ఝరి – 46 by S Sridevi

  1. ఝరి – 46 by S Sridevi
  2. ఝరి – 47 by S Sridevi
  3. ఝరి – 48 by S Sridevi
  4. ఝరి – 49 by S Sridevi
  5. ఝరి – 50 by S Sridevi
  6. ఝరి – 51 by S Sridevi
  7. ఝరి – 52 by S Sridevi
  8. ఝరి – 53 by S Sridevi
  9. ఝరి – 54 by S Sridevi
  10. ఝరి – 55 by S Sridevi
  11. ఝరి – 56 by S Sridevi
  12. ఝరి – 57 by S Sridevi
  13. ఝరి – 58 by S Sridevi
  14. ఝరి – 59 by S Sridevi

జరిగిన కథ-వాసు, గీత భార్యాభర్తలు. గీత ఆత్మహత్యకి ప్రయత్నం చేసి బైటపడుతుంది. తులసికి కేన్సరొచ్చి తగ్గుతుంది. భర్తతో విడిపోవాలనుకుంటుంది. అతనికి విడాకులు ఇష్టం వుండదు. గీతకి ఎవరో ఫోన్‍చేసి బెదిరిస్తారు. ఆ ఫోన్ సుధీర్‍ చేసాడేమోననే అనుమానం వస్తుంది వాసుకి. మహతి భర్తతో విడాకులు తీసుకుంటుంది. మేఘన ఆమె కూతురు. తల్లి దగ్గిరే వుంటుంది. తండ్రికి యాక్సిడెంటైతే చూడటానికి వస్తుంది. మహతితో విడాకులయ్యాక నరేంద్ర మరో పెళ్ళి చేసుకుంటాడు. ఆమెవలన ఇద్దరు పిల్లలు. ఆమె చనిపోతుంది. అతనికి యాక్సిడెంటైతే సాయానికి హాస్పిటల్‍కి వెళ్తుంది మహతి. రాత్రి అతనికి అటెండెంటుగా వుంటుంది. పిల్లలని వాసు తనింటికి తీసుకెళ్తాడు. మహతికి అతనితో తన పెళ్ళైనప్పటి రోజులు గుర్తొస్తుంటాయి. నరేంద్రతో విడిపోయాక ఆమె ముంబైలో వుండిపోతుంది.
గీత గతం. చదువయ్యి, చిన్నవయసులోనే వుద్యోగంలో చేరుతుంది. ఇంట్లో ఆమెకి పెళ్ళి చెయ్యాలనుకుంటారు. తండ్రి అడిగితే సూచనాప్రాయంగా వాసు పేరు చెప్తుంది. ఆమెని తనింటికి తీసుకెళ్ళి సుధీర్ని చేసుకొమ్మని నచ్చజెప్పే ప్రయత్నం చేస్తాడు రవి. గీతావాసులకి చాలామంది కజిన్స్. చిన్నతనంలో వాళ్లంతా ఒకే స్కూల్లో చదువుకుంటారు. రామారావు యశోద ప్రమీల ఇంటికి వెళ్ళి పెళ్ళివిషయం చెప్పి, ఆహ్వానించి వస్తారు. సుధీర్ గీతని ఇష్టపడతాడు. ఆమెని చేసుకోలేకపోతున్నందుకు బాధపడతాడు.
వెంకట్రావు, విశాల అనే భార్యాభర్తలు అప్పులబాధ తట్టుకోలేక వురివేసుకుని చనిపోతారు. వాళ్ళ కూతురు అమృత. అమృత అవంతీ ఎస్టేట్స్‌లో మాధవరావు ప్రాపకంలో వుంటుంది. పోలీసుస్టేషన్‍కి పిలిచి బెదిరిస్తారు అమృతని. విజయ్, శ్యామ్మోహన్ అండగా నిలబడతారు. తనకి అమృత అంటే ఇష్టమని ప్రసూనకి చెప్తాడు. ఆ విషయం చెప్పి రోహిణిని హెచ్చరిస్తుంది ప్రసూన.


“సుమా! జీవితం అన్నాక రెండిట్లో ఒకచోట రాజీపడక తప్పదు. పెళ్ళిదగ్గిరో, కెరీర్ దగ్గిరో. ఒకటి ప్రాకృతికమైనది, దాంతో ఎన్నో ముడిపడి వుంటాయి. ఇంకోటి వస్తుసంబంధమైనది. అది నీకు ఆనందాన్ని యివ్వగలదేమోగానీ, జీవితంలోని మౌలికతని పరిపుష్ఠం చెయ్యలేదు” ప్రమీలకూడా చెప్పింది. డాక్టరు సంబంధం అనేసరికి గురుమూర్తి ఇంకేం ఆలోచించలేదు. పెళ్ళికొడుకు పేరు విని మళ్ళీ గొడవచేసింది సుమతి.
“అదేం పేరు? అంతా ఏడిపిస్తారు నాన్నా!”
“నా పేరేమేనా గొప్పగా వుందేమిటి? మీ అమ్మ చేసుకోలేదా? వాళ్ళింట్లోలాంటి మంచిపేర్లు ఎంతమందికి వుంటాయి? రవణమ్మనో, వెంకటమ్మనో పెట్టేవాళ్ళు మా యిళ్లలో. నా పేరు గురువయ్యైతే గురుమూర్తని మార్చుకున్నాను. పేరులో ఏముంది? పిల్లవాడు బాగా చదువుకున్నాడు. సంపాదించుకుంటున్నాడు. అందగాడు. పేరుమీద అతనికే లేని అభ్యంతరం నీకెందుకు?” అని నచ్చజెప్పాడు. వినలేదు.
“నీ పేరే మార్చిపారేస్తాను, ఏమనుకున్నావో! అప్పలమ్మనో, పెంటమ్మనో పెట్టేస్తాను” అని అరిచాడు చివరికి విసుగేసి. అలా పెళ్ళిచూపుల ప్రహసనం మొదలై, పెళ్ళికి దారితీసింది. ఉద్యోగం చేస్తానని గొడవచేసింది పెళ్లయాక కొన్నాళ్ళు. దానికి ఆమె అత్తగారు జవాబు చెప్పింది.
“చూడమ్మా! కుటుంబాలు చాలీచాలని జీతాలతో బీదరికంలో కొట్టుకుపోతుంటే మాతరంలో కొందరం వుద్యోగాలు చేసాం. మగాళ్లని వడ్డుని పడేసాం. ఇప్పుడు నీకా అవసరం ఏం వుంది? ఇంటికి రెండేసి వుద్యోగాలు ఇవ్వగలిగే పరిస్థితి మన ప్రభుత్వానికి లేదు. రెండుజీతాలయ్యేసరికి అవసరాలు మారతాయి. కొత్తగా పుట్టుకొచ్చే డిమాండ్లని తీర్చగలిగేన్ని రిసోర్సెస్ మన దేశానికిగానీ, ఇంకా మాట్లాడితే ఈ మొత్తం భూగ్రహానికిగానీ లేవు. డిమాండ్ పెరిగి, సప్లై లేకపోతే ధరలు పెరుగుతాయి. అంటే ఒకళ్ళు ఉద్యోగం చేసి కొనుక్కోగలిగిన వస్తువులని అప్పుడు ఇద్దరు వుద్యోగం చేసి కొనుక్కుంటారు” అంది. మరో విషయంకూడా స్పష్టంగా చెప్పింది. “నీ భర్తది ప్రైవేటు ప్రాక్టీసు. వేళాపాళా వుండదు. నీదారిన నువ్వు వుద్యోగమని వెళ్ళిపోతే రేపు పిల్లలు పుడితే ఎవరు చూస్తారు? అదికూడా ఆలోచించుకోండి”
ప్రమీల మళ్ళీ కూతుర్నే కేకలేసింది. “దేనికే నీకు వుద్యోగం? బైటికెళ్ళి సంపాదించుకుని వస్తేనే ఆడవాళ్ళు గొప్పవాళ్ళా? నువ్వు ఆదాయవనరువి అని అర్థమయ్యాక మగవాడు నిన్నింక భార్యగా చూడ్డం మానేసి, తన బరువుకొంత మోపి, తనకీ, తన తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళూ, పిల్లలూ వున్న కుటుంబానికీ అన్నీ సమకూర్చే మనిషిని చేస్తాడు. చెప్పుకోలేక చెప్పలేదుగానీ, మీ అత్తగారు అలాగే బతికింది. నాకు బాధ్యతల్లేవుకాబట్టి నా సంపాదన మన కుటుంబంలోనే వుండిపోయింది. ఉద్యోగం చెయ్యడం అంత తేలికకాదు, ఆడవాళ్ళకి. ఇల్లూవాకిలీ సర్దుకుని, విస్తట్లోకి నవకాయపిండివంటలూ అమర్చి, ఎవరికీ ఏలోటూ జరక్కుండా చూసుకున్నాక అప్పుడు మనల్ని వుద్యోగానికి వదుల్తారు. అక్కడేం కూచోబెట్టి జీతం యివ్వరు. నీకేనా అంతే. మీకు ఎలాంటి బాధ్యతలూ లేవు. హాయిగా తిని తిరుగు. కనీసం కొన్నాళ్ళు. పిల్లలు పుట్టి, పెరిగి, కాస్త పెద్దవాళ్లయేదాకా. లేని సమస్యలు తెచ్చుకోకు” అంది.
“గీత చేస్తోందికదమ్మా?” అంది సుమతి.
“దానితో నీకు పోలికేమిటి? నలుగురున్న కుటుంబంలో వుంటోంది. పిన్నితో కలిసి పంచుకునేవే తప్ప, ప్రత్యేకించి చేసే పనులూ బాధ్యతలూ ఏమీ లేవు. అడిగేవాళ్ళూ లేరు. పిల్లలు పుట్టినా పిన్నో అత్తో చూసుకుంటారు. వాసుదికూడా పదింటికి వెళ్ళి, ఐదయ్యేసరికి వచ్చేసే వుద్యోగం. దానికి కుదిరినట్టు నీకెలా కుదుర్తుంది? ” అంది ప్రమీల.
ఇలాంటిమాటలు విన్నప్పుడు పురుషాధిక్యతగా కనిపిస్తుంది. పెళ్ళిచేసుకోవడం, పిల్లల్ని కనటం, పెర్పెచ్యువేట్ కావడాన్ని మించి ఆడవాళ్ళకి మరో ధ్యేయం లేదా అనే ప్రశ్న తలెత్తుతుంది. సమాజం అనేది మనం చేసుకున్న ఏర్పాటు. మాతృస్వామ్యం వున్నాకూడా పిల్లని కడుపులో మోసి కనాల్సింది ఆడవాళ్ళే. ఆ శిశువుని రెండేళ్ళో మూడేళ్ళో ఎత్తుకుని తిరగాలి. ఈలోగా ఇంకో శిశువు పుడుతుంది. వీళ్ళని మనం చేసుకున్న ఏర్పాటులో ఇమడ్చడానికి మనిషి జీవితంలో వుండే క్రియాశీలకభాగమంతా ఖర్చౌతుంది. ఇప్పుడు ప్రశ్న. ఆడవాళ్ళు కన్నాక మగవాళ్ళు పెంచవచ్చుకదాని. ఇది తలెత్తే ప్రశ్నే కానీ సరైన జవాబు వున్నదికాదు. కొద్దిమందికి చెందినదికానీ అందరికీ కాదు. కాబట్టి జవాబు సార్వజనీనం కాదు. ఆడవాళ్ళకి ఆడవాళ్ళు సపోర్టు సిస్టంగా వుండేవారు ఒకప్పుడు. అంటే అమ్మలు, అత్తలు పిల్లని చూసుకుంటే వీళ్ళు ఆఫీసులకి వెళ్లగలిగేవారు. వాళ్లతరంలో వాళ్ళుకూడా వుద్యోగాలు చేసి అలిసిపోతున్నారు. అప్పుడు?
కొన్నిరోజుల సుదీర్ఘమైన ఆలోచన తర్వాత అర్థమైంది సుమతికి, చదువనేది కేవలం వుద్యోగం చెయ్యడానికిమాత్రమే కాదు, తనది ప్రొఫెషనల్ కోర్సు కాదు, తనకి వుద్యోగం అవసరం లేదని. చదవటం ఆపలేదు. సంతోషపడటమూ ఆపలేదు. ఆమె స్వతహాగా సంతుష్టజీవి కావడం కొంతైతే భర్తనుంచీ అంటుకున్న సంతోషం మరికొంత.
ఇద్దరు పిల్లలు. పెద్దవాడు కొడుకు. ఆరేళ్ళు. తర్వాతిది పాప. పిల్లలని వొళ్ళో పెట్టుకుని వాళ్లతోపాటు వుయ్యాలలో వూగుతూనూ, వాళ్లు పడుక్కున్నప్పుడు ఏకాంతాన్ని ఆస్వాదిస్తూనూ చదువుతుంది. ఆ రసాస్వాదనలో పడ్డాక వుద్యోగం చెయ్యాలన్న కోరిక మళ్ళీ కలగలేదు.
ఇప్పుడు మహతికోసం పసిపిల్లని వేసుకుని ఒక్కర్తీ రావటం ఆమె భర్త ప్రేమకీ, సంస్కారానికీ లిట్మస్ పరీక్షలాంటిది. మహతిగురించి చెప్పి, వెళ్తానంటే అతను వద్దనలేదు. కొడుకుని ఆయా సాయంతో తను చూసుకుంటానని హామీ యిచ్చాడు. జాగ్రత్తగా వెళ్లమని చెప్పాడు. మధ్యలో రెండు స్టేషన్లలో తెలిసినవాళ్ళు వచ్చి పలకరించి, ఆమెకి భోజనం, పాపకి పాలకి ఫ్లాస్కులనిండా వేణ్ణీళ్ళూ అందించే ఏర్పాట్లూ చేసాడు.
మాధవ్ ఆమెకోసం ప్లాట్‍ఫాంమీద ఒకొక్క కంపార్టుమెంటూ చూసుకుంటూ నడుస్తుంటే వెనక బేక్‍పాక్, ముందు బేబీ కేరియర్, చిన్నస్ట్రాలీతో ఫస్ట్‌క్లాస్ కంపార్టుమెంటులోంచీ దిగింది. ఒకళ్ళనొకళ్ళు చూసుకోగానే వాళ్ల ముఖాల్లో వెలిగిన వెలుగు అపురూపమైనది. తల్లిని హత్తుకుపోయి, నోరు చప్పరిస్తూ, అధరామృతాన్ని కారుస్తూ… మిలమిల్లాడుతున్న కళ్లతో మబ్బుతునకలా చూస్తున్న ఆమె కూతుర్ని చూడగానే చేతులు చాపాడు మాధవ్.
“అది ఎవరి దగ్గిరకీ రాదురా. నన్ను ఎవరేనా ముట్టుకున్నా కూడా ఏడుస్తుంది” అంది సుమతి.
“సేనిటైజర్లు వేసి బాగా పామి కడుగుతున్నారేమిటే, పిల్లని? మనుషుల్ని చూసి బేక్టీరియా, వైరస్‍లనుకుంటోదేమో!”అన్నాడు పకపక నవ్వి.
“ఎంత మిస్ చేసానురా, నీ నవ్వునీ, జోక్స్‌నీ” అంది సుమతి ఆప్యాయంగా అతని మోచెయ్యి పట్టుకుని. అతను ఆమె చేతిని ప్రేమగా నొక్కి వదిలాడు. ఆక్షణాన అతని మనసులో ఎలాంటి కోపం లేదు. ప్రకటిస్తున్న ప్రేమలో భేషజం లేదు.
“ముందు మహీ యింట్లో లగేజి పెట్టి, ఫ్రెషై, దాన్ని తీసుకుని వచ్చేస్తానేం? అమ్మమ్మని చూసికూడా చాలారోజులైంది” అంది. అతను తలూపి, మహతి ఫ్లాట్‍కి తీసుకెళ్ళాడు. ఆమెని అక్కడ వదిలిపెట్టి తమ యింటికి వస్తే, నీలిమ అడిగింది, “ఏరీ ఆవిడ?” అని.
“మహీతో కలిసి వస్తానంది” చెప్పాడు. ఆమె ముఖంలో స్వల్పంగా అసంతృప్తి. మాధవ్ వివరణ యివ్వలేదు. ఆరోజు లీవు పెట్టాడు. అదికూడా నీలిమ అసంతృప్తికి కారణమైంది. మహతి సంఘటనతో లీవు బాగా వాడుతున్నాడతను. డబ్బూ ఖర్చౌతోంది. తిరిగితిరిగి కోపమంతా గీతమీదికి మళ్ళుతుంది, ఇదంతా తమకి చుట్టినందుకు. అసలు దీనంతటితో తమకి సంబంధం ఏమిటి? మాధవ్ భయానికి పైకి అనదు. గవర్నమెంటు లీవు యిచ్చేది ఏడాది కష్టపడి పనిచేసినవాళ్ళు ఆనెలా విశ్రాంతి తీసుకుని కొత్తవుత్సాహంతో తిరిగి వస్తారని. కొన్ని డిపార్టుమెంట్లలో లీవురిజర్వు స్టాఫ్‍కూడా వుంటారు. లీవురిజర్వుని తగ్గించేసి, గవర్నమెంటు లీవు అమ్ముకోవడాన్ని ప్రోత్సహించడం మొదలుపెట్టాక, ఎర్న్‌డ్ లీవుని డబ్బులెక్కల్లోనే చూస్తున్నారు జనం. ఇంత వివరంగా తెలిదుగాబట్టి నీలిమకూడా డబ్బులెక్కలే వేస్తోంది.
పార్ట్‍టైమ్‍గా చేస్తుండటంతో మహతికూడా ఆఫీసుకి వెళ్లద్దనుకుంది. ముందసలు మనుషుల్లో పడితే చాలని అనుకునేవాళ్ళేగానీ ఆమె వెనుక ఇలా లెక్కలు వేసేవాళ్ళు లేరు.
దాదాపు అరగంట తర్వాత సుమతి, మహతి కలిసి వచ్చారు. తమతో సమానంగా అల్లరి చేసి, అవంతీపురం అంతా బలాదూర్‍గా తిరిగిన ఆడపిల్లలు అమ్మలుగా రూపాంతరం చెంది, జిరాఫీపిల్లని పొట్టని కరుచుకుని తెచ్చినట్టు ఒకళ్ళూ, చేత్తో ఎత్తుకుని మరొకళ్ళూ వచ్చేసరికి తమాషాగా అనిపించింది మాధవ్‍కి. నీలిమకి సుమతీ తెలుసు. ఫంక్షన్స్‌లో కలుస్తుండేవారు. ఇలా ప్రత్యేకంగా చూడటం ఇదే మొదలు. ఇద్దరూ పిల్లల్ని నేలమీద దింపి కాస్త కుదురుకున్నారు. నీలిమతో పలకరింపులయ్యాయి. కాఫీ టిఫెన్లు కాసేపటికి వాయిదా వేసారు. సుమతి కూతురు ఏడుపు మొదలుపెట్టింది. మాధవ్ ఎత్తుకోబోతే మరింత గట్టిగా కంయిమంది.
“దాన్ని వదిలెయ్యరా, బాబూ! గీతగురించి చిన్నప్పుడు అత్త అనేదే, గాడిద కూసినా వూరుకోదని, ఆ బ్రాండు” అంది.
మేఘన బిజీగా యిల్లంతా పాకేస్తుంటే మాధవ్ కొడుకు తండ్రి కుర్చీ వెనక నక్కాడు. వాడిని పిలిచి ముద్దుచేసి, తనతో తెచ్చిన బొమ్మలు యిచ్చి, మిగిలిన యిద్దరి ముందూకూడా బొమ్మలు వేసి వూపిరి పీల్చుకుంది సుమతి. ఈలోగా మాధవ్ సుమతి కూతుర్ని అమాంతం గాల్లోకి అంత ఎత్తుకి లేపేసి, అక్కడే తైతక్క ఆడించి వళ్ళో కూర్చోబెట్టుకున్నాడు. ఆ పిల్ల కాస్త తికమకపడింది. ఏడవనా వద్దా అన్న సందిగ్ధంలో పడిపోయింది. నెమ్మదిగా తల్లివైపుకి చేతులు చాపి, ఆమె వొళ్ళోకి చేరిపోయింది. మళ్ళీ కిందకి దింపబోతే దిగలేదు. అలానే తల్లి వొళ్ళో నిద్రపోయింది.
“అమ్మమ్మనికూడా తీసుకు రావల్సింది. ఆవిడ ఒక్కర్తీ అక్కడెందుకు?” అన్నాడు మాధవ్.
“కాసేపయ్యాక వస్తానంది” అంది మహతి.
“ముహుర్తమేమిటో?”
“ఆవిడ వీపుదురదంటూ వుంటుంది. ఇదేవో క్రీములు తీసుకొచ్చింది. అవన్నీ రాయించుకుని హాయిగా వుందని పడుక్కుంది”
“మీ పిల్లల పేర్లేమిటి?” అడిగింది నీలిమ.
“వాడు యశూ… యశస్వి, ఇది తుషార” సుమతి జవాబు.
“బావున్నాయి పేర్లు. ఇదో వీడికి పంకజ్ వుదాస్ పేరు పెడతానన్నారు. మరీ అవంతీపురం పంకజ్ వుదాస్ అనీ, గండిపేట ఏఆర్ రహ్మాన్ అనీ పెట్టుకుంటే బావోదని దెబ్బలాడితే పంకజ్ దగ్గిర ఆగారు” చెప్పింది నీలిమ.
“ఎలా వున్నాడే మీ జోగేశ్వర్రావు?” అడిగాడు మాధవ్ వేళాకోళంగా.
“జో” అంది కోపంగా.
“అది నీకు. ఐనా నువ్వు జో జో అంటూ వుంటే అతను జోలపాడినట్టు నిద్రపోక ప్రాక్టీసెలా చేస్తున్నాడే? “
“డాక్టర్ కేజే రావ్” అంది ఇంకా కోపంగా.
“పేషేంట్లకి. మాకు జోగేశ్వర్రావే. ఏమే మహీ, పెళ్ళిపత్రికలో అలానే వుందికదా?”
“మహీ ఏం చూడలేదు. చూసినా చెప్పదు. మర్చిపోయింది. పోరా, పోయి, మీ నీలమ్మకి చెప్పుకో” అంది.
“నీలమ్మ… నీలూ! ఇదేదో బావున్నట్టుందే” అన్నాడు మాధవ్ పెద్దగా నవ్వి.
“ఉరుము వురిమి మంగలంమీద పడ్డట్టు ఇద్దరూ నా పేరుమీద పడ్డారేంటి?” నీలిమ చిరుకోపంగా.
“నీ గొడవ కాస్త ఆగి చూద్దాం. అసలు విషయం ఇంకొకటి వుంది” అని ఆమెని ఆపి, “ఇన్నిరోజులైంది మేం యిక్కడికి వచ్చి. ఒక్కసారికూడా మా యింటికి రావాలనిపించలేదే, నీకు?” నిలదీసాడు మాధవ్, సుమతిని.
“సుధీర్ పెళ్లైన కొత్తలో ఇక్కడికి బానే వచ్చాం. అప్పటికి మీరు ఇంకా రాలేదు. ఆ తర్వాత… వాళ్ళు స్టేట్స్ వెళ్లడంతో ఆ పరుగులూ అవీ ఆపి, వూపిరి పీల్చుకునేసరికి పిల్లలు… హడావిడి. ఇప్పుడేనా… హైకమాండ్ ఆర్డర్స్… బాబాయ్‍వాళ్ళూ షిఫ్టవడానికి పదమూడునెలలు పడుతుందని లెక్కేసుకుంది. మహతికి తోడుగా మామ్మ అక్కడ వుండిపోయింది, ఒకొక్కళ్ళూ నెలేసి రోజులు మీ అమ్మదగ్గర వుండి పండగ చేసుకోండని సీనియర్స్‌కి బంఫర్ అఫర్ యిచ్చింది. మిగిలిన నాలుగునెలలూ మామధ్య సర్దుబాటు చేసింది. రాక తప్పుతుందా?” అంది సుమతి.
“గీతకోసం వచ్చావుగానీ, నాకోసం కాదన్నమాట” అంది మహతి.
“ఏం ఫిట్టింగ్ పెట్టావే?” అంది సుమతి.


1 వాసు, గీత – భార్యాభర్తలు, మేనత్తమేనమామ పిల్లలు. మయూఖ్, విహంగ్ గీతావాసుల పిల్లలు. రామారావు గీత తండ్రి.
2 ప్రమీల – రామారావు పెద్ద చెల్లెలు. సుధీర్, సుమతి, సుమంత్ ఆమె పిల్లలు. భర్త గురుమూర్తి.
రమ – సుధీర్ భార్య. వ్యాస్, హాస్ వాళ్ళ పిల్లలు. సరళ ఆమె తల్లి. సుమతి భర్త జోగేశ్వర్రావు.
3 లక్ష్మి – రామారావు రెండో చెల్లెలు. వాసు, మాధవ్, తులసి ఆవిడ పిల్లలు. నీలిమ మాధవ్ భార్య. పంకజ్ కొడుకు.
4 నిర్మల – రామారావు మూడో చెల్లెలు. నారాయణ ఆమె భర్త. మహతి, రవళి ఆమె కూతుళ్ళు.
నరేంద్ర, మహతి భర్త, మేఘన కూతురు. విజయ నరేంద్ర రెండో భార్య. హరి, ఇందిర ఆమె పిల్లలు.

1 thought on “ఝరి – 46 by S Sridevi”

  1. I was very pleased to uncover this great site. I need to to thank you for ones time for this fantastic read!! I definitely appreciated every bit of it and I have you bookmarked to look at new information on your blog.

Comments are closed.