ఝరి – 76 by S Sridevi

  1. ఝరి – 76 by S Sridevi
  2. ఝరి – 77 by S Sridevi
  3. ఝరి – 78 by S Sridevi
  4. ఝరి – 79 by S Sridevi
  5. ఝరి – 80 by S Sridevi
  6. ఝరి – 81 by S Sridevi
  7. ఝరి – 82 by S Sridevi
  8. ఝరి – 83 by S Sridevi
  9. ఝరి – 84 by S Sridevi
  10. ఝరి – 85 by S Sridevi
  11. ఝరి – 86 by S Sridevi
  12. ఝరి – 88 by S Sridevi
  13. ఝరి – 89 by S Sridevi
  14. ఝరి – 90 by S Sridevi

పొద్దున్న ఏడూ ఎనిమిదిమధ్యని బద్ధకంగా లేచి వయ్యారంగా వంటింట్లోకి వెళ్ళి, రెండు కప్పుల కాఫీ చేసుకుని, ట్రేలో పొందిగ్గా అమర్చుకుని తెచ్చుకుని మాధవ్‍తో కూర్చుని తాగి, తొమ్మిదింటిదాకా అతన్తో కబుర్లు చెప్పి, అతను ఆఫీసుకి వెళ్ళాలని తయారౌతూ వుంటే మళ్ళీ వంటింట్లోకి వెళ్ళి ఉప్మాయో, మరోటో చేసుకొచ్చి, ఒకళ్ళకొకళ్ళు తినిపించుకుంటూ ముద్దుమురిపాలు తీర్చుకున్నాక అతన్ని ఆఫీసుకి పంపి, కాసేపు విశ్రాంతి తీసుకుని, స్నానం చేసి, వంట మొదలుపెట్టి అతను భోజనానికి వచ్చేవేళకి పూర్తిచేసి, ఇద్దరూ కూర్చుని మాట్లాడుకుంటూ తినాలని వుంటుంది నీలిమకి.
కానీ గీతతోఅలా కుదరదు. పొద్దున్నే ఐదూ ఆరూ మధ్యలో లేచేస్తారు భార్యాభరలు. కాఫీ తాగుతూ పెరట్లో కూర్చుంటారు. దొర్లీ దొర్లనట్టు, ప్రభాతసమయపు ఏకాంతానికి భంగం కలుగుతుందేమోనన్నట్టు ఒకటి రెండు మాటలు. వాసు తండ్రికి కాఫీ అవీ అవసరం లేదు. చిన్న ఎలక్ట్రిక్ కెటిల్ వుంటుంది ఆయన దగ్గిర. దాంట్లో వేడినీళ్ళు కాచుకుని నిమ్మకాయరసం తేనె కలుపుకుని తాగుతాడు.
“వేణ్ణీళ్ళు పెట్టి, నేను కలిపిస్తాను మామయ్యా!” అని గీత ఎన్నిసార్లో చెప్పింది. ఆయన వినడు.
ఆరింటికి వాసు గ్రౌండుకి వెళ్ళిపోతాడు. మళ్ళీ రావటం తొమ్మిదింటికి. పెళ్ళవకముందు మాధవ్‍కూడా కలిసేవాడు. ఇప్పుడిక అతను రావట్లేదు. వాసు ఒక్కడే వెళ్తాడు. గీత నవల తెచ్చుకుని చదువుతూ అక్కడే కూర్చుంటుంది. పనావిడ రావడం, వెళ్లడం ఔతాయి. లక్ష్మి లేస్తుంది. ఆవిడ వెంటే మయూఖ్ వస్తాడు. పనులు మొదలౌతాయి. స్నానం చేసి, పూజ చేసుకుని చకచక వండేస్తుంది గీత. ఆఫీసులకి వెళ్ళేది నలుగురు. అందరూ భోజనాలు చేసి, బాక్సులు తీసుకెళ్తారు. బాక్సుల్లో పెట్టడానికి ఉప్పుపిండో, పులిహోరో ఇంకా అలాంటివేవో చేస్తుంది. అందరూ వెళ్ళాక మిగిలినవన్నీ జాగ్రత్తగా చిన్నగిన్నెల్లో సర్దిపెడుతుంది లక్ష్మి. నీలిమ ఆలోచనలకి ఇదంతా భిన్నంగా వుంటుంది. యాంత్రికంగా తనూ ఏవో చేస్తున్నట్టు చెయ్యి కలిపినా, అయిష్టంగానే.
“అంత పొద్దున్నే వండుకోవడం దేనికండి అక్కా? టిఫెన్లు తినేసి ఆఫీసుకెళ్ళి మధ్యాహ్నం భోజనాలకి ఇంటికి రావచ్చుకదా?” అంది గీతతో.
“ఆఫీసన్నాక చాలా పనుంటుంది నీలిమా! ఒక్కోసారి లంచికి టైముండదు. టిఫెనైతే వేళదాటినా తినెయ్యచ్చు. ఆఫీసుకి వెళ్ళిందగ్గర్నుంచీ ఎప్పుడూ ఇంటికి వెళ్ళాలా అని ఆలోచిస్తుంటే అక్కడ పనెలా ఔతుంది? కూర్చోబెట్టి ఎవరూ జీతం ఇవ్వరుకదా?” అంది గీత.
“మా నాన్న అలానే చేస్తారు. పొద్దున్న కాఫీ ఎలాగా తాగుతారు. టిఫెను తినేసి, మరోసారి కాఫీ తాగి ఆఫీసుకెళ్తారు. ఒంటిగంటకల్లా వచ్చేస్తారు. మళ్ళీ మూడింటికి వెళ్ళి రాత్రి కొంచెం పొద్దుపోయాక వస్తారు”
“అందరికీ అలా కుదరదులే” అంది గీత. మగవాళ్ళు ఆఫీసువేళలో బైటపనులమిద తిరిగినా, రాత్రిదాకా వుండి పని పూర్తిచేసుకుంటారు. ఆడవారికి అలా కుదరదు. అందుకని సీటు వదలకుండా పనిచేసుకుని, వేళకి బైటపడతారు. ఐదయ్యేసరికి ఠంచనుగా బేగులు సర్దేస్తారని కొన్నిసార్లు మాటా పడతారు. ఇవన్నీ ఉద్యోగానుభవం లేని నీలిమకి తెలీవు.
“ఏమో మరీ!” అంది. అదోక పదప్రయోగం. నువ్వేదో చెప్పావు, నాకు దానిమీద నమ్మకం కలగలేదు అని సూచిస్తుంది. గీత వాదన పొడిగించలేదు.
“అంత పొద్దున్నే వండేసరికి మీరు తినే టైముకి అన్నీ చల్లారిపోతున్నాయి. పోనీ వాళ్ళ వంట అక్క చేసినా మనకి నేను వండనా?” లక్ష్మిని అడిగింది నీలిమ.
“రోజుకి మూడుసార్లు వంటంటే బోల్డంత గేస్ ఖర్చౌతుంది నీలిమా! సిలిండరు బుక్ చేస్తే నెలైనా రావటం లేదు. నువ్వూ వాళ్లతో తినేసెయ్” అంది లక్ష్మి. నీలిమది అలా పరిష్కారంవైపుకి జరిగి సర్దుకునే తత్వం కాదు.
“అంత పొద్దుటే భోజనం చేస్తారేమిటి మీరు? ఆకలి ఎలా వేస్తుంది? తినబుద్ధౌతుందీ?” మాధవ్‍తో అంది.
“వదిన అందరికీ అలా అలవాటు చేసేసింది. గ్రౌండుకి వెళ్ళొస్తాంకదా, నేనూ వాసూను? మంచి ఆకలిమీద వుంటాం” అన్నాడతను.
“ఇప్పుడు మీరు వెళ్ళట్లేదుకదా?” అడిగింది.
“ఇక వెళ్ళడం మొదలుపెట్టాలి. ఇక్కడ వున్నన్నిరోజులేనా వెళ్తే బావుంటుంది. వేరేచోటికి ట్రాన్స్ఫరైతే గ్రౌండూ అవీ వుండవు” అన్నాడతను.
“అబ్బ! మీకు ఎలా చెప్పాలో తెలీడం లేదు. మీ వదిన పొద్దున్న పొద్దున్నే వండిపడేసే అన్నం తినడానికి ఆకలి పుట్టడంకోసం మీరిప్పుడు గ్రౌండుకి వెళ్ళి ఆడి ఆవురావురుమంటూ రావాలా? భలే వున్నారు” అని మురిపెంగా విసుక్కుంది. అతను నవ్వేసాడు.
“సరే, నువ్వే చెప్పు. ఏం చెయ్యాలో” అన్నాడు.
“పొద్దున్న వెళ్తే రాత్రికిగానీ రారు మీరు. మాట్లాడే మనిషి లేక బోరుకొట్టిపోతుంది. మధ్యలో రావచ్చుకదా?” అంది. మిగిలినవాళ్లకి తోచకపోవడం సమస్య వుండదు. తోచకపోతే ఏదో ఒక పుస్తకం తీసుకుని చదువుకుంటారు. మరొకళ్ళు వచ్చి కాలక్షేపం చెయ్యాలని అనుకోరు. ఎమెస్కో పాకెట్‍బుక్స్, కొన్ని పత్రికలూ తెప్పించుకుని అన్నిళ్ళమధ్యా తిప్పుకుంటారు. నీలిమ పుస్తకాలు పెద్దగా చదవదు. చుట్టూ అన్ని పుస్తకాలు చూసి, ఇప్పుడిప్పుడే తిరగేస్తోంది.
“అక్కకీ చెప్పాను. తనకి వీలవదంట. మీరేనా రండి” అంది తనే మళ్ళీ. మాధవ్‍ మరోలా అర్థమ్ చేసుకున్నాడు. తనకీ వాళ్ళకీ కేడర్ తేడా వుంది. లంచికి లేచిన వుద్యోగిని ఆపి, “ఆ ఫైలు తీసుకురా!” అని చెప్పగలిగే అధికారం తనకి వుంది.
“లంచికి వెళ్తున్నాను, వచ్చాక ఇస్తాను” అనగలిగే అవకాశం వాళ్ళిద్దరికీ లేదు. ఆ విషయాన్ని అతను పైకి అనలేదు. కానీ నీలిమ చురుకైనది. గ్రహించింది. అర్థం చేసుకుంది. ఎక్కడ, ఎలా అన్వయించుకోవాలో అక్కడ అలా అన్వయించుకుంది.
“మీ అమ్మగారు వినేలా చెప్పండి, మధ్యాహ్నం భోజనానికి వస్తానని. నే వండి పెడతాను. నా వంటకూడా రుచిచూద్దురుగాని. ఎప్పుడూ మీ వదిన వంటేనా?” అంది.
తనంత విపులంగా చెప్పినా ఆమె మాట నెగ్గించుకుందని లక్ష్మికి అర్థమైంది. మనసు చివుక్కుమంది.
“వాళ్ళిద్దరికీ వండకులే, గీతూ! మాధవ్ లంచికి వస్తాడట. ఇద్దరికీ వేడిగా వండుకుని తింటామన్నారు” మర్నాడు చురుగ్గా అంది గీతతో.ఆమె నవ్వేసింది.
“నువ్వే పార్టీ?” అడిగింది. “పోన్లే అత్తా! కొత్తగా పెళ్లైందికదా, మాధవ్‍తో ప్రైవసీ కోరుకుంటోందేమో!” సర్దిచెప్పింది. లక్ష్మీ నవ్వింది. తులసికి పెళ్ళి చేసి పంపెయ్యడం మంచిదైందనిపించింది ఆమెకి. మర్నాడు మామూలువేళకి మయూఖ్‍కి పెట్టి, తను తినేసి, గిన్నెలన్నీ తోమటానికి వేసేసింది. ఆమెకీ కొంచెం పంతం వుంది. ఏదో ఇంత అన్నం వండి, కాస్త వేపుడు చేసి, మిగిలిన ఐటెమ్స్‌తో సరిపెట్టచ్చుననుకున్న నీలిమ అన్నీ మొదట్నుంచీ వండాల్సి రావటంతో తెల్లబోయింది. వాళ్ళిద్దరూ కావాలనే ఇలా చేసారనిపించింది. మాధవ్‍కి చెప్పాలనుకుంది. ఎలా చెప్పాలి? ఏమని చెప్పాలి? అంతకుముందు ఇలాంటి అనుభవం ఒకటి జరిగింది. వంటింట్లో జరిగిన ఏదో విషయం అతనికి చెప్పబోయింది.
“నేనిప్పుడు అక్కడికి వచ్చి నీవైపున వకాల్తా తీసుకోవాలా? బావుండదు నీలూ! నలుగురు మనుషులు వుండేచోట నాలుగు అభిప్రాయాలు వుండటం సహజం. నలుగుర్నీ ఒకతాటిమీదికి లాక్కురావటమేకదా, కుటుంబం అంటే. అమ్మ ఎలా చెప్తే అలా విను. ఆవిడ పెద్దదికదా?”అన్నాడు.
“ఆవిడ మీ వదినవైపే మాట్లాడతారు” అంది కినుకగా.
“వదినెవరు? మా మామయ్యకూతురు. అంటే వదినవి ఆవిడ పుట్టింటి పద్ధతులు. అందుకని ఇద్దరికీ కలుస్తుంది. వాళ్ళిద్దర్నీ నీదారికి రమ్మనడంకన్నా నువ్వే కాస్త సర్దుకుపోవటం బావుంటుంది. లేకపోతే నచ్చజెప్పు” అన్నాడు.
“అంటే నేనే పైదాన్నన్నమాట” అంది ఆమె విసురుగా.
ఇలాంటి గొడవలు వచ్చినప్పుడు ఎలా సర్దుబాటు చెయ్యాలో మగవారికి తెలీదు. ఆ తెలీకపోవటంతోనే అటు తల్లికో, ఇటు భార్యకో కంటౌతారు.
ఇప్పుడు చెప్పినా, “నువ్వేకదా, నాకు వండి పెడతానన్నది?” అని అడుగుతాడు మాధవ్. ఎటూ మాట్లాడలేక వూరుకుంది.
తర్వాతెప్పుడో తల్లితో చెప్తే, “సిగ్గుందా నీకు? అత్తగారూ, పెద్దతోడికోడలూ వండిపెడుతుంటే కూర్చుని తింటున్నది చాలక తంపులు పెట్టుకుంటున్నావా? పొద్దున్నే తిని ఆఫీసుకి వెళ్ళడానికి మీ ఆయనకి లేని అభ్యంతరం నీకేంటి? ఉన్నవి తినడానికి మీ అత్తగారికి లేని బాధ నీకెందుకు?” అని తల్లి ఆమెనే కేకలేసింది.
చిన్నచిన్న గొడవలు మొదలౌతున్నాయి. ఏ యిల్లూ కోడలిరాకతో మొదలవ్వదు. అప్పటికే అనేక వ్యవహారాలు జరిగి వుంటాయి. కోడలు రావడమన్నదే ఆ వ్యవహారాల్లో ఒకటి. లక్ష్మి భర్త ఇంట్లోంచీ వెళ్ళిపోయి తిరిగి వచ్చినప్పట్నుంచీ వాళ్ళ కుటుంబవిషయాలన్నీ రామారావే చూసుకుంటున్నాడు. ఇప్పుడుకూడా అటో యిటో వెళ్తూ రెండుమూడురోజులకి ఒకమాటు వచ్చి చెల్లెల్ని చూసి వెళ్తాడు. ఏది చెయ్యాలన్నా ఆవిడ అన్నగారికి చెప్పకుండా వుండదు. నిర్ణయం వాళ్లదైనా దాన్ని జరిపించేది వాసు. మాధవ్‍ పట్టించుకోడు. వాసు ఏదేనా చెయ్యమంటే చేస్తాడు. అతనివరకూ ఆయన ఇంకా మేనమామే. అన్నకి పిల్లనిచ్చిన మామగారిగా మారలేదు. కనిపిస్తే ఎదురెళ్ళి చెయ్యిపట్టుకుంటాడు.
చిన్నప్పుడు పిల్లలందరిదీ తలోరకం అల్లరిగా వుండేది. అమ్మమ్మతో పోట్లాట వచ్చినప్పుడల్లా మాధవ్ ఆవిడ పొయ్యి విరిచేసేవాడు.
“మామయ్య రానీ! నీ వీపు విరగ్గొట్టిస్తాను” అని ఆవిడ బెదిరించేది. అతను ఇంటిమీదికి ఎక్కి కూర్చునేవాడు. దిగడం వచ్చేదికాదు. మిగిలిన పిల్లలందరూ చుట్టూ మూగి చూసేవారు. అక్కడినుంచీ పడతాడేమోనని లక్ష్మి భయపడేది. వాసో, రాణాయో ఎక్కాలనుకున్నా, మాధవ్ ఇంకే దుడుకుపని చేస్తాడోనని పెద్దవాళ్ళు ఆపేవారు. ఆఖరికి రామారావు వచ్చి దిగమని బతిమాలేవాడు.
“దిగను మామయ్యా! నేను ఇక్కడే వుంటాను. దిగితే నువ్వు కొడతావు” అనేవాడు మాధవ్. అరగంట బతిమాలటాలూ బుజ్జగింపులూ అయ్యాక చాక్లెట్ కొనిస్తాననే ప్రమాణం చేయించుకునేవాడు. రామారావు నిచ్చెన వేసి బలంగా పట్టుకుంటే దిగేవాడు. దిగేసరికి భయంతో చెమటలు పట్టేసేవి.
“అంత భయం వున్నవాడివి ఎందుకు ఎక్కేవురా? పడితే ఏ కాలో చెయ్యో విరిగేదికదరా? ” అని కోప్పడేవాడాయన.
“ఇదోనే లక్ష్మీ! నీ కొడుకుని జాగ్రత్తగా దింపుకొచ్చాను. మాకిద్దరికీ చాక్లెట్లు నువ్వే కొని పెట్టాలి” అనేవాడు నవ్వుతూ. ఆ మేనమామ మాధవ్ మనసులోంచీ చెరిగిపోలేదు. నీలిమకి ఇవేవీ తెలీవు. గీత తండ్రికి ఇచ్చిన ప్రాధాన్యత తన తండ్రికి ఇవ్వట్లేదనుకుంటుంది.
“మా నాన్నతోకూడా ఓ మాట చెప్తే…” అంటుంది.
“ఏం చెప్పాలి?” అని అడుగుతాడు మాధవ్.
“మీ అమ్మగారు అన్ని విషయాలూ పూసగుచ్చినట్టు ఆయనకి చెప్తారు. ముఖ్యమైనవికూడా మానాన్నకి చెప్పరేంటి?” ఆమె కోపం.
ఏం చెప్పగలడు అతను? తండ్రి ముగ్గురు పిల్లలతో ఇల్లొదిలేసి పారిపోతే వెతికి తీసుకొచ్చి మళ్ళీ ఇంటికి కట్టేసిన సంగతి చెప్పగలడా? అప్పట్నుంచీ కుటుంబం బాగోగులు చూసింది ఆయనే అని చెప్పగలడా? అన్నీ చేయించుకుని, ఇప్పుడు నీ అవసరం ఇంక మాకు లేదని చెప్పగలడా?
“నాన్నని చూసావుకదా, ఎంతసేపూ భక్తీ, పూజలూ అంతే. మా చిన్నప్పట్నుంచీ మామయ్యే దగ్గిరుండి అన్నీ చూసుకునేవాడు” అన్నాడు.
“ఇప్పుడు మీరు పెద్దవాళ్లయారుకదా?”
“ఐతే ఏంటి? మేం పెద్దవాళ్ళమైపోయాం. ఇంక నీ అవసరం మాకు లేదని చెప్పమంటావా? నాకు చేతకాదుగానీ, నువ్వెళ్ళి చెప్పు” అన్నాడు కొంచెం కఠినంగా. అతనలా అంటే నీలిమ కళ్ళమ్మట నీళ్ళు పెట్టేసుకుంటుంది. అతనికి గిల్టీగా అనిపిస్తుంది.
“నీలూ! మా తాతయ్య అమ్మావాళ్ళ చిన్నప్పుడే పోతే అందరినీ చూసుకున్నదీ, చదివించి పెళ్ళిళ్ళు చేసిందీ మామయ్యే. అన్నాచెల్లెళ్ళమధ్య అనేకం వుంటాయి. వాళ్ళు తొమ్మండుగురైనా ఏ ఇద్దరిమధ్యా ఒకేలాంటి ఇంటరాక్షన్స్ వుండవు. ఆడవాళ్లలో పెద్దదని ఆమ్మని తనతో సమానంగా చూస్తాడు. మా అమ్మతో ఇలా. అరుణ పిన్నిని చూసావుకదా? ఆయన పక్కని కూర్చునీ, చెయ్యిపట్టుకుని తిరుగుతూనూ చిన్నపిల్లలా సంతోషపడుతుంది. మా అందరి జీవితాలూ ఆయనతో అల్లుకుపోయి వున్నాయి. ఆయన్ని మేము ఏరకంగానూ బాధపెట్టలేము. గీతని ప్రేమగా చూసుకోవడంకూడా అందుకే. ఆయనకి సంతోషం కలుగుతుందని. అదేమీ చెడ్డపిల్ల కాదు. మీ నాన్నని మనింటికి రావద్దని ఎవరూ అనలేదు. రెండురోజులకోమాటు ఆయన్నీ రమ్మను. వచ్చి అమ్మతో వ్యవహారం మాట్లాడమను. ఏవేనా పనులు చెప్తే అందుకొమ్మను. మన రెండుకుటుంబాలకీ మధ్య సంబంధాలు పెరుగుతాయి” అన్నాడు బుజ్జగిస్తున్నట్టు.
“వదిన్ని పట్టుకుని అదీ ఇదీ అంటారేంటి? ఎవరేనా వింటే తప్పుపడతారు. ఎవరిదాకానో ఎందుకు, మీ అన్నయ్యకే కోపం రావచ్చు” మాట మార్చేసింది.
“చిన్నప్పట్నుంచీ అలా అలవాటైపోయింది. వాళ్ల పెళ్ళిలో అమ్మమ్మ అందరికీ వార్నింగిచ్చింది, తనని ఇకమీదట వరసతో పిలవాలని. మా అందరికన్నా ఎక్కువగా వాసే నవ్వాడు. చాలా బావుండేది నీలూ, లైఫ్ అప్పట్లో. మా బేచి మొత్తం పదకొండుమందిమి. కలిసి అల్లరిచేస్తూ వుండేవాళ్లం. సగంమందికి అప్పుడే పెళ్ళిళ్లైపోయాయి. పిల్లలుకూడా పుట్టేస్తున్నారు. పెద్దవాళ్ళమైపోతున్నాం కదూ?” అన్నాడు. చిన్నప్పటి విషయాలు చాలా చెప్తాడతను. గీత ప్రస్తావన వచ్చేదాకా బాగానే వింటుంది. ఆమె మాట రాగానే ఏదో వుక్కిరిబిక్కిరితనం. ప్రహ్లాద్‍ని మాధురి అడిగినట్టు నువ్వూ తనని చేసుకోవాలనుకున్నావా అని అడగలేదు. చిన్నప్పుడెప్పుడో వేసుకున్న బంధాల్లో ఇంకెంతకాలం ఇరుక్కుని వుంటారు, బైటికిరాకుండా? బాల్యస్నేహాలు, లోతైనస్నేహాలు వుండచ్చు, మరీ ఒకింట్లోనే వుంటే ఎలా? అని ప్రశ్నించుకుంటోంది.
“నాన్న ఇటొచ్చిపోతూ వుంటే బావుంటుందికదమ్మా? మా తోడికోడలి తండ్రి మాటమీద ఇల్లంతా నడుస్తుంది. మా స్థానం ఎక్కడో నాకు తెలీడంలేదు. మాధవ్‍కి చెప్పినా వినడు” అంది తల్లితో దిగులుగా.
ఆవిడ సుదీర్ఘంగా నిశ్వసించింది.
“పెళ్ళై కొత్తగా వెళ్ళింది నువ్వు నీలూ! నువ్వు వెళ్ళకముందునించే ఆ మనుషులున్నారు. అలానే వున్నారు. ఇమడటానికి ప్రయత్నం చెయ్యి. వాళ్ళంతా కలిసి ఆ పిల్లని నెత్తిన పెట్టుకుని వూరేగనీ. అటేమైనా మీ అత్తగారు ఎక్కువ పెట్టేస్తుంటే మేం చూస్తూ వూరుకుంటామా? పెట్టడానికేనా వున్న ఆస్తులేమిటి? ఆ యిల్లొక్కటేనా? ఇప్పట్నుంచీ అలాంటి ఆలోచనలు దేనికి?” అంది.
కానీ నీలిమ కోరుకునేది, తెల్లకాగితంలాంటి, తను తప్ప మరే బలమైన అనుబంధాలూ లేని మాధవ్‍ని.