తెగిపోయాక తనే మామధ్య వారధైంది. శివా బీటెక్ పాసై లెక్చరర్‌గా చేస్తున్నాడు. నేనంటే వాడికి చాలా అభిమానం. మీరా, శివా కబుర్లలో పడ్డారంటే కాలమే తెలీదు. వాళ్లకి. శివాకి నేనడుగుతాననే వైజయంతి అనుకుంటోందేమో! మగపిలాలవాడి తల్లికదా? ముందుగా తనెలా బైట పడుతుంది?
నేను వెళ్లేసరికి వైజయంతికీ శివాకీ మధ్య ఇదే విషయం మీద చర్చ జరుగుతుండటం కేవలం కాకతాళీయం.
“నా కులం ఎక్కువనో, ఆమె కులం తక్కువనో కాదురా, ఇప్పటికీ మాలతిని వదినగా అనుకోలేను. ఆమె ఇస్తే మంచినీళ్లు కూడా తాగలేను. వెలపరం పుడుతుంది. ఇంట్లో వండుకోరేమోగాని ఆమెని హోటల్‍కి తీసికెళ్తాడట మామయ్య వాళ్ల కూరలు తినిపించడానికి. వాళ్ళ బంధువులిళ్లకి వెళ్తారు. వాళ్లూ వస్తూంటారు. చిన్నప్పట్నుంచీ వాడి దగ్గర నాకున్న చనువునీ
రకసంబంధాన్ని తెంచుకోలేక వాళ్లింటికి వెళ్తుంటానుగానీ వాళ్ల మధ్య వాడెప్పుడూ నాకు పరాయివాడిలాగే వుంటాడు” లోపలి గదుల్లోంచి వైజయంతి గొంతు తీవ్రస్థాయిలో వినిపిస్తూంటే హాల్లోనే ఆగిపోయాను.
కాళ్లకింది నేల కదులుతున్నట్టనిపించింది. గిరుక్కుమని వెనక్కి తిరిగాను.
ఇంతలోనే శివా గొంతు వినిపించింది.
“మీరా ప్యూర్ వెజిటేరియన్ అమ్మా! నువ్వసలు ఇంట్లోంచి ఎక్కడికీ వెళ్లవు కాబట్టి నీకేమీ తెలీవు. ఈ రోజుల్లో మనిషికీ మనిషికీ భేదంలేదు. ఆఫీసులో నీళ్ళిచ్చే అటెండరు దగ్గర్నుంచి ఆర్డర్లిచ్చే బాస్‍దాకా అందరూ వుంటారు. అంతెందుకు? మనలో మాత్రం ఎంతమంది తినటం లేదు? ఒరియావాళ్లకీ బెంగాలీవాళ్లకి అసలది తప్పేకాదు. చేపల్ని తింటారు. వాటిని జలపుష్పాలని వ్యవహరిస్తారు. మీరా పైపిల్ల కాదు. సంబంధాలు దొరకటంలేదు. పాపం మామయ్య…”
నేనింక వినదల్చుకోలేదు.
నా కూతురు ఎవరితోనో కాంట్రాస్ట్ చెయ్యబడి, ఆపైన జాలితోనో, ఇంకెందుకో ఆమెని పెళ్లి చేసుకోవడం… శివానైనా ఇంకెవరైనా సరే నేను సహించలేను. మీరా ఒక మంచి పెళ్ళికూతురు కాదా? తనకున్న లక్షణాలు ఎంతమంది ఆడపిల్లలకుంటాయి?
రెండంగల్లో ఇవతలికొచ్చి స్కూటర్ స్టార్ట్ చేశాను. నేనిక్కడికొచ్చేముందు మాలతి చూసిన చూపు గురొచింది. ఎంత మూగవేదన… అందులో! తనంటే ఏమాత్రం గౌరవం లేని ఇంటికి పిల్లనిస్తానని వెళ్తుంటే ఆపలేని నిస్సహాయత.
ఇంటికెళ్ళాలనిపించలేదు. పార్కులోకెళ్ళి సందడిలేనిచోట సిమెంటు బెంచీ మీద కూర్చుని వెనక్కివాలి కళ్ళు మూసుకున్నాను. మనసు అగ్నికీలలా భగ్గుమనడం అంతర్నేత్రానికి స్ఫురిస్తోంది.
రామ్‍ధన్‍కి మీరానివ్వాలనుకున్నాం. అతనికి మీరాకన్నా నాన్‍వెజ్ ముఖ్యం. నాన్‍వెజ్ వండిపెట్టగలిగే భార్య ముఖ్యం. శివాకి ఆఫర్ చెయ్యబోయాను. నాన్‍వెజ్ తినే, అన్యకులస్తురాలైన స్త్రీకి కూతురు, కాబట్టి వైజయంతికి మీరావద్దు.
మనుషులు ఎడ్వాంటేజియస్ పొజిషన్లో వున్నప్పుడు ఎదుటివారి కష్టం, సమస్య అర్ధమవవు. ఒక మెట్టు దిగివచ్చి అర్థం చేసుకోవాలనుకోరు. అలా దిగి రావాలంటే ఒక బలమైన కారణం, అలాంటి ఒక డ్రైవింగ్ ఫోర్స్ కావాలి.
ఏమిటీ సమాజం? చుట్టూ మనుషులు కావాలి. అలా లేకుండా ఒంటరిగా బతకలేరు. మళ్ళీ వాళ్ళకోసం ఏమీ చెయ్యరు. వాళ్ళ కష్టసుఖాలతో మనకి నిమిత్తం వుండదు. వుండకూడదు. మనుషులు అంతరంగికంగా ఎవరి గూటిని వాళ్ళు కాంక్రీట్ చేసుకుని, భౌతికంగా గుంపులుగుంపులుగా జీవిస్తున్నంతమాత్రాన అది సమాజమౌతుందా? సంయుక్తత లేని సమాజం ఎవరి మంచికోసం? చాలా అసహనంగా అనిపించింది. నేను మనుషుల మధ్య వున్నట్లు కాకుండా ముళ్ళ పొదలమధ్యన చిక్కుకున్నట్టు భావన.
ఎవరో నా పక్కని కూర్చున్నట్టనిపించి చూశాను. శివా! నాకేసి సూటిగా చూడలేక తలొంచుకున్నాడు.
“నువ్వు మా ఇంటికెప్పుడొచ్చావో గుర్తించలేదుగానీ వెళ్తుంటే చూశాను మామయ్యా! నాకూ, అమ్మకి మధ్య జరిగిన సంభాషణ విని వుంటావని గ్రహించి నిన్ను వెంటనే ఫాలో అయాను. అయాం సారీ” అన్నాడు.
“దీనికి సారీ” నా గొంతులో నేనే ఎప్పుడూ ఎరగని కారిన్యం.
“అత్తయ్యని చేసుకుని నువ్వు మొదలు పెట్టిన ఓ మంచిపనిని నేను కొనసాగించలేకపోతున్నందుకు, నిన్ను బాధ పెట్టినందుకు”
“మాలతిని నేను చేసుకుంటూ అదో మంచిపనని అనుకోలేదు. అందర్లాగే మేము పెళ్ళిచేసుకున్నాం. అందులోని మంచిచెడలుగానీ నేనేదో గొప్పపని చేస్తున్నాననిగాని లెక్కలు వేసుకోలేదు. ఆమె కోసం చేశాను. ఆమె లేనిదే బతకలేననిపించి చేశాను”
“నాకు మీరాపట్ల అలాంటి భావంలేదు మామయ్యా! నీకోసం ఆమెని చేసుకోవాలనుకున్నాను”
“అమ్మకి ఇష్టం లేదు కాబట్టి నాకు సారీ చెపున్నాను. అంతేనా? నీకోసం నువ్వు బతకడం నేర్చుకోరా, అదెన్నో సమస్యలని పరిష్కరిస్తుంది. ఈ కృత్రిమ విలువల్ని తగ్గిస్తుంది” అని లేచి నిలబడ్డాను. మీరాని చేసుకోవాలనుకోవడం, వద్దనుకోవడం. అమ్మకి ఎదురు చెప్పలేకపోవడం, ఇవన్నీ అతని వ్యక్తిగత సమస్యలు. నాకు వాటితో సంబంధం లేదు. మీరాని అతను కోరుకుని వుంటే ఆ కోరిక మీరా ఇప్పటి సౌఖ్యానికీ, భవిష్యతుకీ సంబంధించినది కాబట్టి నేను తలదూర్చేవాడిని.
కోరిక అంతరంగికం. అనుభవం వైయక్తికం. పర్యవసానం సామాజికం.
అతనికి కోరికే లేదు. అలాంటప్పుడు అనుభవానికి చోటులేదు. పర్యవసానం ప్రసక్తే లేదు.
ఇంటికొచ్చాక మాలతి నన్నేం అడగలేదు. జవాబు ముందే ఊహించినది కాబట్టి పెద్దగా అప్సెట్ అవలేదు. మీరామాత్రం నాతో దెబ్బలాడింది. “
“శివా నాకు బెస్ ఫ్రెండ్. ఈ టాపిక్ తేవడంతో మా ఫ్రెండ్లిప్ దెబ్బతింటుంది. దయచేసి నాకు మేచెస్ చూడకండి నాన్నా! ఇప్పుడే చేసుకోవాలనిలేదు””అంది.
సరేననటానికే తప్ప కాదనటానికి నాకు అవకాశం లేదు.
మీరా చదువులో పడిపోయింది. పి.జి… రిసెర్చి… కెరీర్… ఇలా తన చుట్టూ అడ్డుగోడ కట్టుకోవడంలో మునిగిపోయింది.
తరుణ్‍కి పెళ్ళైందని తెలిసింది. అతను నాకు కార్డు పంపలేదు. ఒకే డిపార్ట్మెంటు కావడంవల్ల ఎవరిద్వారానో తెలిసింది.
రామ్‍ధన్ పెళ్ళి చేసుకున్నాడు. అతను మీరాని తిరస్కరించినందుకు మా మనసులో ఏ కోపమూలేదని తెలియచెప్పేందుకు భార్యాభర్తలిద్దర్నీ పిలిచి బట్టలు పెట్టాం. అతనొచ్చి వెళ్తుంటాడు.
భార్యకి దగ్గరుండి స్వయంగా ఎండుచేపల పులుసు పెట్టడం ఎలా నేర్పించాడో మాలతికి చెప్తుంటాడు. అతనికామెని చేసుకోవడంలో సంతోషం వుంది. మేడ్ ఫర్ ఈచ్ అదర్‍గా వుండడానికి భార్యాభర్తలు మిస్ అన్డ్ మిస్టర్ యూనివర్స్ కానక్కర్లేదు. వాళ్ళిద్దరూ చాలా సంతోషంగా వున్నారు.
శివాకీ పెళ్ళైంది. మావైపు జరిగే పెళ్ళిళ్ళన్నిటికీ నేనొక్కడినే వెళ్తాను. మాలతి రాదు. ఇప్పుడూ అలాగే జరిగింది. శివా కళ్ళలో నన్ను చూడగానే అదే అపరాధభావం. ఆ అపరాధభావనే వాళ్ళ వైవాహిక జీవితాన్ని శాసించబోతోందా? ఇగ్నోరెన్స్ యిజ్ ఎ బ్లిస్ అన్నారు. తెలీక చేసిన తప్పు మనని బాధించదు. తెలిసి చేస్తేమాత్రం అది నిప్పులా కాలుస్తుంది.
మీరా రోజురోజుకీ పెద్దరికాన్ని తెచ్చుకుని హుందాగా మారిపోతోంది. కళ్ళలో నిర్లిప్తతేతప్ప ఆకాంక్షగానీ, నైరాశ్యంగానీ కనిపించవు. వసంతాన్ని కోరుకోని మనసుంటుందా? వసంతం అనేదొకటి వుంటుందని తెలీనట్టుండే మీరా గుండెల్లో మాకు తెలీని రహస్యహర్యాలు.


ఆరోజు ఆఫీసులో కూర్చుని వున్నాను. మార్చి ఎకౌంట్స్ పూర్తవటంతో తీరిగ్గా వున్నాను. ఎటెండర్ ఎవరిదో విజిటింగ్ కార్డు తెచ్చి ముందు పెట్టాడు.
“ప్రొఫెసర్ జ్ఞానదేవ్ ఎమ్మెస్”
నా భృకుటి ముడిపడింది. ఎవరితను? నాతో ఏం పని? ఆశ్చర్యపోతూనే పంపించమని చెప్పాను. అతనొచ్చాడు. ప్రొఫెసర్లు సింబాలిగ్గా ఎలా వుంటారో అలా వున్నాడు. సన్నగా, పొడుగ్గా. నిశితమైన చూపులు, చిరుగడ్డం. మీరా గురొచ్చింది. తనూ అంతే. ఎలావుంటే స్టూడెంట్స్ గౌరవిస్తారో అటువంటి ఆహార్యాన్ని స్వీకరించింది.
అతను రాగానే నమస్క్జరించాడు. నేను తిరిగి నమస్కరించి, కూర్చోమన్నాను. కూర్చున్నాడు.
“మీతో పర్సనల్‍గా మాట్లాడాలి. ఎప్పుడు తీరిగ్గా వుంటారో, ఎక్కడ కలుసుకుందామో చెప్పండి” అన్నాడు సూటిగా.
నేను ఆశ్చర్యపోయాను.
“మీరా గురించి” నెమ్మదిగా అన్నాడు. అతని ముఖం ఎరుపెక్కింది. ఇబ్బందిగా వున్నట్టు కనిపించాడు. పెద్ద సంతోషపు కెరటం నన్ను బలంగా తాకి ఉక్కిరిబిక్కిరి చేసింది.
” ఖాళీగానే వున్నాను. ఎక్కడో ఎందుకు? ఇప్పుడే… ఇక్కడే చెప్పండి” అన్నాను . బెల్ నొక్కి ఎటెండర్ రాగానే రెండు డ్రిక్స్ పంపమని చెప్పాను.డ్రింక్స్ వచ్చేదాకా మేమేమీ మాట్లాడుకోలేదు. అవి రాగానే ఒక బాటిల్ అతని ముందుకి జరిపి నేనొకటి తీసుకున్నాను. నేను మళ్ళీ బెల్ నొక్కేదాకా రావద్దని అటెండర్‍కి చెప్పాను. అతను వెళ్ళిపోయాదు.
“అయామ్ ఇన్ లవ్” సిప్ చేస్తూ చెప్పాడు.
కభీకభీలో శశికపూర్‍లా నవ్వాలనిపించింది నాకు. అంతలోనే చిన్న సందేహం. ఇతను మీరాని ప్రేమిస్తే నాకొచ్చి చెప్తున్నాడెందుకు? అనుకున్నాను.
“కానీ తను నా ప్రతిపాదనని ఔట్‍రైట్‍గా తిరస్కరించింది. తనకసలు పెళ్ళి చేసుకునే ఉద్దేశ్యం లేదట” అతను నాతో ఈ విషయాలు చెప్పటానికి చాలా మొహమాటపదుతున్నాదు. టీనేజ్ లవ్‍స్టోరీ కాదు. వాళ్ళంతట వాళ్ళు నిర్ణయించుకుని ఫార్మల్ గా మాకు చెప్పే స్టేజ్.
క్రమంగా జ్ఞానదేవ్‍లో యీజ్ చోటుచేసుకుంది. ఫ్రీగా చెప్పసాగాడు. మాటలనేవి బిగించి ముడివేసిన పూసలదండల్లాంటివి. ఒకసారి ముడి విప్పితే జలజలా జారిపోతాయి.
“నేను నాన్‍రెసిడెంట్ ఇండియన్ని, కాలిఫోర్నియాలో వుంటాను. అక్కడ ఐమీన్. స్టేట్స్‌లో పెళ్ళిళ్ళు కొంచెం ఆలస్యం. అన్నీ అమర్చుకున్నాక సెటిల్ కావడానికి చేసుకుంటారు. నాకు ముప్పయ్యెనిమిది. నాలుగేళ్ళక్రితం ఒక సెమినార్లో మీరాని కలుసుకోవడం జరిగింది. అప్పట్నుంచీ ఆమెని నేను మర్చిపోలేదు. కానీ అప్పట్లో పెళ్ళి చేసుకోవాలనే ఆలోచన నాకు లేదుకాబట్టి ఆమె ఒక జ్ఞాపకంగా వుండిపోయింది”
“…”
” గత రెండేళ్ళు మేమిద్దరం ఒక ప్రాజెక్టులో ఆన్‍లైన్‍లో కలిసి పనిచేసాం. మా కంపెనీ కొన్ని సెలెక్టెడ్ యూనివర్శిటీలతో ఒక ప్రాజెక్టు లాంచ్ చేసింది. నా ఇండియన్ కౌంటర్‍‍పార్ట్ మీరా. అప్పుడప్పుడు చాటింగ్ చేసేవాళ్ళం. మా ప్రాజెక్టు పూర్తయిపోయాకా మీరాతో మళ్ళీ నా కాంటాక్స్ తెగిపోయాయి. నాలో ఒక రకమైన నిరుత్సాహంలాంటిది చోటుచేసుకుంది. అదేమిటో కూడా గ్రహించాను. మీరాకోసం వెంటనే బయల్దేరాను “
“తనేమంది?”
“తనకసలు పెళ్ళి చేసుకోవాలని లేదని చెప్పింది. ఎందుకని అడిగాను. “సింప్లీ అని జవాబిచ్చింది. ఇలాంటి అసాధారణమైన నిర్ణయాలు అంత సింపుల్‌గా తీసుకోరని నాకు తెలుసు” జ్ఞానదేవ్ చిన్నగా నవ్వాడు.
నాకర్థమైంది. మీరా తనకింక పెళ్ళవదని అర్థంచేసుకుని పెళ్ళంటే విముఖతని పెంచుకుంది.
“తనలా ఎందుకందో నాకు తెలీదు. ఇరవైల్లో వున్నప్పుడు రెండుమూడు సంబంధాలు చూశాం. కొన్ని కారణాలచేత ఏదీ కుదరలేదు. తను చదువు, కెరీర్ వైపు మళ్ళిపోయింది. అంతే”
“ఎనీ బ్రోకెన్ ఎఫేర్”
“అలాంటివేం లేవు” నమ్మకంగా చెప్పాను.
“అలాగైతే మీరామెతో మాట్లాడతారా?”” ఆతృతగా అడిగాడు. అందులో అభ్యర్థన ధ్వనించింది. అతను మీరాని కోరుకుంటున్నాడు. మరికొద్దిసేపు వుండి మామూలు చిషయాలు మాట్లాడి వెళ్ళిపోయాడు.
సాయంత్రం మీరాని జ్ఞానదేవ్ గురించి అడిగాను. తన కళ్ళలో తడబాటు కనిపించింది. “”అతను మీకెలా తెలుసు?”” తడబాటుని కప్పిపుచ్చుకుంటూ అడిగింది. చెప్పాను.
“అతన్ని చేసుకోవడంలో నీకు గల అభ్యంతరమేమిటమ్మా? ఇలాంటి అకేషన్‍కోసం నేనూ, అమ్మా ఎంతగా ఎదురుచూస్తున్నామో”” అన్నాను.
“నాకు… నాకెందుకో పెళ్ళి చేసుకోవాలనిపించడం లేదు”
“ఎందుకు? ఎందుకని?”
“పెళ్ళి పేరిట జరగుతున్న కించపాటు చూశాక అలా నిర్ణయించుకున్నాను””
“ఏం చూశావు మీరా, నువ్వు? చదువు, ఆస్తి, అందం, ఉద్యోగం… అన్నీ వున్న నువ్వే ఇలాగంటే మిగిలినవాళ్ళమాట? అసలు నువ్వు చూసిందేపాటి? నీ దగ్గర చదువుకునే ఆడపిల్లలు తూనీగల్లా తుళ్ళిపడడం నువ్వు రోజూ చూస్తూనే వుంటావు. పెళ్ళిళ్ళయ్యాక వాళ్ళ కళ్ళు ఎంత కాంతివిహీనంగా వుంటాయో! ఎన్ని కన్నీటి గాధల్ని చెపాయో! అది బాధని కూడా తెలినంతగా ఈ కించపాటు వాళ్ళ జీవితాల్లో పెనవేసుకుపోయింది. ఎన్నున్నా ఆడపిల్లని తక్కువగా చూసి
కల్చర్ మనది. అదొక్క ఆడపిల్లని అనేకాదు. సాటి మనిషినే తక్కువగా చూసి, అతడి బాధలోనే మనకి మనుగడ వుందని గుడ్డిగా నమ్మే సంస్కృతిని మనం తయారుచేసుకున్నాం. ” నాలో ఆవేశం కట్టలు తెంచుకుంది.
“యత్ర నార్యంతు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః అని గొప్పగా చెప్పుకుంటాం. అంటే దానర్థం… స్త్రీని గుళ్ళో దేవతగానో, సతిగానో, మాతగానో పూజించమని కాదు. స్త్రీ పురుషుడికన్నా శారీరకంగా బలహీనురాలు. అయినా సృష్టిలో సగం. సృష్టిలో బలవంతులూ, బలహీనులు కూడా స్త్రీ పురుష వివక్షత లేకుండా సగం సగం గానే ఉంటారు. స్త్రీని గౌరవించే స్థాయికి మగవాడు ఎదిగితే… అలా ఎదగడంకోసం అతడో మెట్లు దిగగలిగితే తనకన్నా బలహీనుడికోసం కూడా ఆ పని చెయ్యగలుగుతాడు. ఎలాంటి న్యూనతగానీ అభద్రతాభావంగానీ లేకుండా వాళ్ళూ అతడిస్థాయికి ఎదుగుతారు. అదే సమసమాజమంటే…”
“నాన్నా!”
“ఔను మీరా! మనిషిని మనిషి కించపరచుకుంటూ బతుకుతున్నాం మనం. స్త్రీలుగా, పురుషులుగా, కులాలుగా, మతాలుగా, వున్నవాళ్సుగా, లేనివాళ్ళుగా విడిపోయిన సమాజం మనది. అందుకే నీ పెళ్ళి ఆలస్యమైమ్ది. అతను నీ విలువ గుర్తించి వచ్చాడు “
“…”
“మేం చాలా సంతోషంగా పెళ్ళి చేసుకున్నాం. నువ్వు పుట్టావు. సంతోషం రెట్టింపైంది. నీకు ఊహ తెలిసేదాకా మేం నీకోసం ఏర్పాటు చేసినవే, అలా ఇవ్వగలిగినవే నువ్వు సంతోషాలనుకున్నావు. ఆ తర్వాత సమాజం పెట్టిన ఇబ్బందులని మనం కలిసి పంచుకుకున్నాం. మీరా! ఇప్పటిదాకా మనం పంచుకున్నది బాధని మాత్రమే. నువ్వు పెళ్ళి చేసుకుంటే సంతోషాన్ని కూడా పంచుకోగలుగుతాం. అప్పుడే జీవితానికి సాఫల్యత”” అన్నాను.
నా మాటలు మీరామీద బాగా పనిచేశాయి. జ్ఞానదేవ్‍కి తనే ఫోన్ చేసి స్వయంగా డిన్నర్‍కి ఆహ్వానించింది. దగ్గరుండి అతడికి తనే పెట్టింది. ఆ తర్వాత ఇద్దరూ కలిసి సివిల్‍మేరేజ్‍కి తేదీ నిర్ణయించుకున్నారు
నాకో సత్యం… ఇన్నాళ్ళూ ఆచరిస్తూ వచ్చినదే అయినా ఇప్పుడర్థమైంది. కులం, మతం, ఆస్తి, అంతస్థు, కట్నకానుకలూ… ఇవన్నీ స్త్రీపురుషులు ఒకరికొకరు ఏమీ కానప్పుడు వాళ్ళ పెళ్ళిలో ముఖ్యపాత్ర వహిస్తాయి. ఒకకరినొకరు కావాలనుకున్నప్పుడు తమ అస్థిత్వాన్ని కోల్పోతాయి. నేను గ్రహించిన ఈ నిజాన్ని చెప్పడం కోసం మాలతిని ఇంట్లోకి తీసుకెళ్ళాను జ్ఞానదేవ్ తో మీరాకి ఏకాంతన్నొదిలి.

గతజలం, సేతుబంధనం-ప్రథమ ముద్రణ మయూఖలో

అప్పుడే ఇంట్లో పని ముగించుకుని పెరట్లోకి వచ్చి కూర్చుంది యశోద. ఆరోజు ఆదివారం కావటంతో అంతా ఇంట్లోనే వున్నారు. ఆవిడకి పెద్దగా వ్యాపకాలేవీ వుండవు. ఇంట్లో ఐదుగురు సభ్యులు. తను, కొడుకు, కోడలు, వాళ్ళ ఇద్దరు పిల్లలు. అందరూ బైటికి వెళ్ళే హడావిడి వుంటుంది. అందుకని పొద్దుటి వంట తనే చేస్తుంది. సాయంత్రం మాత్రం ఆఫీసునించీ ఇంటికొచ్చాక కోడలు రాధ చేసుకుంటుంది. అదేనా చెయ్యలేక కాదు. పూర్తిగా అలవాటైపోతుందని. అంతా వెళ్ళిపోయాక ఇల్లంతా అద్దంలా సర్దుతుంది. బాత్రూముల్లో నల్లాలతోసైతం మెరిసేలా కడుగుతుంది. అత్తాకోడళ్ళకి ఒకరిమిద ఒకరికి ఫిర్యాదులేమీ లేవు. అలాగని అరమరికల్లేని అనుబంధమూ లేదు.
“నానమ్మా! నువ్వు చదువుకోలేదా?” ప్రభ యశోదని అడిగింది. పధ్నాలుగేళ్ళుంటాయి ఆ పిల్లకి. అన్నీ తెలుసుకోవాలనే సహజమైన కుతూహలం.
నానమ్మ ఎప్పుడూ పనిచేస్తుంటుందని ఒకసారెప్పుడో అమ్మమ్మదగ్గర అంటే –
“ఆవిడ చదువుకోలేదులేవే. అందుకే అలా పుణుక్కుంటూ వుంటుంది. లేకపోతే టీవీ పెట్టుకుని ఆ పిచ్చి సీరియల్సన్నీ చూస్తుంది. టైంపాస్ కావాలిగా?” అంది. అప్పట్నుంచీ అసలు చదువుకోకపోవటమంటే ఏమిటో తెలుసుకోవాలని ఆపిల్లకి కోరిక. ఇప్పుడు అడిగేసింది.
“లేదమ్మా! ఆడపిల్లలంటే మా నాన్నకి ఇష్టం వుండేది కాదు. అందుకని నన్ను చదివించలేదు” ఆవిడ గొంతులో నిర్లిప్తత.
“అసలు స్కూలుకే వెళ్లలేదా?” ప్రభ గొంతులో ఆశ్చర్యం.
“ఐదో ఆరో చదివాక పెద్దపిల్లనయానని మానిపించేసారు”
“స్కూలు మానెయ్యమంటే బాధెయ్యలేదా? ఏడుపు రాలేదా?”
“ఆవిణ్ణి చదివించి వుంటే కలెక్టరో డాక్టరో అయేదేమో!” లోపల గదిలో కూర్చుని ఆ మాటలు విన్న రాధ భర్త సురేంద్రతో పరిహాసం‍గా అంది. అతనక్కడే కూర్చుని సెల్‍లో ఏదో చూస్తున్నాడు. భార్య మాట విన్నాడుగానీ జవాబు ఇవ్వలేదు. జీవితంలో జరిగిన పొరపాట్లు చాలా వున్నాయి. వాటిని తవ్వి చూసుకోవడం అతనికి నచ్చదు.
“నిన్నే , నానమ్మా! చదువుకోవద్దంటే నువ్వు ఏడ్చి గొడవ చెయ్యలేదా? మా నాన్న నేనడిగింది కాదంటే అసలే వూరుకోను తెలుసా?” ప్రభ మళ్ళీ అడిగింది.
పదేళ్ళమ్మాయిని స్కూలు మానెయ్యమనటమేంటో అసలలా ఎందుకు చేసారో అర్థం కాలేదు.
“మారోజుల్లో నాన్నకి ఎదురు చెప్పేవాళ్ళం కాదు. ఆయనకి భయపడేవాళ్ళం. ఎదురుపడి మాట్లాడ్డానికి కూడా భయమే.”
“ఎందుకలా?”
దానికి జవాబు లేదు యశోద దగ్గర. నిజమే. ఎందుకలా భయపడేవాళ్ళు ఆయన్ని చూసి తామంతా? ఏదైనా కావలిస్తే తల్లికి చెప్పేవారు. ఆవిడ చెప్పినా ఆయన వినటం, తమకి కావల్సింది దొరకటం వుండేది కాదు. అందులోనూ ఆడపిల్లలకి. తాము ముగ్గురు ఆడపిల్లలు, నలుగురు మగపిల్లలూ.
“చదువాపేసి మరో ఏడాదికల్లా పెళ్లి చేసి పంపించేసారు”
“అంత చిన్నప్పుడు పెళ్లా?!” అపనమ్మకంగా అడిగింది ప్రభ.
“ఔనే! అప్పుడు అలాగే చేసేవారు” అదే నిర్లిప్తత.
“పోనీ ఇప్పుడు చదివించండి. ఏ స్టాన్‍ఫర్డ్ యూనివర్సిటీలోనో తేలతారేమో ” అదే పరిహాసం రాధ గొంతులో. అది పూర్తిగా పరిహాసంకూడా కాదు. చదువుకోనివారిపట్ల వుండే చులకనభావం. సెల్ సోఫాలో పడేసి దిగ్గున తలతిప్పి భార్యకేసి చూసాడు సురేంద్ర.
“ఆవిడ చదువుకుని వుంటే ఏమయేదో నాకు తెలీదుగానీ, నేను సరిగా చదువుకుని వుంటే నా జీవితం మాత్రం ఇలా వుండేదికాదు” అన్నాడు కొంచెం ఆవేశంగా.
“ఇప్పుడు మీకేమైంది? బాగానే వున్నారుగా?” అడిగింది రాధ.
“నేను బీటెక్ పూర్తి చేసేసరికి నాన్న పోయారు”
“ఔనటగా? అత్తయ్య చెప్పారు”
“బోల్డన్ని బేక్‍లాగ్‍లు. ఫ్రెండ్స్, తిరుగుళ్ళు. డిగ్రీ అవలేదు”
“ఇంట్లో అడిగేవాళ్ళు కాదా?”
“ఎవరడుగుతారు? నాన్నకి పొద్దుగూకులు వుద్యోగం, ఓటీలు… ఎప్పుడు ఆఫీసుకి వెళ్లేవాడో ఎప్పుడు తిరిగొచ్చేవాడో తెలీదు. ఇక అమ్మ… చదువులేనిదని ఆమె మాట వినేవాడిని కాదు. ఇంట్లోకూడా చదువుకోలేదని ఆవిడకి ఎవరూ విలువిచ్చేవారు కాదు. అంటే వాళ్ళంతా పండితులని కాదు. ఒకళ్ళమీద ముద్ర పడుతుంది చూడు, ఇంక మళ్ళీ చెరుపుకోలేనట్టు. అలా. చిన్నప్పుడే పెళ్ళైంది. అత్తగారింటికి వచ్చింది. ఏమీ తెలిసేది కాదు. పుట్టింట్లోనే అన్నీ నేర్పి పంపించేంత వయసు లేదు. తప్పులు చేస్తూ సరిదిద్దుకుంటూ… ఆ ప్రాసెస్‍లో అలా అనిపించుకుంది”
“…”
“నాన్న సర్వీసులో వుండగా పోయారు. కంపాషనేట్ గ్రౌండ్స్‌లో వుద్యోగం ఇచ్చారు. అమ్మకి చదువు లేదు. అటెండరు పోస్ట్ ఇస్తామంటే తను వెళ్లలేదు. పెన్షనుమాత్రం తీసుకుంది. క్లరికల్ పోస్ట్‌లో నేను చేరాను. అదే పని. నాన్నలాగే ఇరుక్కుపోయాను. నాతో చదివినవాళ్ళంతా సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలోనూ, మార్కెటింగ్‍లోనూ చేస్తుంటే నేనిక్కడ ఇలా…” అతని గొంతులో బాధ వుంది.
ఇప్పుడున్న జీవితం బాగానే వుంది. నెల తిరిగేసరికి జీతం, ఏడాదికోసారి బోనస్. హైర్ అండ్ ఫైర్ లాంటి టెన్షన్సేం వుండవు. ఐనా ఎక్కడో అసంతృప్తి. తోటివారు తమకి భిన్నంగా బతుకుతుంటే, తన పరిధిలోకి ఆ అవకాశం రాకపోవటంవలన. అది గొప్పదా, కాదా అనికాదు దొరికిందా, లేదా అనేది ముఖ్యం.
“గవర్నమెంటు వుద్యోగం చెయ్యలేదని నా ఫ్రెండ్సెవర్లోనూ రిగ్రెట్స్ లేవు. వాళ్ళ వుద్యోగాలు వాళ్ళకి సంతృప్తిగానే వున్నాయి. పోతే ఇంకాస్త ఎక్కువ పేకేజి, ఫారిన్ అవకాశాలు… ఇవి వాళ్ళ సమస్యలు. అందుకే నేను వాళ్ళకంటే తక్కువగా వున్నానని అనుకుంటాను. వాళ్ళతో ఫ్రీగా కలవలేను” అన్నాడు.
రాధ మాట్లాడలేదు. చిన్న ఆలోచన.
ఇప్పటికీ ఆడపిల్లల చదువుకి మొదటి వ్యతిరేకత ఇంట్లోంచే వస్తుంది. ఇద్దరు పిల్లల్ని చదివించే స్తోమత లేకపోతే తండ్రి కూతుర్ని పోటీలోంచీ తప్పిస్తాడు. ఇద్దరూ ఆడపిల్లలైతే మీ పెళ్ళికోసం దాస్తున్నానంటాడు. ఇప్పుడు చాలావరకూ ఈ పరిస్థితులు మారాయి. ఐనా కూడా పోటీ అంటూ వస్తే అందరూ గెలిపించేది మగపిల్లవాడినే.
అత్తగారు చదువుకోకపోవటంవలన ఏమీ కోల్పోయి వుండదు. చదువుకోనిదని అందరూ అనుకోవటంవలన నష్టపోయింది. తనుకూడా తక్కువగానే చూస్తోందికద? తన తల్లితో పోల్చి ఇంకా తక్కువ చేస్తుంది. తనూ కొంచెం మారాలేమో!
“నానమ్మా! ఇప్పుడు చదువుకోవచ్చుగా, నువ్వు? వద్దనటానికి మీ నాన్న లేరు. మా తాతయ్య లేరు. నాన్నేమీ వద్దనడు” అడిగింది ప్రభ.
యశోద నవ్వింది. ” ఇప్పుడు చదువుకుని ఏం చెయ్యనే? చదువుకోవాలన్న తపన వున్న రోజులు గడిచిపోయాయి. చదువులేనిదాన్నని ముద్ర వేసి అవమానించిన రోజులూ గడిచిపోయాయి. చేతికి వచ్చిన వుద్యోగంలో చేరలేకపోయాను. ఇంక దేనికమ్మా, చదువు? ఈ వయసులో? మీ అమ్మకి ఒక పని సాయం చేస్తే అది సుఖపడుతుంది” అంది.
“మా అమ్మమ్మ పక్కని కూర్చుని నువ్వూ పేపరు చదవచ్చు”
“మీ అమ్మమ్మ పెట్టి పుట్టింది. అదృష్టవంతురాలు. మనసెరిగిన తండ్రికి పుట్టింది” అంది మనస్ఫూర్తిగా.
కోరిక వుంటే అది తీరలేదన్న బాధ వుంటుంది. తీరితే ఇంకాస్త పెద్దది పుట్టుకొస్తుంది. అదొక జీవచైతన్యం. అలాంటిది యశోదలో పెద్దగా లేదు. అందుకని బాధా లేదు.
“అమ్మ సంతృప్త జీవి. జరిగిపోయినవి మార్చలేం. జరిగేవాటిల్లో తప్పులు వుండకుండా చూసుకుందాం… నేను చేసినలాంటివి. నువ్వు అమ్మని ఎప్పుడూ చులకన చెయ్యకు. అలాంటి భావం కలిగినప్పుడు ఆవిడ ఆఖర్లో అన్న మాటలు గుర్తు తెచ్చుకో” అన్నాడు సురేంద్ర.
తలదించుకుంది రాధ. తాత చదివించాడుగాబట్టి తన తల్లి చదువుకోగలిగింది. చదివించనంటే ఆవిడా ఏమీ చెయ్యగలిగేది కాదేమో! అంత చిన్న వయసులో తండ్రిని ఎదిరించే తెలివి ఏ పిల్లలకుంటుంది? ఏ తల్లేనా వినని భర్తతో ఎంతకని పోరాడగలదు? ఎలాగో పిల్లల్ని వడ్డుని పడేసి తనూ గట్టెక్కాలనుకుంటుందిగానీ? ఆ వొడ్డూ, గట్టూ డొంకైనా సరే. కూతురు చిన్నగా మొదలుపెట్టిన సంభాషణ తనలో పేరుకుపోయిన మౌఢ్యాన్ని కరిగించింది. చదువంటే ఇదే కదూ? ఇలాంటి చదువు ఏ స్కూళ్ళలోనూ చెప్పరు.
లేచి వెళ్ళి అత్తగారిపక్కన కూర్చుంది, ఆవిడతో మాట కలుపుతూ.

తనువు, మనసు, ఆత్మ- ఆంధ్రభూమి వారపత్రిక

ముందురోజు పోస్టులో వచ్చిన శుభలేఖ ఆరాత్రంతా నిద్రలేకుండా చేసింది స్వర్ణకి. ఏ తెల్లవారో కొద్దిగా కునుకు పట్టే సమయానికి తల్లి దగ్గర్నుంచీ ఫోను.
“అమ్మమ్మకి సీరియస్‍గా ఉందటనే. ఆఖరి చూపులన్నట్టే చెప్పాడు పెద్దమామయ్య. మేమంతా క్వాలిస్ తీసుకుని బయల్దేరుతున్నాం. నువ్వూ మాతో రాగలవా? అలా వచ్చేస్తే ఇబ్బంది ఉండదు. ఒక్కదానివీ విడిగా ఎందుకు?” అంది.
ఆవిడ గొంతులో తల్లి పరిస్థితిపట్ల ఆందోళన ఉంది. స్వర్ణ ఒక్కర్తే విడిగా రావడంపట్ల విముఖత ఉంది. ఈ రెండింటినీ మించినది ఇంకేదో
కూడా ధ్వనిస్తోంది. అదేంటో స్వర్ణకి తెలుసు. తనని నిన్నట్నుంచీ కలవరపరిచినదే ఆవిడనీ కలవరపెడుతోంది.
“ఏంటంట, అమ్మమ్మకి?” తన ఫీలింగ్సు దాచుకుని అడిగింది. అమ్మమ్మకి సీరియస్‍గా ఉందంటే గుండె చిక్కబట్టినట్టుగా అయింది.
“ప్రత్యేకించి ఏముంటుందమ్మా? పెద్దతనం. ఎనభయ్యేళ్లు ఆవిడకి” చిన్నగా నిట్టూర్చింది స్వర్ణ తల్లి విశాలాక్షి. కొద్దిసేపు ఇద్దరిమధ్యా మౌనం.
“శుభలేఖ మీకూ వచ్చిందామ్మా?” ఆఖరికి అడిగింది స్వర్ణ.
“వచ్చింది. బాధనిపిస్తోంది. నీ పెళ్లి మూణ్ణాళ్లముచ్చటగా మిగిలిపోయినందుకు. విడాకులిచ్చి తొందరపడ్డావేమో, స్వర్ణా! అతనిదేముంది, మగవాడు. ఏడాదయ్యేసరికి మళ్లీ పెళ్లికొడుకయ్యాడు” అంది విశాలాక్షి బాధపడుతూ.
“నాకూ బాధగానే ఉందమ్మా! అతన్ని ద్వేషించి విడిపోలేదు నేను. భరించలేక విడిపోయాను. భరించలేనని కచ్చితంగా నిర్ధారించుకున్నాకే విడాకులిచ్చాను.”
మళ్లీ మాటలు ఆగాయి. మౌనానికి భాష ఉండదు. కానీ భావాలు మాత్రం వెల్లడవుతాయి. ఇద్దర్లోకీ ముందుగా తేరుకున్నది విశాలక్షే. “సరే! అయిందేదో అయింది. నువ్వు కోరుకున్నట్టే జరిగింది. బాధెందుకు? నీ ప్రయాణం మాటేమిటి? మాతో బయల్దేరతావా? ఆఫీసుకెళ్లి సెలవుపెట్టాక వస్తావా?” అనడిగింది.
“ఎన్నింటికి బయల్దేరుతున్నారు?”
“ఇంకో అరగంటకి”
“నేనూ మీతోటే వచ్చేస్తాను. లీవు మేనేజి చేసుకుంటాలే” జవాబిచ్చింది స్వర్ణ. విశాలాక్షి ఫోన్ పెట్టేసింది.
స్వర్ణకి వరంగల్లో ఉద్యోగం. రెండు నెలలైంది ప్రమోషన్‍మీద ఇక్కడికి వచ్చి. తల్లిదండ్రులుండేది ఖమ్మంలో. వాళ్ళక్కడినుంచీ బయల్దేరి రావటానికి ఎంత లేదన్నా రెండు గంటలు పడుతుంది. వచ్చేలోగా ఒక నిద్ర తీద్దామని మళ్ళీ పడుకుందిగానీ ఎంతో అలజడిగా వున్న మనసు సాధ్యపడనివ్వలేదు.
ఎన్నో జ్ఞాపకాలు మనసుని తట్టి తట్టి లేపుతున్నాయి. మంచం దిగి కారిడార్లోకి వచ్చి నిలబడింది. చుట్టూ చీకటి, మనసులో కూడా. ఏం చేస్తుంటాడు శశాంక ఈ సమయంలో? కొత్తభార్యగురించి కలలు కంటుంటాడా? ఉదయాన్నే నిద్ర లేపి శుభోదయాలని అందజేస్తుంటాడా? తల బలంగా విదిల్చింది. అతని జ్ఞాపకాలు తూనీగల్లా ఎగిరిపోయాయి కాసేపు.
అమ్మమ్మ గుర్తొచ్చింది. ఎనభయ్యేళ్ల వృద్దురాలు. ఎనిమిదేళ్లకి పెళ్లై, పర్నాలుగేళ్లకి అత్తవారింటికి వచ్చిందట. అప్పట్నుంచీ అరవయ్యైదేళ్ల పైబడి సహచర్యం. తాతయ్యతో. ఎనిమిదిమంది పిల్లలు. మనవలు, మునిమనవలు, పల్లెటూళ్లో పదెకరాల వ్యవసాయం. పెద్దగా ఆస్తిపాస్తులు లేకపోయినా సంతృప్తికరమైన జీవితం. కొన్ని అపశృతులు ఉండి ఉండవచ్చు. ఆవిడా కన్నీళ్లు పెట్టి ఉండచ్చు.
సరు పిన్ని ఆవిడ సంతానంలో ఆఖరిది. ఎంతో ఘనంగా పెళ్లి చేశారు. అతనికి తండ్రి లేడు. తల్లిది పెత్తనం. పిన్నిని బాగానే చూసుకునేవారు. కోరిన నగ, చీర.. ఏదడిగితే అది కొనిపెట్టారు. రెండేళ్లు గడిచాయి. అతను ఉన్నట్టుండి ఊళ్లోంచీ పారిపోయాడు. అప్పటికింకా పిల్లలు లేరు. పిన్ని ఏడుస్తూ పుట్టింటికొచ్చింది. తాతయ్యా, మామయ్యలూ అతన్ని వెతికించితే రాజమండ్రిలో దొరికాడు. వెళ్లి వెంట పెట్టుకుని వచ్చారు. ఊర్నిండా అప్పులట. తలకి మించి ఉన్నాయి. భయపడి పారిపోయాడు.
“చీరలనీ నగలనీ మగవాళ్లని వేధించకూడదు. తాహతుకి మించి ఖర్చుపెడితే ఫలితం చూశావా?” అని పిన్నిని కోప్పడి, అతనికి ధైర్యం చెప్పి వాళ్ల ఊరు వెళ్లి బంగారం, వెండీ అమ్మి కొన్ని చిన్నచిన్న అప్పులు తీర్చి, కొన్నిటికి తను హామీ ఉండి, ఇంకొన్నిటిని తనమీదికి బదలాయించుకున్నాడు తాతయ్య. పెళ్లైన పిల్లకి మళ్లీ యిదంతా చెయ్యటమేమిటని ఎవరూ అనలేదు. వాళ్ల కుటుంబాన్ని నిలబెట్టడమే ధ్యేయంగా అందరూ కృషి చేశారు.
“మీ అమ్మాయినే ఇల్లు చక్కబెట్టుకొమ్మనండి. మీరు వెనక ఉండి సలహాలివ్వండి” అని తీర్థయాత్రలకి వెళ్లిపోయింది సరు పిన్ని అత్తగారు.
ఈరోజుని సరుపిన్నికి ముగ్గురు కొడుకులు. వాళ్ళలో ఇద్దరికి ఉద్యోగాలు కూడా. ఆరోజుని వాళ్లు కలుసుకునే దిశగా కృషి జరగకుండా ఉండి వుంటే ఈరోజుని ఆ కుటుంబం ఉండేది కాదు. తన కుటుంబంలో సరుపిన్ని నవ్వులూ ఆమె భర్త చమత్కారాలు ఉండేవి కాదు.
అమ్మమ్మ ఇల్లెప్పుడూ సందడిగా ఉండేది. ఆవిడ పిల్లలూ మనవలూ మనవరాళ్లే కాక అక్కచెల్లెళ్లూ వాళ్ల పిల్లలూ వచ్చేవారు. అసలు అన్ని సంవత్సరాలు ఇద్దరు అపరిచితవ్యక్తులు కలిసి ఉండటం… ఇంత ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సృష్టించడం చిత్రమనిపిస్తుంది స్వర్ణకి. ఇదివరకూ అమ్మమ్మా తాతయ్యా వేరువేరనిపించేవారు కాదు. తన పెళ్లి విఫలమయ్యాకే ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి. తల్లిదండ్రులనీ, మిగిలిన బంధువుల జంటల్నీ అదే విశ్లేషణతో చూస్తోంది. వాళ్లంతా కలిసి ఉండగలిగినప్పుడు తనెందుకు అతన్ని భరించలేకపోయింది? తన వైఫల్యమా?
తాతయ్యలో, తన తండ్రిలో ఇంకా మిగిలిన మగవాళ్లందర్లో ఏవో ఒక లోపాలు లేకుండా లేవు. కనీసం పురుషహంకారం. తాతయ్య ముందుగది దాటి రాడు. చుట్టలు తాగుతాడు. తండ్రి వంటింట్లోకి వెళ్లి మంచినీళ్ళు తెచ్చుకోడం తనెప్పుడూ చూడలేదు. ఐనా అమ్మమ్మ, తన తల్లి వాళ్లతో సంతృప్తిగానే ఉన్నారు. ఎక్కడ జరిగింది. తన విషయంలో లోపం? పునశ్చరణ మొదలైంది. కొద్దిసేపటి క్రితం ఎగిరిపోయిన తూనీగల గుంపు మళ్లీ వచ్చి వాలింది.
తన పెళ్లి….
శశాంక, తనూ ఒకే ఆఫీసులో చేసేవారు. మొదట పరిచయమైంది. తర్వాత పరిభ్రమణాలు మొదలయ్యాయి. అతను తన చుట్టూ తిరిగేవాడు. తన కడగంటి చూపుకోసం, కొనగోటి స్పర్శకోసం తపించిపోయేవాడు. తనూ అలాగే అతనితో మాట్లాడాలని ఆరాటపడేది. దాన్నే ప్రేమనుకున్నారు ఇద్దరూ. ఆ భావన ఇద్దర్నీ కలిపే వారధి అయింది. తర్వాతి ప్రకరణం పెళ్లి. పెద్దవాళ్ల వప్పుదలతోనే జరిగింది.
వంటరికాపురం. పగలూ రాత్రి అతనికి తన ధ్యాసే. ఆఫీసులోనూ అతనే. ఇంట్లోనూ అతనే.
“స్వర్ణా! ఈ డ్రాఫ్టెలా ఉందో ఒకసారి చదివి కరెక్షన్సుంటే చేసి మా సెక్షన్‍కి పంపు… ఆ ఫైల్ నువ్వు డీల్ చేస్తున్నావా?… హాట్‍పాక్ ఓపెన్ చెయ్యి… లంచ్ చేద్దాం … రాత్రికి కర్రీ ఏంటి? వచ్చే ముందు పాలు ఫ్రిజ్‍లో పెట్టావా?” ఎక్కడా అతని గొంతే.
తనని ఒక పంజరంలో బంధించేశాడు. ఒక నట్‍షెల్‍లా తనని చుట్టేశాడు. అతనికి స్నేహితుల్లేరు. తల్లిదండ్రులకి ఒక్కడే. వాళ్లు రూర్కెలాలో ఉంటారు. మామగారికి అక్కడ ఉద్యోగం. శశాంక అతని ప్రపంచాన్ని తన చుట్టే నిర్మించుకున్నాడు. ఆ పరిధిని విస్తరించుకోటానికి ప్రయత్నించలేదు.
కానీ తనకి?
తల్లిదండ్రులు.. అక్కాబావలు.. స్నేహితులు.. పెద్ద బంధుబలగం.. సహోద్యోగులు.. పుట్టి పెరిగిన ఊరిది. మొత్తం చదువు, ఉద్యోగం అన్నీ ఇక్కడే. తన కజిన్స్ వచ్చి వెళ్తుండేవారు.
“అన్నయ్య” అని తను పరిచయం చేస్తే-
“పెద్దమ్మ కొడుకు” అని దూరాన్ని నిర్దేశించేవాడు.
తనపట్ల పొసెసినెస్‍తో సతమతమయ్యేవాడు. తనని హోల్డ్ చెయ్యటానికి.. అన్నట్టు ప్రయత్నాలు చేసేవాడు. అతనికదంతా ప్రేమలా ఉండేది. ఒకటిరెండు సంఘటనలు చాలు, అతని ఆలోచనలని పట్టివ్వడానికి. సంక్రాంతికి పిల్లలందరినీ పిలిచి వేడుకచేస్తుంది అమ్మమ్మ. కనీసం అరవై డేబ్భ్హైమందేనా చేరతారు. మనిషి సంతోషంకోసం ఎన్నెన్నో మార్గాలు వెతుకుతాడు. కళ్ళముందు వున్న సులువైన దారిలోకిమాత్రమ్ వెళ్ళడు. కుటుంబం, ప్రేమలు అలాంటి సులువైన దారి.
మొదటేడు సంక్రాంతికి తమని తీసుకెళ్ళడానికి పెద్దమేనమామ వచ్చాడు.
“పండగకి వాళ్ళెవరింటికో వెళ్ళటమేమిటి? వెళ్తే మీఅమ్మావాళ్ళింటికి వెళ్ళాలి, లేకపోతే మనింట్లో జరుపుకోవాలి. ఐనా మీ తాత యింటికి రమ్మని పిలవటానికి ఇంకెవరో రావటమేమిటి? నేను రాను” నిర్ద్వంద్వంగా తిరస్కరించాడు.
“వాళ్ళెవరో పైవాళ్ళు కాదు. అమ్మమ్మ, తాతయ్యలు. మా కుటుంబానికి ఆద్యులు. వాళ్ళు కన్న పిల్లలందరినీ ఒక్కచోట, ఒకేసారి చూసుకోవాలనే కోరికతో సంక్రాంతి అక్కడ జరిపిస్తారు. మనమూ ఆ ప్రవాహంతో సాగే కెరటాలమే. ప్రవాహం లేని కెరటం వుండదు. మీకక్కడ ఎలాంటి అమర్యాదా జరగదు” అని ఎన్ని విధాల చెప్పినా అతను వినలేదు. తమకోసం తల్లీవాళ్ళూ, వాళ్ళు వెళ్ళలేదని అక్కావాళ్ళూ ఆగిపోయారు. అందరికీ మనస్తాపమే మిగిలింది.
అతను బయటపడటం మొదలైంది.
“నీకోసం నేనింత తపించిపోతుంటే నీకు నన్నొదిలిపెట్టి ఇంకెవరితోనో మాట్లాడాలని ఎలా అనిపిస్తుంది?” అని అడిగేవాడు.
అతని తపన.. తనని ఉక్కిరిబిక్కిరి చేసేది. ఊపిరాడనట్టు ఉండేది. తల్లితో, అక్కతో…ఎవర్తో మాట్లాడటానికీ ఏకాంతం ఉండేది కాదు.
ప్రతి బంధాన్నీ తుంచివేయటానికి ప్రయత్నించేవాడు. అంతటా అతనే చొచ్చుకు రావటానికి ప్రయత్నించేవాడు.
“ఏముంటాయి మీకంత కబుర్లు?’ అనేవాడు.
భార్యాభర్తలకి మాత్రం ఏముంటాయి, రోజుకి ఇరవై నాలుగ్గంటలు, సంవత్సరానికి మూడు వందల అరవయ్యైదు రోజులు? తనలో విముఖత మొదలైంది. స్పేస్‍కోసం పోరాటం చేసేది. వాళ్లంతా అతనికన్నా ముఖ్యులని కాదు, కానీ తన జీవితంలో ఒక భాగమని తెలియజెప్పే ప్రయత్నం మొదలైంది. సంఘజీవనం అంటారు. బంధుబలగాన్నీ మించిన సంఘం ఇంకేం వుంటుంది?
భార్యా, భర్తా ఏక వ్యక్తి కారు. ఎవరి వ్యక్తిగత పరిచయాలూ, స్పందనలూ వారికే ఉంటాయి. పెళ్లి వుమ్మడి ఆసక్తి. కలిసి ఉండటంకోసం రాజీ, సర్దుబాటూ తప్పనిసరి. ప్రేమ ఉన్నచోట ఇద్దరి ఆంతరంగిక ప్రపంచం కొంతవరకూ ఏకీకృతమవుతుంది. అర్థనారీశ్వరత్వంలో కూడా శివపార్వతులు సగమే కలుస్తారు. మిగిలిన సగాలవైపు వారి వారి ప్రపంచాలుంటాయి. ఇది భౌతిక దృష్టి.
అతనితో సున్నితంగా చెప్పింది. “పెళ్లవ్వడంతో నేను పూర్తిగా భిన్నమైన వ్యక్తిగా మారిపోలేదు. నా పరిచయాలు నాకలాగే ఉంటాయి. వాళ్లతో నాకు అనుబంధాలు కూడా ఏర్పడ్డాయి. వాటిని బలవంతంగా తుంచలేను. ఆ అవసరం లేదు. కాలక్రమాన బలహీనపడాలి” అని.
అతనిది ఒకటే జవాబు, “అవన్నీ పెళ్లికి ముందు. పెళ్లయ్యాక నీకు నేనూ, నాకు నువ్వూ. మన మధ్య ఇంకెవరూ ఉండకూడదు. అంతే” అందులో ఎలాంటి ఫ్లెగ్జిబులిటీ లేదు. రాజీ లేదు. దాన్నతను తలమునకలయ్యే ప్రేమ అంటాడు. గాలికూడా చొరబడకూడనంత గాఢమైన ప్రేమ ఉండాలి మన మధ్య అంటాడు.
అతని ప్రేమ నిజమైనదే కావచ్చు. కానీ భౌతికమైనది. ఏకపక్షమైనది. పెళ్లయిన మొదటేడు నోటితో చెప్పుకోవటందాకా వచ్చిన విముఖత అలిగి పోట్లాడుకునేదాకా వెళ్లింది. పెద్దవాళ్లు కలగజేసుకుని సర్దిచెప్పేవాళ్లు. బంధువుల్లో అందరికీ తెలిసిపోయింది. తనతో ఆడిపాడినవాళ్లంతా దూరమయ్యారు. క్రమంగా తనింటికి ఎవరూ రావటం మానేశారు. ఫోన్లు ఆగిపోయాయి. ఆహ్వానాలు తగ్గిపోయాయి. బాధాకరమైన పరిస్థితి.
“పోన్లేమ్మా! కొంతమందివి ఒంటెత్తు పోకడలు. అతనికి నచ్చినట్టే ఉండు. మేం మీ ఇంటికి రాకపోతే నష్టమేమిటి? నువ్వూ అతనూ సంతోషంగా ఉంటే అదే చాలు” అనే సర్దుబాటు. అది సంతోషమేనా?
అతని ప్రేమ మరింత నిర్దుష్టమైన రూపం ప్రదర్శించసాగింది. “నువ్వు నా స్వంతం.. నాకే స్వంతం..” అనే స్పష్టమైన భావప్రకటన.
“అతన్తో ఎందుకు మాట్లాడావు? పరాయివావాడితో మాట్లాడటానికి ఏం విషయాలుంటాయి? నేనొద్దన్నా నీకీ పరిచయాలేమిటి?” అనే ప్రశ్నలు. ఆ ‘అతను’ ఎవరో కాదు, ఎల్‍కేజీనుంచీ డిగ్రీదాకా తనతో కలిసి చదివినతను. ఉద్యోగం వచ్చిందని చెప్పి కలిసి వెళ్లటానికి వచ్చాడు. శశాంకది అసూయా? అనుమానమా?
“ఇంత పెద్దకుటుంబంలోంచి వచ్చిన నన్ను ఎందుకు చేసుకున్నావు శశీ? ఇక్కడే పుట్టి పెరిగినదాన్ని. తెల్లారి లేస్తే ఎంతోమంది పరిచయస్తులు. వాళ్ళని ఎరగనట్టు మొహం తిప్పుకుని ఎలా వెళ్ళగలను?” విసుగ్గా అడిగింది.
” పెద్దకుటుంబంలోంచీ వచ్చిన అమ్మాయైతే మంచీచెడూ తెలిసి వుంటుందని భ్రమపడ్డాను” అతకని అతని జవాబు.
“అదేమైనా యూనివర్సిటీ డిగ్రీనా, చదివి బైటికి వచ్చి మళ్ళీ పుట్టింటిమొహం చూడకుండా వుండటానికి?”
అతను మాట్లాడలేదు.
అత్తగారూ అంది,” పుట్టిన దగ్గర్నుంచీ అ పల్లెటూరు దాటి ఎక్కడికీ వెళ్ళలేదేమో, నీకు ప్రపంచం తెలీదు. నార్త్‌లో ఒకసారి పెళ్ళైందంటే ఆడపిల్లని జన్మలో మళ్ళీ పుట్టింటికే పంపరు. చావైనా బతుకైనా అత్తింట్లోనే”
ఏం మాట్లాడాలో తనకి తెలీలేదు.
జీవితాన్ని అందంగానూ అర్థవంతంగానూ మలుచుకున్నా అసహ్యంగానూ కంగాళీగానూ చేసుకున్నా అంతా మన చేతుల్లోనే ఉంది. ఆడవాళ్లతో మాట్లాడినా తప్పే. మగవాళ్లతో మాట్లాడినా తప్పే. అసూయతో రగిలిపోయేవాడు. అప్పటికీ అతనివరకూ అతనిది ప్రేమే. తనే అర్థం చేసుకోవటం లేదని అభియోగం.
క్రమంగా తామిద్దరూ కలిసి ఉండగలిగే పరిస్థితులు తప్పిపోవటం మొదలైంది. రోజంతా ఇద్దరే… ఇంటా బైటాకూడా. ఆఫీసుకి తనే తీసుకెళ్తాడు. అక్కడి నుంచీ తనే తీసుకొస్తాడు. చీరల షాపింగూ అతనితోనే టైలరు దగ్గరకి వెళ్లాలన్నా అతనితోనే. కంగన్‍హాలుకీ అతనే
కంపెనీ. అన్నిటిమీదా ఆసక్తి తగ్గిపోయింది. ఎలాంటి వైవిధ్యం లేదు. జీవితం రసహీనంగా తయారైంది. తనకి అతనంటే విముఖత ఇంకా పెరిగిపోయింది. దాన్నతను గుర్తించే ప్రయత్నం చేయలేదు. వికర్షించుకోవటం మొదలైంది. అతనికి తనలోని లోపాలు తనకీ తనలోని లోపాలు అతనికీ భూతద్దంలో పెట్టినట్టు కనబడసాగాయి.
ఇతన్నా నేను ప్రేమించినది? అనే విస్మయం తనలో.
ఏం చూసి ఈమెని ప్రేమించాను? ప్రేమని అర్థం చేసుకునే లక్షణం లేనే లేదే? అనే పశ్చాత్తాపం అతన్లో.
ఆ తర్వాత ఎక్కువకాలం కలిసి ఉండలేకపోయారు. పెద్దవాళ్ల జోక్యం అతనికి నచ్చలేదు. ఫామిలీ కోర్టులో కౌన్సిలింగ్ చేశారు. అయినా ప్రయోజనం లేకపోయింది. అతను చాలా పట్టుదలగా ఉన్నాడు. తను తగ్గడం అంటే తనలోని జీవాన్నీ స్పందనలనీ వదులుకోవటమే. అలాంటి జీవితం జీవితమేనా? ఎందుకు? ప్రయోజనం ఏమిటి? అనేవి ప్రశ్నలు.
విడిపోయారు.
పంజరంలో బైటపడ్డట్టనిపించింది తనకి. స్వేచ్ఛావాయువుల్ని పీల్చుకుంది. కొందరు తొందరపడ్డావన్నారు. ఇంకొందరు సర్దుకుపోవల్సిందన్నారు. ఇలాంటివాటికి విడిపోతారా అని ఆశ్చర్యాన్ని వ్యక్తపరిచారు. మూడేళ్ల వైవాహికబంధం తర్వాత ఇప్పటికిలా వంటరిగా మిగిలింది తను. కానీ ఇప్పటికీ సందేహమే, జరిగినదాంట్లో తన తప్పు ఎంతని.
“తయారయ్యావా?” మళ్లీ ఫోను. తల్లి దగ్గర్నుంచీ. ఆలోచనలు కట్టిపెట్టి తనవో రెండు జతలు బేగులో పెట్టుకుంది. లీవు లెటరు రాసి, పక్క
ఫ్లాటులో వాళ్ల అబ్బాయికిచ్చి, తన ఆఫీసులో ఇమ్మని రిక్వెస్టు చేసింది. ఫ్రిజ్‍లో పాలుంటే టీ చేసుకుని తాగింది. అపార్టుమెంటు ముందు క్వాలిస్ ఆగే టైముకి తయారై గేటు దగ్గర నిలబడింది. తల్లి, తండ్రి, అక్కా ఆమె ఇద్దరు పిల్లలు, పెద్దమ్మ పెద్దనాన్న వాళ్ల కొడుకు, కోడలు,
ఇంకో పెద్దమ్మ కూతురు భాను.. ఇంతమంది కలిసి బయల్దేరారు. స్వర్ణ ఎక్కుతుంటే అన్నయ్య చెయ్యి అందించాడు. అతని స్పర్శలో వాత్సల్యం, ఓదార్పు ఉన్నాయి. లోపలికి జరిగి పక్కని చోటిచ్చాడు. అతన్ని లేవమని భాను వచ్చి ఆ జాగాలో కూర్చుంది. ఇద్దరూ ఒకరి చేతులు మరొకరు పట్టుకున్నారు. ఒక ఆర్తి. ఒక తపన. కళ్ళలో నీళ్ళు రావు. గుండెల్లో తడి. పుట్టినప్పట్నుంచీ స్నేహితులు తాము. రోజుల తేడా.
భాను భర్త ఆర్మీలో ఆఫీసరు. ఒక పెళ్లిలో చూసి ఇష్టపడి చేసుకున్నాడు. కార్గిల్ వార్‍లో అమర సైనికుడయ్యాడు. అప్పటికి వాళ్లకొక బాబు. మళ్లీ పెళ్లి చేసుకొమ్మని ఎవరెంత చెప్పినా వినలేదు బాబుని పెట్టుకుని గడిపేస్తోంది.
“నా మనసు నిండా అతనే ఉన్నాడు. అతను చనిపోయాడన్న విషయం నేను ఇప్పటికీ నమ్మలేను. అతని జ్ఞాపకాలు చాలు నాకు” అనేస్తుంది.
“ముఖం అలా ఉందేమే? రాత్రంతా నిద్రపోలేదా?” అడిగింది స్వర్ణ తల్లి. స్వర్ణ జవాబివ్వలేదు.
క్రమంగా వాళ్ల సంభాషణ ఆఖరి క్షణాల్లో ఉన్న వృద్ధురాలి మీదికి మళ్లింది. ఎన్నో జ్ఞాపకాలు.. ఆవిడ్ని అనుసంధానించుకుని. అందర్లోనూ దుఃఖం ఉందిగానీ అది బహిర్గతమవ్వటం లేదు. అదొక సహజ పరిణామంలా తీసుకున్నారు. తొందరగా వెళ్తే ఆఖరి చూపులేనా దక్కుతాయనే ఆరాటం.


క్వాలిస్ వెంకటాపురం చేరి తిన్నగా ఇంటిముందు ఆగింది. ఇంటిముందు ఊళ్లోవాళ్లు చాలామంది ఉన్నారు. అందరి ముఖాల్లోనూ విషాదం. పక్కకి జరిగి స్వర్ణావాళ్లకి దోవ ఇచ్చారు. వరండాలో చాపమీద పడుకోబెట్టి వుంది రామమ్మగారి పార్థివశరీరం. ఒకమూలకి నిర్వికారంగా కూర్చున్నాడు. ఆవిడ భర్త. అల్లుళ్లంతా ఆయన్ని పలకరించి పక్కన కూర్చున్నారు.
ఇద్దరు మేనమామలు తప్ప మిగిలినవాళ్లంతా చుట్టుపక్కల ఊళ్లనించీ రావాలి. విశాలాక్షిదీ ఆమె అక్కదీ అందర్లోకీ దూరం. అప్పటికే మిగిలినవాళ్లంతా వచ్చేసి ఉన్నారు. వీళ్ళు రావటానికి కొద్దిసేపటి ముందే వాళ్ళూ వచ్చారు. వీళ్లని చూసి అంతా ఒక్కసారి గొల్లుమన్నారు. అప్పటిదాకా అంతర్గతంగా ఉన్న దుఃఖం వీళ్లలోనూ పెల్లుబికి బైటికొచ్చేసింది. కొద్దిసేపు ఏడ్పులతో ఇల్లంతా మార్మోగిపోయింది. తర్వాత నెమ్మదిగా చల్లబడ్డారు.
కొత్తగా ఎవరేనా వచ్చినప్పుడల్లా ఈ ప్రకరణం పునరావృతమవుతునే ఉంది. అది ఒక్కసారితో ఆరిపోయే జ్వాల కాదు. కన్నతల్లిని.. కుటుంబానికి ఆలంబనగా దశాబ్దాలపాటు నిలిచిన వ్యక్తిని పోగొట్టుకోవటమంటే జీవధారలో కొంత పోగొట్టుకోవటమే. అది ఆజీవనపర్యంతం వెంటాడే విషాదం. ఆ కుటుంబంలోని రెండు తరాల పిల్లల్ని ఆవిడ ఎత్తి పెంచింది. వాళ్లకి అనారోగ్యాలొస్తే చేసింది. వేడుకలు జరిపింది. కానుకలిచ్చింది. పసిప్రాయపు కోరికలని తీర్చింది. ఆవిడ లేకపోవటం అందరికీ వెలితే.
ఎప్పుడు పోయిందీ, ఎలా పోయిందనే వాటికి జవాబు చెప్తున్నాడు పెద్ద మేనమామ. తెల్లవారి నిద్రలో పెద్ద కేక పెట్టిందట. డాక్టర్ని పిల్చుకొచ్చేలోపే ప్రాణం పోయిందట. చెప్తుంటే ఆయన కళ్లల్లో నీళ్లు తిరిగాయి.
అంతిమయాత్రకి ఏర్పాట్లు పూర్తయ్యాయి. తీర్థప్రజలా వెళ్లారు పాడె వెంట జనం. సూర్యాస్తమయమైంది అంతా పూర్తిచేసుకుని, ఏదో కోల్పోయినట్లు తిరిగొచ్చారు.
వస్తూనే రెండు చెంబుల నీళ్లు పోసుకుని పొడి పంచ కట్టుకు తన గదిలోకి వెళ్లి ముసుగుపెట్టి పడుకున్నాడు రామమ్మగారి భర్త. ఒక దిగ్భ్రాంతి ఆయన్ని ఆవహించింది. ఎప్పుడో జ్ఞానం తెలీని వయసులో పెళ్లి చేసుకుని, తనతో అంత సుదీర్ఘ కాలం కలిసున్న వ్యక్తి వెళ్తున్నానని ముందుగా చెప్పకుండా తన దారిన తను ఈ వెళ్లిపోవటమేమిటో అర్థమవ్వలేదు. ఆమె వెళ్లిపోయాక మిగిలి ఉన్న తనేమిటి? తన గమ్యం ఏమిటి? అనేక ప్రశ్నలు చుట్టుముట్టాయి. ఎక్కడికి వెళ్లింది ఆవిడ? ఆమెని వెతుక్కుంటూ వెళ్లిపోవాలన్న తపన మొదలైంది.
కర్మ పూర్తై బరువెక్కిన హృదయాలతో ఎక్కడివారక్కడికి వెళ్లిపోయారు. పుట్టింటి రుణం తీరిపోయిందన్న భావన విశాలాక్షికీ అమ్మమ్మగారిల్లు… అనే లిజెండ్ కరిగిపోయిందనే ఆవేదన స్వర్ణకీ కలిగాయి.


శశాంకకి మేరేజి గ్రీటింగ్స్ పంపింది స్వర్ణ. ఎంత పట్టనట్టు ఉందామనుకున్నా ఎక్కడో బాధ ముల్లులా కలుక్కుమంటూనే ఉంది. కళ్లల్లో నీటిసుడి తిరుగుతూనే ఉంది. తను తప్పు చేసిందా? ఎక్కడ తప్పు చేసింది? ఎంతలో పుట్టి ఎంతలో కరిగిపోయింది తమ ప్రేమ? నిరంతరం అదే చింతన.
“జరిగిపోయినవాటి గురించి బాధెందుకు? ఒక్కదానివీ ఉంటే ఇలాగే బాధపడుతుంటావు, ట్రాన్స్‌ఫర్ చేయించుకుని ఇక్కడికి వచ్చెయ్” అంది విశాలాక్షి.
“కనీసం ఇంకో ఆరునెలలు చెయ్యాలట ఇక్కడ” జవాబిచ్చింది స్వర్ణ. అంటే ఇంకో వందా ఎనభై వంటరి రోజులు…


రామమ్మగారు పోయిన నెలరోజులకే పోయాడు ఆవిడ భర్త. ఇది ఆ కుటుంబానికి పెద్ద షాక్. అందరూ మళ్లీ వెళ్లారు.
“ఆవిడ పోయాక మామయ్యగారు బాగా బెంగపెట్టేసుకున్నారు. ఇల్లు దాటి ఇవతలికి వెళ్లడం మానేశారు. వీధి వరండాలో పడక్కుర్చీలోనే రోజంతా. నాలుగుసార్లు పిలిచి చెప్తేగానీ కాఫీకూడా తాగేవారు కాదు. ఇంక భోజనం దగ్గర.. పిలవగా పిలవగా ఎప్పటికో వచ్చేవారు. కంచం ముందు కూర్చుని ఒకటో రెండో ముద్దలు నోట్లో పెట్టుకుని కంచం పక్కకి జరిపేసేవారు. ఏదైనా మాట్లాడదామన్నా ధైర్యం చెప్పాలన్నా మన లోకంలో ఉంటేగా?” అంది విశాలాక్షి పెద్ద వదినగారు. స్వర్ణ గుండెల్లో ఎక్కడో వాడిగా గుచ్చుకున్నాయి ఆ మాటలు.
“వాళ్లిద్దరి మధ్యా అంత ప్రేమ ఎక్కడిదమ్మా?” తిరిగొచ్చాక అడిగింది స్వర్ణ తల్లిని.
“ప్రేమేమిటి ప్రేమ?” ఛర్రుమంది విశాలాక్షి. కూతురి పెళ్లి విఫలమయ్యాక ఆవిడకి ఆ మాటంటేనే నచ్చడం లేదు. “హిందూధర్మం ప్రకారం ఆత్మలని కలుపుకున్నారు వాళ్లు. పెళ్లంటే జన్మజన్మల బంధమని నమ్మారు. పెళ్లి చేసుకున్నందుకు కలిసున్నారు. కలిసున్నందుకు మమకారాలు పెంచుకున్నారు. అదంటా జీవనప్రక్రియ. ఒకరు వెలుగు, ఇంకొకరు నీడ. ఎవరు వెలుగు, ఎవరు నీడ అనేది అప్రస్తుతం. ఒకరు లేనిదే ఇంకొకరు లేరు” అంది.
స్వర్ణ మాట్లాడలేదు. ఇంకా ఆలోచనే.
“ఎదురెదురుగా కూర్చుని ఒకళ్ల కళ్లలోకి ఇంకొకరు చూసుకుంటూ నేను నిన్ను ప్రేమిస్తున్నా అని ఊసులు చెప్పుకోవటానికి వాళ్లకి తీరిక లేదు. మా అమ్మ చుట్టూ ఎప్పుడూ గంపెడుమంది పిల్లలు. మనవలు, మనవరాళ్లు. నాన్నకి బోలెడన్ని వ్యవహారాలు, వచ్చే మనుషులు, వెళ్ళే మనుషులు. అమ్మ ఉండే వంటింటికీ నాన్న ఉండే వీధివాకిలికి మధ్య అనంతమైన సంసార సాగరం. అందుబాటులో లేనిది ఆకర్షణ”
“…”
“స్వర్ణా! పెళ్లంటే ఇల్లంటే భార్యాభర్తలు ఏకాంతంగా గడిపే పడకగదితో పాటు సంఘజీవనాన్ని సూచించే వీధిగది కూడా ఉండాలని తెలియకనే ఇప్పటి పిల్లల పెళ్లిళ్లు ఇంత తొందరగా బ్రేకవుతున్నాయి. ఏం ఉంటాయి, ఇరవైనాలుగ్గంటలూ మాట్లాడుకోవటానికి యిద్దరు మనుషులమధ్య ? వైవిధ్యం లేని జీవితం ఎంతటి ప్రేమనీ చంపేస్తుంది. మనంనుంచీ “మవ్వు – నేనులోకి కుదించుకుపోయిన తర్వాత నేనుగా”’ మిగిలిపోవటానికి ఎంతో కాలం పట్టదు. మేం ఎప్పుడూ బోర్ కొట్టి ఎరగం. చేతినిండా మాకు వ్యాపకాలుంటాయి. మరిప్పుడు? పుట్టిన పిల్ల దగ్గర్నుంచి అందరికీ బోరే. మీకు వ్యాపకమంటే డబ్బు సంపాదించిపెట్టేది మాత్రమే. మరి మాకు? చుట్టరికాలు, చుట్టూ వుండే మనుషులు” అంది విశాలాక్షి తనే మళ్లీ
స్వర్ణకి అర్థమైంది. శశాంక తను అతని కళ్ళెదురుగా వుండాలని మాత్రమే కోరుకున్నాడు. రోజుకి ఇరవై నాలుగ్గంటలూ ‘నేను నువ్వు’ అంటూ మూడేళ్లపాటు విసిగించేశాడు. ఎవరికి వారు అనుకునే స్థితికి తొందరగానే వచ్చేశారు. తామిద్దరూ ఒకరికొకరు సరిపడరు. అతనిలాగ చిన్నకుటుంబంలోంచి వచ్చిన అమ్మాయైతే అతనితో ఎడ్జస్టయ్యేది. నలుగురి మధ్య పెరిగిన వ్యక్తయితే అతనికి అనుబంధాలు తెలిసేవి. తనమీద ఆంక్షలు పెట్టకుండానూ అలాగని ఈ బంధుత్వాలపట్ల ఆసక్తి కనబరచకుండానూ ఉండి తనకి కొంత టైమిచ్చినా కొంత ఈక్విలిబ్రియం వచ్చేది. ఈ ట్రాన్స్ఫర్ అప్పుడూ వచ్చి ఉండేది. కాలక్రమాన ఈ బంధాలూ, బంధుత్వాలూ బలహీనపడేవి. చిన్నగా నిట్టూర్చింది.
ఒక ప్రేమ ఆత్మతో… అది ప్రేమనిపించదు. కర్తవ్యం అంతే. సాంప్రదాయంతో సమ్మిళితమైంది. అవినాభావసంబంధమైంది. అది అమ్మమ్మ తాతయ్యల మధ్య చోటుచేసుకుంది.
ఇంకొక ప్రేమ.. అది త్యాగం అనిపించుకుంటుంది. మనసునిండా నింపుకున్న జ్ఞాపకాల పరిమళాలతో జీవితేచ్చని పొందుతుంది. అలాంటి ప్రేమ భానుది.
ఇంకొక ప్రేమ.. అది జీవాన్నీ మానవసంబంధాలనీ చంపేస్తుంది. అది ప్రేమ కాదు. ప్రేమలా కనిపించే వ్యామోహం. ఆకర్షణ. అందుకే అది చచ్చిపోయింది.

లిఫ్ట్ ప్లీజ్-8 ఏప్రిల్ 2001 ఆదివారం ఆంధ్రభూమి

హైదరాబాదునుంచీ వస్తున్నాను. అవంతిపురం వెళ్ళాలి. కారు ఫ్రంట్‍షీల్డ్‌మీద వర్షపుచినుకులు పడి స్ట్రీట్‍లైట్ల వెలుతుర్లో తళుక్కుమని వైపర్స్ తగలగానే జారిపోతున్నాయి. మధ్యాహ్నం రెండు గంటల్నించీ ఎడతెరిపిలేని వర్షం ఉందక్కడ. ఇక్కడా అదే పరిస్థితిలాగుంది. కనుచూపుమేరంతా వర్షానికి నానిపోయినట్టుంది. ఎదురుగా నల్లటి తారురోడ్డు ప్రస్ఫుటంగా మెరుస్తోంది.
తెల్లారి నాలుగున్నరకి పెళ్ళి ముహూర్తం. నాదే. మూడురోజుల ముందునించే లీవు పెట్టాను కానీ ఆఫీసులో ఫ్రాడొకటి బయటపడటంతో రిలీవ్ కాలేక పోయాను.
“పోస్ట్‌పోన్ చెయ్యలేరా?” జీ ఎం పొలైట్‍గా అడిగాడు. ఈ సందర్భంలో నేనిక్కడ వుండటం వాళ్ళకి చాలా అవసరం. అలాగని నా అవసరానికి విరుద్ధంగా ఉండమని గట్టిగా చెప్పలేకపోతున్నారు.
“అదింకా పెద్ద ఫ్రాడౌతుంది సర్” చిన్నగా నవ్వి చెప్పాను. “ఇన్విటేషన్ కార్డ్స్ వెళ్ళిపోయి, బంధువులంతా వచ్చేసి ఉంటారు. పెళ్ళిమంటపం, కేటరింగు… ఒక్కటేమిటి ? అన్నీ … ఆర్డరిచ్చేసి ఉంటారు. ఇప్పుడు ముహూర్తం వాయిదా వెయ్యటమంటే సాధ్యపడదు. ముఖ్యమైన కార్యక్రమాలు అవగానే వెంటనే వచ్చి జాయినౌతాను” నచ్చజెప్పి బైటపడ్డాను. కొన్ని వుద్యోగాలంతే. నా మితృడు ఒకరు పోస్ట్‌మాస్టర్‍గా చేసేవాడు. పల్లెటూళ్ళో. ఆఫీసులో అతనొక్కడే. మిగిలినవాళ్ళంతా సబ్‍స్టాఫ్. పెళ్ళికి సెలవు పెడితే రిలీవరు రాలేదట. రాత్రిముహూర్తం కావటంతో డ్యూటీలోనే వుండి పెళ్ళి చేసుకున్నాడట. తర్వాత రిలీవరు వచ్చాడు. అది వేరే విషయం.
కారు చాలా స్మూత్‍గా పోతోంది. విడిదింట్లోకి డైరెక్టుగా వెళ్ళిపోవటమే. అమ్మావాళ్ళూ ఉదయమే వచ్చామని ఫోన్‍చేసి చెప్పారు. “స్నాతకం ఎలారా?” అంటోంది అమ్మ.
నేనింకా రాలేదని ఆడపెళ్ళివారు తెగ కంగారుపడుతున్నారట. మాటిమాటికీ వచ్చి అడుగుతున్నారట. ఇవన్నీ చెప్పి, “వాళ్ళని మరీ అంత కంగారుపెట్టడం బావోదు. వీలైనంత తొందరగా వచ్చెయ్. ఆఫీసూ, పనీ ఎప్పుడూ వుండేవే. ఇలాంటప్పుడు కూడా వదిలిపెట్టకపోతే ఎలా?” అని మందలించింది అమ్మ.
ఒకప్పుడు పదహార్రోజులపాటు పెళ్ళి వేడుకలు జరుపుకునేవారట. తర్వాత మూడు రోజులకి దిగింది. అక్కయ్య పెళ్ళి కార్యక్రమాలు కరోజంతా జరిగాయి. నా దగ్గరికి వచ్చేసరికి వ్యవధి ఇంకా కుదించుకు పోతోంది. చిన్నగా నవ్వొచ్చింది.
యాక్సిలేటర్ రెయిజ్ చెయ్యబోతున్న నేను రోడ్డుకి మధ్యగా ఒక వ్యక్తి అడ్డు రావటంతో స్లో చేశాను. అతను ఆపమన్నట్లు చెయ్యూపుతున్నాడు. చుట్టూ చూశాను. కొద్దిదూరంలో ఒక కారు రోడ్డుమీంచీ కొంచెం దిగి బురదలో కూరుకుపోయి ఉంది. బహుశః అది అతనిదే అయుంటుంది.
“లిఫ్ట్ ప్లీజ్” దగ్గరికి వస్తూ అడిగాడు. మనిషి నిలువునా తడిసిపోయి ఉన్నాడు. ఏదో అర్జెంటు పని మీద వెళ్తుంటే ఈ అవాంతరం వచ్చినట్టు ముఖంలో నిస్సహాయత కనిపిస్తోంది.
కారాపాను.
“కోటగుడిదాకా… లిఫ్ట్ ఇవ్వగలరా ప్లీజ్?” అడిగాడు.
అసలే టైమ్ లేదు. అతని కోసం మరో పావుగంటో… అరగంటో… కానీ కాదనలేక పోయాను.
“ఎక్కండి” అయిష్టంగానే అన్నాను.
అతను ఎక్కి కూర్చున్నాడు.
“సారీ, మిమ్మల్ని చాలా యిబ్బంది పెడుతున్నాను” సీట్లో సర్దుకుని రుమాలుతో జుత్తులోంచీ మొహంమీదికి జారిపడుతున్న నీళ్ళని తుడుచుకుంటూ చెప్పాడు.
“పర్వాలేదు” అని నా టవల్ ఇచ్చి, పాకెట్‍లోంచీ డన్‍హిల్స్ తీసి, నేనొకటి వెలిగించుకుని, అతనికొకటి ఇచ్చాను. అందుకుంటూ, “దయచేసి త్వరగా పోనివ్వగలరా?” అడిగాడు.
నేను స్పీడ్ పెంచాను.
కొద్దిసేపు మేమేం మాట్లాడుకోలేదు.
“నాకీ వూరు కొత్త. ఎప్పుడూ రాలేదు. నా ఫ్రెండ్ చెప్పిన గుర్తుల ప్రకారం వస్తున్నాను. ఇంతలో వెనక వస్తున్న లారీకి సైడివ్వటంకోసం కొంచెం రోడ్డు దిగానంతే. స్కిడైంది. లారీ వెళ్ళిపోయింది. పావుగంటనుంచీ ఎదురుచూస్తున్నాను. ఏదైనా వెహికిల్ వస్తుందేమోనని… వర్షంచేతనేమో. ఒక్క ఆటోకూడా లేదు” అన్నాడతను మౌనాన్ని ఛేదిస్తూ.
“కోటగుడి దగ్గర ఎక్కడికి?”
వెంటనే జవాబివ్వడానికి అతను మొహమాటపడ్డాడు. కొంచెం ఇబ్బందిగా నవ్వాడు. తర్వాత అన్నాడు. “నా ఫీయాన్సీ ఎదురుచూస్తుంటుంది అక్కడ. ఆమెని తీసుకుని వెళ్ళిపోవాలి. కారు పాడైందికాబట్టి ఇప్పుడింక ఏదైనా రైలు పట్టుకోవాలి”
ఇంతరాత్రి… ఈ వానలో?.. దిగ్భ్రమతో తలతిప్పి చూసి, అడిగాను.
“ప్రేమ కూడా యుద్ధంలాంటిదేట కదండీ? గెలవాలంటే కష్టనిష్టూరాలని పట్టించుకోకూడదు” అన్నాడతను.
చాలా మామూలుగా జరిగిన యీ సంఘటనతో ఒక ఆడపిల్ల జీవితం ముడిపడి వుందనేసరికి నాకు కొంత కుతూహలం కలిగింది. బెరుకు, భయం కూడా కలిగాయి. ఇంకొంచెం వివరాలు తెలుసుకోవాలనుకున్నాను. నా పక్కని కూర్చుని ఉన్న ఈ వ్యక్తి సరైనవాడౌనో కాదో! నేను చేస్తున్న పని సమంజసమైనదేనా? ఇతన్ని దిగిపొమ్మంటే? ఇతనికోసం ఎదురుచూసే ఆ అమ్మాయి ఇతను రాలేదని ఏ ప్రాణమేనా తీసుకుంటే? లేదా ఒక్కర్తీ అక్కడ వుండటం చూసి ఎవరేనా ఏదేనా చేస్తే? ఎన్నో సంశయాలు నాలో.
“మీరేం చేస్తుంటారు? “అడిగాను.
ఎవరో తెలీని ఆ అమ్మాయికి కేర్‍టేకర్ పాత్ర వెయ్యసాగాను, ఇదంతా నాకు తెలీకుండానే… అంటే అప్రమేయంగానే జరిగిపోయింది. నా వుద్దేశ్యాలు అతనికి అర్థమైనట్టే వున్నాయి. అన్నీ చెప్పాడు. తన జాబ్, క్వాలిఫికేషన్, జీతం… అన్నీ. బీటెక్‍మీద ఎంబియ్యే చేసి, ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో చేస్తున్నాడట.
” మీ స్వంతవిషయాల్లో కలగజేసుకుంటున్నాననుకోకపోతే చెప్పండి. పెద్దవాళ్ళ అనుమతితో పెళ్ళి చేసుకోవచ్చు కద?” అడిగాను. నాగొంతులో కొంచెం కరుకుతనం వుంది. కానీ అతను పట్టించుకోలేదు.
నా ప్రశ్నకి అతను పెద్దగా నవ్వేశాడు. “ఏం చెప్పారు మిత్రమా! ప్రేమించుకున్నామని పిల్లలంటే పెద్దవాళ్ళు వొప్పుకుంటారండీ? అసలీ టీవీలూ సినిమాలూ వచ్చి వాళ్ళని మరీ చెడగొట్టేస్తున్నాయి. కోటా శ్రీనివాసరావులాగా, అమ్రిష్‍పురిలాగా తయారౌతున్నారు తండ్రులంతా” అన్నాడు
నవ్వుతూనే.
అతని మాటలకి నేనూ నవ్వేశాను. రెండునిమిషాలు పట్టింది నన్ను నేను కంట్రోల్ చేసుకోవటానికి. అప్పుడు చురుగ్గా అడిగాను, “హాస్యం వద్దు. ప్లీజ్, సీరియస్‍గా చెప్పండి. ఇంత చదువుకుని కూడా తల్లిదండ్రులకి చెప్పకుండా ఇంట్లోంచి వెళ్ళిపోవటమేమిటి?
అతను కూడా సీరియసయ్యాడు. “మీకు మన ప్రస్తుతపు పెళ్ళిళ్ళ కాన్సెప్టు తెలుసా? అత్తలు కోడళ్ళని వెతుక్కుంటారు. మామలు అల్లుళ్లని వెతుక్కుంటారు. ఈ ప్రక్రియలో పెళ్ళిచేసుకునేవారిద్దరి ఇష్టానిష్టాలకిగానీ అభిరుచులకిగానీ ఏమాత్రం విలువలేదు” అన్నాడు.
అతని మాటలకి నేను జవాబు చెప్పలేకపోయాను. నిజమే! అక్కయ్య పెళ్ళికి నాన్న చాలా తిరిగాడు. తనకి అల్లుడనిపించుకోగలిగే అర్హతగల వ్యక్తికోసం. అలాగే నాకు భార్యని వెతికే బాధ్యత అమ్మ తీసుకుంది. వాళ్ళు చూపించిన వారిని మేము సరేనన్నాము.
” అంతేకాదు. ఈ పెళ్ళనేది ఆస్తి అంతస్తుల్నీ, కులగోత్రాలనీ, వంశమర్యాదల్నీ ప్రకటించుకునే వేదిక. అహాలని ప్రకటించుకుని పారస్పరికంగా సంతృప్తిపరచుకునే వేదిక, పిల్లల ఇష్టానిష్టాలని పట్టించుకుంటే ఆ అవకాశాలు పోతాయి…”
“మీరు పొరబడ్తున్నారేమో! ఆ పద్దతిని వప్పుకోవటంలో తప్పేమీ లేదు. అందరం సంతోషంగానే వుంటాం” వొప్పుకోలేకపోయాను.
“లేదు.” స్థిరంగా అన్నాడు. “ఆడపిల్ల పుట్టిందనగానే ఇంక పొదుపు ఉద్యమం మొదలుపెట్టాలనుకునే తల్లిదండ్రున్న వ్యవస్థ మనది. పైసపైస కూడబెట్టి దాచి, ఆ పిల్లకి ఘనంగా పెళ్ళిచేసి అత్తవారింటికి పంపి, ప్రయోజకులమనిపించుకోవాలన్నది వాళ్ళకి జీవితకాలపు ఆశయం.
అందులో ఏ మాత్రం తేడా వచ్చినా తట్టుకోలేదు. అహం దెబ్బతింటుంది. అసలందుకే, ప్రేమ పెళ్ళిళ్ళకి విముఖత ఎదురయ్యేది ఆడపిల్లవైపునించే” అని,
“ఏ వ్యక్తీ మనసులోకి రానంతవరకూ మాత్రమే మీరు చెప్పినట్టు జరుగుతుంది. చదువులరీత్యాగానీ, వుద్యోగాలరీత్యాగానీ అనేక ప్రాంతాలకి వెళ్తున్నాం. కొత్తకొత్త పరిచయాలు జరుగుతున్నాయి. ఒకొక్కసారి ఎవరో ఒక వ్యక్తి నచ్చి, వారితో జీవితం బాగుంటుందనిపిస్తుంది. అలాంటప్పుడుకూడా తమకి నచ్చినవాళ్ళనే చేసుకొమ్మని పిల్లల్ని బలవంతపెట్టడం తప్పు” అన్నాడు.
“మీ విషయం చెప్పండి”
“మాదీ అదే సమస్య. ఆమె తల్లిదండ్రులు వొప్పుకోలేదు”
“మీవాళ్ళు?”
“ఎదిగొచ్చిన కొడుకుని వదులుకోవటంకన్నా రాజీపడటం మంచిదనుకున్నారు?”
“అసలీ గొడవ దేనికి?”
“సర్వసాధారణమైన కారణమే”
అర్థమైంది.
“తను పీజీ చేసింది. ఇంట్లో సంబంధాలు చూడబోతే మాగురించి చెప్పిందట. అంతే… ఆమెకి నయానా భయానా చెప్పారు మనసు మార్చుకొమ్మని. వినలేదు. నన్నూ వాళ్ళ బంధువుల ద్వారా బెదిరించారు. ఆమె పారిపోకుండా కాపలా వుంచి, హడావిడిగా సంబంధం చూసి పెళ్ళి చేసేస్తున్నారు రేపు తెల్లారే ముహూర్తం”
నేను తుళ్ళిపడ్డాను. మనసులో కలవరంలాంటిదేదో లేచింది. దాన్ని అణిచేసే ప్రయత్నంగా అన్నాను “రేపు చాలా పెళ్ళిళ్లున్నట్టున్నాయి”
“ఔను. రేపు తప్పిస్తే మళ్ళీ మూడు నెలలదాకా ముహూర్తాలు లేవు”
మాటల్లో గమనించలేదు. మేం మెడికల్‍కాలేజి దాటేసాం. అంటే కోటగుడి వచ్చేసినట్టే.
ఒక ప్రశ్న అడగకుండా వుండలేక పోయాను. “మీమధ్యని అమాయకుడైన మరోవ్యక్తి ఇరుకునపడటం లేదూ?”
“మనసులేని పిల్లతో అతను మాత్రం సంతోషంగా వుండగలడా? పెళ్ళయాక ఆమె మారితే సంతోషమే. లేకపోతే? నాకు తెలిసి, తనంత తేలిగ్గా నన్ను మర్చిపోలేదు. చావనైనా చస్తానని తెగేసి చెప్పేసింది. అందుకే ఇలా రావల్సి వచ్చింది”
“మొదటే అతన్తో చెప్తే బావుంటుంది కదా?!”
అతను కొద్దిక్షణాలు మాట్లాడలేదు. తరువాత నెమ్మదిగా అన్నాడు.” ఈ విషయాలు మీరనుకున్నంత సాదాగా వుండవు. చాలా ముళ్ళుంటాయి దానికి. అన్నీ సందిగ్ధాలే. నేను దీన్ని సమర్ధించటం లేదు. పెళ్ళికొడుకుతో చర్చించి, నాకు నువ్వంటే ఇష్టంలేదు. నిన్ను చేసుకోలేను, అని చెప్పి సంబంధాన్ని తిరగ్గొట్టుకోవటంవలన ఆమెకి ప్రయోజనం వుండదు. అతనెలా తీసుకుంటాడో తెలీదు. ఆమె వున్న వత్తిడిలో తల్లిదండ్రులకి చేస్తున్న ద్రోహంకన్నా, పెళ్ళికొడుక్కి చేస్తున్నది పెద్దదనిపించదు. “
“నైతికత…?”
“అతను తను నమ్మకస్తుడినని నిరూపించుకున్నాడా?”
“అంటే?”
“నాన్నకి నచ్చే కట్నమిచ్చి, అమ్మకి నచ్చేలా పనిపాటలొచ్చి, అక్కచెల్లెళ్ళతో సర్దుకుపోయే సరళస్వభావం వుండి, తన కోసం అందం,చదువు, వుద్యోగం వుంటే చాలనుకునే అబ్బాయి విషయంలో నైతికతేమిటి? అతనుకూడా ఈ సమాజంలోనివాడేగా? సమాజం ఇచ్చే మంచిని ఆస్వాదించినట్టు చెడుకూడా స్వీకరించక తప్పదు” అతని మాటలు పదునుగా ఉన్నాయి. నన్ను ఆలోచనలో పడేశాయి. మరీ అంతలా కాకపోయినా, పెళ్ళినిర్ణయం అమ్మావాళ్ళకేకదా, వదిలేసింది నేను? అంతలోనే నవ్వు వచ్చింది. రేప్పొద్దున్న… అంటే ఇంకొన్ని గంటల వ్యవధిలో పెళ్ళి పెట్టుకుని… ఇప్పుడు ఆలోచనేమిటి?
“మెడికల్ కాలేజి దాటిపోయాము కదూ?” అడిగాడు.
“మీకీ వూరు కొత్తన్నారు?” గుర్తుచేశాను.
“మై క్లెవర్ ఫియాన్సీ… అన్నీ వివరంగా రాసింది. మెడికల్ కాలేజిదగ్గర కోటలోని గుడికి వెళ్ళే దారి ఉంటుందట. అక్కడ నిలబడతానంది”
నేనక్కడ ఆపాను. ఒక ఆటో మాత్రం ఉందక్కడ.
“మీకు చాలా ట్రబులిచ్చాను. కానీ మీరు చేసిన హెల్ప్… వృధా అయిన మీ సమయంకన్నా విలువైనది. చాలా థేంక్స్… బైదిబై… మీరెక్కడ చేస్తారు?” అడిగాడు. నేను నా విజిటింగ్ కార్డిచ్చాను. దాన్ని జేబులో పెట్టుకుని, మరోసారి థాంక్స్ చెప్పి కారు దిగాడు.
అతన్ని చూసి, ఆటోలోంచీ ఒకమ్మాయి దిగింది. నేను కారు టర్న్ చెయ్యబోయాను. ఆమె అతనికి అభిముఖంగా నడుస్తోంది. ఆ క్రీనీడ ఆమె ముఖంమీద పడ్తోంది. ఆమెని ఒక్కసారి చూడాలన్న కుతూహలం… జస్ట్… కుతూహలం… నన్నాపింది.
అతను కారు చూపించి ఏదో చెప్తున్నాడు. జరిగినదాన్నిగురించి కాబోలు ఆమె వున్నట్టుండి తలతిప్పింది.
షాకయ్యాను.
“మై మేరేజ్ విత్ ఇందూ… ” డాష్‍బోర్డుమీద శుభలేఖ నన్ను వెక్కిరించింది. తేరుకుని ఒక్కసారి కారుని ఉరికించాను. పెళ్ళింటికి కాదు. అక్కడింక నా అవసరం లేదు.

కుటుంబదృశ్యం-ఆంధ్రభూమి సచిత్ర వారపత్రిక 1/2/2007

కుటుంబం ఏర్పడుతూ ఉండే దృశ్యం చాలా అద్భుతంగా ఉంటుంది.
ఇద్దరు స్త్రీ పురుషులు ఒకరినొకరు కావాలనుకుంటారు. పెళ్లిచేసుకుని ఒకటవుతారు. వాళ్ల మనసుల్లో ఇంద్రధనుస్సులు విరుస్తాయి. జీవితాల్లోకి వసంతం వస్తుంది. కాంక్షలు నులివెచ్చని మంటల్ని రగుల్చుతాయి. ఆశలు చిగురిస్తాయి. పిల్లలు పుడతారు. కాలంతోపాటు అంతా కదుల్తారు.
ఆ తర్వాత? ఈ ప్రశ్నకి జవాబులా ఆమె.
నేను భోజనం చేసి సిటౌట్లో కూర్చోగానే అందుకోసమే ఎదురుచూస్తున్నట్టు వచ్చినా ఎదురుగా మెట్లమీద కూర్చుంది. నన్నేదో అడగాలని ప్రయత్నిస్తూ అడగటానికి సంకోచపడుతోంది.
“చెప్పండమ్మా!” అన్నాను.
సన్నగా నల్లగా ఉండే మనిషి, బాగా పాతబడ్డ చవకరకం సింథటిక్ చీర కట్టుకుంది. ముతక జాకెట్టు వేసుకుంది. జుత్తుకి నూనె రాసి నున్నగా దువ్వుకుని వేలుముడి చుట్టుకుంది. చేతులకి రెండేసి వెండిగాజులు, మెళ్లో పూసలదండ. తెల్లగా పేసి గీతలు పడ్డ చర్మం. సుమారైన దేహదారుఢ్యం. కష్టాల రూపురేఖలు ఆమె ముఖంలో ప్రతిబింబిస్తున్నాయి. నాకన్నా బాగా పెద్దదే వయసులో. నేనలా గమనిస్తున్నంతసేపూ ఆమేం మాట్లాడలేదు బహుశః నా చూపులు ఆమెలో సంకోచాన్ని పెంచాయేమో!
ఆమె కూతురూ, అల్లుడూ మా ఔట్‍హౌస్‍లో అద్దెకి ఉంటారు. అతనికి జూట్ మిల్లులో ఉద్యోగం. ఇద్దరు పిల్లలు. అంతా రెండు గదుల్లో సర్దుకుంటున్నారు. కొద్దిరోజులక్రితం అనారోగ్యకారణంగా ఈమె వాళ్లింటికి వచ్చింది. అలా రావటం వాళ్లకిష్టం లేదని వాళ్ల ప్రవర్తన వలన తెలిసింది. ఆమెకూడా ఈ విషయం తెలిసినట్టే దూరదూరంగా మసలుతోంది. అతనింట్లో ఉన్నప్పుడు కాంపౌండులో తిరుగుతుంది. మరీ ఎండగా ఉంటే కారుషెడ్డులో కూర్చుంటుంది.
మొదట్లో మొక్కలకి కుదుళ్లు చేసి నీళ్లుపెట్టేది. నా భార్య వప్పుకోలేదు. “అన్నీ వేలు పోసి కొన్న పారిన్ ప్లాంట్స్, ఆమెకేం తెలుస్తుంది, వాటి పెంపకం?” అంది.
తను మొదట్నుంచీ సిటీలో పుట్టి పెరిగింది. మొక్కల గురించి ఏమీ తెలీదు. కానీ పెంచాలని సరదా. తెలీదుగాబట్టి ట్రెయిన్డ్ మాలీమీద ఆధారపడుతుంది. రిస్కెందుకన్న భయం. అందుకే ఆమెని ముట్టుకోనివ్వలేదు.
మనుషులు చేత్తో పనులు చేసుకుంటూ బతుకుతున్నప్పటి రోజుల్లో అందరూ తలొక పనీ చేసుకుంటూ ఇంత తిండి తినగలిగేవారు. యంత్రసహాయం వచ్చాక అన్ని పనులూ ఒక్కరే చేసుకోగలుగుతున్నారు. కొందరికి పని లేకుండా అయింది. అంటే వాళ్ల అవకాశాలు కబ్జా చేయబడ్డాయి. పనుల్లేవని వాళ్ల అవసరాలు ఆగలేదు. ఆకలి పుడుతునే ఉంది. అది తీరే దారే లేదు. ఆదారి లేకే ఈమె కూతురి దగ్గరకి వచ్చింది.
“ఏమిటమ్మా?” మరోసారి అడిగాను.
“మీరు అమెరికా వెళ్లి వస్తుంటారు కదా?” అడిగింది.
తలూపాను. నా ఇద్దరు కొడుకులూ అక్కడుంటారు. కూతురిది ముంబాయి. ఇవన్నీ నాకు సంబంధిచిన వివరాలు. ఈమె అమెరికా విషయం ఎందుకడిగినట్టు? నా సందేహం వెంటనే తీరింది.
“మా అబ్బాయి… పేరు రాజోలు శ్రీనివాసులు. వాడూ అక్కడే ఉంటాడు”
నేను షాకయ్యాను. కంటిరెప్ప వెయ్యటం, శ్వాస తీసుకోవటంలాంటి అసంకల్పిత చర్యల్ని కూడా మర్చిపోయాను.
“మీరెప్పుడేనా వాడిని చూశారా? ఎక్కడేనా కనిపించాడా? నల్లగా చెయ్యెత్తు మనిషి, సన్నగా ఉండేవాడు. అక్కడికెళ్లాక లావయ్యాడేమో!!” అంది.
కొడుకు అమెరికాలో ఉండగా ఇక్కడ యీమెకేమిటీ దురవస్థ? అతనికి సంపాదన లేదేమో! ఇంకా స్థిరపడలేదేమో!
“నాలుగేళ్లయింది, వాడక్కడికెళ్లి. ఒక్కమారు కూడా రాలేదు. ఎందరితోనో కబురుపెట్టాను. కన్నతల్లినీ తోబుట్టువునీ మర్చిపోయాడు వాడు” ఆమె కళ్లలో నీళ్లు నిలిచాయి.
“అతను అమెరికాలో ఉండగా మీరేమిటమ్మా, ఇక్కడిలా?” అతిప్రయత్నం మీద అడిగాను.
నా పెద్దకొడుకు అప్పుడింతా ఇప్పుడింతా చొప్పున ఇరవై లక్షలు పంపాడు. చిన్నవాడు ఏకమొత్తంగానే పంపాడు. ఇల్లూ, కారు కొనుక్కున్నాం.
నాకు పెన్షన్స్తుంది. రిటైర్మెంటు బెనిఫిట్సు అలాగే ఉన్నాయి. వాడలేదు. ఆ అవసరం రాలేదు. కూతురిదీ మంచి ఉద్యోగం. ప్రేమవివాహం. మతాంతరం చేసుకుంది. కొంత బాధనిపించినా ఎదిగిన పిల్లల స్వేచ్ఛని మనం అరికట్టలేమని వదిలేశాం. మేమే మనసు సరిపెట్టుకుని రాజీపడ్డాం. అందుకు పశ్చాత్తాపపడే అవసరం ఎప్పుడూ రాలేదు. భార్యాభర్తలిద్దరూ ఒకరికోసం ఒకరన్నట్టు బతుకుతున్నారు. హెచ్చుతగ్గులూ, అరమరికలూ లేవు. అతని తల్లిదండ్రులనీ మమ్మల్నీ ఒకేలా చూస్తారు.
“ఉద్యోగం లేదామ్మా?” మళ్లీ నేనే అడిగాను.
“ఏడాదికి అరవై డెబ్బై వేలొస్తుందట. డాలర్లేమో! వాడిని కలిసినవాళ్లు చెప్పారు” ఆమె చీరకొంగులో ముఖం దాచుకుంది. ఏడుస్తోందని గ్రహించాను. కొద్దిసేపు గడిచాక సర్దుకుంది. తన కుటుంబ పరిస్థితులు చెప్పుకొచ్చింది.
“మొదట్లో మాది కలిగిన కుటుంబమే బాబుగారూ! నలభయ్యెకరాల మెట్టా, పదెకరాల తరీ ఉండేవి. నా భర్తావాళ్లూ ఐదుగురన్నదమ్ములు. చాలాకాలందాకా కలిసే వున్నాం. కలిసున్నప్పుడు అందరం బాగానే ఉన్నాం. జొన్నలు తినేవాళ్లం. వరి అమ్ముకుని అవసరాలు తీర్చుకునేవాళ్లం. మా మామగారు పోయాక వేర్లుపడ్డాం. ఇంటాబైటా ఎన్నో మార్పులు. అంతా తెల్లన్నానికి అలవాటు పడ్డారు. హెచ్చులు నేర్చారు. జొన్నలు పండించినా కొనేవాళ్లు లేరు. బోర్లకింద వ్యవసాయం. వానల్లేక బోర్లెండిపోయాయి. అడుగోబొడుగో కొన్ని నీళ్లున్నా కరెంటు లేక అని బైటికి రావు. అమ్మబోతే అడివి, కొనబోతే కొరివి. పంటమీద పంట నష్టం. అప్పులయ్యాయి. తలకు మించాయి. పత్తి వేసి భారం దించుకోవాలనుకున్నాం. పత్తి నెత్తిన మొత్తింది. మనసు చెదిరి ఆయన పురుగుల మందు తాగేశాడు”
నేను దిగ్భ్రాంతిగా విన్నాను. కుటుంబాలు చెదిరిపోయిన వార్తలు పేపర్లలో వస్తుంటాయి. చదువుతుంటాం. టీవీల్లో వస్తుంటాయి. చూస్తుంటాం.
మనసుకి బాధనిపిస్తుంది. కానీ కదిలించవు. ఎందుకంటే అవి వార్తలు. ప్రాణం లేనివి. ఇప్పుడీమె సజీవప్రతిమ. తన మనసునీ అనుభవాన్నీ నాముందు పరిచింది. నేను కదిలిపోయాను.
“కలిసిరాని వ్యవసాయం దేనికని ఐనకాడికి అన్నీ అమ్మి అప్పులు తీర్చాను. వీడిని చదువులో పెట్టాను. తెలివైనవాడు. స్కాలర్షిప్పులొచ్చేవి. చదువుకున్నాడు. వాళ్ల ప్రొఫెసరు అమెరికా వెళ్తూ వీడినీ తీసుకెళ్ళాడు” చెప్పింది.
నేనింకా ముందు కలిగిన ఆశ్చర్యంలోంచీ తదుపరి కలిగిన బాధలోంచీ తేరుకోలేదు. రాజోలు శ్రీనివాసులు… ఆ పేరు గల వ్యక్తి నాకు ఏ తెలుగు అసోసియేషన్లోనే తారసపడ్డాడేమో గుర్తు తెచ్చుకుందుకు ప్రయత్నించాను. అక్కడికెళ్లాక మన పేర్లు మన పేర్లలా ఉండవు. మరి ఈ శ్రీనివాసులు ఏమిగా రూపాంతరం చెందాడో!
“పల్లెటూరివాళ్లం… అమ్మాయికి చిన్నప్పుడే అందివచ్చిన సంబంధం చేసేశాం. వీడి చదువు గురించి అప్పట్లో అంత ఆలోచనలు లేవు. తనకి అన్నీ సరిగా చెయ్యలేదని దానికి కోపం. అల్లుడిది మొదట్లో టెంపరరీ ఉద్యోగం. ఈమధ్యనే పర్మినెంటైంది. గుట్టుగా గడుపుకొస్తున్నారు. నేను రావటం ఇద్దరికీ ఇష్టం లేదు.
“నిజమేకదండీ బాబుగారూ, వంశోద్ధారకుడినని వున్న కాస్తా వూడ్చుకు తిన్న కొడుకుండగా కూతురెందుకు చూస్తుంది? కష్టమో నష్టమో పోనీ పదో పరకో పంపిస్తే వీళ్లు సంతోషిస్తారనుకుంటే అదీ లేదు. అసలిక్కడికి రాకనే పోదును. ఏదో ఒక పని చేసుకుంటూ మా ఊళ్లోనే బతికేద్దామనుకుంటే పనుక్కడివి బాబుగారూ? మీరు కాస్త వాడికి నచ్చచెప్పండి” అంది ముక్తాయింపుగా.
నాకా రాజోలు శ్రీనివాసులు అనే వ్యక్తిమీద కాస్త కోపం వచ్చింది. ఉన్నవాళ్లుంటారు, లేనివాళ్లుంటారు. ఎవరైనా తల్లి తల్లి, కొడుకు కొడుకే.
బాధ్యత తప్పించుకు తిరిగితే ఎలా?
“నా కొడుకులిద్దరికీ ఈనేళే చెప్తాను, మీ అబ్బాయి తెలిస్తే మా ఇంటికి మాట్లాడించమని” చెప్పాను.
ఆమె వెళ్లిపోయింది. నేను ఆ రాత్రే పిల్లలకి ఫోన్ చేసి చెప్పాను రాజోలు శ్రీనివాసులి విషయం. పెద్దవాడికి అతను పరిచయమట.
“మీకెందుకండీ, ఈ గొడవలు? వాళ్లకీ వాళ్లకీ మధ్యని ఎన్ని గొడవలేనా ఉండచ్చు. మనమెందుకు తలదూర్చడం?” అని కోప్పడ్డాడు చిన్నవాడు.


వారంరోజుల్లో జవాబొచ్చింది. రాజోలు శ్రీనివాసులు నాతో మాట్లాడాడు. అతను మాట్లాడుతున్నాడని చెప్పగానే అతని తల్లీ, అక్కా వచ్చి
కూర్చున్నారు. స్పీకర్ ఆన్ చేశాను. నా పెద్దకొడుకు ముందుగానే నన్ను హెచ్చరించాడు.
“మీ మాట కాదనలేక అతన్ని కలిశాను. అతనుకూడా మాట్లాడటానికి వప్పుకున్నాడు. చెప్పింది విని వాళ్లకి చెప్పండి. అంతేగానీ, సలహాలివ్వకండి. మీరు పెద్దరికం అనుకునేదానికి ఇక్కడే విలువా లేదు” అని.
నేనందుకు వప్పుకున్నాకే రాజోలు శ్రీనివాసులుకి కనెక్ట్ చేశాడు. పరిచయాలయ్యాయి. సాధారణమైన సంభాషణ జరిగింది. తర్వాత విషయంలోకి వచ్చాను. అతను తన అభిప్రాయాలని చాలా స్పష్టంగా చెప్పాడు.
“ఆమె నా తల్లంటేనే చిన్నతనంగా ఉంది. మొదటిది… ఆమె నా చదువుకి ఖర్చుపెట్టిందేమీ లేదు. అంతా ఫైనాన్షియల్ ఎయిడ్ మీదే జరిగింది. కాబట్టి ఆమెకి నేను ఏవిధంగానూ రుణపడిలేను. యామై క్లియర్? రెండోది… మా నాన్న చనిపోయిననాటికి మాకు పదెకరాల భూమి, ఇల్లూ ఉండేవి. ఈ రోజున సెంటు భూమి కూడా మిగల్లేదు. పిత్రార్జితమైన భూమిని అమ్మే హక్కు ఆవిడకెవరిచ్చారు? ఆ డబ్బంతా ఏమైంది? అప్పులు తీర్చానంటుంది. రైతుల రుణాలు మాఫీ చేసే దిశగా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంటే ఈమెకి అంత తొందరపడి తీర్చాల్సిన అవసరం ఏమిటి? మా నాన్నకి కాంపన్సేషను ఇచ్చి ఉండాలి. అదేమైంది?” అతను శ్వాస తీసుకోవటంకోసం ఆగాడు. నేను వినడానికి ఊపిరి బిగపట్టాను. అతను కొనసాగించాడు.
“ఇండియాలో ఆమె ఒక్కదానికీ ఎంత ఖర్చవుతుంది? ఐదు వందలో వెయ్యో! అంటే పదిరవైడాలర్లు, ఆ డబ్బుకోసం నన్నిక్కడ నానా యాగీచేస్తోంది. ఆ పదిరవైడాలర్లూ నేనిక్కడ్నుంచీ పంపాలా? తన డబ్బు పెట్టుకుని తను బతకలేదా? బతకలేదే అనుకుందాం. అక్కకి ఆమెపట్ల బాధ్యత లేదా? తనకీ తల్లే కదా? కట్నకానుకలిచ్చి పెళ్ళి చేసారుకదా?” అతని గొంతు తీవ్రంగా ఉంది.
నేనేమీ మాట్లాడకూడదుగాబట్టి మాట్లాడలేదు.
“ఇక్కడ నేను బేబీ సిట్టర్‍కి యిచ్చేది ఎంతో తెలీదా, మీకు? ఆపాటి సర్వీస్ ఆమె అక్కకి చెయ్యట్లేదా? ఇంకా ఎక్కువే చేస్తుండవచ్చు. తనని కూర్చోబెట్టి అన్నీ అమర్చిపెట్టే వ్యక్తికి ఇంతన్నం పెట్టలేదా తను? అంటే?… నేనిక్కడేవో డాలర్లు పోగుచేసుకుని ఉన్నానేకదా? అయాం సారీ సర్. నేను వాళ్లకే డబ్బూ పంపలేను. నాదగ్గరున్నా ఇవ్వాలని లేదు. ఇది అమెరికా. ఇక్కడలా ఎవరూ ఇవ్వరు. అయాం ఫీలింగ్ ఇన్సెక్యూర్. ఇల్లు లేదు. స్థిరమైన ఉద్యోగం లేదు. భవిష్యత్తేమిటో తెలీదు. అక్కడేవో కొన్ని ఆస్తులున్నాయంటే అదో ధైర్యం. అదీ లేదు. పరాయిదేశంలో బతుకుతున్నాను. నాకూ భార్యా పిల్లలున్నారు. వాళ్ల బాధ్యతలు న్నాయి” అన్నాడు.
అతని తల్లి నిశ్శబ్దంగానూ, ఆశ్చర్యంగానూ నింది. అతని అక్క అలా విని ఊరుకోలేకపోయింది.
“పిల్లల కోసం బేబీసిట్టర్‍నీ, నాకోసం హౌస్‍కీపర్‍నీ పెట్టుకుని చేయించుకుని తీరిగ్గా కూర్చుని తినేంత స్థోమతగానీ, మరో మనిషిని కూర్చోబెట్టి
పోషించే శక్తిగానీ లేవు. నాదే పరాధీనపు బతుకు. అమ్మకి ఆశ్రయం ఎక్కడివ్వగలను? బావ ఒప్పుకోరు. ఎదగడానికి నీకిచ్చిన అవకాశాలు నాకివ్వలేదు. తెలిసీతెలీని వయసులో దొరికిన సంబంధమేదో చేశారు. బావ తప్ప నాకు మరో ఆధారం లేదు. ఆయన పెట్టే తిండి తింటూ ఆయన బతకమన్నట్టు బతుకుతున్నాను. అమ్మ పొలంలో నాకూ వాటా ఉంది. కాబట్టి నీకు లెక్కైనవన్నీ నాకూ లెక్కే. నువ్వే చెప్పు, ఏం చెయ్యమంటావ్?” అంది.
“అది, ఆవిడ ఆలోచించుకోవాలి. నేనేమీ చెయ్యలేను. ఇంకోసారి నాకు ఫోన్ చేయవద్దు. నన్ను కలవద్దు. మీతో కాంటాక్ట్స్‌కి నా భార్య వప్పుకోదు. అయాం సారీ” అతను పెట్టేశాడు.
నేను దిగ్భ్రాంతుడినయ్యాను. ఎంత నిర్ణయుడీ కొడుకు? తల్లికి పిడికెడన్నానికి ఇంత చర్చ తర్వాత కూడా కాదన్న వ్యక్తి…
“ఇల్లు గడవడంకోసం ఆయన చేసిన అప్పులు తీర్చడం నా బాధ్యతనుకున్నానుగానీ తప్పనుకోలేదు. ఐనా ఎప్పుడో ప్రభుత్వం ఏదో చేస్తానంటే అప్పటిదాకా అప్పులిచ్చిన వాళ్లేందుకూరుకుంటారు? ఇంటిమీదకొచ్చి గొడవ చేస్తారు. అయ్యా! అప్పులు తీర్చని ఇంట్లో ఆడామెని వడ్డీలకిచ్చినవాళ్ళు ఎలాంటిమాటలంటారో దేనికి పిలుస్తారో మీయిండ్లలో తెలీదు. వాటిని భరించడం రక్తమాంసాలున్న వాళ్ళెవరికీ సాధ్యం కాదు” నాతో అని, కూతురితో, “అదలా ఉంచి మనిషి చచ్చిపోయేదాకా చూసి అప్పుడిచ్చే సాయం కోసం ఎదురుచూసేంత కిరాతకురాలిలా కనిపిస్తున్నానటే, నేను?”” అంది అతని తల్లి.
“ఐనా నాది తప్పేనమ్మా! కొడుకు జీవితం, కూతురిల్లూ ఈ రెండూకూడా మనవి కావని తెలుసుకోలేకపోయాను. మనకి అందులో ఆశ్రయం దొరకదు. అరవయ్యేళ్లో డబ్బైయ్యేళ్ళో బతకాల్సిన అవసరం ఉన్న మనిషి తన గురించి తను కాక ఇంకెవరో ఆలోచిస్తారనుకోవడం పొరపాటు” అంది తనే మళ్లీ.
వాళ్లలో వాళ్లు మాట్లాడుకుంటూ తల్లీకూతుళ్ళిద్దరూ వెళ్లిపోయారు.
“బాగానే ఉంది గొడవ. ఎవరూ చూడకపోతే ఈ ముసలమ్మెలా బతుకుతుందట?” అంది నా భార్య.
“ఒకటి చెప్పు. కన్నతల్లికి తిండి పెట్టనివాడొకడుండగా మనకి పిల్లలు ఇంతంత డబ్బెందుకు పంపిస్తున్నారంటావు?” అడిగాను.
“మనకి తిండీ అవసరాలు తీరుతున్నాయిగాబట్టి అదొక పెట్టుబడిలా వాళ్లు పంపిస్తున్నారు. మీరు ఖర్చు పెట్టటం మొదలుపెట్టండి. వాళ్ళు
లెక్కలడుగుతారు” తన జవాబు. నా గుండెల్లో ఎక్కడో వాడిగా దిగబడ్డాయి ఆ మాటలు. నిర్విణుడినై చూశాను. అం…తే…నా?


ఆరాత్రి మా ఔట్‍హౌస్‍లో బాగా గొడవైంది. జరిగిన విషయం తెలిసి, రాజోలు శ్రీనివాసులి అక్కని ఆమె భర్త బాగా తిట్టాడు. ఆమె వుక్రోషంతో తల్లిని తిట్టింది. ముసలామె ఏడుస్తూ ఇవతలికొచ్చింది. రాత్రంతా ఏడుస్తూనే ఉందనుకుంటా. ఓ మధ్యరాత్రివేళ ఎందుకో మెలకువ వచ్చి కిటికీ తెరలు తప్పించి చూస్తే మా వరండాలో చీరకొంగు కప్పుకుని ముడుచుకుని పడుకుని ఉందామె.
అక్కడ అమెరికాలో రాజోలు శ్రీనివాసులి టీఖర్చుపాటి చెయ్యదు ఆవిడ జీవిక. ఐనా అతను ఖర్చుపెట్టలేకపోతున్నాడు. ఇక్కడ కూతుర్ని కూర్చోబెట్టి పనంతా చేస్తోంది. కూతురికి కావల్సింది అది కాదు. తను సుఖపడే మార్గం కాదు. ఆపాటి కష్టం ఆమె పడగలదు. కొంత ఖర్చు తగ్గే మార్గం. ఆమె భర్తది బావమరిది పట్టించుకోవట్లేదనే నిస్సహాయతలోంచీ పుట్టుకొచ్చిన ఉక్రోషం.
ఒక పరిస్థితి. మనిషి వంట్లో శక్తి ఉంటుంది. చెయ్యడానికి పని ఉండదు. ప్రకృతి మొత్తాన్నీ తన అధీనంలోకి తెచ్చుకున్న ఈ సమాజం మనిషి జీవికకి ఎలాంటి హామీ ఇవ్వదు. వృద్ధులని చూసుకోవాలని చట్టాలున్నాయి. కొడుకు అందనంత దూరంలో ఉన్నాడు. అతన్ని దాని పరిధిలోకి లాక్కొచ్చే శక్తి ఈమెకుందా?
అసలెందుకని, ఈ కుటుంబ సంబంధాలిలా మారిపోతున్నాయి? పిల్లలకి తల్లిదండ్రులూ, తల్లిదండ్రులకి పిల్లలూ ఏమీ చేసుకోలేని ఈ పరిస్థితి యేమిటి? రాజోలు శ్రీనివాసులి తండ్రి ఆత్మహత్య చేసుకోకుండా ఉంచగలిగే పరిస్థితులు ఎందుకు లేవు? ఆయన నిస్సహాయతని అర్థం చేసుకుని తల్లి చర్యని క్షమించగలిగే విచక్షణ ఇంత చదివిన ఆ యువకుడిలో ఎందుకు లోపించింది? నిస్సహాయురాలైన తల్లికి ఆశ్రయం ఇవ్వలేనంత పరాధీనురాలిగా రాజోలు శ్రీనివాసులి అక్కని మార్చిన ఈ వివాహవ్యవస్థ అంతిమరూపం ఎలా ఉంటుంది?
ఆమెకి ఏదైనా చెయ్యగలనా అని ఆలోచించాను. కొంత డబ్బు ఇవ్వటం తప్పించి ఇంకేమీ చెయ్యలేనని అర్థ మైంది. అలా ఎంతకాలం? ఎటూ తోచలేదు. కాస్త డబ్బు కట్టి ఏదైనా ఓల్డేజ్ హోంలో చేర్పించాలని నిర్ణయించుకున్నాను. అలా నిర్ణయించుకున్నాక నిద్ర పట్టింది.