ఝరి – 79 by S Sridevi

  1. ఝరి – 76 by S Sridevi
  2. ఝరి – 77 by S Sridevi
  3. ఝరి – 78 by S Sridevi
  4. ఝరి – 79 by S Sridevi
  5. ఝరి – 80 by S Sridevi
  6. ఝరి – 81 by S Sridevi
  7. ఝరి – 82 by S Sridevi
  8. ఝరి – 83 by S Sridevi
  9. ఝరి – 84 by S Sridevi
  10. ఝరి – 85 by S Sridevi
  11. ఝరి – 86 by S Sridevi
  12. ఝరి – 88 by S Sridevi
  13. ఝరి – 89 by S Sridevi
  14. ఝరి – 90 by S Sridevi

పెళ్లినుంచీ తిరిగొచ్చారు. వెలుతుర్ని వదిలేసి బయటికి వచ్చినట్టు మాధవ్‍కీ, క్రిక్కిరిసిపోయిన జనసమ్మర్దంలోంచీ బయటపడి వూపిరి పీల్చుకున్నట్టు నీలిమకీ అనిపించింది. ఎక్కడివాళ్ళక్కడికి వెళ్ళిపోయారు. అత్తాకోడళ్ళిద్దరే ఇంట్లో మిగిలారు. మయూఖ్ ఆడుతున్నాడు.
అంతా ఆఫీసులకి వెళ్ళిపోయాక ఇంట్లో వీళ్ళిద్దరే వుంటారుకాబట్టి బాగానే మాట్లాడుకుంటారు. లక్ష్మికి తన వయసూ, అనుభవరీత్యా నీలిమగురించి ఒక స్పష్టమైన అవగాహన వుంది. ఈ కుటుంబానికి సంబంధించి ఆమెకి తెలిసింది తక్కువ. ఒక తెల్లకాగితంలాంటిది ఆమె మనసు. దానిమీద ఎలాంటి రాతలు రాస్తే అవే ముద్రలు పడతాయి. అందుకని చాలా జాగ్రత్తగా ఆచితూచి చెప్తుంది విషయాలని.
“మా నాన్న పోయినప్పటికి అన్నయ్యకి పంథొమ్మిదేళ్ళు. చాలా కష్టపడి మా అందర్నీ పైకి తీసుకొచ్చాడు” అంది ఒకసారి. అదే విషయం ఆమె పుట్టింట్లో చర్చకి వచ్చినప్పుడు, కుటుంబరావు-
“అందులో పెద్ద వింతేం వుంది? పెద్దకొడుకన్నాక, లంకంత కొంప తండ్రి రాసిచ్చాక చెయ్యకేం చేస్తాడు?” అన్నాడు చులకనగా. ఆయన భార్యకి ఆ విషయంలో రామారావుమీద గౌరవం వుంది. ప్రతివ్యక్తినీ అలా తీసిపారేసినట్టు మాట్లాడటం ఆవిడకి నచ్చదు.
“ఏదో మొక్కుబడిగా చెయ్యడంకాదు, జాగ్రత్తగా యిటుకమీద యిటుక పేర్చి గోడ కట్టినట్టు, కుటుంబాన్ని నిర్మించుకుని వచ్చాడు. ఇంట్లోవాళ్ళందరి గౌరవాన్నీ సంపాదించుకున్నాడు” అంది. భార్యాభర్తలమధ్య వుండే ఈ బేధాభిప్రాయలవలన పిల్లల దృక్కోణంలో స్పష్టత లోపించి పరిస్థితుల్ని చూసేతీరు అనిశ్చితంగా మారుతుంది. నీలిమకి ఆ సమస్య మొదలైంది.
తనచుట్టూ వున్నవాళ్లందర్నీ సునిశితంగా గమనించింది. అక్కకి పెళ్ళి జరిగినప్పుడు వీళ్ళెవరూ తనకి పరిచయం లేరు. తన పెళ్ళిలో వేడుకలూ, వేళాకోళాలూ తమ చుట్టే జరిగాయికాబట్టి సరదాగా అనిపించింది. చెల్లెలి పెళ్ళిసమయానికి తల్లికి సాయంగా ఆడపెళ్ళివారివైపు వుండిపోయింది. ప్రహ్లాద్, మాధవ్ ఎంత తమవెంట తిరిగినా, తను ఈ గుంపుకి దూరమే. ఇప్పుడు అంటే, మహతి పెళ్ళిలో గుంపులో కలిసింది. ఆ కలయిక ఆమెలో సంతోషాన్ని నింపలేదు. వేదికమీద షో జరుగుతూ వుంటే తనని ప్రేక్షకపాత్రలో మాధవ్ కూర్చోబెట్టినట్టనిపించింది.
అందర్నీ సునిశితంగా గమనించింది. తనందులో భాగంగా వుండి కాక అదొక విహంగవీక్షణం.
గీత, సుమతి నేరుగా మాట్లాడుకోరు. ఎందుకనే ప్రశ్న పక్కని పెడితే, గురుమూర్తి పక్కని కూర్చుని గీత చక్కగా కబుర్లు చెప్పడం, రామారావు చెయ్యిపట్టుకుని సుమతి నడవడం చూసింది. మళ్ళీ ఈ యిద్దరే రవికి చెరోపక్కనీ కూర్చుని మాట్లాడ్డంకూడా. వాళ్ళమధ్య గొడవేంటి? ఎప్పట్నుంచీ మాట్లాడుకోవట్లేదు?
సుధీర్, సుమంత్‍లు ఇంకా ఎందుకు పెళ్ళిచేసుకోలేదు? తల్లిదండ్రులు కట్నం తీసుకోవాలనుకున్నారనీ, అది సుధీర్‍కి యిష్టం లేదనీ చూచాయగా తెలిసింది. వాళ్ల తల్లిదండ్రులిద్దరూ చదువుకున్నారు, వుద్యోగాలు చేస్తున్నారు. కట్నానికి ఆశపడ్డమేమిటి? అతను వాళ్ళకి గట్టిగా చెప్పలేడా? తులసికీ, సమీరకీ కట్నం ఇచ్చి, ఘనంగా పెళ్ళిచేసారు. ఇద్దరు మగపిల్లలకి తీసుకోకుండా వుండి తనింట్లోనూ, వున్న ఒక్క కొడుక్కీ తీసుకోకుండా వుండి వసంత్ ఇంట్లోనూ ఆడపిల్లకి కట్నం ఇవ్వటందగ్గిర ఆ సిద్దాంతం ఎందుకు వదిలిపెట్టారు? ఇప్పుడు ప్రహ్లాద్ చెల్లెలికి సంబంధం చూస్తున్నారట. ఇచ్చిపుచ్చుకోవడాలమీద ఆమెకి గల అభిప్రాయంలో ఎక్కడో చిన్నచీలిక వచ్చింది. తన తండ్రిమీద వాళ్ల ఆధిక్యత రుజువైన భావన కలిగింది.
రాణాని చూసింది. అతను వీళ్లందర్లా ఎందుకు లేడు? వీళ్ళలో ఎందుకు కలవడు? వీళ్ళెందుకు కలుపుకోరు? అందరూ ఏకతానులో ముక్కలమని చెప్పుకుంటారు, అతన్నెందుకు దూరంగా వుంచారు? అతని భార్యకి తామంతా కలిసి వైద్యం చేయించడం దేనికి? గీత చెప్పగానే మారుమాట లేకుండా అంతా ఎందుకు సరేనన్నారు? ఆమె మాటకి ఎందుకంత విలువ? వాళ్ళు పదకొండుమందని చెప్తాడు మాధవ్. అతనిమాటకీ అంతే విలువ వుంటుందా, ఆ గ్రూపులో?
గీతకి పెళ్ళైనవెంటనే మయూఖ్ పుట్టాడట. తులసికీ అంతే. తన తర్వాత పెళ్లైనవాళ్ళిద్దరికీ పుట్టేసారు. తనకెందుకు ఇంకా పుట్టలేదు? ఈ విషయం ముల్లులా గుచ్చుతుంది ఆమెని. మాధవ్‍కికూడా ఈ బాధ వుందా? ఉంటే అలా నవ్వుతూ జోక్స్ వేస్తూ ఎలా తిరుగుతున్నాడు?
చిన్నప్పుడు వీళ్ళలో వీళ్ళకి గొడవలొచ్చి, మగపిల్లలూ ఆడపిల్లలూ విడిపోయి దెబ్బలాడుకునేవారట.
“గీత… భూమికి జానెడుండేది. నడుంమీద రెండు చేతులూ పెట్టుకుని వాసుతో దెబ్బలాడటానికి వెళ్ళిపోయేది. వాసు అప్పటికే చాలా పొడుగు. ఈవిడ తల బాగా పైకెత్తి చూస్తుంటే వాసు తలదించుకుని మాట్లాడేవాడు…” అని ప్రహ్లాద్ పగలబడి నవ్వుతుంటే అందులో నవ్వటానికి అంతేముందో తనకి అర్థమవ్వలేదు.
“అప్పుడేకదరా, మీకు డేవిడ్ అండ్ గోలియాత్ కథ చెప్పాను?” అన్నాడు మాధవ్. నవ్వులు హోరెత్తిపోయాయి.
అతనికి ఎలాంటి బాధ లేదా? ఎప్పుడూ తన దగ్గిర బయటపడలేదు. తను బాధపడితే ఒక బయటిమనిషిలా వోదార్చాడుతప్ప, ఆ సమస్యలో వున్న రెండోమనిషిలా స్పందించలేదు. అతనికి తనమీద ప్రేమ లేదా? ప్రేమంటే ఏమిటి? గీత, వాసు… చిన్నప్పుడే ఒకరికొకరు పేరుపడ్డారా? లేదని చెప్పింది లక్ష్మి. ఒకరినొకరు ఇష్టపడి చేసుకున్నారట. పుట్టినప్పట్నుంచీ తెలిసిన మనుషులమధ్య ప్రేమ ఎలా సాధ్యం? చిన్నప్పట్నుంచీ తెలుసుకాబట్టి ప్రేమా? మేనత్తమేనమామ పిల్లలుకాబట్టి ప్రేమా? పెళ్లైనవెంటనే కొడుకు పుట్టాడుకాబట్టి ప్రేమా? మాధవ్‍కీ తనకీ మధన వున్నది ఎలాంటి ప్రేమ? కేవలం తన అందం చూసిన ఆకర్షణేనా అతనిది? కవ్వంతో చిలక్కొడుతున్నట్టు సాగుతున్న ఆలోచనలన్నీ గీత దగ్గిరకి వచ్చి ఆగాయి.
“అలా వున్నావేమే?” అడిగింది లక్ష్మి, భోజనాలకి కూర్చున్నప్పుడు వుదాశీనంగా వున్న ఆమె వైఖరి చూసి. నీలిమ మాట్లాడలేదు. లక్ష్మే అర్థం చేసుకుంది. పెళ్లైన వెంటనే పిల్లలు పుట్టకపోతే ఎదురయ్యే మాటలు తనకి తెలీనివి కాదు.
“ఏదేనా విశేషమా?” అని అడుగుతారు మొదట్లో.
“ఇంకా పిల్లల్లేరా? డాక్టరుకి చూపించుకున్నావా?” అనే పరామర్శలోకి దిగుతారు. తమింట్లో ఎవరు అలా అడగరు, కానీ బయటివాళ్లని అలా అడక్కుండా ఆపడం సాధ్యం కాదు. తెల్లారిలేస్తే ఎవరెవరో వస్తారు తనింటికి వాళ్లలో ఎవరేనా అనచ్చు. అదొక సహజకుతూహలంలాంటిది. ఏళ్ళతరబడి పరిచయం వున్నవాళ్ళు, ప్రేమగానే అడుగుతారుతప్ప, బాధపెట్టాలని కాదు. ఎవరూ అడక్కపోయినా తోటివాళ్ళని చూసాక నీలిమకే అనిపించవచ్చు.
“బాధపడకు నీలిమా! మీకేం వయసు మించిపోలేదు. డాక్టరుకూడా ఏ లోపం లేదని చెప్పిందికదా? రోజూ దేవుడికి దీపం పెట్టుకుని దణ్నం పెట్టుకో. సంకల్పబలం వుంటే సాధించలేనిది వుండదు” అంది ఓదార్పుగా.
“నేనింత బాధపడుతున్నానుగానీ, మీ అబ్బాయికి కొంచెంకూడా పట్టింపు లేదండీ!” అంది నీలిమ జవాబుగా.
లక్ష్మి నవ్వింది. “ఏం చెయ్యమంటావు వాడిని? బైటికి బాధపడితే అందర్నీ చూసి అసూయపడుతున్నారనుకోరా?”
“బైటివాళ్ళెవరూ లేరుకదా? అందరూ వీళ్ళువీళ్ళేకదా? ఎందుకనుకుంటారు?”
“తప్పుగా అనుకోరుగానీ మనకో కష్టం రాగానే కనిపించినవాళ్లందరికీ చెప్పుకోవడం దేనికి? సుధీర్‍తోనూ, జోతోనూ మాట్లాడుతున్నాడు. లేడీ డాక్టర్ని కలవమని వాళ్ళే అనుంటారు”
నీలిమ తెల్లబోయింది. అలా జరిగి వుంటుందని ఆమె వూహించలేదు.
“మనింట్లో ఎవరూ వంటరివాళ్ళు కారు నీలిమా! రాణా ప్రవర్తన సరిగ్గా లేదని దూరం పెట్టారు వీళ్ళు. అలాగని యమునని వదిలేసారా? వైద్యానికి సాయం చేద్దామనుకున్నారటకదా, అందరు కలిసి?”
“అక్కగారంటే అందరూ తలూపారు. మా విషయంలో తనేం చేస్తుంది?” అడిగింది నీలిమ. ఇంకేమీ మాట్లాడకుండా తినేసి లేచింది.
ఆ సాయంత్రం గీత ఆఫీసునించీ రావటమే అలసటగా వచ్చింది. పెళ్ళి అలసట అనుకుంది లక్ష్మిగానీ, గీత అలా పనికి అలిసిపోయేంత సున్నితమైనది కాదు.
“అలా వున్నావేమే?” సరిగ్గా అదే ప్రశ్న… కొన్నిగంటలకిందట నీలిమని అడిగిన ప్రశ్నే ఆమెనీ అడిగింది. గీత నవ్వేసి వూరుకుంది. ఈ పెళ్ళి హడావిడిలోనే వాసుతో కలిసి వెళ్ళి డాక్టరుకి చూపించుకుని వచ్చింది. మూడోనెల. రాత్రి భోజనాలవేళకల్లా ఇంట్లో అందరికీ ఆ విషయం తెలిసింది. మనసులో ఏం వున్నా పైకి మాధవ్ నవ్వుతూనే తిరిగాడు. సంతోషాన్ని వ్యక్తపరిచాడు.
నీలిమకి గుండె లోలోపల ఎక్కడో భగ్గుమంది. ఆరోజు రాత్రి మాధవ్‍తో పెద్ద గొడవేసుకుంది.
“రాణాబావగారి భార్యకి మనమంతా డబ్బివ్వడమేంటి? మీ వదిన ఏదంటే దానికి తలూపుతారా? వాళ్ళకి వుంది. రెండు జీతాలు. తగలేసుకోమనండి. మనకేం వుంది?” అని మొదలుపెట్టి ఏవేవో మాట్లాడింది. పిల్లల్లేనందుకు అతనికి చీమకుట్టినట్టుకూడా లేదని ఆరోపించింది. అన్నీ ప్రశాంతంగా విన్నాడు. గీత విషయం తెలిసినరోజే ఇలా దెబ్బలాడటం నీలిమలోని అసూయని పట్టిచ్చింది. అతనికి కోపం రాలేదు. జాలి కలిగింది. అత్త లేని కోడలూ, కోడల్లేని అత్తా అంటారు. సంఘటనలు జరగనప్పుడే మనుషులు వుత్తములుగా వుండేది. మిగతావాళ్లలాగే నీలిమకీ వెంటనే పిల్లలు పుట్టి వుంటే ఆమెకి ఇంత విరోధం వుండేది కాదు. ఈ విరోధం గీతపట్లకన్నా పరిస్థితులమీద ఎక్కువ.
“మనసు ప్రశాంతంగా వుంచుకో నీలూ! సుధీర్, వాసూ చాలా ఆలస్యంగా పుట్టారు. సుమతికికూడా పెళ్లైన వెంటనే పుట్టలేదు. డాక్టర్ని కలిసాం. ఇద్దర్లోనూ ఏ సమస్యా లేదని చెప్పిందికదా? టైం రావాలి. అంతే. అంతకన్నా ఏం చెయ్యగలం? అందరం కలిసినప్పుడు సరదాగా మాట్లాడుకుంటాం. కలిసి ఏవో చెయ్యాలనుకుంటాం. అంతమాత్రాన ఎవరికీ ఏ బాధలూ లేవని కాదు. ఏవో వుంటాయి. అవే చర్చించుకుంటూ కూర్చోం. మర్చిపోవడానికి ప్రయత్నిస్తాం” అన్నీ విని, నెమ్మదిగా అన్నాడు మాధవ్.
“మనం వేరే వెళ్ళిపోదాం. నేనిక్కడ వుండలేను. మనదార్ని మనం బతుకుదాం. మామూలప్పుడే అందరూ ఆవిడ్ని నెత్తికి ఎత్తుకుంటారు. ఇప్పుడింకా ఎత్తుకుంటారు”
“వేరేనా?” తెల్లబోయాడతను. ఆమె మొదటి రాయి విసిరి చూసింది. అంతే. వెంటనే తనకి కావల్సిన జవాబు వస్తుందని ఆశించలేదు.
మర్నాటినుంచీ గీతని ఇంక కాలుకూడా కదపనివ్వరు, ఆమెకూడా కూర్చుని పనంతా చేయించుకుంటుందనుకుంది నీలిమ. కానీ ఎప్పట్లానే లేచి పనులన్నీ చేసుకుంటుంటే తెల్లబోయింది.
“రెస్టు తీసుకోకపోయావా అక్కా?” అడిగింది అసహనాన్ని లోలోపలే దాచుకుని.
“నాకిప్పుడేమైంది?” అడిగింది గీత.
నీలిమ తర్వాత రెండోరాయి పద్మ భర్త విసిరాడు. నిజానికి అతనికి రామారావు యింటివిషయాలలో పెద్ద ఆసక్తేమీలేదు. అక్కడేదైనా వుంటేకదా తను ఆశించడానికీ, ఆసక్తి చూపించడానికీ అనేది అతను పెళ్ళప్పుడే అర్థమైంది. రామారావు కూతురికి స్థలం రాసివ్వడం పద్మలో అసంతృప్తికి కారణమైంది. తల్లిముందు అక్కడిక్కడే దాన్ని వెళ్ళగ్రక్కింది. అక్కడితో ఆగలేదు. భర్తతోకూడా అంది. పదేపదే అంది. అతనికీ చురుక్కుమనిపించింది. వసంత్‍కి కట్నం రాలేదన్న కోపం ఎలాగూ వుంది.
వసంత్ సివిల్ ఇంజనీరు. తపస్వినీనది కెనాల్ ప్రోజెక్టులో చేస్తున్నాడు. కెనాల్‍కోసం భూసేకరణ జరుగుతోంది. పరిహారం ఇస్తున్నారు. మహతి పెళ్ళికి వచ్చిన వసంత్ ఇంకా ఇక్కడే వున్నాడు. ఒక ఫ్రెండుకోసం ఆ వివరాలు తెలుసుకోవాలని వాళ్లింటికి వెళ్ళాడు వాసు. అప్పుడు జరిగింది ఆ సంభాషణ.
“రెండు జీతాలుకదరా మీకు, ఎంత దాచారేం?” కుతూహలంగా అడిగాడు. ఆయన మనసులో ఏదో పెట్టుకుని మాట్లాడుతున్నాడనిగానీ, తను లౌక్యంగా వుండాలనిగానీ అనుకోలేదు వాసు.
“గీత జీతం నేను తీసుకోను బాబాయ్. తనే దాచుకుంటుంది” మామూలుగా అన్నాడు.
“గొప్ప తెలివైనవాళ్ళురా, ఇద్దరూను”
“ఎందులో బాబాయ్?”
“అన్నిట్లోనూ” ఆయన తమాషాగా చూసాడు. “గీత కట్నం ఇవ్వద్దనుకుంది. నువ్వు కట్నం తీసుకోననుకున్నావు. మీ మామ స్థలం ఇచ్చాడు, నువ్వు తీసుకున్నావు” అన్నాడు.
“ఆయన అలా చేస్తారని ఎవరం అనుకోలేదు. అసలు వూహించలేదు. గిఫ్ట్‌డీడ్ రాయించి తెచ్చి చేతిలో పెట్టారు”
“ఎలాగైతేనేం? ఆయన యిచ్చాడు, మీరు తీసుకున్నారు. నిన్ను చూసి వరసపెట్టి మిగతావాళ్లంతా కట్నాలు మానేసారు. ప్రహ్లాద్‍కి నందకిషోరూ, వసంత్‍కి నేనూ సంపాదించి అమర్చిపెడతామనుకో, మాధవ్‍గాడి పరిస్థితేమిట్రా? మీ నాన్న ఇల్లు పట్టించుకోడు. కొడుకులు సంపాదనపరులై వుండీ, మీ అమ్మ ఇంటిఖర్చులన్నీ తనే పెట్టుకుంటుంది. మిమ్మల్ని ఒక్క పైస అడగదు”
“ఎవరి జీతాలు వాళ్ళకి మిగుల్తున్నాయికద?”
“ఎంతైనా వాడికి మీలా రెండు జీతాలైతే కావుకదా?”
అప్పుడు ఎర్రబడింది వాసు ముఖం.
“ఉద్యోగం చేసే అమ్మాయిని చేసుకోవద్దని వాడిని ఎవరేనా అన్నారా బాబాయ్? పోనీ ఇప్పుడేనా ఆమెని చెయ్యద్దని ఎవరేనా ఆపారా?”
“అలాకాదు వాసూ! ఎవరి జీతాలు వాళ్లకి మిగులుతున్నాయి. నిజమే. కానీ మీ యిద్దరికీ కలిపి ఒకటే యిల్లుంది. అది ఆలోచించే బావ ఆ స్థలం ఇచ్చి వుంటాడు. ఆయనేం తక్కువవాడు కాదు. త్రిమూర్తులిని అడక్కుండా ఏదీ చెయ్యడు. మీరు అందులో కట్టుకుని వెళ్ళిపోతే ఇప్పుడున్న యిల్లు మాధవ్‍కి ఔతుంది, కూతురు పక్కనే వుంటుందని ఆలోచించుకుని వుంటాడు. ఇద్దరికీ వుద్యోగాలుకాబట్టి మీకు లోన్‍కూడా బానే వస్తుంది. తీర్చుకోవడం తేలిక” అన్నాడు పద్మభర్త. రెండు బొమ్మలు చిన్నపిల్లలకి పంచి యిచ్చి ఇది, నీకూ అది వాడికీ అని చెప్పినంత తేలిగ్గా ఆయన పంపకాలు చెయ్యడాన్ని జీర్ణించుకోలేకపోయాడు వాసు. చిన్నప్పట్నుంచీ ఎరిగుండి, వసంత్‍తో సమానంగా ప్రేమ చూపించిన మనుషులు అలా మాట్లాడటం అతనికి షాకే.
వసంత్ వెంటనే కలగజేసుకున్నాడు.
“ఏం మాట్లాడతారు నాన్నా? చిన్నప్పుడు నన్ను కూర్చోబెట్టి చదువు చెప్పింది మీరేనా? వాళ్ళింటి విషయాలు వాళ్ళు చూసుకోలేరా? ఇల్లు కట్టుకోవాలా వద్దా అనేది వీళ్ళిష్టం. వీళ్ళకి లోన్లు వస్తే మాధవ్‍కీ వస్తాయి” అన్నాడు కోపంగా.
తినికూర్చుని గొడవలు పెట్టుకోవడం అంటే ఏమిటో వాసుకి అర్థమైంది. వెళ్తానని లేచాడు. వసంత్ బయటిదాకా వచ్చాడు.
“ఇవేవీ పట్టించుకోకురా, వాసూ! చిన్నప్పట్నుంచీ ఏది నేర్చుకున్నా నిన్నూ, సుధీర్నీ చూసే నేర్చుకున్నాను. రవళికీ గీతకీ తప్పొప్పులు చెప్పినట్టే నాకూ చెప్పావు. నేను అలా బుద్ధిగా వున్నందుకు అమ్మావాళ్ళూ సంతోషపడ్డారు. అప్పుడు మంచిదైన విషయం ఇప్పుడు కాకపోవడానికి కారణం వాళ్ల ఆలోచనల్లో మార్పు రావడం. నువ్వు నాకెప్పుడూ రోల్‍మోడల్‍వే” అన్నాడు ప్రేమగా చెయ్యినొక్కి.
వాసు ఏమీ మాట్లాడలేదు. ఇల్లు చేరుకున్నాడు. మాధవ్ ఇంకా ఆఫీసుకి వెళ్ళలేదు.
“అరేయ్, నీకేదైనా మనసులో వుంటే సూటిగా నాకే చెప్పు. వాళ్లచేతా వీళ్లచేతా చెప్పించకు” అనేసి తన గదిలోకి వెళ్ళిపోయాడు.
ఏం జరిగిందో అర్థమవలేదు మాధవ్‍కి.
“మామయ్యగారు అన్నదాంట్లో తప్పేం వుంది? ఇంట్లో రెండు ఆస్తులున్నప్పుడు చెరొకటీ పంచుకోరా?” అంది మానస.
“నీకు తెలిసి అడుగుతున్నావో, తెలీక అడుగుతున్నావో తెలీదు మానసా! తెలీకపోతే తెలుసుకో. గౌరవాన్ని పోగొట్టుకోకు” కఠినంగా అన్నాడు వసంత్. ఈ గొడవంతా తెలిసాక నీలిమకూడా చెల్లెలన్నట్టే అంది. మాధవ్ అంత కఠినంగా జవాబివ్వలేకపోయాడు.