వస్తాడు నా రాజు by Thulasi Bhanu

“ఏవిటేవ్, మహ అందంగా తయారవుతున్నావ్, సాయంత్రం గెస్ట్‌హౌస్‍కి రా.. బంగారుగొలుసు తీసుకుపోదువు, నీ బంగారంలాంటి వంటికి బంగారం మరీ అందాన్నిస్తుంది” అని కారుకూతలు కూస్తున్నాడు చలపతి, బీడీలు చుడుతున్న మంగని, ఆశగా చూస్తూ.
“రేయ్, గుడిసెలపక్కకి, ఈమధ్య అడవిదున్న ఒకటి, తెగ తిరిగి, గేదెలని, దూడలని సంపేత్తోందిట. సాయంత్రం మనమిద్దరం కొడవలి, గునపం పట్టుకుని సిద్ధంగా ఉందాం. దాన్ని అక్కడే నరికినరికి సంపేద్దాం…” అన్నాడు వెంకడు, సత్యంతో. పరోక్షంగా, చలపతికి వార్నింగ్ ఇస్తూ.
వాడు ఆ బీడీల ఫాక్టరీకి, సరుకులు, ఎత్తిదించే, వ్యాన్ డ్రైవర్. వాడంటే ఊర్లోవాళ్ళకి భయమే, చలపతితోసహా.. వెంకడు ఒక్కదెబ్బ కొడితే చాలు, వళ్ళు చచ్చుబడిపోతుంది అని.
చలపతి, వెంకడి మాటలకి భయపడి, తోకముడవడం చూసి మంగ , వాడిని మెచ్చుకోలుగానూ, కృతజ్ఞతగానూ చూసింది.
మంగకి తండ్రి ఎన్ని పెళ్ళి సంబంధాలు చూసినా వద్దంటోంది. తల్లి గట్టిగా నిలదీసి అడిగేటప్పటికి చెప్పేసింది, తనకు వెంకడిమీద ప్రేమ ఉందనీ, పెళ్ళంటూ చేసుకుంటే వెంకడినే చేసుకుంటానని.
“ఎహె, ఆడి జాతి, మన జాతి వేరు వేరు. వాడితో నీ మనువుకి నేనొప్ప..” అని తెగేసి చెప్పేసాడు మంగతండ్రి
“లేదు అయ్యా, నా మనసుని నేను తిప్పుకోలేను, నాకు వెంకడే నా భర్త…” అని తన అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పేసింది మంగకూడా.
” ఛీ ఫోవే నా ఇంట్లోంచీ… ” అని ఇంట్లోంచి గెంటేసాడు తండ్రి…
వెంకడి దగ్గరకు బయల్దేరి వెళ్ళింది మంగ. ఆవేశం ఎక్కువగా ఉండే వెంకడు దివాణంపెద్ద, సూరయ్యతో, గొడవపడుతున్నాడని తెలిసి, దివాణానికి పరుగు పరుగున వెళ్ళింది.
సూరయ్య, పూజారి వడ్డీకట్టలేదని, అతని కూతురి పెళ్ళికి ఆధారం అనుకున్న ఎకరం పొలాన్ని తన పేరుమీద రాసిచ్చేయమని ఒత్తిడి తెస్తున్నాడు. పూజారి అస్సలు ఒప్పుకోవట్లేదని, అతని ఇల్లంతా తన మనుష్యులతో, చిందరవందరగా చేయించి, పూజారి పూర్వీకులు, ఇల్లు దాటనీయద్దని చెప్పి దాచి ఉంచిన చిన్నభోషాణం పెట్టెని బలవంతంగా ఎత్తుకొచ్చేయించాడు సూరయ్య. అలా జరగటం, తమ వంశానికీ, ఇంటికీ, అరిష్టమనీ అపశకునమనీ, బాధపడి పరిగెత్తుకొచ్చాడు సూరయ్య ఇంటికి పూజారి.
ఆ గొడవ తీర్చటానికి వెంకడు సూరయ్యతో గొడవపడుతున్నాడు. గొడవపెరిగి సూరయ్య తన మనుష్యులతో వెంకడిని ముట్టడించేలా చేసి, తమ దివాణంలో చీకటిగదిలో బంధించేసాడు. అది చూసిన మంగ బీడీలఫాక్టరీలో తనతో కలిసి పనిచేసే కార్మికులతో కలిసి, సూరయ్యమీదకి దండెత్తి వచ్చింది. దివాణంలోకి బలవంతంగా చొరబడి వెంకడిని వెతికి బయటకు తీసుకొచ్చింది సురక్షితంగా.
ఇంకోగంట ఆగుంటే దివాణం చీకటిగదిలోకి నాగుపాముని వదిలి వెంకడిని చంపించేసేవాడు సూరయ్య. మంగ చకచకా జనాలను పోగేసి దివాణంమీద దాడిచేసింది కాబట్టి , ఆకాస్తసమయంలో ఏమీ చేయలేకపోయాడు. అసలు మంగ ఇంత త్వరత్వరగా వెంకడిని బయటికి తీసుకెళుతుందని సూరయ్య ఊహించలేదు.
మంగచేత వెంకడు కొండదగ్గర గుడికొచ్చివెళ్ళే యాత్రికులు ఇష్టంగా కొనుక్కువెళ్ళే చిక్కుడుగింజలు, బొప్పాయిముక్కలు, ఆనపకాయలు, సహజంగా పండించే కాయగూరలు, ఉసిరికాయలలాంటివి అమ్మే ఏర్పాటు చేసాడు.
మంగ వాటితోపాటు మల్లెలు, కనకాంబరాలు, డిసెంబర్‍పూలు ఇలా సీజన్నుబట్టీ వచ్చే పూలను చిక్కగా మాలలుకట్టి ఇష్టంగా అమ్మేది. పూలమాలలు కొనుక్కుని వెళ్ళేవాళ్ళు, “లా అందంగా మాలకట్టావు అమ్మాయ్!” అని అంటే మంగ సంతోషంతో పొంగిపోయేది.
మంగ వెంకడికి తన ఇష్టం గురించి తెలియచెప్పింది. తండ్రి తనమీద కోపంచేసాడనికూడా చెప్పుకుంది.
“పిల్లా, నీ ఇష్టం నాకు అదృష్టవశాత్తూ దొరికిన వరమేకానీ మీ అయ్య ఒప్పుకోనీ. అప్పుడు మనం మనువాడుకుందాం” అనేసాడు వెంకడు.
అలా సంవత్సరం గడిచింది. మంగతండ్రి, మంగ ఊసే మరిచాడు. రెండోకూతురికి పెళ్ళి జరిపిస్తున్నాడు. మంగ మనసు ఇహ పూర్తిగా విరిగిపోయింది. తండ్రి నిరాదరణకు కుమిలికుమిలి ఏడ్చింది. మనసుపడ్డ మనిషిని, నన్ను అన్నివిధాలా కాపాడుకుంటూ, కళ్ళల్లో పెట్టుకుని చూసుకునేవాడిని, నేను పెళ్ళి చేసుకోవాలనుకోవటం తప్పా, నాకంటూ ఇష్టం ఉండకూడదా… అని ఆలోచించుకుంది.
మర్రోజు చెరువులో తలారా స్నానంచేసింది. అమ్మవారిని మనసారా తలుచుకుంటూ చెరువులో అయిదుమునకలు మునిగింది. కొత్తచీర కట్టింది. నుదుటిన పెద్దబొట్టులాగా దిద్దుకుంటూ కళ్యాణతిలకంలాగా మలుచుకుంది. జడనిండా మల్లెలు, మరువం, కనకాంబరాలు కలిపి వత్తుగా అల్లుకున్న రెండుమూరల పూలు పెట్టుకుంది. అద్దంలో చూసుకుంటే, తనకు తానే సీతమ్మతల్లిలా అందంగా కనిపిస్తున్నాననుకుని మురుసుకుంది. తీరిగ్గా అన్నిరకాల పూలు గుట్టగాపోసి పెట్టుకుని, తనకి ఇష్టమైన పాట పాడుకుంటూ పెద్దమాల అల్లి చివరన ముడేసింది. అందమైన పూలదండ తయారయ్యింది.
వెంకడు చెరువులో స్నానం చేసి వచ్చి చెట్టుక్రింద ఉన్న జంటపాముల విగ్రహం దగ్గర నుదుట కుంకుమ పెట్టుకుని భక్తిగా రెండుచేతులూ జోడించి దేవునికి దణ్ణంపెట్టుకుంటున్నాడు. అతని మెడలో మెత్తగా పూలదండ పడింది. కళ్ళుతెరిచి చూసాడు. ఎదురుగా పూర్తి అలంకరణలో అందంగా, ముగ్ధమనోహరంగా నవ్వుతూ సిగ్గులమొగ్గవుతున్న మంగ.
“ఇహనుంచీ నువ్వే నా భర్తవి, నా అర్ధభాగానివి” అంటోంది స్పష్టాస్పష్టంగా.
“ఏవిటిది మంగా, ఎందుకీ తొందరపాటు? మీ నాన్నని ఒప్పించుకునేవాళ్ళంకదా” అన్నాడు వెంకడు, మంగను మందలిస్తూ.
“మా నాన్న ఎప్పటికి ఒప్పుకునేను? మనం ముసలివాళ్ళం అయినా మానాన్న మనని పట్టించుకుంటాడన్న నమ్మకం నాకు లేదు మావా ” అంది సర్దిచెబుతున్నట్టుగా.
వెంకడు అడ్డంగా తలూపుతూ మెడలోని పూలదండ తీసి చెట్టుకొమ్మకి వేలాడదీసి కోపంగా వెళ్ళిపోయాడు. మంగమాత్రం కొత్తపెళ్ళికూతురిలాగా, “నా భర్తని, నన్ను చల్లగా చూడు దేవుడా! ” అని శ్రద్ధగా, భక్తిగా దణ్ణంపెట్టుకుని వేడుకుంది మనసారా.
ఆరోజు సాయంత్రం ఎర్రంచు తెల్లచీర కట్టుకుని తలనిండా మల్లెలపూల ధరించి తల్లి దగ్గరకు వెళ్ళింది. తల్లి పాదాలకు దణ్ణం పెట్టుకుని తల్లిని తనివితీరా గుండెలకు హత్తుకుని , తన వివాహజీవితం మొదలుపెట్టేందుకు తల్లి ఆశీస్సులు తీసుకోవాలి అనుకుంది.
తమ ఇల్లు కాస్తంత దూరంలో ఉండగా, ఇంటిముందు ఏదో గలాటా జరుగుతోందని చూసింది మంగ. పరుగుపరుగున వెళ్ళి చూసింది.
“బాబూ, ఒక్కనెల సమయం ఇవ్వు. నా రెక్కలు ముక్కలయ్యేలా శ్రమపడైనాసరే, మీ అమ్మకి బంగారు చెవిదుద్దులు చేయిస్తా. నాకూతురి పెళ్ళిజీవితం మొదలవకుండానే పాడుచేయద్దు బాబూ! ఎన్ని ఆశలతోనో నా కూతురు నీచేత మూడుముళ్ళూ వేయించుకుంది” అని తండ్రి కొత్తపెళ్ళికొడుకు రమణని బతిమాలాడుతున్నాడు.
రమణ తల్లి , రమణ చెయ్యిపట్టుకుని లాక్కుపోవాలని చూస్తోంది. చెల్లి మణి ఏడుస్తోంది. తల్లి తలకొట్టుకుంటూ, చీరకొంగు నోటికి అడ్డంపెట్టుకుని ఏడుస్తోంది. మంగకి ప్రాణం కొట్టుకుపోయింది.
“అయ్యో! నా మనుషులు కష్టంలో ఉన్నారు” అనుకుని గబగబా చెల్లి దగ్గరకు వెళ్ళి ఓదార్పుగా చెల్లి చెయ్యిపట్టుకుంది.
రమణ తల్లి పార్వతి, మంగని చూసి “ఇదుగో, నీ పెద్దకూతుర్ని ఎలాగో కట్నం ఖర్చు తప్పించుకోవడానికి బయటకు తరిమేసావుగా, చిన్నకూతురికి పెట్టేందుకుకూడా లోభిస్తావెందుకూ ” అని మంగ తండ్రిని నిందించింది.
అప్పుడు మంగవైపు, మంగతండ్రి “నువ్వెందుకు తగలడ్డావు ఇప్పుడు ఇక్కడికీ?” అన్నట్టు అసహ్యంగా చూసాడు. మంగకి మనసుకి చాలా బాధనిపించింది తండ్రి చూపులకి. అప్పుడే వెంకడు అక్కడికి వచ్చాడు.
“రమణా! అమ్మకి సోమవారంకల్లా మంగా, నేనూ వచ్చి బంగారం అందిస్తాము. మణిని కాపురానికి తీసుకెళ్ళండి” అని రమణకి మాటిస్తున్నాడు.
“ఛీ! ఎవడిక్కావాలిరా నీ నీచమైన సొమ్ము? ధూ… నీడబ్బుతో నా చిన్నకూతురి కాపురం బాగుపడేట్లయితే, నాకు అది బరువేమీకాదు, నాతోనే ఉంటుంది ” అన్నాడు మంగ తండ్రి ఛీత్కారంగా వెంకడిని చూస్తూ.
“అయ్యా! అవునవునూ, నీ జాతే రమణది. కానీ నీకూతురిని పెళ్ళిచేసుకునికూడా వాళ్ళమ్మకి బంగారం పెళ్ళిసమయానికి నువ్వు ఇవ్వలేకపోయావని, కట్టుకున్న భార్యని బాధపెడుతున్నాడు. కానీ వెంకడు మానవత్వం నిండుగా ఉన్న మానవుడు. ఆయనకు జాతి, హోదాతో పనిలేదు. సాటిమనిషికి సాయంచేస్తే చాలు అనుకుంటాడు అలాంటివాడిని నువ్వు ఛీ కొడతావు, ధూ అంటావు. మీవైపుకి వెంకడు రాకూడదని నువ్వనటంకాదు. అసలు వెంకడి వ్యక్తిత్వానికి మీరు తూగలేరు” అంది ఆవేశంగా మంగ.
“మంగా! నువ్వుండు… మణీ! నువ్వెళ్ళమ్మా రమణతో… రమణా! తల్లి ఎంత ముఖ్యమో, తాళికట్టాక భార్యకూడా అంతే ముఖ్యం. మన యువకులం అటు తల్లికీ, ఇటు భార్యకీ ఇద్దరికీ న్యాయం చేయాలి. నీవంట్లో సత్తువలేదా? నీ గుండెల్లో నీమీద నీకు నమ్మకంలేదా? ఆమాత్రం వాళ్ళిద్దరికీ నువ్వు సమకూర్చలేవా? మణిని ప్రేమగా, బాధ్యతగా మీయింటికి తీసుకెళ్ళు. వచ్చే సోమవారం మంగ తన చెల్లెలి ఇంటికి బంగారం, చలిమిడితో సారె తీసుకొస్తుంది ” అని వెంకడు రమణకి నమ్మకం కలిగించాడు, తక్షణ కర్తవ్యం బోధించాడు.
రమణ తన తల్లివైపు ఊరుకోమ్మా, ఒప్పుకోమ్మా అన్నట్లు చూసి “మణీ! నీ సామాన్లు సర్దుకున్నట్లేనా? మనింటికి బయలుదేరుదాం” అన్నాడు.
మంగ తల్లి వెంకడికీ రమణకీ చేతులు జోడించింది. అలా వద్దు అన్నట్లు వెంకడు తలడ్డంగా తిప్పుతూ తనూ చేతులు జోడించాడు. రమణ మణితో కలిసి అత్తకి, మావకి కాళ్ళకు దణ్ణం పెట్టుకున్నాడు.
మంగ, వెంకడి వైపు ప్రేమగా చూస్తూ దగ్గరకువచ్చి నుంచుంది.
మంగ తండ్రి తెలిసీతెలియని, అర్థం అయ్యీ అవ్వని అసహనంతోనూ, వూరటతోనూ వూగిసలాడుతూ ఓపక్కన నుంచుని ఉన్నాడు.
చెల్లికాపురం పదిహేనురోజుల్లో సరిదిద్దింది మంగ, వెంకడి సాయంతో. తండ్రి అభిప్రాయంలో, వెంకడి పట్ల ఎలాంటి సానుకూలమార్పూ లేదు.
“నీ తండ్రికూడా పూర్తిగా ఇష్టపడితేనే మెడలో తాళికడతాను. లేదంటే నిన్ను నాభార్యగా దగ్గరకు తీయను” అన్నాడు వెంకడు స్పష్టంగా.
మంగకి వెంకడి ఆలోచనల్లో మంచితనమూ, మూర్ఖత్వమూ రెండూ కనిపిస్తాయి. ఎవ్వరూ లేని వెంకడు, మంగకూడా తన కారణంగా తల్లికీ తండ్రికీ చెల్లికీ దూరం కాకూడదు అనుకుంటాడేకానీ ఇప్పటికీ మంగను తండ్రి ఇంట్లోకి రానివ్వట్లేదు అనేది సరిగ్గా అర్థంచేసుకోడు.


పట్టణంలో మల్టీప్లెక్స్ పనికి పోయాడు వెంకడు. తరువాత బొంబాయికికూడా చేరిపోయాడు ఇంకా పెద్దపెద్దపనుల కాంట్రాక్టులకు ఒప్పుకుని. మంగకు దూరందూరంగా ఉంటే అయినా, ఆమె తండ్రి ఆమెని దగ్గరకు తీస్తాడని. మంగ మరొకరిని పెళ్ళిచేసుకుని అమ్మానాన్నలకు దగ్గరవుతుందేమో అని వెంకడి ఆలోచన. మంగకి ఏ లోటూ ఉండకూడదని వెంకడి ప్రయత్నం.
వెంకడు తనపక్కన ఉంటే తనకి, తన ఆనందానికి ఏ లోటూ ఉండదని మంగకి తెలుసు. తనకి తెలిసింది ఎన్నిసార్లు నచ్చచెప్పాలని చూసినా, వెంకడు ఏదో ఒక సందేహంతోనో, సంశయంతోనో మంగకి దూరంగానే ఉన్నాడు తప్ప మంగని దగ్గరకు తీయలేదు. మంగ తల్లి ఎంతలా బతిమలాడినా, మంగ తండ్రి మూర్ఖంగా ఉండి, వెంకడిని తమలో కలుపుకోవటానికి అస్సలు ఒప్పుకోలేదు.
సంవత్సరాలు గడిచినా మంగ ఒంటరితనానికి పరిష్కారం దొరకట్లేదు. ఇంక ఆ దసరాకి ఊరు వచ్చిన వెంకడిని మంగ నిలదీసింది. మంగ తల్లికూడా వెంకడిని అడిగింది. మంగ మెడలో తాళికట్టమనీ, కూడా తనతో పాటుగా బొంబాయికి తీసుకెళ్ళమని.
వెంకడూ ఒకరకమైన మొండివాడు, మంగ తండ్రీ ఒకరకంగా మూర్ఖుడు. ఫలితంగా మంగ, జంటలేని పక్షిలా మిగిలిపోయింది.
వెంకడిది మంచితనంకాదూ, మొండితనం అని మంగకి అర్థం అయ్యేసరికి ఆమెకి పెళ్ళి వయసు దాటిపోయింది. అయినా మంగకూడా తాను ఒకనాడు వెంకడి మెడలో దండ వేసేసిందికాబట్టి వెంకడే తన భర్త అని మరొకరితో పెళ్ళి అన్న ఆలోచనే చెయ్యలేదు.
“వస్తాడు నారాజు ఈరోజు… ఏదో ఒకరోజు మంగా అంటూ తన ప్రేమని నాకు అందిస్తాడు నా వెంకడు” అని అనుకుంటూ చుట్టూ పచ్చని ప్రకృతి, మేఘాలు ముసిరి వానపడేలాంటి వాతావరణంలో, కొండరాయిమీద కూర్చుని తన ప్రాణసఖునికోసం ఎదురుచూస్తూ ఉంటుంది మంగమ్మ .

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *