ఝరి – 56 by S Sridevi

  1. ఝరి – 46 by S Sridevi
  2. ఝరి – 47 by S Sridevi
  3. ఝరి – 48 by S Sridevi
  4. ఝరి – 49 by S Sridevi
  5. ఝరి – 50 by S Sridevi
  6. ఝరి – 51 by S Sridevi
  7. ఝరి – 52 by S Sridevi
  8. ఝరి – 53 by S Sridevi
  9. ఝరి – 54 by S Sridevi
  10. ఝరి – 55 by S Sridevi
  11. ఝరి – 56 by S Sridevi
  12. ఝరి – 57 by S Sridevi
  13. ఝరి – 58 by S Sridevi
  14. ఝరి – 59 by S Sridevi

జరిగిన కథ-వాసు, గీత భార్యాభర్తలు. గీత ఆత్మహత్యకి ప్రయత్నం చేసి బైటపడుతుంది. తులసికి కేన్సరొచ్చి తగ్గుతుంది. భర్తతో విడిపోవాలనుకుంటుంది. అతనికి విడాకులు ఇష్టం వుండదు. గీతకి ఎవరో ఫోన్‍చేసి బెదిరిస్తారు. ఆ ఫోన్ సుధీర్‍ చేసాడేమోననే అనుమానం వస్తుంది వాసుకి. మహతి భర్తతో విడాకులు తీసుకుంటుంది. మేఘన ఆమె కూతురు. తల్లి దగ్గిరే వుంటుంది. తండ్రికి యాక్సిడెంటైతే చూడటానికి వస్తుంది. మహతితో విడాకులయ్యాక నరేంద్ర మరో పెళ్ళి చేసుకుంటాడు. ఆమెవలన ఇద్దరు పిల్లలు. ఆమె చనిపోతుంది. అతనికి యాక్సిడెంటైతే సాయానికి హాస్పిటల్‍కి వెళ్తుంది మహతి. రాత్రి అతనికి అటెండెంటుగా వుంటుంది. పిల్లలని వాసు తనింటికి తీసుకెళ్తాడు. మహతికి అతనితో తన పెళ్ళైనప్పటి రోజులు గుర్తొస్తుంటాయి. నరేంద్రతో విడిపోయాక ఆమె ముంబైలో వుండిపోతుంది.
గీత గతం. చదువయ్యి, చిన్నవయసులోనే వుద్యోగంలో చేరుతుంది. ఇంట్లో ఆమెకి పెళ్ళి చెయ్యాలనుకుంటారు. తండ్రి అడిగితే సూచనాప్రాయంగా వాసు పేరు చెప్తుంది. ఆమెని తనింటికి తీసుకెళ్ళి సుధీర్ని చేసుకొమ్మని నచ్చజెప్పే ప్రయత్నం చేస్తాడు రవి. గీతావాసులకి చాలామంది కజిన్స్. చిన్నతనంలో వాళ్లంతా ఒకే స్కూల్లో చదువుకుంటారు. రామారావు యశోద ప్రమీల ఇంటికి వెళ్ళి పెళ్ళివిషయం చెప్పి, ఆహ్వానించి వస్తారు. సుధీర్ గీతని ఇష్టపడతాడు. ఆమెని చేసుకోలేకపోతున్నందుకు బాధపడతాడు.
వెంకట్రావు, విశాల అనే భార్యాభర్తలు అప్పులబాధ తట్టుకోలేక వురివేసుకుని చనిపోతారు. వాళ్ళ కూతురు అమృత. అమృత అవంతీ ఎస్టేట్స్‌లో మాధవరావు ప్రాపకంలో వుంటుంది. పోలీసుస్టేషన్‍కి పిలిచి బెదిరిస్తారు అమృతని. విజయ్, శ్యామ్మోహన్ అండగా నిలబడతారు. తనకి అమృత అంటే ఇష్టమని ప్రసూనకి చెప్తాడు. ఆ విషయం చెప్పి రోహిణిని హెచ్చరిస్తుంది ప్రసూన.


నిర్మల పార్థివదేహాన్ని తీసుకురావడానికి రవి, నందకిశోర్ నారాయణకి తోడుగా వెళ్ళారు. రామారావు ఇక్కడి ఏర్పాట్లు చూడటానికి వుండిపోయాడు. పిల్లలూ పెద్దవాళ్ళూ అందరూ ఒకళ్ళొకళ్ళుగా ఆ యింటికి చేరుకుంటున్నారు. ఆ కుటుంబంలో జరిగిన మరణవిషాదాల్లో ఇది రెండోది. మొదటిది లక్ష్మి భర్తది. అప్పుడది తమలో ఒకరికి వచ్చిన కష్టంలా అనిపించింది. ఇదిమాత్రం తమకే వచ్చిన కష్టం అని అందరికీ అనిపించింది. విజ్జెమ్మ మంచం పట్టేసి వుంది. ఆవిడకి ఇవి ఆఖరిరోజులన్నట్టే. అలాంటి సమయాన వచ్చి పడిన దు:ఖం ఇది.
“పెద్దదాన్ని నేనుండగా ఏం తొందరొచ్చిందే, నీకు?” అని ఏడ్చింది ప్రమీల. ఎన్నో దు:ఖాలు ఆమె గుండెల్లో గూడుకట్టుకుని వున్నాయి. అవన్నీ ఒక్కసారి కరిగి ప్రవహించాయి. కనిపించని దు:ఖాన్ని తనలో ఎంతోకాలం మోసిన లక్ష్మి అప్పుడూ యిప్పుడూ నిర్వికారంగానే వుంది. తన చేత్తో పెళ్ళి చేసి పంపించిన చెల్లెలికి ఇప్పుడీ తతంగాలు చేయవలసిరావడం రామారావుకి దిగ్భ్రమగా వుంది. జీవితం ఇంక ముగింపుకి వస్తోందా? ఒక్కమనిషిగా పుట్టి, అనేక జీవితాలతో ముళ్ళూ వేసుకుంటూ పెరిగి, ఆ ముళ్ళని యిప్పుకుంటూ వంటరిగా తిరిగి వెళ్ళిపోవటమేనా, జీవితానికి అర్థం? ఇన్నేళ్ళ ప్రయాసకి ఫలితం? అర్థంకాని అయోమయం.
“అమ్మని నేనే చంపుకున్నాను. అక్కడికి వాళ్ళు రాకుండా వుండాల్సింది. కళ్ళెదుట నేను కనిపిస్తూ వుంటే తట్టుకోలేకపోయింది. నాకే బాధా లేదమ్మా అంటే నమ్మలేదు. లేని దు:ఖాన్ని వూహించుకుని బలైపోయింది” అని భోరుని ఏడ్చింది మహతి. రవళి అక్కని పట్టుకుని ఏడుస్తూ వుండిపోయింది. తమని తిట్టీ, కోప్పడీ, బుజ్జగించీ, బుద్ధులు చెప్పీ, ఇంతవాళ్ళని చేసిన తల్లి, తమ బాధలన్నిటినీ తమతో సమానంగా మోసిన తల్లి, ఆవిడ రుణం తీర్చనివ్వకుండానే వెళ్ళిపోయింది. ఇకమీదట తాము పెద్దవాళ్ళు. ఎవరికీ తమపట్ల అలాంటి బాధ్యత వుండదనుకుంటే కడుపులోంచీ తెర్లుకు వచ్చింది దు:ఖం. చనిపోయిన వ్యక్తిచుట్టూ గజిబిజిగా అల్లుకుని ఎన్నో బంధాలు. బాంధవ్యాలు, రక్తసంబంధాలు, చుట్టరికాలు. ఆ ముడులన్నీ ఇప్పుకోవడానికి ఎవరికివారే ప్రయాసపడుతున్నారు. బాధపడుతున్నారు.
సుధీర్ సూచనమీద వాళ్ళ బేచి అందరూ కలిసి కొంత బాధ్యతని పంచుకోవాలనుకున్నారు. వాసు తండ్రి పోయినప్పుడుకూడా ఇచ్చారు. గీత ఆ డబ్బుకి మరికొంత కలిపి ఆయన పేరుమీద మయూఖ్ స్కూల్లో స్కాలర్‍షిప్ పెట్టించింది. వాళ్ళకి పుష్కలంగా డబ్బుంది. ఆ పని చెయ్యగలిగింది. మహతి ఆర్ధికపరిస్థితి ఎలా వుందో తెలీదు. భర్తని వదిలిపెట్టి బతుకుతోంది. నిలదొక్కుకుందో లేదో! కుటుంబం మొత్తం ముంబైకి మారటానికి చాలా ఖర్చు వచ్చింది. అదంతా దృష్టిలో వుంచుకుని తలోకొంతా ప్రహ్లాద్ అకౌంట్లో వేసారు.
దానికిముందు అతనికి భార్యతో కొంత చర్చలాంటిది జరిగింది. దాన్ని వాదన అనచ్చు. అది సందర్భం కాదని ఆమెకి తెలీదు. ఆమెకి ఈ కుటుంబాన్ని ఏకతానుగా చూడటం ఇప్పటికీ రాలేదు. నిర్మల పోవడాన్ని తమకి పెద్దగా సంబంధం లేని ఒక సంఘటనగానే అనిపిస్తోంది.
“బావుంది. ప్రతీదానికీ మీరంతా వేసుకోవడమేమిటి? వాళ్లకి లేదా, పోదా? పోనీ వాళ్ళ ఆస్తుల్లో మీకేమైనా భాగం పంచుతారా?” అంది నిరసనగా.
“ఒకళ్ళకొకళ్ళం వున్నామన్న నమ్మకం కలిగించడానికి ఇస్తున్నాం. ఆస్తులు పంచి యిచ్చేంత త్యాగాలు మనమేం చెయ్యడం లేదు” అన్నాడతను.
“ఐతేమాత్రం? ఏదొచ్చినా ఇలా డబ్బులు ఇవ్వడం దేనికి? ఎవరికి వుండేది వాళ్ళకి వుంటుంది. వాళ్ళ స్థాయిలో వాళ్ళు ఖర్చుపెట్టుకుంటారు” అంది తగ్గకుండా.
అతను ఆమెని నిశితంగా చూసాడు. “వాళ్ళూ మనమూ కాదు. మనది ఒకటే కుటుంబం. చాలా పెద్దకుటుంబం. ఈ పదిపన్నెండురోజులూ వెళ్ళేవాళ్ళం వెళ్తాం, వచ్చేవాళ్లం వస్తాం. మా అమ్మావాళ్ళు తొమ్మండుగురిలో ఒకళ్ళు పోయారు. మహీకీ, రవళికీ వచ్చిన కష్టం చిన్నదేం కాదు. వాళ్ళని దగ్గిరుండి చూసుకోవాలి. వంటమనుషులకీ, భోజనాలకీ మిగతావాటికీ చాలా ఖర్చొస్తుంది. బాబాయ్ ఎంతని పెట్టగలడు? ఒక్కళ్ళమీద భారంమోపి తినాలంటే అందరికీ ఇబ్బందిగా వుంటుంది. ఇతరకులస్తుల్లో ఒక్కోరోజు ఒకొక్కళ్ళని ఖర్చులు పెట్టుకుంటారు. చదివింపులుకూడా చేస్తారు కొందరు. అందరూ తలోచెయ్యీ వేస్తేనే ఇలాంటి కార్యక్రమాలు సరిగ్గా సాగుతాయి” అన్నాడు వివరణ యిస్తూ. ముందుగానే చెప్పి వప్పించకపోతే ఆ తర్వాత అక్కడికెళ్ళి మాట తూలే మనిషి మాధురి.
“మందమందంతా వెళ్ళడం దేనికి? పదోరోజుని కనిపించి వస్తే చాలదా?” అంది.
“ఈ మంద నచ్చేకదా, ముందు నిన్ను తోసాడు ఇందులోకి? అది చాలదన్నట్టు నీ చెల్లెళ్ళిద్దరినీకూడా మందలో కలిపేసాడు?” అన్నాడు కొంచెం మొరటుగా. అతను ఇలా మాట్లాడుతుంటే విన్నప్పుడు అరుణ చాలా బాధపడుతుంది. ఎంతో సున్నితంగా, జాగ్రత్తగా పెంచింది పిల్లలని, లోలోపలి పశుప్రవృత్తి బైటికి తీస్తుందేమిటీ ఈ పిల్లని బాధపడుతుంది.
“చూడు, ఒక్క ఐదువేలల్లో మన ఆస్తులేం కరిగిపోవు. ఒకవేళ నీకు అలా కరిగిపోతూ కనిపించినా, అందర్లో ఏం మాట్లాడకు. కార్యక్రమాలన్నీ అయాక లెక్కలు తేల్చుకుందాం” అన్నాడు అతనే.
“మీ అందరిమధ్యనీ నోరెత్తేంత ధైర్యం నాకెక్కడిదిగానీ?” అని, “అందరూ చేరతారుకదా? ఆ యింటివిషయం ఒకమాటు ఎత్తకూడదూ? నీలిమ మీకేమన్నా పరాయిదా? స్వంత మరదలేకదా?” అంది అతని మాటకి వప్పుకున్నందుకు బేరమాడుతున్నట్టు.
“ఏ యిల్లు?” అడిగాడు ప్రహ్లాద్ అర్థం కానట్టు.
“వాసు బావగారికి మీరంతా కూర్చుని చెప్తే వినరా? మాధవ్ ఆయన స్వంతతమ్ముడేకదా?”
“నేను అందులో కలగజేసుకోను. అది వాళ్ళింటి విషయం. వాళ్ల నాన్న పోయినప్పుడు జరిగిన గొడవ చాలు. మీ నాన్న రావాలనుకుంటే పదోరోజుని వచ్చి ధర్మోదకాలు ఇచ్చి, ఇంత తిని, మర్యాదగా వెళ్ళిపొమ్మను. మీ అమ్మ రాకూడదుకాబట్టి ఆయన నోరు తెరవకుండా చూసుకునే బాధ్యత నీది” కచ్చితంగా అన్నాడు.
“ఇంత పెద్దకుటుంబం, అంత పెద్దకుటుంబం అని గొప్పగా చెప్పుకుంటారు, తినిపోవడానికేనా, మంచీచెడూ చెప్పుకోవడానికి కాదా?”
“ఎవరి మంచి వాళ్ళకి తెలుసు. ఒకళ్ళు ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. వాసు, మాధవ్ ఇద్దరూ నాకు ఆమ్మ పిల్లలు. ఇద్దరూ సమానమే. వాసేనా, తమ్ముడు కష్టపడున్నాడంటే వెయ్యో పదివేలో సర్దగలడుగానీ, ఇంట్లో వాటా వదులుకోడు. వాడేకాదు, ఎవరేనా అంతే. అందులో తులసికీ వాటా వుంటుంది. దాని భర్త ఎందుకు వదులుకుంటాడు? అనవసరంగా దాని కాపురంలో సమస్యలు తేవద్దు”
“అదేమిటి? ఆ అమ్మాయికి బోల్డు కట్నం యిచ్చారు. భారీగా ఖర్చుపెట్టి పెళ్ళి చేసారు. ఇంకా వాటా ఏమిటి?”
“ఐతే? కట్నం ఇవ్వకపోతే పెళ్ళిళ్ళు జరగవు. అందుకని యిస్తారు. నీ పెళ్ళి నువ్వు చేసుకో అని ఆడపిల్లని వదిలెయ్యరు. అలా వదిలేస్తే అది ఏ తలకిమాసినవాడినో తీసుకొస్తే వాడిని కలుపుకోలేక పెద్దసమస్యకదా? అందుకు ఆడపిల్ల పెళ్ళిబాధ్యత పెద్దవాళ్ళు, అన్నదమ్ములు తీసుకుంటారు. ఆస్తిలో వాటా చట్టపరంగా వస్తుంది. వద్దంటున్నా వాళ్ళింటిమీద పడ్డాయేమిటి మీ తండ్రీకూతుళ్ళ కళ్ళు? మాధురీ! ఇది మనకి సంబంధం లేని వ్యవహారం. ఇప్పటికే వాసుకీ, ఆమ్మకీ మనమీద చాలా కోపంగా వుంది, ఆరోజుని వాళ్ళింట్లో నువ్వలా అన్నందుకు. ఒకసారికాదు, రెండుసార్లు జరిగింది అలా. తెలివితక్కువమాటలని వదిలెయ్యనివ్వకుండా ఇంకా ఎగసెనదోస్తున్నారు మీరు. అది మంచిదికాదు” నచ్చజెప్తున్నట్టు అన్నాడు.
ఆమె బలంగా నిశ్వసించింది. కోపంగా చూసింది. పెళ్ళైన మొదట్లో అతను తనేం చెప్పినా వినేవాడు. తర్వాత తర్వాత మార్పొచ్చింది. ప్రతిదానికీ హద్దురేఖలు గీస్తున్నాడు. వాసూ, గీతలతో పోలిస్తే నీలిమా, మాధవ్‍లు తమకి దగ్గిర. ఇప్పటికి ఇంకా స్వంతిల్లు లేకుండా వున్నారు వాళ్ళు. వాళ్ళపక్షం తీసుకుని, వసంత్‍ని కలుపుకుని పెద్దవాళ్లమధ్య ఆ యింటి విషయం గట్టిగా అడగచ్చు. చెల్లెలి అత్తగారుకూడా తమవైపే వుంది. కానీ ఇతను అడగడు. ఆ విషయంలో చాలా అసంతృప్తి వుంది మాధురికి.
“నేనిప్పుడు అటే వెళ్తున్నాను. నువ్వు నాతో వస్తావా? విడిగా వస్తావా?” అడిగాడు వెళ్లడానికి వుద్యుక్తుడై.
“ఇప్పుడే వచ్చి చేసేదేముంది? అందులోనూ కర్మ జరిగేది మీ వదినగారి పుట్టింట్లో. బయటినుంచీ వచ్చిన కోడళ్ళం ఎవరికీ కంటికి ఆనం. ఆవిడ విశ్వరూపదర్శనం చూడ్డానికి రావాలి” అంది నిరసనగా.
“నీ యిష్టం” అనేసి వెళ్ళిపోయాడు. కొంతమంది దు:ఖాలు ఎవరూ తీర్చలేరు. గీతంటే పడదు. వాసు వదులుకుంటే వచ్చే ఆస్తులు కావాలి. మాధవ్‍ గీతని అభిమానించకూడదు. తనుమాత్రం ఈమె చెల్లెళ్ళని నెత్తిమీద పెట్టుకోవాలి. వాసు, గీత ఒకళ్లనొకళ్ళు ఇష్టపడి చేసుకున్నారంటే హేళన. మాధవ్, నీలిమల ప్రేమకథ మాత్రం అద్వితీయం. హిడింబి, భీముడు అందొకసారి వాసూగీతలని. చాచిపెట్టి కొట్టాలన్నంత కోపం వచ్చిందతనికి. తమాయించుకున్నాడు.
“ఇంకోసారి వాళ్లని తక్కువచేసి మాట్లాడకు మాధురీ! నాకు నచ్చదు. మర్యాదకని వూరుకుంటున్నాను. నేనూ నోరు తెరవాల్సి వస్తుంది” అన్నాడు ఆరోజుని కటువుగా. అప్పుడు అంటుకున్న కటుత్వం అతన్ని వదలట్లేదు. అకారణమైన ఈ ద్వేషాలు, అసూయలు తమ వైవాహికబంధాన్ని ప్రభావితం చేసి, రసస్ఫూర్తిని కరిగిస్తున్నాయని అర్థం చేసుకోదు. అతను నిట్టూర్చాడు.
డబ్బు డ్రా చేసుకుని మహతిని వెతుక్కుంటూ వెళ్ళాడు. గీత, రవళి, మహతి, సుమతి ఇంకా కొంతమంది ఒక గదిలో కూర్చుని వున్నారు. వెళ్ళి మహతి పక్కని కూరున్నాడు. ఏడ్చేడ్చి అందరి ముఖాలూ ఎర్రగా వుబ్బి వున్నాయి.
“ఏమిటే, ఇది? వీళ్ళిద్దర్నీ ఓదార్చడం మానేసి ఇంకా ఏడిపిస్తున్నారా?” అని అడిగాడు. అతనికీ కళ్ళలో నీళ్ళు తిరిగితే కళ్ళద్దాలు తీసి తుడుచుకుని మళ్ళీ పెట్టుకున్నాడు.
“ఈ డబ్బు వుంచవే” మహతి చేతిని తనచేతిలోకి తీసుకుని అందులో పెట్టాడు.
“ఏమిట్రా, ఇది? ఉంది డబ్బు” అంది చెయ్యి వెనక్కి తీసుకుని.
“లేదని ఇవ్వట్లేదు మహీ! లేకుండా ఎలా వుంటుంది? మనందర్లోకి ఎక్కువ బాధలు పడుతున్నది నువ్వు. నీ కష్టాన్నీ బాధనీ మేమెవ్వరం తుడిచెయ్యలేం. కొంచెం భారం పంచుకోనీ. భార్యలూ, భర్తలూ ఎవ్వరూ మనకి ఆత్మబంధువులు కారు, కాలేరు. చిన్నప్పట్నుంచీ కలిసిమెలిసి పెరిగినవాళ్ళం, మనకి మనమే” అన్నాడు నిర్వేదంగా. వచ్చేముందు జరిగిన వాదన అతన్ని చాలా బాధపెడుతోంది. అతని భుజమ్మీద తలవాల్చి ఏడ్చేసింది మహతి.
“రుణపడిపోతున్నానురా, మీ అందరికీ. ఎందుకురా, ఇంత ప్రేమ?” అంది ఏడుస్తునే.
“అంతంత పెద్దమాటలు వద్దు మహీ! చిన్నప్పట్నుంచీ కలిసి వున్నాం. ఇప్పుడూ అంతే” అని, “రవళీ! ధైర్యం తెచ్చుకోవాలమ్మా! మేమంతా లేమా?” అంటూ ఆమెనీ వోదార్చాడు.
డబ్బు నేరుగా నారాయణకో, రామారావుకో ఇవ్వచ్చు. వాళ్ళు పిల్లల దగ్గిర్నుంచీ తీసుకోరు. ఎవరికివాళ్ళే మహరాజులు. వాళ్ళతరంలో ప్రతీదీ పకడ్బందీగా ప్రణాళికతో చేసుకున్నారు. ప్రతిబాధ్యతకీ ఎంతో కొంత డబ్బు ఏర్పాటు చేసుకున్నారు. ఆ పరిధిలోనే వుండి బాధ్యతలని తీర్చుకున్నారు. తన చెల్లెలి పెళ్ళికి ఖర్చంతా తండ్రే పెట్టుకున్నాడు. తులసి పెళ్ళికి వాళ్ళింట్లోనూ అంతే. వసంత్‍కీ సమీరకీ ఒకేరోజు చేసారు. ఖర్చుల్ని మూడుకుటుంబాలవాళ్ళూ పంచుకున్నారు. అంతదాకా ఎందుకు? గీత పెళ్ళప్పుడు ఐదుగురు అక్కచెల్లెళ్ళూ ఇద్దరు తమ్ముళ్ళూ కలిసి కొంత డబ్బు అన్నగారికి సాయంగా ఇవ్వాలని నిర్ణయం చేసుకుని తన తల్లిని రాయబారం పంపారట.
“నేను పెళ్ళికూడా చెయ్యలేని స్థితిలో వున్నానని గీతకి అనిపించడం నాకిష్టం లేదు. అందరం పలచనౌతాం. నా తహతుకి తగ్గట్టు చేస్తాను. మీకు ఇవ్వాలనిపించిందేదో పిల్లకి ఇవ్వండి. దానికీ సంతోషంగా వుంటుంది” అన్నాడట మేనమామ. గీత పెళ్ళప్పటికి తామెవరికీ వుద్యోగాలూ సంపాదనలూ లేవు. ఆ తర్వాత వుద్యోగాలు వచ్చినా కలెక్టివ్‍గా చేసింది ఏమీ లేదు. రాణా భార్యకి ఆరోగ్యసమస్య వచ్చినప్పుడు గీత ప్రతిపాదన చేసింది.
“మన పదకొండుమందిమీ పెద్దవాళ్ళయ్యాం. మగపిల్లలు మీకందరికీ, నాకూ, రవళికీ వుద్యోగాలు వున్నాయి. మనందరం నిలబడి ఎంతోకొంత సాయం చేస్తే రాణా భార్యకి జరిగే వైద్యానికి ఇంకాస్త హెల్ప్‌గా వుంటుంది” అంది. సుమతికూడా యిచ్చింది. మహతి ఇవ్వలేకపోయింది. సెటలైట్స్ బేచి అంటే ప్రవల్లికా, కృష్ణావాళ్ళు నలుగురూ తమతో చేరారు. ఇప్పుడిప్పుడు క్రేడిల్స్ బేచిలో పిల్లలు ఒకొక్కళ్ళుగా చేరుతున్నారు. ఈ ఇచ్చుకోవటాలు పెద్దవాళ్ళకి సంబంధం లేని, పిల్లల వ్యవహారంగా వుండిపోయింది.